‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో విశిష్ఠ బహుమతి పొందిన కథ.
‘సదువు సక్కగ లేనోని బతుకు.. సముద్రంల నాటుపడవ లెక్కుంటది’ అని అనుకుంటున్న రాజారాం మెదడు అల్లకల్లోలంగా ఉన్నది. అదే మనాది ముల్లెను కొడుకు ముందు విప్పిండు. కొడుకు పరశురాములు అల్లాటప్పా మనిషి గాదు.
“నీ యవ్వ! ఇదంతా నువ్వే జేసినవు. కులకష్పి అనుకుంట బడికి సరిగ్గా పోనియ్యకపోతివి”.. పరశురాములు కొరకొర చూపులు, రాజారాం పొత్తి కడుపును పరపర కోసేస్తున్నట్టన్నయ్.
“వాణ్ని బడికి తోలియ్యకుండ తాతల నాటి విద్య నేర్చుకొమ్మని తల్కాయె దింటివి. వానికో బంగిరిద్దెల విద్య నేర్పితివి. వాడు అందరిలెక్క బడికి వోతె పదో తరగతి ఎప్పుడో పాసైపోతుండె. ఆ బంగిరిద్దెల విద్యను ఇప్పుడెవ్వడూ దేకుతలేడు. ఈ బోడ్సోడ్ విద్యను నమ్ముకొంటే బతుకు నడిగంట్ల నాగిలిడిశినట్టాయె” రాజారాం భార్య మణెవ్వ కడుపుల కుతకుతలాడుతుంది.
ఆ మాటలు విన్న రాజారాంకు వీపుమీద సురుకులు వెట్టినట్టు అయ్యింది. ఓర్చుకోక తప్పలేదు.
“అయిందేదో అయ్యింది. ఇంట్ల బాగా సదువుకొని ఆ పదో తరగతి పరీక్షలు మల్లా ఇయ్యచ్చు గదా?” రాజారాం సలహా.
గట్ల ఎన్నిసార్లు జెప్పినా పరశురాములు ఒగ్గూపినట్టు తల్కాయె ఊపె. గానీ, పుస్తకమైతె పట్టకపాయె. లండు సోపతులు వట్టి దున్నపోతు లెక్క తిరగవట్టె.. రాజారాం రంది.
పెద్దలిచ్చిన భూమి అమ్మి ఇద్దరాడ పిల్లల లగ్గం జేసిండు. చెల్లెండ్ల లగ్గాలాయె.. ఇంకా తన లగ్గం కాలేదని వాని కసి. కులవృత్తి కళలకు ఆదరణ అడుగంటె. సంపాదన లేని పరశురాములుకు ఎవ్వలూ పిల్లను ఇవ్వకపోయిరి. తండ్రి విద్యను తాను నేర్చుకొని, ప్రదర్శించి నాలుగు పైసలు సంపాదించకపాయె.
వారం కింద..
“పర్శరాములూ! సిరిసిల్లల తెలిసినోల్లున్నరు. వాళ్లతోని మాట్లాడ్తా. నువ్వక్కడికి వొయ్యి సాంచాలు నడుపుడు నేర్సుకొని, గదే సాంచాలల్ల జీతముంటె బాగుంటది” అన్నడు రాజారాం.
“సగమీడు దిరిగినంక సముర్త కట్నాలన్నట్టు.. ముప్పయేండ్లు ముడ్డికిందికొచ్చె. గా ఊర్లె జీతముంటడా?” భార్య జవాబు.
వాడు ముందే ఆవారాగాడు. వానికి తల్లి ఊదుపొగ ఎయ్యవట్టె.
“ముందుగాల నాకు లగ్గం జెయ్యి. గప్పుడాలోచిస్త” కొడుకు సిగ్గు విడిచిండు.
“గదేదో శాస్త్రముంది! పిచ్చి కుదిరితే పెండ్లయితది. పెండ్లయితే పిచ్చి నయమైతది.. అన్నట్టు నీకు సొంత సంపాదనుంటే ఎవ్వడైన పిల్లనిస్తడు..”.
పరశురాములు వొయ్యి ఊరుమీద వడ్డడు. రాజారాం మంచమ్మీద ఒరిగిండు. తేనెతుట్టెలోని తేనెటీగల్లాగ ఆలోచనలు.. పాత జ్ఞాపకాలు మెదడును ముసురుకుంటున్నయి.
* * *
ఆ రోజులల్ల కులవృత్తి విద్యలు బలంగా సాగుతుండేవి. సాధనాశూరుల ప్రదర్శన చూసి, అంతా సంతోషించి ధాన్యం, పైసలు ఇచ్చేటోళ్లు. కూరగాయలు, ఇంకేవేవో దానమిచ్చెటోళ్లు. శ్రీమంతులు కొత్త బట్టలు పెట్టేటోళ్లు. రందిలేని జీవితం.
ఆ ఊరు చింతమడక. కామునికంత పెద్ద చౌరస్తా. ఆ రోజు సాధనాశూరుల విద్య ప్రదర్శన. బెల్లం చుట్టూ ఈగల లెక్క జనాలు గుమిగూడిండ్రు. ఆట చూపించెటోళ్లు.. అనుభవమున్నోళ్లు. ఊరి మస్కూరీలు అందరినీ పద్ధతిలో కూర్చుండబెట్టిండ్రు. ప్రదర్శన షురువైంది.
పెద్దమనిషి ముందట నీళ్లు, పసుపుపొడి, ఇటుకపొడి తాంబాలాలున్నయి. పసుపు, ఇటుకపొడిని కలిపి నీళ్లు బోసిండు. అందులోకి సూర్య కిరణాలు తొంగి చూస్తున్నయి. చేతులు పైకెత్తి దండం బెట్టిండు.
“ఇటుకపొడి, పసుపుపొడి నీళ్లల్ల కలిసినై గదా! కలిసిపోయిన వాటిని నీళ్ల నుంచి పొడిపొడిగా తీస్తున్నా..” అంటూ ఇటుకపొడి తీసి ఒక తాంబాలంల, పసుపు పొడి తీసి వేరే తాంబాలంల పోసిండు. చప్పట్లు మార్మోగినయి.
“ఇంకోటి చూడుండ్రి!” పెద్దమనిషి నవ్విండు.
నాలుగు పందిరి గుంజలను నాలుగు దిక్కుల పాతిండ్రు. మొదటి గుంజకు యువకుడు నారాయణను కట్టేసిండ్రు. మీద, చుట్టూ పరదాలు కట్టిండ్రు. లోపల నారాయణ ఒక్కడే ఉన్నడు. రెండు నిమిషాలాగి పరదాలు విప్పేసిండ్రు. ఈ గుంజకున్న నారాయణ మరో గుంజకు కట్టేసున్నడు. చప్పట్లతో చౌరస్తా మురిసింది. నారాయణను అట్లే ఉంచి, మళ్లీ పరదాలు కట్టిండ్రు. నారాయణ పందిట్లనే ఉన్నడని అనుకున్నారంతా. పెద్దమనిషి నారాయణను పిలిచిండు.
“వస్తున్నా..” అనుకుంట నారాయణ జనాల గుంపులోంచి వచ్చిండు. పరదాలు విప్పి చూస్తే.. ఎవరూ లేరు. మళ్లీ చప్పట్ల జడివాన. చుట్టూ జనాల గుంపు బాగా పెరిగింది.
ఈల వేసి పెద్దమనిషి రాజును పిలిచిండు. గుంపుల నుంచి వచ్చిన రాజు చేతుల వేపరెమ్మలు ఉన్నయి. ఇద్దరు మనుషులు రాజును కింద కూచోబెట్టి, వేప రెమ్మలు నెత్తిమీద పెట్టిండ్రు. పక్కన ఉన్నాయన రెడీగా ఉన్న సిమెంటు పొయ్యిని నెత్తిమీది వేప రెమ్మలమీద పెట్టిండు. గ్యాసునూనెలో తడిపిన బట్టపేగులేసి, అగ్గిపుల్ల గీసి అంటుబెట్టిండు. పొయ్యి మీద వెట్టిన గిన్నెల నూనె ఉంది. పొయ్యిల మంటలు లేస్తున్నయి. ఇంకొకాయన గోధుమ పూరీలు చేసి, గిన్నెలో వేసిండు. పూరీలు దేవి తీసిండు. రాజు ఖుషీగా నవ్వుతున్నడు.
“అరె! నెత్తిమీద మంట వెడితే జుట్టుగూడ కాలలేదు”.. జనాల మాటల్తో చప్పట్లు లేచినయి. పక్కనున్న చింతచెట్టు నవ్వుతున్నట్టు.. కొమ్మలు – రెమ్మలు గట్టిగా ఊగినయి.
“ఇంకో గమ్మతి చూడుండ్రి!” అంటూ పెద్ద
మనిషి ఇద్దరికి సైగ జేసిండు. వాళ్లు సొప్పబెండ్లు, దారంతోని మంచం, ఉయ్యాల తయారు చేసిండ్రు. పెద్ద కట్టెకు ఉయ్యాల కట్టిండ్రు. సొప్ప బెండ్ల ఉయ్యాల మీద పెద్దమనిషి కూసున్నడు. ఇద్దరు మనుషులు ఉయ్యాల కట్టెను లేపి, చెరో భుజమ్మీద పెట్టుకొని చుట్టూ తిప్పిండ్రు. బెండ్లు ఇరుగలేదు.. దారం తెగలేదు.
“అదెట్లా?” ఒకాయన అడిగిండు.
“ఈ విద్య మాకు దైవదత్తం..” పెద్దమనిషి జవాబు. మళ్లీ ఈలలు, చప్పట్లు.. ఆకాశానికి అంటినయి. ఇట్లా చిత్ర, విచిత్రాలు రెండు గంటలపాటు చూపించిండ్రు. ఓ పక్కన కుర్చీలో కూసున్న దొర..
“బాగుందిరా సాధనాశూరుల విద్య! మా ఇంటికొచ్చి రెండు బుడ్ల వడ్లు తీసుకోండ్రి!” అని ఆదేశించిండు.
“దొరకు దండాలు! గిసొంటి వాళ్లతోనే బతుకుతున్నం. మీరు సల్లంగుండాలె దొరా!” పెద్ద
మనిషి దొర కాళ్లకు మొక్కిండు.
“గీ విద్య ఎట్ల నేర్చుకున్నరు రా?”.. దొర సందేహం.
“దొరా! వంశపారంపర్యంగా మా తాతతండ్రుల నుంచి వచ్చిన విద్య. తరం తర్వాత తరం నేర్చుకుంటున్నం”.
దొర వెళ్లినంక.. జనాల మధ్య గుడ్డ పరిచి..
“దానం చెయ్యుండ్రయ్యా!” అంటూ అందరికీ దండం బెట్టిండు పెద్దమనిషి. నాణేలు, నోట్లు.. ఆ పరిచిన గుడ్డలో జడివాన లెక్క పడినయి.
ఆ పెద్దమనిషే.. రాజారాం. ఇంకో నలుగురితో కలిసి ఊరూరా తిరుగుతూ బట్ట – పొట్టకు తిప్పలు లేకుండా గడిపేవాడు.
* * *
“ఏందయ్యా! గట్ల బీరిపొయ్యి కూసున్నవ్”.. మణెవ్వ గొంతు విని మరో లోకం నుంచి మానవలోకానికి వచ్చిండు రాజారాం. లేచి కూసొని ఆమె చెయ్యి అందుకోబోయిండు.
“బాగానే ఉంది సంబడం..” చెయ్యి వెనక్కు లాక్కుంది ఆమె.
ముక్కుపుడక మెరుస్తూ ఉంటే.. చాయ గ్లాసు అందించింది. తానో చాయ గ్లాసుతో ఉంది.
“ఛీఛీ! వాని బతుకు బండవారిపాయె!”.. అంటున్న భర్త పక్కనే కూర్చొని, వేడి చాయ జుర్రుతున్నది మణెవ్వ.
చాయ పాములెక్క నరాలల్లకు పాకింది. పానం ఉషారైంది.
“నేనేం జెయ్యాలె?”.. అన్నది.
“ఎక్కడన్నా జీతముండడు. సొంత యాపారం పెట్టిద్దామంటే పెట్టువడికి పైసల్లేవాయె. పైసలు లేనోన్ని పెండల పురుగోలె తీసిపారేస్తరు. గౌర్మెంటు ఇస్తున్న గా పించినితోనే ఇల్లు గడువవట్టె. శిల్లర బాకీలు కుప్పలోలె ఉండె”.
“ఏదన్నా ఉపాయం జెయ్యాలయ్యా!”.
“గింత పెద్దిల్లు ఏం జేసుకుంటం? సగమమ్మి ఓ కిరాణ దుకాణం పెట్టిత్తె బాగుంటది గదా?”.
“గట్లయితే ఇప్పుడేదో సదురుకోవచ్చు గానీ, వాని పెండ్లయినంక ఇరుకుటమైతదేమో..?”.
“ఇరుకుడో.. గిరుకుడో.. వాడు తొవ్వల వడాలె!”.
గప్పుడే గోడ మీది బల్లి అరిచింది.
“కృష్ణ కృష్ణా! బల్లి గూడ పలికింది. అట్ల జేస్తె బాగనే ఉంటది” రాజారాం ఆలోచన.
* * *
“అక్కా! ఓ అక్కా!” అనుకుంట ఇంట్లకు ఓ కొత్త మనిషొచ్చిండు.
భార్యాభర్తలు అటు చూసిండ్రు. పైజామా, గీతల షర్టు. భుజమ్మీద తుండుగుడ్డ, నుదుట భస్మరేఖలు, అతని వెనక ఇరవై ఐదేండ్ల పడుసు పిల్ల. సాయ నలుపు, ముఖమ్మీద ఆరబోసిన అమాయకత్వం, చెవులకు రింగులు. ఆ కొత్తవాళ్లు మంచం దాకా వచ్చిండ్రు.
“ఏందక్కా? నేను.. బావా! నీ బామ్మర్ది శంకరయ్యను. ఇది భవాని, నా బిడ్డ. బొంబై నుంచి అచ్చిన” అంటూ సూటుకేసు కిందవెట్టిండు.
మొగ్గలెక్క ముడుసుకున్న మణెవ్వ ముఖం.. బీరపువ్వోలె విచ్చుకుంది.
“నువ్వార శంకరీ! గిట్లయినవు ఏందిరా?” అనుకుంట సూటుకేసు తీసి, లోపల వెట్టింది.
“సుక్కతెగి వడ్డట్టు వచ్చినవురా” అంటూ తమ్ముని చేతులందుకొని కండ్లకద్దుకున్నది.
“ఒక ఉత్తరం గూడ రాయకపోతివి. నీ బిడ్డనా? దీని పేరు భవాని గదా? నీ పెండ్లాం ఎట్లుందిరా?” అంటూ కుశల ప్రశ్నలేసింది.
మణెవ్వ దంపతుల కాళ్లకు మొక్కింది భవాని.
“మీ అమ్మ బాగుందా బిడ్డా?” అంటూ భవానిని లేపి, గుండెలకు హత్తుకుంది మణెవ్వ.
“మా అమ్మ.. అమ్మ..” అనంగనే.. భవాని కండ్లల్ల నీళ్లు దిరిగినయి.
“మీ అమ్మకేమైందే?” మణెవ్వలో ఆత్రుత.
“అమ్మ.. సచ్చిపోయిందత్తా!” గొల్లుమన్నది భవాని. మణెవ్వ కండ్లు మంచు పూలైనయి.
“గట్లెట్లరా?” గుండె పిండినట్టయ్యింది.
“ఎవల బిశాది ఏందని బొంబై వోతి!”.. తుండుగుడ్డతో కండ్లద్దుకున్నడు శంకరయ్య.
“మొదట్ల కూలి పన్జేసినక్కా! రాత్రింబగళ్లు పంజేస్తి. పెండ్లాన్ని తోల్కపోతి. పైసలు కూడవెట్టి సాంచాలు కొంటి. బట్టలు తయారుజేస్తి. నాకష్టం లెక్క సాంచాలు పెరిగినయి”.
“మరి!”.. కంటిధారల్ని మణెవ్వ కొంగుతో అద్దుకుంది.
“మంచి పిల్లగాన్ని జూసి భవాని లగ్గం జేత్తి! భవాని మొగడు ప్రైవేటు కంపెనీల పంజేసెటోడు. నా అల్లునిది రాజా గుణం. ఏడాది దిర్గకుండనే ఆళ్లకు కొడుకు పుట్టిండు. గంతల్నే ఏ దేవునికి కన్నుగుట్టిందో! నా బిడ్డ బతుకు అన్యాయమై పోయిందక్కా! ఓ రోజు ముగ్గురూ బైకు మీద సిన్మాకు పోతుంటే.. యాక్సిడెంటైంది. తండ్రి కొడుకులు అక్కడికక్కడే సచ్చిపోయిండ్రు. భవాని దెబ్బలతోటి బైటవడ్డది. నా భార్య, నేను బుద్దార ఏడ్శినం. బిడ్డ బతుకు ఆగమైందన్న రందితోనే నీ మర్దలు మంచంల వడ్డది. ఎన్ని దావకాండ్లు దిప్పినా దక్కలే! ఇగ మా గతి అంగట్ల అవ్వా అంటే.. ఎవనికి పుట్టినవ్ బిడ్డా? అన్నట్టుగైంది. మాకక్కడ నా అన్నవాళ్లెవరూ లేరు. గంతల్నే మీరు గుర్తుకొచ్చిండ్రు. ఇల్లు అమ్మేసి, సాంచాలు కిరాయికిచ్చి వచ్చినం” తన కథంత చెప్పుకొచ్చిండు శంకరయ్య.
శంకరయ్య, భవానీ దుఃఖం కక్కేస్తుంటే.. రాజారాం, మణెవ్వ లోపలినుంచి పొంగుకొచ్చిన ఆవేదన అంతా ఇంతా కాదు. శంకరయ్యను గుండెలకు హత్తుకున్నడు రాజారాం.
“శంకరా! మనుషులమంతా పైవాని చేతిల ఆటబొమ్మలం. అదంతా రుణానుబంధం”.. తుండుగుడ్డతో బామ్మర్ది కండ్లు తుడిచిండు.
“అందరి సంగేతేందో గానీ, నా బతుకు బండల పాలైందత్తా!” అంటూ మేనత్త ఒడిలో ఒదిగిపోయింది భవాని.
“మనిషి బతుకుల కష్టసుఖాలు రెండూ ఉంటాయి భవానీ!” వీపు నిమిరింది మణెవ్వ.
“నీ బతుకు బండలైందని అనుకోకు. మేమున్నం గదా!” అంటూ ఊరడించింది.
గంతల్నే..
“కల కానిదీ.. విలువైనదీ బతుకూ…” అంటూ సిన్మా పాట పాడుకుంట పరశురాములొచ్చిండు. ముందర వయసు పొంగులతోని భవాని కనబడింది.
‘అబ్బో! ఏవలీ ముద్దుగుమ్మ? కౌచిప్పలోలె కండ్లు, చెక్కిన ముక్కు, గంత పొడుగు జడ..’ అని మనసులోనే అనుకుంటున్నడు.
“ఏందిరా గట్ల జూస్తున్నవ్! అది భవాని! నీ మేన మరదలు. ఇగో మా తమ్ముడు శంకరయ్య. బొంబై నుంచి మూట ముల్లె సద్దుకొని వచ్చిండ్రు” మణెవ్వ చొరవ సూపుకుంట అన్నది.
‘మామా!’ పరశురాములు ఆశ్చర్యానందాలు.
“మిమ్మల్ని చూసి చానా కాలమైంది. అంతా బాగున్నరా?”.
“ఏదో బిడ్డా! గిట్లున్నం. నా మేనల్లుడు శానా పెద్దోడైండు. పెండ్లాం పిల్లలంతా..” శంకరయ్య అయోమయంలో ఆశ.
“ఆనికి ఇంక లగ్గమే కాలే. మన సాధనాశూరుల విద్య నేర్సుకొని ఎటూ గాకుంట వోయిండు..” సంగతంతా చెప్పిండు రాజారాం.
ఆ సాయంత్రం భవాని సంగతంతా కొడుక్కు పూస గుచ్చినట్టు చెప్పింది మణెవ్వ. భవాని, పరశురాములు చూపులు కలుసుకొని ఒకరినొకరి ఆసాంతం పరిశీలించుకుంటున్నరు. గుండెల గుసగుసలు. భవానికి తన పరిస్థితి గుర్తుకొచ్చి గంభీరమైంది. మొహం ముడుచుకుపోయింది.
* * *
నాలుగు రోజులు గుంభనంగ గడిచినయి. గుండెల్ల గుండు సూది గుచ్చినట్టుగుంది భవానికి.. గది నుంచి బయటికి రాలేదు. అక్కను సూడగానే.. గుండెమంటల మీద నీళ్లు వోసినట్టు అయ్యింది శంకరయ్యకు.
‘భవాని గురించి అంతా శెప్పితి. అక్కాబావలకు దయ కలిగిందో.. లేదో? భవానిని వాళ్ల కొడుక్కిచ్చి లగ్గం జెయ్యమని అడిగితే! బావ కోపానికొచ్చి కొండెంగలెక్క అయిపోతడేమో? ‘ముండ మోసిన పోరిని నా కొడుక్కు చేసుకోవాల్నా?’ అని ఒంటికాలి మీద లేస్తడేమో?’.. ఆలోచనలు అల్లకల్లోలం చేస్తున్నయి.
ఇటు జూత్తె మణెవ్వ.. ‘నా తమ్ముని బిడ్డ బతుకు ఎనుగుల వడ్డ ఎలుక పిల్లలెక్కాయె. కొడుకును సూత్తె కొండమీది కొంగలెక్కుండె. ఎటు ఎగిరిపోతడో.. వన్నెల పోశెట్టి! భవానిని లగ్గం జేసుకుంటడో? లేదో?’ ఆలోచనాలోచనాలు తిరుగుతున్నయి.
ఇక రాజారాంది.. కుడితిల వడ్డ ఎలుకలెక్కుంది పరిస్థితి. ‘బామ్మర్ది, ఆని బిడ్డ ఎన్ని రోజులుంటరో? మాకే తిండికి తిప్పలు గావట్టె. బోడిగుండు మీద కొబ్బరి బోండం పడ్డట్టుంది. కొడుకు ఎట్లా బాగుపడాలె? శంకరయ్య ఏదన్న సాయం జేస్తడో?’.
భవానిని చూసినప్పటి సంది పరశురాములు మనసు అటే లాగుతున్నది. ‘భవాని బొమ్మోలె బాగానే ఉంది. కానీ, నా పరిస్థితి.. సంపాదన సున్న, ఖర్చు మిన్న. భవానిది ముందే దెబ్బతిన్న పానం. నాతో పెండ్లికి ఒప్పుకొంటదా?’.
భవాని ఒకసారి బయటికొచ్చి చూసింది. అందరి లెక్క తాను గూడ పొద్దున చాయదాగి, పరశురాముల్ని చూసింది. ప్చ్.. ఏం లాభం? నరాలల్ల కొత్త అల్లకల్లోలం పుట్టుకొస్తుంటె.. తిరిగి గదిలోకెళ్లి మంచమ్మీద కూర్చుంది.
* * *
మధ్యాహ్న మార్తాండుడు వేడిని వెదజల్లుతున్నడు. భోజనాలైనంక అందరూ వసారాల కూసున్నరు. భవాని తల పైకెత్తడం లేదు.
‘మా ఇంట్ల ఇంకెన్ని రోజులుంటవురా శంకరీ?’ అని అడుగుదామని అనుకున్న రాజారాం, భార్య సైగలతో ఆగాడు.
“బావా! అక్కా!”.. శంకరయ్యలో మొండి ధైర్యం. ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నడు.
“ముసుగుల గుద్దులాట ఎందుగ్గాని.. నెనొకటి చెప్తా.. మీరు సరేనంటరా?” అని అడిగిండు.
“అందరికీ బాగుంటే అవునంటం..” రాజారాం తెగింపు.
మణెవ్వ జాగ్రత్తగా వింటున్నది.
“అయితే వినుండ్రి.. నా బిడ్డ భవానికి మల్ల లగ్గం జెయ్యాలనుకున్న. మీ కొడుకూ లగ్గానికున్నడు. నా దగ్గర లక్ష రూపాలున్నయి. మీరు భవానిని పరశురాములకు చేసుకుంటె.. ఆ లక్ష మీకే ఇస్త. బొంబైలున్న సాంచాలు దెప్పించి, సిద్దిపేటల వెట్టిపిస్త. వాటిని గూడ మీకే ఇచ్చేస్త. పరశురాములు సాంచాల మీద పనిచేసుకుంట నాల్రూపాలు సంపాయించుకుంటడు. తాను బతుకుతడు. మనందర్ని బతికిస్తడు. నేను జిందగీ ఉన్నంతదాక మీతోనే ఉంట. ఇప్పుడేమంటరు?” సూటిగ అడిగిండు.
అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నరు. అందరి కండ్లల్లో కొత్త కాంతులు మెరుస్తున్నయి. భవాని, పరశురాములు కండ్లు కలుసుకొని సైగలు చేసుకుంటున్నయి. ఇద్దరూ భవిష్యత్తు గురించి ఊహల ఉయ్యాలలూగుతున్నరు.
ఐతా చంద్రయ్య స్వస్థలం సిద్దిపేట జిల్లా చింతమడక. బీఏ చేశారు. పోస్ట్ మాస్టర్గా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందారు. 50 ఏండ్లుగా కథా రచనలో ఉన్నారు. ఇప్పటివరకూ 700లకు పైగా కథలు రాయగా, అవి 22 సంపుటాలుగా వెలువడ్డాయి. 19 కవితా సంపుటాలు, 11 నవలలు, 6 రంగస్థల నాటకాలు, 18 రేడియో నాటికలు, 6 ఏకపాత్ర సంపుటాలు, 29 బాల సాహిత్య సంపుటాలు, మరో 23 అనువాదాలు, 9 ఇతర సంపుటాలను వెలువరించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి, సాహితీ, ప్రతిభా పురస్కారాలను అందుకొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్తు నుంచి వరిష్ఠ పురస్కారంతోపాటు అనేక అవార్డులు, సన్మానాలు పొందారు. వివిధ సంస్థల నుంచి కథా శిల్పి, కవి శేఖర, బాల కథా శిల్పి బిరుదులు వరించాయి.
-ఐతా చంద్రయ్య , 93912 05299