కాచిగూడ, అక్టోబర్ 4: జనాభా లెక్కల సేకరణలో కులగణన కోసం లక్షల మందితో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ గణనపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీలో కులగణన విజ్ఞప్తిచేశారని, కేంద్రప్రభుత్వం మాత్రం కులగణన సాధ్యంకాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశ ప్రధానిగా బీసీ వ్యక్తి ఉండి బీసీలకే తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలోని సీనియర్ బీసీ నాయకులు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కులగణన చేసేవిధంగా ప్రధాని మో దీపై ఒత్తిడి తేవాలని కోరారు. కులగణన కోసం దేశంలోని బీసీలంతా కేంద్రం మెడలు వంచే రోజు దగ్గరలోనే ఉన్నదని, కులగణన చేపట్టకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలు గద్దె దించుతారని హెచ్చరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని,అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్చేశారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, కోలా జనార్దన్, జిల్లపల్లి అంజి, చంటి ముదిరాజ్, ఉదయ్, లక్ష్మణ్ యాదవ్, నర్సింహ పాల్గొన్నారు.