సంప్రదాయ చీరకట్టుకు వైభవం పట్టు! మహదేవ్పూర్ కష్టజీవుల సౌభాగ్యం పట్టు! అడవిని ఆ ఊరిని అనుసంధానించింది దసలిపట్టు. మద్ది చెట్టుకు కాసే పట్టు పురుగులే వారికి ఉపాధి మార్గం చూపాయి! పట్టు పురుగుల పెంపకం, పట్టు నూలు వడకడం, దారం నులకడం, మగ్గం నేయడమే ఆ ఊరి ప్రజల వృత్తులు. పట్టుతో జీవితంపై పట్టు బిగించిన మహదేవ్పూర్ కథ ఇది..
మెరిసే పట్టులోనూ అనేక ధగధగలున్నాయి. ఒక్కోపట్టుకీ ఒక్కో నాణ్యత, ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. వాటిల్లో దసలిపట్టు అందమే వేరు. దసలిపట్టు చీర చూడగానే కట్టి తీరాలని ఆడవాళ్లు పట్టుబడతారు. అదీ మహదేవ్పూర్ చేనేత చీరైతే మరీనూ! ఈ ఆనందం కట్టేవాళ్లకు మాత్రమే కాదు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ప్రజలకు కూడా సొంతం. దేశంలో చేనేత పరిశ్రమ, పట్టుపురుగుల పెంపకం సంక్షోభంలో ఉంటే దసలిపట్టు మహదేవ్పూర్ ప్రజల సౌభాగ్యంగా విలసిల్లుతున్నది.
పల్లె జీవితమంటే చెలకలో పనులు, పశువులు, జీవాల పెంపకం, కులవృత్తులు చేసుకుంటూ బతుకుతారు. మహదేవ్పూర్ వాసుల జీవితం మాత్రం మరోలా ఉంటుంది. అన్ని ఊళ్లల్లో నీరుంటే వరిపంట, లేకుంటే పత్తి పంట రివాజు. మహదేవ్పూర్లో మాత్రం పట్టు పంట సాగవుతుంటుంది! ఊరు ఊరంతా పట్టు పరిశ్రమ మీదనే బతుకుతున్నది. ఆ ఊరి చుట్టూ పట్టు పరిశ్రమే. పక్కనే ఉన్న అడవిలో ఎర్రమద్ది, నల్లమద్ది చెట్లున్నాయి. ఈ చెట్లపై మల్బరీ తోటలో పట్టు పురుగులు పెంచినట్టే దసలిపట్టు (టస్సర్) పురుగులను పెంచుతున్నారు. మద్ది ఆకులు తింటూ పెరుగుతున్న పట్టు పురుగుల బాగోగులు చూసుకుంటూ అయిదు వందల కుటుంబాలు దాకా ఇక్కడ బతుకుతున్నాయి. నాలుగు దశలు జరిగిపోయిన తర్వాత పట్టు పురుగు ఆహారం తీసుకోకుండా, విశ్రమించకుండా జిగురులా ఉండే పట్టుని తన చుట్టూ తానే అల్లుకుంటుంది. ఈ ప్రక్రియ తొమ్మిది రోజులు దీక్షగా సాగి.. అది అల్లుకున్న గూడు కోడి గుడ్డంత అవుతుంది. ఇలా తయారైన కకూన్లను రైతులు మద్ది చెట్లు ఎక్కి సేకరిస్తారు.

రాట్నం నుంచి మగ్గం పైకి
కాయలుగా మారిన పట్టు పురుగులు సేకరించడం రైతన్నల పని. ఆ తర్వాత నేతన్నల పని మొదలవుతుంది. పట్టుకాయల్లోని దారాన్ని నులికి మగ్గాలపై వస్త్రాలు నేస్తారు. గుడ్డు నుంచి గుడ్డ దాకా ఒకే ఊరిలో జరిగిపోతుంది. అడవిలో పట్టుపంటకు కాపుగాసే రైతన్నకు, మగ్గం నేసే నేతన్నకు సెరీకల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు వారధులుగా పని చేస్తున్నారు. పట్టుసాగులోని రైతులు, చేనేత మగ్గాలు నేసే నేతన్నలు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబనకు పూనుకున్నారు. ఆకలి, అప్పులు లేని ఆదర్శవంతమైన పల్లె జీవితానికి నాంది పలికారు. ఈ కకూన్లను చేనేత కార్మికులు ఉడకబెట్టి టస్సార్ తోడి, రాట్నం వడికి, పడుగు పోసి రీలింగ్ చేసి దారం తీస్తారు.
దసలిపట్టు వన్నెలు
ఒకో నాణ్యమైన కాయ (పింజ) నుంచి సుమారు కిలోమీటర్ దారం వస్తుంది. ఆ దారాన్ని మగ్గంపై పడుగు, పేక పోసి, వస్త్రాలను నేస్తారు. ఈ పనిలో అరవై కుటుంబాల దాకా ఉపాధి పొందుతున్నాయి. మగ్గంపై తయారైన దసలిపట్టుకు అద్దకం విద్య తెలిసిన చేతి వృత్తుల వాళ్లు మరిన్ని వన్నెలద్ది మార్కెట్కి తగ్గట్టుగా సిద్ధం చేస్తారు. ఇలా తీర్చిదిద్దిన చీరెలు, శాలువాలు, పంచెలతోపాటు పలు రకాలు వస్త్రాలను రూపొందిస్తున్నారు. కాళేశ్వరం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు మహదేవ్పూర్ చేనేత కార్మికుల ఇంటికి నేరుగా వెళ్లి, చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. మన చేనేత వైభవాన్ని చాటుతూ మహదేవ్పూర్ గ్రామంలో రైతు-చేనేత సహకార ఉద్యమం నాలుగు దశాబ్దాలుగా వర్ధిల్లుతూ ఉన్నది!
…? చీర్లవంచ రమేశ్ చారి, మహదేవ్పూర్
