శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. చుట్టూ కమ్ముకున్న యుద్ధమేఘాలను తొలగించే శక్తి శ్రీమత్ రామానుజాచార్యులకే ఉందనిభావిస్తాడు విష్ణువర్ధనుడు. అదే జరిగింది.
వరదరాయలు భార్య అనుకుంటున్నది.
భగవంతుడికి మనం నైవేద్యం సమర్పిస్తాం. దేవుడు ఉన్నాడని నమ్మే మనం.. ఆయన తిన్నాడని కూడా భావిస్తాం. భావన నుంచి భక్తి పుడుతుంది. భక్తి అంటే నమ్మకంతో కూడిన భావన.
తమ ఇంటికి వచ్చింది ఎవరో సామాన్యమైన వ్యక్తికాదు. సాక్షాత్తూ శ్రీమద్రామానుజులవారు.
వారికి నైవేద్యం సమర్పించాలి అంటే.. వారు ఎక్కడ ఉంటే, అక్కడికి వెళ్లాలి. అదీ.. ఆయనను కలుసుకొనే మహద్భాగ్యం మనకు రాసిపెట్టి ఉంటే!
ఉదయాన్నే తన భర్త వరదరాయలు స్నానాదికాలు ముగించి, పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తొందరతొందరగా బయల్దేరి వెళ్లాడు.
వెళ్లేటప్పుడే తను అడిగింది..
“ఎక్కడికి స్వామీ” అని అడగబోయి..
“ఎప్పుడు తిరిగొస్తారు స్వామి” అన్నది.
“రామానుజాచార్యుల వారు మన ఊరిమీదుగా వెళ్తున్నారని తెలిసింది. వారు మన గ్రామాన్ని సందర్శిస్తే, వారిని దర్శించే అవకాశం ఉంటుందో ఏమో అనే ఒకే ఒక ఆశతో వెళ్తున్నాను..” సంతోషంగా చెప్పాడు.
అంతలోనే విచారంగా అన్నాడు..
“అదృష్టం ఉంటే స్వామివారి దర్శనం దొరకవచ్చు. కానీ, వారికి అన్న పానీయాలు ఏర్పాటు చేయలేకపోయినా, కనీసం పండో ఫలమో ఇవ్వాలి కదా.. చూస్తాను. స్వామివారిపైనే భారం వేస్తాను”.
ఏమీ మాట్లాడలేదు తను.
ఇప్పుడేమో స్వామివారే స్వయంగా వచ్చారు.
సమయానికి వెళ్లాలి.
పరుగులు తీస్తున్నంత వేగంగా వెళ్లింది.
ఏమి అనుకున్నదో.. ఏమి కలగన్నదో.. ఏమి వండి పెట్టిందో.. ఎంతమంది ప్రసాదాన్ని స్వీకరించారో ఏమీ తెలియడం లేదు.
స్వామివారు చిరునవ్వు నవ్వుతూ ఆశీస్సులు అందించారు. అందరూ ప్రసాదం స్వీకరించారు.
ప్రయాణం కొనసాగవలసి ఉన్నందున.. ఆ ఇంటి నుంచి స్వామివారు త్వరగానే బయల్దేరి వెళ్లారు.
శిష్యగణమూ ఆయనతోపాటే!
గుమ్మం దగ్గర చేతులు జోడించి, నిలబడిన మనిషి నిలబడినట్టుగానే అలా ఉండిపోయింది.
జరిగినదంతా కలా? నిజమా? వైష్ణవమాయా?
స్వామివారు రావడం, ప్రసాదం స్వీకరించడం.. తనున్న ఈ లోకంలోనే జరిగిందా?
కనులు మూసుకున్నా, కనులు తెరచినా తండ్రిలాంటి రామానుజాచార్యుల వారి చిరునవ్వే కనిపిస్తున్నది.
ఆచార్య రామానుజులవారు తన కుటీరానికి వచ్చి వెళ్లారనే సమాచారం వరదరాయలుకు చేరింది.
స్వామివారి దర్శనం కోసం ఊరి చివర ఎదురుచూస్తున్న వాడల్లా.. ఈ వార్త తెలియగానే ఇంటికి పరుగెత్తుకొచ్చాడు.
ఎదురుగా కనిపిస్తున్న తన ఇల్లు ఒక గుడిసెలాగా కనిపించడం లేదు. స్వామివారి రాకతో పావనమైన గుడిలా కనిపిస్తున్నది.
భార్యను చూశాడు. ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంది.
“ఎంత పుణ్యాత్మురాలివి నువ్వు!” అన్నాడు.
ఆ మాట వింటూ ఉలిక్కిపడి.. ఈ లోకంలోకి వచ్చింది.
భర్త అన్న మాట విన్నది.
‘ఎంత పుణ్యాత్మురాలివి నువ్వు!’..
సరుకులిచ్చిన ధనికుడికి తను చెప్పిన మాట గుర్తొచ్చింది.
“నేను పుణ్యాత్మురాలినా? కాదండీ..” అన్నది గొంతు పెగల్చుకొని..
“కాదా మరి! స్వామివారికి ప్రసాదం నివేదించే అదృష్టానికి నోచుకున్న పుణ్యాత్మురాలివి.. ఎంతమంచి రోజో ఈ రోజు!”.
“అవును! పండుగలన్నీ ఒకేరోజు వచ్చినట్టు ఉంది. అష్టకష్టాలుపడి వ్యవసాయం చేసే రైతుకు పంట చేతికొచ్చినట్టు సంతోషంగా ఉంది. కానీ స్వామీ..” మనసులో మెదులుతున్న మాటను భర్తకు చెప్పలేక, దుఃఖం గొంతుకు అడ్డం పడుతుండగా ఆగిపోయింది.
“కానీ.. ఎందుకా విచారం?” ఆశ్చర్యంగా అడిగాడు.
ఏం జరిగిందో అర్థంకాక, భార్య ముఖాన్ని తన వైపునకు తిప్పుకొని..
“ఏం జరిగింది? అంతా మంచిదేగా?” అన్నాడు.
భర్త మాటలకు ఆమె కండ్లలో నీళ్లు తిరిగాయి.
“మంచే జరిగింది స్వామీ! ఆ మంచి పనిచేయడానికి చెడు వాగ్దానాలు చేయాల్సి వచ్చింది”.
“ఏమిటా చెడు వాగ్దానం?”.
అప్పుడు చెప్పింది..
ఇంట్లో బియ్యం గింజ కూడా లేకపోవడం, వంట సరుకుల కోసం ధనికుడి వద్దకు వెళ్లడం, అతడు సరుకులకు బదులుగా.. తను అతడితో గడపాలనే కోరిక కోరడం.. అది తను ఒప్పుకోవడం!
అంతా విన్నాడు వరదరాయలు.
పిడికిలి మూసి తన హృదయం దగ్గర పెట్టుకొన్నాడు.
తను, తన ధర్మపత్నీ ఏం చేయాలో ఆలోచించాడు.
“పద వెళ్దాం..” అన్నాడు.
తన భర్త అన్నమాట తను సరిగ్గా విన్నదా..
“ఏమంటున్నారు స్వామీ.. ఎక్కడికి వెళ్దామంటున్నారు?” ఏడుస్తూనే అడిగింది.
“మనం వెళ్లాల్సిన చోటుకు.. వస్తామని మాట ఇచ్చిన చోటుకు!”.
“అంతకన్నా జీవితాన్ని ముగించుకోవడం మంచిది కదా!”.
వరదరాయలు తలపంకించి అన్నాడు.
“ఏది మంచి, ఏది చెడు.. నిర్ణయించుకొనే శక్తి మనకున్నదా? చెప్పినమాట ప్రకారం అక్కడికి వెళ్లకుంటే ఎలా?”.
అంటూ ముందుకు నడిచిన భర్తను అనుసరించింది భార్య.
ఇద్దరూ మౌనంగా నడిచి వెళ్తున్నారు.
వరదరాయలు భార్య చాలా అందగత్తె. చక్కటి రూపం. ఆమెపైన ఎప్పటినుంచో కన్ను వేశాడు. ఆ కోరిక ఈనాటికి తీరబోతున్నది. ఇక తనకు స్వర్గ సుఖమే.. అని ఊహించుకొంటూ అత్తరులు పూసుకొని, అలంకరించుకొని ఎదురుచూస్తున్నాడు ఆ ధనికుడు.
ఎదురుగా వీధి మలుపు దగ్గర తలవంచుకొని నడిచి వస్తున్న వరదరాయల భార్య కనిపించింది.
ఎప్పుడెప్పుడు ఆమె పొందు దొరుకుతుందా.. పాములా బుసకొడుతున్న తన కాంక్ష తీరడమెప్పుడా.. అని తహతహలాడుతూ ఎదురుచూస్తున్న ధనికుడికి ఎదురుగా కనిపించిన దృశ్యం దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎ.. దు.. రు.. గా..
భార్య వెనుక నడిచి వస్తున్న వరదరాయలు..
అదిరిపడ్డాడు. పిడుగు పడినంత పనయ్యింది.
త్వరలో తన కాంక్ష తీరబోతున్న ఉన్మాదం.. నీటిలో ఉప్పులా నిలువునా కరిగిపోయింది.
అయినా.. ఇతగాడు ఎందుకొస్తున్నాడు? తనేమన్నా బలవంతం చేశాడా?
ఒప్పుకొని.. ఇష్టపడే వస్తానని చెప్పింది కదా!
ఇక్కడికి మొగుడిని తీసుకొస్తున్నదంటే.. గొడవ పడటానికే అయ్యుంటుంది. తన దగ్గర డబ్బుంది.. పలుకుబడి ఉంది. అంతకాడికి వస్తే.. వీళ్లిద్దరినీ కారాగారంలో తోయించగలడు.
బింకంగా ఉన్నాడు.
వాళ్లు దగ్గరికొచ్చారు.
“అయ్యా.. నేనొచ్చాను” అన్నది ఆ ఇల్లాలు.
“అయ్యా.. నేనే తీసుకొచ్చాను” అన్నాడా భర్త.
అర్థం కాలేదు ఈ కాముకుడికి.
“వరదయ్య గారూ! ఏందిదంతా?” అయోమయంగా అడిగారు.
“అయ్యా! మీరు నా భార్య శరీరాన్ని అడిగారు. కానీ, ఆమె హృదయం నాది. నా హృదయం ఆమెది..
సకృదంశో నిపతతి – సకృత్ కన్యా ప్రదీయతే
కసృదాహ దదానీతి – త్రీణ్యేతావి సతాం సకృత్
కుటుంబంలో ఆస్తుల పంపకం ఒకసారే జరుగుతుంది. కన్యాదానం ఒకసారే జరుగుతుంది. ‘నేను ఇస్తాను’ అనే వాగ్దానం.. మాట ఇవ్వడం ఒకసారే జరుగుతుంది. సత్పురుషులకు సంబంధించి ఈ మూడు పనులు ఒకేసారి జరుగుతాయి. అందుకే ఆమె ఇచ్చినా, నేను ఇచ్చినా.. ఇచ్చిన మాట ఒక్కటే. అది మారదు. ఒక మంచి పనిచేయడం కోసం.. ఏ పనిచేయవలసి వచ్చినా చెడు కాదు. అందుకే, నేను వచ్చాను. ఇక్కడే వేచి ఉంటాను”.
ఆ మాట అని కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డాడు వరదరాయలు.
నోట మాట రాలేదు ఈ ధనికుడికి!
నాయనా.. చిన్నా.. రారా! దగ్గరికి రా!”.
అమ్మ పిలుపు వినిపించింది. అమ్మ ఎప్పుడొచ్చింది?
చేతులు చాచి.. తన బిడ్డను ఎత్తుకొని లాలించడానికి అదిగో.. అమ్మ!
“రా.. నాయనా.. రారా!” ప్రేమగా పిలుస్తోంది.
అవే కండ్లు, అదే చూపు, అదే ప్రేమ, అదే పిలుపు!
“అమ్మా!” అంటూ ముందుకొచ్చాడు.
“చిన్నా.. ఏంటి అలా చూస్తున్నావు? ఆకలేస్తోందా?”.
అంటూ అమ్మ దగ్గరికొస్తోంది.
చిన్నా.. అని అమ్మ పిలుస్తున్న ఈ ధనికుడికి అమ్మ తప్ప ఏమీ కనిపించడం లేదు.
రదరాయలుకు గానీ, ఆయన భార్యకు గానీ ఏమీ అర్థం కావడం లేదు.
ఎందుకీ మనిషి.. అమ్మా! అమ్మా! అంటూ కన్నీరు పెట్టుకొంటున్నాడు? ఏమయ్యింది?
“అయ్యా.. నేను. మీరు నాకు సరుకులిచ్చారు. వంటచేసి వడ్డించి వచ్చాను. పెద్దలు మనసారా ఆశీర్వదించారు. మా ఇద్దరి జన్మ ధన్యమైంది”.
వరదరాయల భార్య మాటలకు ధనికుడు స్పృహలోకి వచ్చాడు.
“అమ్మా.. ఏమంటున్నారమ్మా?” అన్నాడు అయోమయంగా.
“నన్ను రమ్మన్నారు. వస్తేనే సరుకులిస్తాను అన్నారు. మరచిపోయారా?” అడిగిందామె.
“అవునమ్మా! అన్నీ మర్చిపోయాను. ఇక ఒక్కటే గుర్తుపెట్టుకొంటాను. మీరు మా అమ్మ అనీ! నేను మీ కొడుకుననీ!” దుఃఖంతో అతనికి మాటలు రావడం లేదు.
ఆమె పాదాలపైబడి భోరున ఏడ్చాడు.
“అమ్మతో తప్పుగా మాట్లాడాను. మన్నించండయ్యా.. వరదయ్యా!” ఏడుస్తూనే ఉన్నాడు.
ఏమిటీ మార్పు?
“అదిగో.. ఆచార్యులవారు.. ఆచార్యులవారు”.
ఎదురుగా కనిపించినట్టే పిలుస్తున్నాడు.
వరదరాయలకు ఏమీ అర్థం కాలేదు.
కానీ, ఆయన భార్యకు స్వామి కనిపిస్తున్నాడు. భగవత్ స్వరూపుడైన రామానుజాచార్యుల వారు!
“ఏమంటున్నాడమ్మా.. నీ బిడ్డ. అందరి ఆకలితీర్చే అమ్మవు కదమ్మా నువ్వు. అంతా శుభమే జరుగుతుంది”. చిరునవ్వుతో ఆశీర్వదించారు రామానుజాచార్య స్వామివారు.
అప్పుడర్థమైంది ఆమెకు.
ఇదంతా స్వామివారి అనుగ్రహం..
సత్పురుషులు సంకల్ప మాత్రం చేతనే అనుగ్రహం చూపగలరు. సాధించగలరు. సాధన ఫలాలను లోకానికి అందించగలరు.
శ్రీమతే రామానుజాయనమః
వరదరాయల సంతోషానికి అంతులేదు.
ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ.. ఆగి, అందరికేసి చూశాడు రాజగురువు.
“గురుదేవా! రామానుజాచార్యుల వారు విష్ణువర్ధన మహారాజుకు ఎలా తెలుసు? వారిద్దరి మధ్య
అనుబంధమేమిటి?”.
“మనిషికీ, దేవుడికీ ఉన్న అనుబంధం.. అందుకు మూలంష శ్రీనరసింహ దేవుడే!”
ఓమ్ నమో నారసింహా!
✍ అల్లాణి శ్రీధర్