శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. కానీ అంతటితో కథ సుఖాంతం కాలేదు. ఎన్నో మలుపులు. ప్రభువుల సభకు బాల సంచారి రాక అతి పెద్ద మలుపు.
మహాత్ముడైన యాదరుషి చరితను, స్వామివారి ఆవిర్భావ ఘట్టాన్ని వినాలనున్నదని చెప్పిన రాకుమారుడు సోమేశ్వరుడి కోరికను మన్నించాడు బాల సంచారి. అద్భుతమైన నృసింహావతార ఘట్టాన్ని బాల సంచారి వివరిస్తుండగా, మహారాజు త్రిభువనమల్ల చక్రవర్తి, రాణీ చంద్రలేఖ, రామభట్టు తదితరులు మంత్రముగ్ధులై ఆలకిస్తున్నారు.
మన్యే ధనాభిజన రూప తపః శ్రుతౌజః
తేజః ప్రభావ బల పౌరుష బుద్ధి యోగాః
నారాధనాయ హి భవంతి పరస్యపుంసో
భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ!
“ధనం, గొప్ప వంశంలో పుట్టాననుకోవడం, రూపమూ, తపస్సు, విద్య, ఓజస్సు, తేజస్సు, ప్రభావం(పరపతి), బల పౌరుషాలు, జ్ఞానము, యోగమూ.. ఇటువంటి గొప్పగొప్ప గుణాలు ఎన్ని ఉన్నా, అవి పరమ పురుషుని.. అనగా, శ్రీ నారసింహుడి అభిమానాన్ని, అనుగ్రహాన్నీ పొందలేవు. ఆయనకిష్టమైనదీ, సంతుష్టి పరిచేది.. భక్తి ఒక్కటే! అందుకే కదా.. గజేంద్రుడి భక్తికి మెచ్చి దేవుడే దిగివచ్చాడు.
విప్రాద్దిషడ్గుణయుతా దరవిందనాభ
పాదారవింద విముఖా చ్చవచం వరిష్టమ్
మన్యే తదర్పితమనో వచ నాస్మగేహ
ప్రాణః పునాతి స కులం న తు భూరిమానః
అద్భుతమైన పన్నెండు గుణాలు కలిగిన ఉన్నతుడు స్వామి పాదారవిందములంటే ఇష్టం లేనివాడైతే, అతనికంటే మనస్సు, వాక్కు, కర్మలు, ధనం, జీవనము.. శ్రీ నారసింహుడికి అర్పించే పామరుడే అయినా అతడు ఏ ఇంట పుట్టినవాడైనా గొప్పవాడే అవుతాడు. అటువంటి చిన్నస్థాయివారు స్వామి సేవకులైతే.. తరతరాలను పునీతం చేసుకొంటారు. అన్ని గుణాలూ ఉండి శక్తి సంపన్నుడైన ఉన్నత స్థాయివాడు కూడా భక్తి లేకపోతే ముక్తి పొందలేడు. తన పుట్టుకను, తదనంతర తరాలను కూడా అపవిత్రం చేస్తాడు.” అని చెప్పాడు బాల సంచారి.
అమృత తుల్యములైన ఈ పలుకులు విని, బాల సంచారికి దాదాపు అభివాదం చేశాడు రామభట్టు.
“అసలు.. భక్తి అనేదాని అవసరం భగవంతుడికి లేదు. ఆ అవసరం మనకే ఉంది. సర్వశక్తివంతుడు, తన స్వరూప సాక్షాత్కారము వల్ల పరిపూర్ణుడైన దేవుడికి మన పూజలు అవసరమా? మనవంటి సామాన్యులు చేసే పూజలను, నైవేద్యాలను, భజనలను అంగీకరించాల్సిన అవసరం దేవాధిదేవుడికి లేనేలేదు. అయినా కరుణామూర్తి కనుక, మన కోరికలను తీర్చాలి అనే దయామయుడు కనుక.. మన మంచి కోసమే, మన హితం కోరి మాత్రమే మన పూజలను ఒప్పుకొంటాడు. మన అందం అద్దంలో కనిపించినట్టు మనం శ్రీ నారసింహుడికిచ్చే కానుకలు, నైవేద్యాలు, పూలు, వ్రతాలు.. మళ్లీ ఫలరూపంలో మనకే కదా వస్తాయి? మన మనసులో ఏముందో, మనం ఏది కోరుకుంటున్నామో, మనం దేవుడికి, దేవుడి వంటి గొప్పవారికి ఏది ఇస్తామో.. చిత్తశుద్ధితో, అది మళ్లీ మనకే వస్తుంది. మరొక రూపంలో..” చెప్పాడు బాల సంచారి.
బాల సంచారి దేవుడి గురించి, భక్తి గురించి వివరిస్తుండగా.. త్రిభువనుడి ఆలోచన ఇంకో రకంగా ఉంది. తాను భక్తుడిగా స్వామి సేవలో తరించాలనుకొన్నాడు. భక్తి వ్యక్తిగతం కాదు, పాలకుడి భక్తి ప్రజలందరికీ ఆదర్శం అంటున్నాడు బాల సంచారి. నిజమే! మరి తనిప్పుడు ఏం చేయాలి? చేయవలసింది పరిపాలకుడిగానా? ఒక పరిపూర్ణ భక్తుడిగానా?‘స్వామీ.. నారసింహా! నువ్వే నాకు దిశానిర్దేశం చేయాలి’ అని మనసులోనే ప్రార్థించాడు త్రిభువనమల్లుడు.
త్రిభువనమల్లుని ఆలోచన, ధ్యాస శ్రీ నారసింహుడిపైనే లగ్నమై ఉంది. సామాన్యుడు, స్వామికి భక్తుడైతే.. ముడుపు కడుతాడు. రాజ్యాన్నేలే పాలకుడే, భక్తుడైతే.. స్వామికి గుడినే కడుతాడు. “బాల సంచారీ! నేను చేయవలసిన పని ఏమిటో నాకు అర్థం అయ్యింది. స్వామి సేవలో ఏ రకంగా తరించాలో.. ఆ మార్గం దొరికింది. చేస్తాను. నా శాయ శక్తులా స్వామికి సేవ చేస్తాను”దృఢ నిశ్చయంతో త్రిభువనుడు పలికిన ఆ మాటలు విని, చిరునవ్వుతో ‘సరే’ అన్నట్టు తల ఊపాడు బాల సంచారి. అయితే, రాణీ చంద్రలేఖకు తన భర్త సంకల్పం ఏమిటో తెలియలేదు. సోమేశ్వరుడు కూడా అయోమయంగా చూశాడు. ఏదో కనిపిస్తున్నట్టుగా.. ఎవరో పిలుస్తున్నట్టుగా హఠాత్తుగా లేచి, పూజా మందిరం కేసి వడివడిగా నడుస్తూ వెళ్లిపోయాడు త్రిభువనుడు. ఊహించని విషయమేదో జరగబోతున్నదనే భావన బలంగా కలిగింది చంద్రలేఖ మనసులో!తన ఇష్టదైవమైన శ్రీ మహాలక్ష్మిని మనసారా ప్రార్థించింది.. తన భర్త ఆలోచన ఎలా ఉన్నా.. అది నిజమయ్యేట్టు అనుగ్రహించమని! తమ ప్రజలకు సుఖశాంతులను ప్రసాదించమని!
త్రిభువనమల్ల చక్రవర్తి భక్తిభావంలో తలమునకలై ఉన్న సమయంలో.. హొయసల సామ్రాజ్యాధీశుడు విష్ణువర్ధనుడు.. యుద్ధ ప్రకటన చేశాడు. తాను ఇక మీదట చాళుక్య సింహాసనానికి, త్రిభువనమల్లుడికి సామంతుడిగా ఉండదల్చుకోలేదని.. విస్పష్టంగా ప్రకటించాడు. ఇదంతా జరుగుతున్నది పన్నెండో శతాబ్దంలోనే! శ్రీరామానుజా చార్యులవారు సమస్త లోకానికి ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరింపజేస్తున్న సమయమది. విష్ణువర్ధనుడు అమితంగా గౌరవించేదీ, పూజించేదీ రామానుజుల వారినే! అయితే స్వామి అనుగ్రహం ఉన్నది కనుక తాను ఇంకెంత కాలమూ సామంతుడిగా ఉండలేనని యుద్ధం ప్రకటించాడు. తన అధిపతి, పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్లుని నుండి విముక్తి పొందాలనీ, సర్వ స్వతంత్రుడిగా వ్యవహరించాలనీ, వీలు కుదిరితే త్రిభువనమల్లుని రాజ్యాన్ని కొంతకొంతగా హొయసల రాజ్యంలో కలుపుకోవాలనీ కలలు కంటున్నాడు. దానికి తగ్గట్టుగానే ‘గరుడ దళం’ పేరుతో ఒక ప్రత్యేక సైనిక దళాన్ని తయారు చేసుకొన్నాడు. ‘గరుడ దళం’ పురాణాల్లోని గరుత్మంతుడిని పోల్చి రూపొందించబడింది. గరుడదళం ఎలాంటిదంటే.. చంపడానికైనా, చావడానికైనా ముందుకురికే తెగింపు దళం! అయితే.. ‘గరుడ దళ’ అధిపతిగా ముఖ్య సైనికాధికారిని నియమించాడు. వారి సహకారంతో యుద్ధ ప్రణాళికలు మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. దేశంలో ప్రతి యుక్తవయస్కుడూ యుద్ధ సమయంలో సైనికుడిలా పనిచేయాలి. నిర్బంధ సైనిక శిక్షణ తీసుకోవాలి.
సామాన్యుడు, స్వామికి భక్తుడైతే.. ముడుపు కడుతాడు. రాజ్యాన్నేలే పాలకుడే, భక్తుడైతే.. స్వామికి గుడినే కడుతాడు. “బాల సంచారీ! నేను చేయవలసిన పని ఏమిటో నాకు అర్థం అయ్యింది. స్వామి సేవలో ఏ రకంగా తరించాలో.. ఆ మార్గం దొరికింది. చేస్తాను. నా శాయ శక్తులా స్వామికి సేవ చేస్తాను”దృఢ నిశ్చయంతో త్రిభువనుడు పలికిన ఆ మాటలు విని, చిరునవ్వుతో ‘సరే’ అన్నట్టు తల ఊపాడు బాల సంచారి. అయితే, రాణీ చంద్రలేఖకు తన భర్త సంకల్పం ఏమిటో తెలియలేదు.
(మిగతా వచ్చేవారం)
… అల్లాణి శ్రీధర్