Sri Rama Navami | ఖమ్మం, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం బుధవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయజయ రామ’ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. కల్యాణ ఘడియ కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న భక్తజనం రాముడిని పెండ్లి కుమారుడిగా, సీతమ్మ తల్లిని పెండ్లికుమార్తెగా దర్శనం చేసుకొని తరించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. భక్తులకు సీతారామ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రెండు కనులూ చాలలేదు. అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఒడిలో ఓలలాడించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది. శ్రీరాముడు, సీతాదేవి వధూవరులుగా ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. సీతమ్మ వారికి కల్యాణం రోజు దేశంలో ఎక్కడైనా పుస్తెల తాడులో రెండు సూత్రాలను మాత్రమే ధరింపచేస్తారు. కానీ.. భద్రాచలంలో కల్యాణ మహోత్సవంలో మాత్రం సీతమ్మ వారికి శ్రీరాముడు కట్టే పుస్తెల తాడులో మూడు సూత్రాలు ఉంటాయి. జనక , దశరథ మహారాజులు చేయించిన పుస్తెలతో పాటు రామదాసు సీతమ్మను తన కుమార్తెగా భావించి చేయించిన మూడో సూత్రాన్ని కలిపి రామయ్య తండ్రి సీతమ్మతల్లి మెడలో మాంగళ్యధారణ గావించారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన సీఎస్
శ్రీరామచంద్రుడికి, సీతమ్మవారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టువస్ర్తాలు, ముత్యా ల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులు కూడా పట్టువస్ర్తాలను సమర్పించగా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రఘునాథ్ తిహారీ, జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎం హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, మల్టీజోన్ ఐజీ ఏవీ రంగనాథ్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్రాజ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో రమాదేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.