మారేడ్పల్లి, మే 27: జోనల్ రైల్వేలలో 50 శాతం నాన్ సేఫ్టీ పోస్టులను సరెండర్ చేస్తూ రైల్వే శాఖ జారీచేసిన ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వేశాఖను డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు.. అనుబంధ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు, యూనియన్ నాయకులు సికింద్రాబాద్ సంచాలన్భవన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్రావు ప్రసంగిస్తూ… భారతీయ రైల్వేలో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని, వీటిని భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏటా 2 శాతం పోస్టులు తగ్గుతుండడం తో.. రైల్వే అధికారులు, కార్మికులపై పనిభారం పెరుగుతున్నదని చెప్పారు. రైల్వే కోచ్లు, లోకో షెడ్లలో ఇంజన్లు, కొత్తగా విద్యుదీకరించిన లైన్లు, కొత్తలైన్ల నిర్మాణం మొదలైన వాటి వల్ల రైల్వే ఆస్తులు పెరిగినప్పటికీ, ఖాళీలను భర్తీ చేయకుండా రైల్వే మంత్రిత్వ శాఖ కాలయాపన చేస్తున్నదని తెలిపారు.
50 శాతం నాన్-సేఫ్టీ పోస్టుల సరెండర్ కోసం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిచుకోవాలని, ఆల్ ఇండియా ప్రాతిపదికన దరఖాస్తులను పిలవడానికి బదులుగా సులభమైన రిక్రూట్మెంట్ ద్వారా వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్, సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నాయకులు రవీందర్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.