హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (SI Sriramulu Srinu) మృతి చెందారు. ఆయన గత ఆదివారం మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. తోటి సిబ్బంది వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం చేశానని శ్రీనివాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ జితేందర్రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు.
అశ్వారావుపేట పోలీస్ సేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఎస్సై శ్రీను జూన్ 30న ఉదయం 8.30 గంటలకు మఫ్టీలో స్టేషన్కు వచ్చారు. సోమవారం నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అదే సమయంలో ప్రైవేట్ కారు రావడంతో డ్రైవర్ను దింపిన ఎస్సై.. ఇప్పుడే వస్తానంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.
మధ్యాహ్నం తరువాత సిబ్బంది ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో సీఐ జితేందర్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్సై ఫోన్ లోకేషన్ను ట్రాక్ చేయగా మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత మండలంలోని తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు. కానీ రాత్రి 10:45 గంటల వరకు ఆచూకీ లభ్యం లభించలేదు. ఇంతలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు.