‘మనవాడు ఒకడు ప్రపంచాన్ని ఏలుతాడు’ అని బ్రహ్మంగారు చెబితే… ఆ మాట నిజం కాకపోతుందా అని ఆశపడుతున్నాం! కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పీఠమెక్కితే.. మన ఆడబిడ్డకే అందలం దక్కినంతగా మురిసిపోయాం! ఇది ‘అహంతృప్తి’ కాదు. మహదానందం. మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తారనే నమ్మకం. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల ఆరంభ సమయంలో భారతీయ మూలాలున్న నేతలను తలుచుకునే ప్రయత్నం…
డయాస్పోరా! ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జాతిని సూచించే పదం. ‘నేను విస్తరిస్తున్నాను’ అన్న అర్థమిచ్చే గ్రీకు మాట నుంచి పుట్టింది. ‘ఇండియన్ డయాస్పోరా’ భారతీయ మూలాలున్న వారందరినీ సూచిస్తుంది. మన ప్రభుత్వ అంచనా ప్రకారం, విదేశాల్లోని భారతీయుల సంఖ్య మూడు కోట్ల ఇరవై లక్షలు. వీరిలో చాలామంది వలస వెళ్లి తరాలు మారిపోయి ఉండవచ్చు. స్థానికులతో వివాహబంధాన్నీ అందుకొని ఉండవచ్చు. కానీ ఇప్పటికీ వారిలో అధిక శాతం… భారతీయ నేపథ్యం ఉన్నవారే, ఇక్కడ సంస్కృతిని అనుసరించేవారే. అమెరికాకు చెందిన ‘ఇండియాస్పోరా’ అనే స్వచ్ఛంద సంస్థ, వివిధ దేశాల్లో రాజకీయంగా ఎదిగిన భారతీయులను గుర్తించే ప్రయత్నం చేసింది. ఆ జాబితాలోని ప్రముఖుల వివరాలు, ఆ స్థానాన్ని చేరుకోవడం వెనుక దాగిన ఆసక్తికరమైన కథనాలు స్ఫూర్తిదాయకం. నిజమే, ఎక్కడో పుట్టి ఎక్కడో ఎదగడమంటేనే మాటలు కాదు. ఇక కోటలు కట్టడమంటే..
అమెరికా టు ఐర్లాండ్!
కమలా హ్యారిస్ ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలు. ఆ స్థాయికి చేరుకోగలిగిన మొట్టమొదటి మహిళ. కురువృద్ధుడైన బైడెన్ గెలుపు వెనుక తారకమంత్రం తను. కమల గెలిచిందని తెలియగానే, ఆమె తాతగారి ఊరు ‘తులసేంద్రపురం’లో సంబరాలు మిన్నంటాయి. ఇవేవీ నామమాత్రపు తతంగాలు కావు. కమల ఇప్పటికీ దేశంలోని తన బంధువులతో సఖ్యంగానే ఉంటున్నారు. మన వంటకాల నుంచి నటుల వరకూ సర్వం తనకుపరిచయమే!
శ్వేతజాతీయుల ఆధిక్యం ఎక్కువగా కనిపించే మరో దేశం ఐర్లండ్. అక్కడా భారతీయుడే ఉపాధ్యక్షుడు కావడం విశేషం. లియో వరద్కర్ తండ్రి అశోక్, ముంబై నుంచి ఐర్లాండ్కు వలస వెళ్లారు. అక్కడే పుట్టిన లియో, అడపాదడపా మన దేశానికి వస్తూనే ఉండేవారు. వైద్యవిద్యార్థిగా, ముంబైలోని ‘కెమ్ ఆసుపత్రి’లోనే ఇంటర్న్షిప్ పూర్తిచేశారు. ఐర్లాండ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా, తన పూర్వీకుల ఊరైన ‘వరద్’ను చూసేందుకు మందీమార్బలం లేకుండానే వచ్చారు. లియో వరద్కర్ స్వలింగ
సంపర్కుడు. తను గే అని బహిరంగంగా ప్రకటించిన, తొలి ఐర్లండ్ రాజకీయవేత్త!
‘మన’ నేతలు
2019 అక్టోబర్ 7. ‘నా ప్రియమిత్రుడు ఆంటోనియా పోర్చుగల్ పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు’ అంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో దౌత్యపరమైన మొహమాటాన్ని మించిన విశేషం ఉంది. సదరు ఆంటోనియా తాతయ్య పుట్టింది గోవాలోనే. వారికి ఇక్కడి సంస్కృతి అన్నా, సాహిత్యమన్నా చాలా ఆపేక్ష. ఆంటోనియా తండ్రి, రవీంద్రనాథ్ టాగూర్ మీద వ్యాసాలు రాసిన రచయిత. వారి కుటుంబం తరచూ గోవాకు వస్తూ ఉండేది. గోవాలో ఆంటోనియా అభిమానులు తనను ముద్దుగా ‘బాబుష్’ (ప్రియమైన యువకుడు) అని పిలుస్తుంటారు. అంతేకాదు! భారతీయ విలువలైన అహింసని ఆచరించి చూపించిన చరిత్ర ఆంటోనియాది. అందుకే తనకి ‘లిస్బన్ గాంధీ’ అనే బిరుదు దక్కింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ను శాంతియుతంగా మార్చినందుకు లభించిన గౌరవమది. 500 ఏండ్ల క్రితం పోర్చుగల్ మన దేశంలో కొంతభాగాన్ని ఆక్రమించుకొని పాలించింది. ఆశ్చర్యం! ఇప్పుడు అదే దేశాన్ని మనవాళ్లు ఏలుతున్నారు. ఆంటోనియా మంత్రివర్గంలో ఆర్థికశాఖను కూడా ‘జోవా లియో’ అనే భారతీయుడు నిర్వహించడం విశేషం!
దక్షిణ అమెరికాలోని గయానా దేశానికి అధ్యక్షుడు.. సాక్షాత్తు నాలుగో తరం భారతీయుడే. పేరు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. 2020లో ప్రమాణస్వీకారం చేసిన ఇర్ఫాన్ అలీకి ఓ ప్రత్యేకత ఉంది. దక్షిణ అమెరికా చరిత్రలో, ఓ దేశ అత్యున్నత పదవిని అందుకున్న తొలి ముస్లిం తనే. ఆ దేశానికి ఉపాధ్యక్షుడు కూడా భరత్ జగ్దేవ్ అనే భారతీయుడే. గయానా తాత్కాలిక ప్రధానమంత్రిగానూ, అధ్యక్షుడిగానూ పనిచేసిన ఘనత జగ్దేవ్ది. ఇక్కడ ఘనంగా చెప్పుకొనే హిందూ-ముస్లిం సామరస్యం… అక్కడ ప్రతిఫలిస్తున్నది.
గ్లోబల్ పీస్ ఇండెక్స్.. మారిషస్ను ఆఫ్రికాలోనే అత్యంత శాంతికాముక దేశంగా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వ విద్య, ఉచిత వైద్యం, రాజకీయ స్వేచ్ఛ… అద్భుతం అంటూ ఎన్నో నివేదికలు కితాబునిచ్చాయి. అందుకు కారణం ఆ దేశాధినేతలే . ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ జగ్నాథ్ మారిషస్
ప్రధానిగా ఉన్నారు. పృథ్వీరాజ్సింగ్ రూపున్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మారిషస్లో భారతీయులే ఎక్కువ కాబట్టి, దశాబ్దాలుగా ఆ వర్గంవారే ప్రధానులుగా ఎంపికవుతున్నారు. దక్షిణ అమెరికా ఖండంలోని సురీనామ్లోనూ భారతీయుల ఆధిక్యత ఉన్నా గత ఏడాదే, ఆ దేశాధ్యక్ష పీఠం భారతీయుల చేజిక్కింది. హిందూ కుటుంబానికి చెందిన చాన్ సంతోకీ సంస్కృత శ్లోకాలు వల్లిస్తూ, ఆ దేశ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
‘భారతీయ’మంత్రాంగం
సురీనామ్, ఫిజి, మారిషస్ లాంటి దేశాల్లో భారతీయ మూలాలున్న ప్రజలు ఎక్కువే! కాబట్టి, వాళ్లు ప్రభుత్వంలో ఉండటం, మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం ఆశ్చర్యం కాదు. మారిషస్ మంత్రివర్గంలో ఏకంగా 15 మంది భారతీయులే! ఇక గయానలోనూ పదిమంది మంత్రులు మనవారే! కానీ మిగతా దేశాల్లో భారతీయుల ఉనికి వెనుక వేర్వేరు కారణాలున్నాయి. ఉదాహరణకు సింగపూర్! అక్కడికి భారతీయులు కేవలం వలస కూలీల్లాగానే అడుగుపెట్టలేదు. వెయ్యేండ్లకు పూర్వమే అక్కడికి భారతీయ సంస్కృతి చేరుకుంది. హిందూ, బౌద్ధ మతాలు అక్కడి సంస్కృతి మీద చెరగని ముద్ర వేశాయి. విద్య, వ్యాపారం, ఉపాధి కోసం వలస మొదలైంది. సింగపూర్ మాత్రమే కాదు… మలేషియా, థాయ్లాండ్, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్లకు కూడా రాకపోకలు ఉండేవి. ఈ దేశాలను అంతర్భాగంగా చేసుకుంటూ ‘శ్రీవిజయ’ అనే హిందూసామ్రాజ్యం ఉండేది. రాజ్యాలు పోయినా… మన దేశం నుంచి, అందునా దక్షిణాది నుంచి వలసలు ఆగలేదు. కాబట్టి, ఈ దేశాల్లో భారతీయుల అధికారం ఆశ్చర్యం కలిగించదు. సింగపూర్ విదేశాంగశాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్, రక్షణ మంత్రి షణ్ముగం భారతీయులే. వీరే కాకుండా మరో ముగ్గురు భారతీయులు అక్కడ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మలేషియా మానవవనరుల శాఖ మంత్రి శరవణన్ మురుగన్ దక్షిణాదివాడే!
చట్టసభల గొంతుక మనదే
దేశాధినేత స్థానాన్నే అందుకోగల సత్తా ఉన్నప్పుడు, మంత్రివర్గాల్లో కీలకంగా నిలుస్తున్నప్పుడు… చట్టసభల్లోనూ మన ఉనికి గట్టిగానే ఉంటుంది కదా! భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లోనే కాకుండా… బ్రిటన్, కెనడాల్లోనూ మనవారి ప్రాతినిధ్యం గణనీయం.
ఈస్ట్ ఇండియా సేవకులుగానే కాకుండా… విద్యార్థులుగా, వ్యాపారస్తులుగా మనవాళ్లు బ్రిటన్కు వెళ్లేవారు. రెండువందల ఏండ్ల క్రితమే అక్కడ తొలి భారతీయ రెస్టారెంట్ వెలసింది.1814లో దీన్ మహమ్మద్ అనే వ్యాపారస్తుడు వాళ్లకి ‘షాంపూ’ను పరిచయం చేశాడు. అప్పట్లో మన దేశంలో ఉన్న ఇంగ్లండ్ సైనికులు, భారతీయులను పెండ్లి చేసుకున్న సందర్భాలూ ఎక్కువే. అలా బ్రిటన్ జనాభాలో మనవారి సంఖ్య రెండు శాతం పైనే ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో వాళ్లు మంచి విజయాలనే అందుకున్నారు. మేఘానంద్ దేశాయ్, అజయ్ కక్కర్, స్వరాజ్ పాల్, కమలేష్ పటేల్… ఇలా ఎందరో ప్రముఖులు అక్కడి పార్లమెంటులో కొలువుదీరారు. బ్రిటన్ ఉభయసభల్లో 29 మంది భారతీయులు ఉన్నారని అంచనా!
కెనడా చట్టసభల్లోనూ ఇరవై మందికి పైగా భారతీయులు ఉన్నారు. వందేళ్ల క్రితం పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఉపాధి కోసం అక్కడికి వలసవెళ్లారు. తీవ్రమైన వివక్షతో పాటు, భౌతిక దాడులను తట్టుకొని నిలబడ్డారు. 1972లో ఉగాండా నుంచి వెలివేయబడ్డ ఎంతోమంది భారతీయులు కెనడాకు చేరుకున్నారు. ప్రస్తుతానికి కెనడాకు చేరుకునే వలసల్లో మనదే ప్రథమ స్థానం. అరిఫ్ వీరాని, మణిందర్ సిద్ధు, రాజ్ సైని వంటి వారు అక్కడి పార్లమెంటుకు ఎన్నిక కావడం… ఆ దేశంలో మనం అందుకున్న ప్రాధాన్యతకు సాక్ష్యం.
మహిళా శక్తి
విదేశాల్లో నిర్ణాయక శక్తులుగా భారతీయ మహిళలు ఉండటమూ ఓ విశేషమే! కమలా హ్యారిస్ వెలుగులోకి రాకముందే వీరి గురించి చర్చలు జరిగాయి. కెనడా పౌరసరఫరాల శాఖ మంత్రి అనిత ఆనంద్ కొవిడ్ సమయంలో చకచకా నిర్ణయాలు తీసుకున్నారని పేరు. అక్కడి పార్లమెంటులో ‘అంజు ధిల్లన్’, ‘కమల్ ఖేరా’, ‘రూబీ సహోతా’ వంటి మహిళా ప్రతినిధులూ ఉన్నారు. ఇక బ్రిటన్ హోంశాఖ సెక్రటరీగా ఉన్న ‘ప్రీతీ పటేల్’కు గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉందని విశ్లేషకుల అంచనా! అక్కడి పార్లమెంటులో ఏకంగా ఆరుగురు భారతీయ మహిళలు ఉన్నారు. ఆయా దేశాల్లో రక్షణ శాఖ లాంటి కీలకమైన శాఖల్లోనూ (కృష్ణ మతేరా- సురీనామ్), అటార్నీ జనరల్ స్థాయిలోనూ (సులియా బ్రేవర్మెన్- బ్రిటన్) భారతీయ మహిళలు ఉండటం గర్వకారణమే!
అత్యున్నత స్థానాల్లో..
ఒక దేశం తరఫున రాయబారిగా ఉండటం అంటే… ఆ దేశ ప్రతిష్ఠకు చిహ్నంగా మారడమే. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ రాయబారుల్లో మనవారు పదిమంది ఉండటం గమనార్హం. ఆస్ట్రేలియాలో గీతా కామత్, సింగపూర్లో కమల్ వాస్వాని, కెనడాలో నాదిర్ పటేల్ కీలకమైన దేశాలతో సత్సంబంధాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. దౌత్యసంబంధాల్లో కీలకంగా ఉండే కౌన్సిల్ జనరల్స్గానూ మనవారు కనిపిస్తున్నారు. ఇక మారిషస్, ఫిజి, సింగపూర్ ప్రధాన న్యాయమూర్తులూ భారతీయులే! ఆ మూడు దేశాల రిజర్వ్ బ్యాంక్ నేతలూ మనవారే!
నిజానికి, ఈ జాబితా సమగ్రమేమీ కాదు. చేరని పేర్లు, చేజారిన వివరాలు చాలానే ఉండవచ్చు. ఏదో ఒక దేశంలో, ‘మన’ అనుకునే ఎవరో ఒకరు చక్రాన్ని తిప్పుతూనే ఉండి ఉంటారు. పైగా ఈ సత్తా తాత్కాలికమైన ప్రభావమేమీ కాదు. ఇంతింతై అంటూ మొదలైన మన ఉనికి ఆకాశమంతై, ఈ పుడమిని కమ్ముకునే రోజు దగ్గర్లోనే ఉంది. అప్పుడు జాబితాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదేమో! భారతీయ పతాకాన్ని ప్రపంచంలోని ఏ మూల ఎగరేసినా, ఎవరు ఎగరేసినా.. మనకు గర్వ కారణమే. భారతమాత తన బిడ్డ ప్రగతిని చూసి మురిసిపోతుంది.
బైడెన్ యంత్రాంగంలో..
‘భారతీయ మూలాలు ఉన్నవారు… మన అమెరికాను ఏలేస్తున్నారు. మన ఉపాధ్యక్షురాలు దగ్గర నుంచి నా ఉపన్యాసాలు రాసేవారి వరకు అందరూ భారతీయులే!’ అని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇవేమీ ఈర్ష్యతో అన్న మాటలు కావు. నాసా శాస్త్రవేత్త స్వాతిమోహన్ను అభినందించే సందర్భంలో అందించిన ప్రశంసలు. భారతీయులను మేధావులుగా, శ్రమించేవారిగా, పట్టుదలతో సాధించేవారిగా, వ్యూహరచనలో ఉద్దండులుగా గుర్తిస్తూ… కొన్నేళ్లుగా అమెరికా అధ్యక్షులు తమ యంత్రాంగంలో మనవారిని చేర్చుకుంటున్నారు. అలా జో బైడెన్ దగ్గర 50 మందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారు. రక్షణ నుంచి పర్యావరణం వరకు అనేక విషయాల మీద ఆయనకు సేవలు, సలహాలు అందించేందుకు కృషి చేస్తున్నారు.
కొన్ని మైలురాళ్లు ..
దలీప్ సింగ్ సౌంద్, 1956లో అమెరికన్ కాంగ్రెస్కు ఎంపికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియావాసి ఇతనే.
ఒట్టోమన్ లాంటి రాజుల దగ్గర నుంచి ఈదీ అమీన్ లాంటి పాలకుల వరకు నియంతల కరకుదనాన్ని తట్టుకుని నిలిచిన చరిత్ర మన వలసదారులది.
సింధు నాగరికత కాలం లోనే మనవాళ్లు వలస వెళ్లిన సాక్ష్యంగా, సుదూర ప్రాంతాల్లో ఆనవాళ్లు కనిపించాయి.
ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, తేలికగా మన దేశంలోకి అడుగుపెట్టేందుకు ‘Persons of Indian Origin’ అనే గుర్తింపు కార్డు ఇచ్చేవారు. గత ఏడాదే ఇది రద్దయింది.
విదేశాల్లో స్థిరపడ్డాక, వారి భార్యలను తీసుకువెళ్లకపోవడం ఓ పెద్ద సమస్య.
ఈ Abandoned NRI wives సంఖ్య దాదాపు అయిదువేలు ఉంటుందని అంచనా!
చెన్నై సింగం
చెన్నైలోని ఓ మధ్యతరగతి నేపధ్యం నుంచి అమెరికాకు చేరుకున్నాడు రంగస్వామి. ఉన్నత చదువు తన కల. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడటం లక్ష్యం. అమెరికా గడ్డ మీద అడుగుపెట్టేనాటికి అతని జేబులో ఉన్నది ఎనిమిది డాలర్లే. కానీ, విలువకట్టలేని ైస్థెర్యం తన దగ్గర ఉంది. దాంతోనే అనుకున్నది సాధించారు. సిలికాన్ వ్యాలీలో విజయపతాక ఎగరేసిన భారతీయుల్లో ఒకడిగా నిలిచారు. ఫోర్బ్స్, వాల్స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికల జాబితాలో చేరారు. 1997లో ‘శాండ్ హిల్ గ్రూప్’ అనే సంస్థను స్థాపించారు రంగస్వామి. ప్రతిభావంతులకు పెట్టుబడి అందించడమే దాని ఉద్దేశం. రంగస్వామి 2012లో ‘ఇండియాస్పోరా’ను ప్రారంభించారు. అమెరికాలో ఉన్న భారతీయులందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడమే ఈ సంస్థ లక్ష్యం. అందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలను, సెమినార్లను, నివేదికలను రూపొందిస్తున్నది. కమలా హ్యారిస్ విజయం సందర్భంగా, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ నేతల జాబితాను విడుదల చేసింది. ఇందుకోసం 15 దేశాలకు చెందిన 200 మందికి పైగా ప్రముఖులను గుర్తించారు.
వలస వేదం అమెరికాలో అయితే..
మన దేశం వెలుపల భారతీయులు అనగానే అమెరికానే గుర్తుకొస్తుంది. నిజమే! ఓ అంచనా ప్రకారం అమెరికాలో దాదాపు నలభై లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. విదేశాల్లో జన్మించి, అక్కడ స్థిరపడిన వారిలో, భారతీయుల సంఖ్య ఆరు శాతం. కంప్యూటర్ యుగానికి పూర్వమే ఈ వలస మూలాలు కనిపిస్తాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ సేవకులుగా కొందరు భారతీయులు అమెరికాలో అడుగుపెట్టారు. ఉపాధి కోసం కెనడాకు వలసవెళ్లిన రైతులు, అక్కడి వివక్షను తట్టుకోలేక అమెరికాకు చేరుకున్న సందర్భాలూ ఎక్కువే! వారిలో సిక్కుల సంఖ్యే అధికం. 1912లోనే కాలిఫోర్నియాలో సిక్కులు తమకోసం ఓ గురుద్వారాను నిర్మించుకున్నారు. కానీ ఎంత కష్టపడుతున్నా, ఎన్ని సేవలు అందిస్తున్నా వారి మీద చాలా ఆంక్షలు ఉండేవి. తెల్లవారిని పెండ్లాడటానికి, భూమి కొనుగోలు చేయడానికి హక్కులు లేకపోయేవి. పౌరసత్వం కూడా లభించేది కాదు. 1917 తర్వాత దేశంలోకి అడుగుపెట్టడానికి కూడా షరతులు మొదలయ్యాయి. వారిలోనూ మేధావులకే ప్రాధాన్యత ఉండేది. ఏడాదికి ఇంతమందే అన్న కోటా అడ్డుపడేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు, పౌరసత్వాలూ అందుబాటులోకి వచ్చాయి. ఇక 1980ల తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే!
తెలుగువారి మాటేమిటి
నేల నలుచెరగులా తెలుగువారి విస్తరణ తక్కువేమీ లేదు. శ్రీలంకలోని అహికుంటికలు లాంటి జాతులు, తెలుగువారి వలసకు చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తాయి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని మనవాళ్లు త్వరగానే అందిపుచ్చుకున్నారు. వారిలో ఎల్లాప్రగడ సుబ్బరావు ఆ గడ్డ మీద ఉన్నత విద్య కోసం అడుగుపెట్టి సరిగ్గా శతాబ్ది(1922). ఉషా రెడ్డి (మన్హట్టన్ మేయర్), చివుకుల ఉపేంద్ర (న్యూజెర్సీ అసెంబ్లీ), సి.ఆర్.రావు (శాస్త్రవేత్త), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), నోరి దత్తాత్రేయుడు (వైద్యుడు), రాజ్ రెడ్డి (రోబోటిక్స్), అనీష్ చాగంటి (దర్శకుడు), నీనా దావులూరి (మిస్ అమెరికా)… చెప్పుకొంటూ వెళ్తే ‘తెలుగు వారి’ జాబితా సుదీర్ఘంగానే ఉంటుంది.
సురీనామ్, ఫిజి, మారిషస్, ట్రినిడాడ్… మన దేశానికి వేల మైళ్లలో దూరంలో ఉండే ప్రాంతాలు. భౌగోళికంగా, సాంస్కృతికపరంగా భిన్నమైన దేశాలు. అలాంటి చోట్ల భారతీయులు కనిపించడం ఏంటి? వెస్టిండీస్ క్రికెట్లో కాళీచరణ్, కనయ్య, చందర్పాల్, శివనారాయణ్ లాంటి పేర్లు వినిపించడం ఏంటి? లాంటి ప్రశ్నలకు జవాబు వింటే… మనవాళ్లు అక్కడ స్థిరపడ్డారు అన్న సంతోషంతో పాటు కొన్ని విషాదాలు మనసును కమ్మేస్తాయి.
అది 19వ శతాబ్దం! బానిసత్వానికి వ్యతిరేకంగా చట్టాలు చేయాలంటూ చాలా దేశాల్లో ఒత్తిడి పెరుగుతున్నది. మరి శ్రమదోపిడీ మీదే ఆధారపడిన రాజ్యాలు మనుగడ సాగించేదెలా? అందుకోసం Indentured Labourer (వలస కూలీ/ ఖరారునామా కూలీ) అనే క్రూరమైన పద్ధతిని కనిపెట్టారు. తమ పాలనలో ఉన్న ఇతర దేశాల్లో చెరుకు, రబ్బరు తోటల్లో పనిచేయడానికి పేద భారతీయులను ఒప్పించేవారు. ఇలా 1830 నుంచి 1917 మధ్యకాలంలో పద్నాలుగు లక్షలమందికి పైగా భారతీయులను ఇలా ఉపాధి ఉచ్చులో విదేశాలకు తరలించారు. అప్పట్లో మన దేశాన్ని పంచుకున్న బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ పాలకులు ఈ అరాచకంలో పోటీ పడ్డారు.
ఈ Indentured Labourer విధానం పైకి స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా కనిపించేది. ఓ ఐదేళ్ల పాటు పనిచేస్తే సరిపోతుందనీ, జీతంతో పాటు చాలా సదుపాయాలు ఉంటాయనీ ఆశ చూపించేవాళ్లు. అప్పటికే దేశంలో వ్యవసాయం, చేతివృత్తులను నాశనం చేశారు కాబట్టి… విదేశాల్లో ఉపాధి పేదలను ఊరించేది. కానీ ఓడలోకి అడుగుపెట్టిన తర్వాత, నరకం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చేది. జంతువుల్లాగా కుక్కిన ఓడల్లో అయిదు నెలల సముద్రయానం చేస్తే కానీ ఆఫ్రికాకు చేరుకునేవారు కాదు. చనిపోతే సముద్రంలోకే. తీరా తీరానికి చేరాక, కష్టాలు రెట్టింపయ్యేవి. పనిచేసే చోట, పేరుకి మాత్రమే స్వేచ్ఛ. ఇటు యజమానీ నిర్దాక్షిణ్యంగా ఉండేవాడు, అటు స్థానికులూ వివక్ష చూపించేవారు. అన్నిటికీ మించి… వేషభాషలు, వాతావరణంలో ఎక్కడా ఇసుమంతైన పొంతన ఉండేది కాదు. లస్కర్, హిండూ, కూలీ లాంటి పేర్లతో భారతీయులను వేరుగానే గుర్తించేవారు.
ఇంతాచేసి, ఒప్పందం గడువు ముగిసిన తర్వాత మాతృదేశానికి వద్దామనుకుంటే కుదిరేది కాదు. ఎందుకంటే… తిరుగుప్రయాణపు ఖర్చులు తామే భరించాల్సి ఉండేది. ఆహారానికే సరిపోయిన అరకొర జీతాలతో, పొదుపు చేసేదెక్కడ! పైగా ఒప్పందాన్ని పొడిగిస్తే, జీతం పెంచుతామని ఆశ చూపించేవాళ్లు. అందుకని శాశ్వతంగా అక్కడే ఉండిపోయేవారు ఆ వలస కూలీలు. అయితే… తరాలు మారినా, తలరాతలు మారినా భారతీయ మూలాలను వాళ్లు మర్చిపోలేదు. వాళ్ల జీవనశైలిలో ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో అయితే, స్థానికుల కంటే భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు. ఉదాహరణకు దక్షిణ అమెరికాలోని సురీనామ్ దేశంలో 27 శాతం ప్రజలవి భారతీయ మూలాలే! సురీనామ్ రాజధాని పరమారిబోలో, ఒకప్పటి వలస కూలీల జ్ఞాపకార్థంగా, నాటి వేషభాషలతో రూపొందించిన భారతీయ జంట విగ్రహం కనిపిస్తుంది. ఎట్టకేలకు 1917లో ఈ వలస విధానాన్ని రద్దు చేశారు!