హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలనుకొనే విదేశీ విద్యార్థుల కోసం ‘ఎడ్యుకేషన్ ఇండియా’ పేరిట కొత్త పోర్టల్ ప్రారంభించినట్టు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తెలిపింది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఈ పోర్టల్ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మెడికల్ విద్యార్థులకు కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టంచేసింది. మన దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకోవాలనుకొనే విదేశీ విద్యార్థులు ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని, వీరికి యూనిక్ ఐడీని కేటాయిస్తామని పేర్కొన్నది. స్టూడెంట్ వీసా దరఖాస్తు మొదలు కోర్సు పూర్తయ్యే వరకు ఈ ఐడీనే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. దేశంలోని మెడికల్ కాలేజీలకు, ఎలక్టివ్ కోర్సు లేదా అబ్జర్వర్షిప్ చేయాలనుకొనే విదేశీ విద్యార్థులకు ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్ఎంసీని సంప్రదించిన తర్వాతే విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎలక్టివ్ కోర్సుకు యూజీలో 5 శాతం సీట్లను, పీజీలో 2 సీట్లను కోటాగా నిర్ణయించింది. అంతకుమించి చేర్చుకోవద్దని కాలేజీలను ఆదేశించింది. విదేశీ విద్యార్థులు గరిష్ఠంగా 90 రోజుల్లో కోర్సు పూర్తి చేయాలని, ఆ సమయంలో రోగులకు చికిత్స చేయొద్దని స్పష్టంచేసింది. ఈ కోర్సు ఫీజును యూజీలో రోజుకు 100 డాలర్లు, పీజీకి రోజుకు 200 డాలర్లుగా నిర్ణయించినట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నది.