ఫ్యాక్టరీ పెట్టి కొలువులు ఇస్తామంటే రమ్మంటారు. ఊరికే వస్తే మాత్రం రోడ్డుకు అడ్డంపడతారు. వీధుల్లో చెత్త సేకరిస్తామంటే జేజేలు పలుకుతారు. ఆ చెత్త కోసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామంటే.. వీధి పోరాటం మొదలుపెడతారు. ఎంత విడ్డూరం? కానీ, ఆయన ‘మడ అడవుల సంరక్షణ కోసం మీ సాగు ఆపేయండి’ అనగానే మన్నార్ ప్రజలు ఆపేశారు.
సముద్ర జీవుల సంరక్షణ కోసం చేపల వేటనూ నిలిపేశారు. ఆ ప్రజల హృదయాల్లో మార్పు వచ్చింది. మన్నార్ మారింది. మన్నార్ జీవావరణ సంరక్షణకు యునెస్కో అవార్డు వచ్చింది! ఈ మార్పు వెనుక ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఉన్నారు.
సముద్రపు ఆవు గురించి విన్నారా? తిమింగలం అంత ఉంటుంది. సంద్రంలోని గడ్డి, నాచు తింటుంది. పాలు ఇస్తుంది. ఎన్నడూ వినని, ఎన్నడూ కనని వింతలెన్నో ఉన్నాయి తమిళనాడు దక్షిణ తీరంలోని మన్నార్లో. ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న తీరప్రాంతమిది. మన్నార్ సింధుశాఖలో నాలుగువేల పైచిలుకు జాతుల మొక్కలు, జంతువులున్నాయి. సముద్రపు ఆవుగా పిలిచే డుగాంగ్ డుగాన్ మొదలు భారీ పరిమాణంలో ఉండే హాక్స్బిల్ తాబేళ్లు (ఆకుపచ్చ తాబేళ్లు), పగడాలు, సముద్రపు గుర్రాలు, నత్తలు, సొరచేపలు, మడ అడవుల్లో పెరిగే అరుదైన మొక్కలు, రంగురంగుల చేపలు.. మొత్తంగా అదో వింతైన జీవ ప్రపంచం! ఆ వైవిధ్యాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం దృష్టి సారించింది. కానీ, ఆశించినంత వేగంగా మార్పు రాలేదు. దానికి కారణాలు అనేకం.
మనసు మారితే..
చేపలవేట మన్నార్ ప్రజల జీవనాధారం. సముద్ర జలాల్లోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం అంటే సామాన్యుల ఉపాధికి గండి కొట్టడమే. ‘ప్రకృతిని కాపాడటం సరే. మా పొట్టకొట్టకండి’ అంటారు వాళ్లు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ.. తదితర పదాలు వినగానే వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. ప్రభుత్వాల వల్ల కాలేని పనిని ఓ వ్యక్తి చేశారు. మన్నార్ ప్రజల్లో మార్పునకు కారణమైన ఆ వ్యక్తి.. జగదీశ్ బకాన్. అతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. ఉద్యోగ నిర్వహణలో భాగంగా.. మన్నార్ సింధుశాఖ ఫారెస్ట్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. రామనాథపురం నుంచి తూత్తుకుడి వరకూ ఆయన పరిధే. మన్నార్ నేషనల్ పార్క్ కూడా భాగమే. ఈ పార్కులో రామేశ్వరం నుంచి తూత్తుకుడి కోట మధ్యలోని 21 దీవులూ వస్తాయి. ఆ లంకల్లో 252 గ్రామాలున్నాయి. చేపల వేట వల్ల సముద్ర జీవుల్లోని అరుదైన జాతులు అంతరించే స్థితిలో ఉన్నాయి. వ్యవసాయ భూమిని కొత్తగా సాగులోకి తెస్తే మడ అడవుల్లో పెరిగే అరుదైన వృక్ష జాతులు అంతరిస్తాయి. ప్రభుత్వం చేపల వేటకు ఒప్పుకోదు. వ్యవసాయమూ చేయనివ్వదు. మరి బతికేదెట్లా? ఆ చిక్కుప్రశ్నకు ఓ పరిష్కారం కనిపెట్టే దిశగా జగదీశ్ అడుగులు వేశారు.
సహకారోద్యమం
చేపల వేట, వ్యవసాయం జీవనాధారమైన స్థానికులకు ఇతర ఉపాధి మార్గాలు పరిచయం చేశారు జగదీశ్. పర్యావరణానికి విఘాతం కలగకుండానే బతుకు మార్గం చూపాలనుకున్నారు. బ్యాంకులను ఒప్పించి, స్థానికంగా 2,700 స్వయం సహాయక సంఘాలలోని 36,000 మంది సభ్యులకు సూక్ష్మ రుణాలు అందజేశారు. సముద్ర తీరంలో దొరికే గవ్వలు, కొబ్బరి టెంకలు, కొబ్బరి పీచుతో రకరకాల గృహాలంకారాలు, బొమ్మలు తయారుచేయడం నేర్పించారు. పచ్చళ్ల తయారీ, కుట్టుపనిలో నైపుణ్యం పెంచుకునేలా స్థానిక మహిళల్ని ప్రోత్సహించారు. తాటాకులతో బుట్టలు అల్లించి.. ప్లాస్టిక్ను కట్టడి చేశారు. చేతినిండా ఉపాధి లభించడంతో ప్రభుత్వంపై జనంలో నమ్మకం పెరిగింది. సముద్రపు ఆవులను, సొరచేపలను కాపాడతామని స్వచ్ఛందంగా ప్రమాణం చేస్తున్నారు. ఓర్పుతో, నేర్పుతో ప్రయత్నిస్తే.. స్థానికులను మార్చడం పెద్ద కష్టం కాదని మన్నార్లో వచ్చిన ఈ మార్పు రుజువు చేస్తున్నది.
ప్లాస్టిక్ చెక్పోస్ట్
పర్యాటకులు పడేసే వ్యర్థాలతో రామేశ్వరం ప్లాస్టిక్ కుప్పగా మారింది. ఈ వ్యర్థాలు మడ అడవుల్లో పెరిగే మొక్కలకు, సముద్ర జలాల్లో పెరిగే గడ్డి జాతులు, జంతుజాతులకు ప్రమాదంగా పరిణమించాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రామేశ్వరం వెళ్లే దారిలోని.. 23 కిలోమీటర్ల మార్గంలో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక చెక్పోస్ట్ ఏర్పాటుచేశారు జగదీశ్. వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సీజ్ చేస్తున్నారు. చెక్ పాయింట్ల ద్వారా నెలకు నాలుగు టన్నుల ప్లాస్టిక్ సేకరిస్తున్నారు. దీన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగిస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెస్తూ, నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఆరు ప్రదేశాలను ఇకో టూరిజం ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ పర్యాటక ప్రాంతాలకు వచ్చే ఆదాయంలో 60 శాతం పరిసరాలను పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు ఖర్చు చేశారు.
మన్నార్లో జీవావరణ పరిరక్షణకు గాను యునెస్కో అందించే మైఖేల్ బాటిస్స అవార్డ్-2023ను గెలుచుకున్నారు జగదీశ్ బకాన్. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడు ఈయనే.మన్నార్లో అరుదైన మొక్కలు, జంతువులు సహజీవనం చేస్తున్నాయి. ఎన్నోచోట్ల అంతరించిన వేల జీవజాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ప్రాణికోటి తలదాచుకున్న మన్నార్ పరిశోధకులకు, పర్యాటకులకే కాదు..
జీవజాతులకూ స్వర్గధామమే.