(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గాంధీజీ వారసత్వానికి మోదీ సర్కారు పాతరేస్తున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారణాసిలోని గాంధేయ సామాజిక సేవా సంస్థ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన కట్టడాలను ఇటీవలే నేలమట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. గాంధీజీ సిద్ధాంతాల అమలుకు కృషిచేస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ)ని కూడా మూతపడేలా చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఆ సంస్థ నిర్వహిస్తున్న ఖాదీ యూనిట్లలో 20 శాతం కూడా పని చేయటం లేదని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తప్పు పట్టింది.
కేవీఐసీ ద్వారా 92 డిపార్టుమెంటల్ ట్రేడింగ్ యూనిట్లు ప్రారంభిస్తే అందులో కేవలం 18 మాత్రమే పని చేస్తున్నాయని తన నివేదికలో పేర్కొన్నది. ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ల పేరుతో దేశంలోని పలు నగరాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. 2021 మార్చి నాటికి ఆ సంస్థ కార్యకలాపాలను మూల్యాంకనం చేసిన తరువాత కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసేసిన 25 విక్రయ కేంద్రాల్లో 11 కేంద్రాల మూసివేతకు అసలు కారణాలు తెలియలేదని పేర్కొన్నది. ప్రైవేటు ఖాదీ సంస్థలు లాభాల్లో నడుస్తుంటే ప్రభుత్వ సంస్థ అయిన కేవైఐసీ కేంద్రాలెందుకు మూసేవేయ బడ్డాయో కారణాలు తెలియలేదని కాగ్ తెలిపింది. వోకల్ ఫర్ లోకల్, ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ వంటి కాన్సెప్ట్లతో భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చర్యలు చేపడుతున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊదరగొడుతున్నది.