పట్టిందల్లా బంగారమైనవాడు, అడుగుపెట్టిన చోటల్లా అగ్రస్థానంలో నిలిచేవాడు.. విజేత కానేకాడు, మహా అయితే అదృష్టవంతుడు! అసలు సిసలు విజేత ఓడి గెలుస్తాడు, వెక్కిరించిన నోళ్లతోనే ప్రశంసలు అందుకుంటాడు, కాదన్నవారినే కాళ్లబేరానికి రప్పించుకుంటాడు. బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ కూడా అలాంటి నిఖార్సయిన విజేతే! చాంపియన్గా, క్రీడా శిక్షకుడిగా తన స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని‘షట్లర్స్ ఫ్లిక్’ (మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్) శీర్షికతో పుస్తక రూపంలో తీసుకువచ్చారు గోపీచంద్. ఆ విశేషాలు సంక్షిప్తంగా..
ప్రతి ఒక్కరికీ తమదైన రంగంలో చాంపియన్గా అవతరించగల సామర్థ్యం ఉంటుంది. తమ కలలను సార్థకం చేసుకోగల నైపుణ్యమూ ఉంటుంది. అయితే చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. చావోరేవో అన్నట్టు సాధన చేయాలి. లక్ష్యమే ప్రపంచమని అనుకోవాలి. అచ్చంగా ఒక చాంపియన్లానే ప్రవర్తించాలి. సాధనే మనిషిని పరిపూర్ణుణ్ని చేస్తుందని నమ్ముతారు విజేతలు. అన్నిటికంటే ముందు తమ దారి ఏమిటో తమకు తెలియాలి. 2001 ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీ సమయంలో పుల్లెల గోపీచంద్ అదే చేశాడు.
బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ ఫైనల్స్ జరుగుతున్నాయి. స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ మైదానానికి అలాంటి వాతావరణం కొత్తేం కాదు. పుల్లెల గోపీచంద్ ఫైనల్స్లో ప్రవేశించడం మాత్రం భారతీయులకు సంబంధించినంత వరకూ ప్రత్యేకమైన విషయమే. అప్పటికే సెమీస్లో.. ప్రపంచ నంబర్-1గా ఉన్న డెన్మార్క్ క్రీడాకారుడు, ఒలింపిక్స్ బంగారు పతక విజేత అయిన పీటర్ గేడ్ను ఓడించాడు గోపీ. దీంతో, తమ ఆటగాడే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ను సొంతం చేసుకుంటాడన్న విశ్వాసం భారతీయుల్లో పెరిగింది. ఆ కల నిజం కావాలంటే చైనా క్రీడాకారుడైన చెన్ హోంగ్తో గోపి తలపడాల్సి ఉంది. హోంగ్ అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉన్నాడు. పీటర్ గేడ్ వస్తే తమకు గెలుపు దక్కదేమో అనుకున్న చైనీయుల్లో గోపీ విజయం ఊరటనిచ్చింది. ఆ బక్కపలచ కుర్రాడిని అసలు ఓ ప్రత్యర్థిగానే భావించలేదు వాళ్లు. చాంపియన్షిప్ తమదే అన్న ధీమాతో స్టేడియంలో కేరింతలు కొడుతున్నారు. కానీ, గోపి వరుసగా రెండు సెట్లలో ధాటిగా ఆడి చెన్ హోంగ్ మట్టికరిపించాడు. 1980లో ప్రకాశ్ పదుకొనె ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీని గెలుచుకొన్న ఇరవై ఏండ్ల తర్వాత మనకు దక్కిన ఘన విజయమిది. ఇక్కడ గెలుపు ఒక్కటే విశేషం కాదు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రను మలుపుతిప్పింది. గోపీచంద్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఎంతోమంది ఆటపట్ల ఆసక్తి పెంచుకున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటివారు భారత్కు ఒలింపిక్స్ కాంస్య, రజత పతకాలను సంపాదించి పెట్టారు. ఒక విజయం మరిన్ని ఘన విజయాలకు మార్గం చూపడం అంటే ఇదే.
ఆల్ ఇంగ్లండ్ విజేతగా నిలిచి, తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకునే వరకు గోపీచంద్ ప్రయాణం ఒడుదుడుకుల మయం. ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని చదివితే.. క్రీడల్లోనే కాదు, జీవితంలోనూ గోపి ఎంత స్థితప్రజ్ఞతతో వ్యవహరించారో, ఓటముల్లో ఎంతటి ఓర్పును ప్రదర్శించారో తెలుస్తుంది. బ్యాడ్మింటన్ చాంపియన్గా, శిక్షకుడిగా స్ఫూర్తిదాయకమైన తన ప్రస్థానాన్ని ‘షట్లర్స్ ఫ్లిక్’ (మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్) శీర్షికతో పుస్తక రూపంలో తీసుకువచ్చారు గోపీచంద్. ఈ అక్షర యజ్ఞంలో ఆయనకు ప్రియా కుమార్ సహకారం అందించారు. ఆటగాళ్లకు గాయాలు పాఠాల్లాంటివి. తొలినాళ్లలో తగిలిన దెబ్బలే గోపిచంద్కు భయాన్ని జయించే బలాన్నిచ్చాయి. ఒక్కసారి దెబ్బల్ని, ఎదురు దెబ్బల్ని అధిగమిస్తే.. ఆటలోనైనా, జీవితంలోనైనా కిందపడిపోవడం అన్నదే ఉండదు. క్రికెట్, గిల్లిదండ, ఫుట్బాల్… ఇలా చిన్నాపెద్ద అన్న తేడాలేదు అన్ని ఆటల్లోనూ గోపిది విజయ ప్రస్థానమే. అసలు విజయం సాధించడమే తన లక్ష్యమన్నట్లు ఆడేవారు. తమ కొడుకు ఎప్పటికైనా గొప్ప విజేత అవుతాడని చిన్నతనంలోనే గుర్తించారు తల్లిదండ్రులు సుభాష్, సుబ్బరావమ్మ. అందుకు తగిన శిక్షణ కూడా ఇప్పించారు. లాల్ బహదూర్ స్టేడియం (ఫతేమైదాన్) వేదికగా గోపి బ్యాడ్మింటన్ ఓనమాలు నేర్చుకున్నారు. ఆటలో ప్రతిభకు గుర్తింపుగానే సెయింట్ పాల్స్ పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఆ రుణం తీర్చుకోవడానికే అన్నట్టు గోపి అదే ఏడాది సెయింట్ పాల్స్కు ఇంటర్ స్కూల్ ట్రోఫీ సంపాదించి పెట్టారు. గోపిలోని మెరుపును కోచ్ హుస్సేన్ త్వరగానే గుర్తించారు. అందరు పిల్లలూ ఇంటికి ఎప్పుడు వెళ్లిపోతామా అన్నట్లు ఉండేవారు. గోపి మాత్రం ఇంకొంతసేపు ఆడాలని అనుకునేవారు. అందరికంటే ముందు బడికెళ్లి, అందరికంటే చివరన ఇంటికి వచ్చేవాడు. ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా స్టేడియానికి వెళ్లేవాడు. మధ్యలో బడి, పాఠాలు, హోంవర్క్ గోపి ఆటకు విరామం మాత్రమే.
కలలు అందరూ కంటారు. గమ్యాన్ని చేరుకునేది మాత్రం కొంతమందే. పరీక్షల సమయంలో కూడా కాస్తంత విరామంలో ఆటలు ఆడటం మంచిదేనంటాడు గోపి. దీనివల్ల విద్యార్థుల వ్యక్తిత్వం మరింతగా వృద్ధి చెందుతుందని తన అభిప్రాయం. కోర్టు బయట చేసిన రన్నింగ్, స్ప్రింట్లు, మెట్లు ఎక్కడం, స్కిప్పింగ్ లాంటివి గోపిలో వేగాన్ని, చురుకుదనాన్ని పెంచాయి. అలా తన ఆటకు అవసరమైన హంగులన్నీ సమకూర్చుకున్నాడు. అయితే అతనికి అసలు సిసలు శిక్షణ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరిఫ్ దగ్గరే లభించింది. తొలిరోజుల్లో గోపి రాష్ట్ర స్థాయి పోటీల్లో సునాయాసంగా గెలిచేవాడు. జాతీయ స్థాయిలో మాత్రం రాణించలేకపోయేవాడు. తీవ్రంగా వేధిస్తున్న సైనసైటిస్ రుగ్మత దీనికి కారణం. జాతీయ పోటీలు గోవా, చెన్నై, కోల్కతా లాంటి సముద్ర తీర ప్రదేశాల్లో జరిగేవి. అక్కడి ధూళి, గాలిలో ఆర్ద్రత కారణంగా సైనసైటిస్ విజృంభించేది. దీంతో ఆటమీద దృష్టి సారించలేకపోయేవాడు. ఆటలో పడి చదువులను నిర్లక్ష్యం చేయడంతో ఇంజినీరింగ్లోనూ సీటు రాలేదు. అయినా, తల్లిదండ్రులు మరో అవకాశం ఇచ్చారు. ఈసారి జాతీయ స్థాయిలో ఆటలో రాణించలేకపోతే, బళ్లారిలో ఇంజినీరింగ్ చేర్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ పరిస్థితుల్లో కూడా గోపి ఆశావాదాన్ని వీడలేదు. ఓడినా గెలిచినా ఆడుతూనే ఉండాలన్నది గోపి తత్వం. మన పని మనం చేసుకొంటూ పోతే, కొత్త ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయని విశ్వసించాడు.
.. సరిగ్గా ఆ సమయంలో గోపి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. చైనీస్ కోచ్ షియావో మింగ్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ శిక్షణ శిబిరానికి హాజరు కావాలంటూ పిలుపువచ్చింది. అప్పట్లో మింగ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షకుడిగా పరిగణించేవారు. ఆయన కూడా గోపిలోని దూకుడును పసిగట్టాడు. కఠిన శిక్షణ ఇచ్చి రాటుదేలేలా చేశాడు. ఎడతెరిపిలేని సాధన వల్ల అలసిపోతామని అందరూ అనుకుంటారు. కానీ గోపి అలాకాదు. ఎక్కువ సాధనవల్లే ఆటలో మరిన్ని పాయింట్లు లభిస్తాయని విశ్వసించాడు. అలా మింగ్ శిక్షణలో సీనియర్స్ నేషనల్ టీంలో ఇండియా- మలేసియా టెస్ట్ సిరీస్లో ఆడే అవకాశం వచ్చింది. ఈ బృందంలో అందరికంటే చిన్నవాడు తనే. అయినా సరే, పెద్ద దిక్కయి జట్టును గెలిపించాడు. ఆతర్వాత, నేషనల్స్ జూనియర్లోనూ గెలిచాడు. అదీ గోవాలో. ఈసారి చాలా వ్యూహాత్మకంగా అడుగువేశాడు. ముందుగా, తన తొలి ప్రత్యర్థి అయిన సైన సైటిస్ను గెలవడానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. ఇక మిగిలింది మైదానంలో గెలుపు. అదీ ఓ పెద్ద సమస్య కాలేదు.
సరైన కోచ్, తగినన్ని సదుపాయాలు లభించినంత మాత్రాన ఎవరూ చాంపియన్లు అయిపోరు. మనకోసం అండగా నిలిచేవాళ్లు ఉంటేనే లక్ష్య సాధన సులువు అవుతుంది. తన ఆటకోసం అమ్మ చేసిన త్యాగం గురించి చెబుతూ… ‘నేను, మా అన్న రాజశేఖర్ బడి నుంచి ఇంటికి వెళ్లాక, స్టేడియానికి వెళ్లేందుకు ముందు ఇంట్లో ఓ అరగంట కునుకు తీసేవాళ్లం. ఆ సమయంలో ఎవరూ మా నిద్రను భంగం చేయకుండా అమ్మ ఇంటి బయట మెట్ల దగ్గర కూర్చునేది. ఇక తెల్లవారుజామున స్టేడియానికి వెళ్లే సమయంలో ఒక్కోసారి కుక్కలు వెంటపడేవి. అప్పుడు, నాన్న మాకు తోడుగా వచ్చేవారు. నేను చాంపియన్గా అవతరించానంటే.. అందుకు కారణం నా కుటుంబమే’ అంటాడు గోపి.
ఆటలో అగ్రస్థానం కోసం గోపి తనదైన వ్యూహాన్ని రూపొందించుకున్నాడు. కోచ్లు డిఫెన్స్ ఆడమని చెప్పినా వినకుండా, అటాకింగ్ వైపు మొగ్గుచూపాడు. మైదానంలో ఒక మూలన కూర్చొని ఆట గురించి అన్ని కోణాల్లో విశ్లేషణ చేసుకునేవాడు. తన బలాలూ బలహీనతలే కాదు, ప్రత్యర్థుల వ్యూహాలను కూడా ఆకళింపు చేసుకునేవాడు. ఆరునూరైనా గెలవడమే లక్ష్యం అన్నట్టు ఉండేది గోపి ధోరణి. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన ఉంటుంది. ఆట మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఉంటుంది. కాబట్టి ఏ సమయంలోనైనా ఆడేలా మానసికంగా సిద్ధం అయ్యేవాడు. మరెవరూ మన సమస్యను అర్థం చేసుకోలేరు కాబట్టి, మనకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి. ఆ స్థయిర్యం గోపిలో పుష్కలం.
మనకంటే మంచి ఆటగాళ్లతో తలపడితేనే సాధన పదునుదేలుతుంది. గోపి విషయంలో జరిగిందీ అదే. శిక్షణలో తన బలహీనతలు బయటపడిన ప్రతిసారీ సాధనతో వాటిని అధిగమించడానికి ప్రయత్నించేవాడు. అదే పొరపాటు తదుపరి మ్యాచ్లో జరగకుండా జాగ్రత్త పడేవాడు. ముందురోజు ఆట కంటే, మరుసటి రోజు ఆట ఒక్క శాతమైనా మెరుగ్గా ఉండాలని తన ఆరాటం. ఓ సందర్భంలో శిక్షణ కోసం ప్రకాశ్ పదుకొనె దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మెరుగైన సౌకర్యాలే ఉన్నాయి. కాకపోతే, ప్రకాశ్ పద్ధతుల్లోనే ఆడాల్సి ఉంటుంది. గోపికి ఆ పరిమితులు నచ్చేవి కాదు. తనదైన శైలిలో, తనకు నచ్చినట్లు ఆడేందుకు మళ్లీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిబిరానికే తిరిగొచ్చాడు. ఈ నిర్ణయమే తనను అద్భుతాల ఆవిష్కరణ దిశగా నడిపించింది. పేరుకు శిక్షణకు వెళ్లాడన్న మాటే కానీ, చాలావరకు సొంతంగానే ప్రతిభకు పదునుపెట్టుకున్నాడు. తన స్వభావానికి తగినట్లు దూకుడుగానే ఆడేవాడు. తనదైన శైలిలో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేవాడు. మరింత శక్తితో, మెరుపులాంటి కదలికలతోనే శక్తిమంతులైన చైనీస్, ఇండోనేషియన్ ప్రత్యర్థులను మట్టికరిపించగలమన్న సంగతి గోపికి తెలుసు. ఎత్తుకు పై ఎత్తుతో ప్రత్యర్థులను దిగ్భ్రమకు లోనుచేసేవాడు. ప్రతీ ఆటనూ గెలిచేందుకు మాత్రమే ఆడేవాడు. ఒకవేళ ఓడిపోవాల్సి వచ్చినా పోరాడి ఓడేవాడు. అలా 17 ఏండ్లు వచ్చేసరికి ఎవరూ తేలిగ్గా తీసుకోలేని ఆటగాడిగా రాటుదేలిపోయాడు. ఈ సంగతి భారత బ్యాడ్మింటన్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది.
ఎప్పుడూ పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉండాలని ఆశించకూడదు. వాటిమీద ఫిర్యాదులూ చేయకూడదు. ఢిల్లీలో ఎండకాలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాంటి సమయంలో నలుగురైదుగురు ఆటగాళ్లకు ఒకగది కేటాయిస్తారు. దాంతో బాత్రూమ్, భోజనం, నీళ్లు ఇలా ఏది కావాలన్నా అందరినీ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. పైగా వేడికి నిద్ర పట్టదు. ఎయిర్ కండిషనర్లు ఉండవు. ఉన్న ఒకట్రెండు ఫ్యాన్ల వల్ల అంతగా ఉపయోగం ఉండదు. చెమటకాయలు ఇబ్బంది పెడుతుంటాయి. మైదానంలో కచ్చితంగా టీ షర్ట్ వేసుకోవాల్సిందే. దీంతో కురుపుల వల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అయినా గోపి ఆట నుంచి తప్పించుకునేవాడు కాదు. ఆ అంకితభావమే ఇతర ఆటగాళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆటలో మానసికంగానూ ముందుండేలా చేసింది. కఠినమైన పరీక్షలను ఎదుర్కోకుండా ఎవ్వరూ గొప్పవాళ్లు కాలేరంటాడు గోపి. బ్యాడ్మింటన్ తనకు ఎన్నో జీవిత పాఠాలు, నాయకత్వ సూత్రాలు, స్ఫూర్తిదాయక అంశాలు బోధించిందని చెబుతాడు.
గోపీచంద్ ప్రొఫెషనల్ శిక్షణ ప్రారంభించే నాటికే అతను తిరుగులేని ఆటగాడు. దాంతో ఇతర ఆటగాళ్లు అతని ఆటను మాత్రమే కాకుండా ప్రాక్టీస్ను కూడా పరిశీలించేవాళ్లు. రోజుకు సగటున నాలుగు గంటలు సాధన చేసేవాడు తను. బరువులు ఎత్తడం, పరుగెత్తడం, స్కిప్పింగ్ చేయడం గోపికి అలవాటు. సాధన క్రమంలో రోజుకు 50కి పైగా బ్యాడ్మింటన్ షటిల్స్ విరిగిపోయేవి. ఓ సాధువు ఆధ్యాత్మిక ఉన్నతికి తన జీవితాన్ని అంకితం చేసినట్లే, గోపిచంద్ తన జీవితాన్ని బ్యాడ్మింటన్కు రాసిచ్చేశాడు. గోపి జీవితమే ఓ ఆట. అతను ఉంటే ఆటలో, లేకుంటే శిక్షణలో ఉంటాడు. రెండూ కాకపోతే, సాధన చేస్తూ కనిపిస్తాడు. అది కాకపోతే మనసులో ఆట గురించి వ్యూహాలు, ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు. ఇవేవీ చేయకుండా ఉన్నాడంటే, మరుసటి రోజు ఆట కోసం విశ్రాంతి తీసుకుంటున్నాడని అనుకోవాలి. ఆటల్లో గెలవాలంటే శరీరానికి శిక్షణ ఇస్తే సరిపోదు. మానసికంగానూ దృఢంగా ఉండాలి. దానికీ శిక్షణ అవసరం అవుతుంది. మానసిక దృఢత్వ పాఠాలను గోపి అంతర్జాతీయ క్రీడాకారుడు రాజీవ్ బగ్గా నుంచి నేర్చుకున్నాడు. పుట్టుకతోనే బధిరుడైన బగ్గా ప్రత్యర్థి ఆటగాళ్ల కదలికల ద్వారానే వాళ్ల సర్వీస్లను పసిగట్టగల నేర్పరి.
ఓసారి భారత బృందం మలేసియా పర్యటనకు వెళ్లింది. మొత్తం 80 మందిలో అందరికంటే చిన్నవాడు గోపినే. అయితే ఈ పర్యటనలో గోపి సహా ఎవ్వరూ గెలవలేదు. దాంతో గదిలో నిరాశాపూరిత వాతావరణం అలుముకుంది. నిరాశను బద్దలుకొడుతూ గోపి తాను ఆట గెలిచి చూపిస్తానని సవాలు విసిరాడు. దాంతో అందరి కళ్లూ అతనిపైనే నిలిచిపోయాయి. చాలాకాలం ఓటములు వెంటాడినా గోపిలో గెలవాలన్న కసి మాత్రం తగ్గలేదు. అలా అని, గోపికి విజయం అంత సులువుగా ఏమీ దొరకలేదు. ఇక ఆట ఆడే ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఒక్కడే ఎదుర్కొన్నాడే తప్ప ఎప్పుడూ సాకులు చెప్పలేదు. ఆటకోసం గోపి చదువును పణంగా పెట్టాల్సి వచ్చింది. సైన్స్కు బదులుగా ఆర్ట్స్ గ్రూప్లో చేరాడు. కాలేజీకి కూడా ఎప్పుడో ఓసారి వెళ్లేవాడు. దాంతో, హాజరు వేస్తున్నప్పుడు అతని నెంబరును లెక్చరర్లు పిలిచేవారే కాదు. కొన్నిసార్లు, ఆ గైర్హాజరుకు శిక్షగా తరగతి గది బయటే నిలబడమనేవారు. ఆ శిక్షను కూడా ఓ అవకాశంగా తీసుకొని స్టేడియానికి వెళ్లిపోయేవాడు. అయితే, ఆ సమయానికే గోపి స్టేట్ చాంపియన్గా అవతరించాడు. దాంతో జీవితం కొంచెం సులువుగా సాగడం మొదలైంది. అయితే గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తన కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే తనకు సాంత్వన కలిగించే అంశమని అంటాడు గోపి. అసలు వాళ్లున్నందుకే తనీ స్థితిలో ఉన్నానని చెబుతాడు.
గోపి అన్నయ్య రాజశేఖర్ కూడా మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడే. ఓ సందర్భంలో అన్న మొదటి స్థానంలో, తమ్ముడు రెండో స్థానంలో నిలిచారు. అయితే రాజశేఖర్ చదువుల్లో కూడా చురుకే. ప్రవేశ పరీక్షలో 101వ ర్యాంకు సాధించి ఐఐటీ రూర్కీలో చేరిపోయాడు. గోపి మాత్రం ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో నెగ్గ లేకపోయాడు. మరోదార్లేక డిగ్రీలో చేరాడు. ఇంతలో జంషెడ్పూర్లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టిస్కో)లో నెలకు 4,500 రూపాయల వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో అది పెద్దమొత్తమే. అక్కడ మెరుగైన సదుపాయాలే ఉన్నాయి. అయితే తగిన ఆటగాళ్లు మాత్రం లేరు. ఇంతలో గోపికి చిన్నమ్మవారు సోకింది. తండ్రి వెళ్లి హైదరాబాద్కు తీసుకువచ్చారు. బాగా బలహీనపడటంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంతలో ఎయిర్ ఇండియా నుంచి స్పోర్ట్స్ కోటాలో నెలకు 3,000 రూపాయల స్కాలర్షిప్ పొందగలిగాడు. 1994 జనవరిలో గోపి మోకాలి గాయంతో బాధపడ్డాడు. మోకాలి గాయం అంటే అథ్లెట్ కెరీర్ ముగింపునకు చేరుకున్నట్టే. మళ్లీ కోలుకుంటాడా అన్నదీ ప్రశ్నార్థకమే. ఓ దశలో గోపి హాస్పిటల్కు వెళ్లేసరికి అతని కాలు బాగా వాచిపోయి ఉంది. ఇంతబాధలో కూడా గోపి తదుపరి జాతీయ టోర్నమెంట్ కోసం ఢిల్లీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సమయానికి కూడా గాయం తగ్గలేదు. అక్కడ డాక్టర్ రాజగోపాల్ చికిత్స చేశారు. ఇందుకు పదిహేనువేల వరకూ ఖర్చు అయింది. కానీ గోపి కుటుంబం అంత భరించే స్థితిలోలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజగోపాల్ ఉచితంగానే వైద్యం చేశారు. ‘నా ఫీజుగా ఆల్ ఇంగ్లండ్ కప్ తీసుకురావాలి మరి!’ అంటూ గోపిని సాగనంపారు. కోలుకుంటున్న సమయంలో గోపి యోగా, ఆధ్యాత్మిక, ఆయుర్వేద గ్రంథాలు అనేకం చదివాడు. అలా, భవిష్యత్తు పోరాటానికి అవసరమైన మానసిక స్థయిర్యాన్ని సమకూర్చుకున్నాడు.
చక్రాల కుర్చీకే పరిమితమైన గోపి గోడలకు బంతులు కొడుతూ ఇంట్లోనే సాధన చేశాడు. ఏడు నెలల తర్వాత హైదరాబాద్ ఫతేమైదాన్లో ప్రాక్టీసుకు వచ్చేటప్పటికి వాతావరణం మారిపోయింది. గోపి ఇకపై సరిగ్గా ఆడలేడన్న గుసగుసలు మొదలయ్యాయి. అందరి నోళ్లూ మూయిస్తూ.. సార్క్ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఎవరైనా సరే పోరాటాన్ని ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. ఎవరు ప్రోత్సహించినా, ఎంతమంది పరిహసించినా లేచి నిలబడి కలబడాల్సింది మనమే. విద్వేషపూరితమైన మానసిక దాడులకు తిరుగులేని సమాధానం.. గెలుపే. గోపి కూడా తన రాకెట్తోనే సమాధానం ఇచ్చాడు. కాలు నొప్పి ఉంటే బ్రూఫెన్ మాత్ర వేసుకున్నాడు. కదలలేని పరిస్థితుల్లో గోడతోనే ఆడుకున్నాడు. అంతే తప్పించి, బాధపడుతూ కూర్చోలేదు. ఆ గాయాల్ని ప్రత్యర్థులు కూడా అలుసుగా తీసుకున్నారు. ఎడమకాలి వైపే షటిల్ను సర్వ్ చేసేవాళ్లు. అయితే ఈ అవరోధాలన్నీ గోపిని ఏమీ చేయలేకపోయాయి. తను మరింత సాధన పెంచాడు. 1994 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్కు భారత్ ప్రతినిధిగా అర్హత సాధించాడు. గోపి 1995లో రెండోసారి కూడా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్స్కు వెళ్లాడు. కొద్దిపాటి డబ్బుతో ఇబ్బందిపడుతూనే పోటీలో పాల్గొన్నాడు. వెంట సహ క్రీడాకారుడు దీపాంకర్ కూడా ఉన్నాడు. అయితే ఈసారి విశేషం ఏంటంటే, ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారుడు, ఒలింపిక్స్ బంగారు పతకం విజేత అయిన అలన్ బుదికుసుమను గోపి ఓడించాడు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్లో గోపి ఓడినా, ఈ సిరీస్లో అతని ప్రదర్శన అతని ఆటపై మళ్లీ ఆశల్ని సజీవంగా ఉంచింది. జీవితం అన్నిసార్లూ కఠినంగా ఏమీ ఉండదు. ఆనందంగా ఉండటానికి కూడామనకు అవకాశం ఇస్తుంది. దానిమీదే దృష్టిసారించాడు గోపి.. అప్పడే కాదు, ఆ తర్వాత కూడా!
అనూహ్యంగా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) గోపికి జాతీయ స్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశాన్ని ఇచ్చింది. 1985లో అండర్- 12 నేషనల్స్ కోసం ఢిల్లీ వెళ్లాడు గోపి. నేషనల్ చాంపియన్ కావాలన్న ఆకాంక్ష ఆ మైదానంలోనే బలపడింది. ఆ సాధన సమయంలో ఇంట్లో ప్రతి గోడకూ షటిల్ మరకలే. పైగా ప్రాక్టీస్ కోసం గోపి బాడ్మింటన్ రాకెట్ కాకుండా స్కాష్ రాకెట్ ఉపయోగించేవాడు. దాంతో అతని భుజాలు బలంగా తయారయ్యాయి. చైనా, కొరియా ఆటగాళ్లు ఇలాగే చేస్తారు. అప్పటికి, ఆ విషయం గోపికి తెలియదు. అయితేనేం, ఆ సాధన ఎంతో ఉపకరించింది. అతను విసిరే స్మాష్లే ప్రపంచంలో అత్యంత వేగవంతమైనవిగా నిలిచిపోయాయి. అవే 2001 ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీని గెలుపొందేలా చేశాయి.
అసలే మధ్యతరగతి కుటుంబం. బ్యాడ్మింటన్ కోసం షటిల్, రాకెట్, షూస్, ఆహారం.. ప్రతి ఖర్చూ ఖరీదైన వ్యవహారమే. ఆ విషయం తనకూ తెలుసు. కాబట్టే, పూర్తిగా పాడైపోయేవరకూ షటిల్ను వాడేవాడు గోపి. బిడ్డ కోసం అమ్మ సుబ్బరావమ్మ కూడా అనేక త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎర్రటి ఎండలో హైదరాబాద్ రోడ్లపై నడిచివెళ్లేవారు. తండ్రి సుభాష్ వ్యక్తిగత ఖర్చుల్ని బాగా తగ్గించుకున్నారు. ఉన్న నాలుగైదు అంగీలతోనే ఏడాదంతా నడిపించారు. పదిహేనేండ్లపాటు ఆ కుటుంబం సినిమా థియేటర్లకే వెళ్లలేదు. వేడుకలు, రెస్టరెంట్లు, వినోదాలు అన్నీ బంద్. ఇంట్లో చర్చంతా బ్యాడ్మింటన్పైనే. అలా, తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను గోపికి ఇచ్చిందా కుటుంబం.
ఆట కోసం గోపి సామాజిక జీవితాన్ని త్యాగం చేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆడటం అలవాటు చేసుకున్నాడు. స్నేహితులతో సినిమాలూ, షికార్లూ లేవు. 1990లలో అయితే కొరియా, చైనా, జపాన్లలో భారత్ తరఫున వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్న భారతీయ క్రీడాకారుడు తనొక్కడే. అమ్మ సుబ్బరావమ్మ కూడా తన కొడుక్కి బ్యాడ్మింటనే సర్వస్వమని చెబుతారు. ‘మొదట్లో మా అబ్బాయికి సేవచేశాం. ఇప్పుడు మా అబ్బాయి సేవచేసే ప్రతి ఒక్కరికీ సేవ చేయడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాం’ అంటారామె.
గోపీ, నేను 2002లో పెండ్ల్లి చేసుకున్నాం. ఆయన నాకు బాల్యం నుంచే తెలుసు. ఆయనపట్ల, ఆయనలోని క్రీడాకారుడిపట్ల నాకెప్పుడూ ఆరాధనా భావమే ఉండేది. అప్పటినుంచీ చాంపియన్ లక్షణాలను ప్రదర్శించేవాడు. ప్రాక్టీస్ అయ్యాక ఫ్రెండ్స్తో బయట తిరిగేవాడు కాదు. మేం తరచూ టీ స్టాల్కైనా వెళ్లేవాళ్లం. తను వచ్చేవాడు కాదు. నేరుగా ఇంటికే వెళ్లిపోయేవాడు. ఆట తప్ప ఏదీ పట్టేది కాదు. అప్పటినుంచి ఇప్పటివరకు అదే జీవనశైలి. ఇప్పుడూ అంతే. ఉంటే అకాడమీలో ఉంటారు. లేదంటే ఇంట్లో కుటుంబంతో గడుపుతారు. ఇంట్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నేను కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని కావడంతో గోపి జీవితాన్ని, ఆశయాన్ని బాగా అర్థం చేసుకోగలను. మా ఇద్దరు పిల్లలు… గాయత్రి, సాయివిష్ణు మా బాటలోనే నడుస్తున్నారు. ఆటగాళ్లుగా, శిక్షకులుగా, మనుషులుగా మా పిల్లలకు ఆదర్శంగా ఉండటమే నా ఆశయం.
–పీవీవీ లక్ష్మి, గోపీచంద్ అర్ధాంగి
పద్దెనిమిదేండ్లు నిండేసరికి గోపి దూకుడు కలిగిన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఆటలో తనకు సహనం తక్కువ. దూకుడు తగ్గించాలని కోచ్లు ఎంతగానో నచ్చచెప్పారు. అయినా తనదైన అటాకింగ్ శైలిని మాత్రం విడిచిపెట్టలేదు. సీనియర్లతో ఆడేందుకు తానింకా సిద్ధంగా లేడంటూ గోపిని వారించడానికి కోచ్ ఆరిఫ్ ఎంతగానో ప్రయత్నించాడు. అయినా వినకుండా ఇండియా ఓపెన్ జూనియర్ టోర్నమెంట్లో ఆడటమే కాదు, విజేతగా నిలిచి గురువుకు తనపై విశ్వాసం కల్పించాడు. దీంతో కోచ్ ఆరిఫ్ కూడా పూర్తిగా గోపిపైనే దృష్టిసారించక తప్పలేదు.
–హర్షవర్ధన్ చింతలపల్లి