హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సోసైటీ పరిధిలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం గతనెల జూన్ 5లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 45,735మంది దరఖాస్తు చేసుకోగా 40,575మంది పరీక్షకు హాజరయ్యారని మల్లయ్య భట్టు తెలిపారు. వారిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల కాలేజీల్లో ఇంటర్ కోర్సుల్లో 12,560మంది విద్యార్థులు చేరుతారని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు విద్యార్థులు సాధిస్తారన్నారు.