ఒకపారి విజయనగరంల కచేరిలుండే నౌకర్లు, కవులు అందరి ఇండ్లల్ల ఎల్కల బాధ బాగైంది. ఎట్లనన్న ఎల్కలను ఎల్లగొట్టాలని అనుకుని.. మాలెస్క ఇకమతులు జేశిండ్లు. గానీ, గా ఎల్కలు ఎంతకూ వోలె! ఇక వశంగాక రాజు కిష్ణదేవరాయలు తానకు వొయ్యి గోస జెప్పుకొన్నరు. ఎల్కల బాధ వోయేందుకు నపరో పిల్లిని, ఆ పిల్లిని సాదేందుకు నపరో ఆవును ఇప్పిచ్చిండు రాజు. అందరికి ఇచ్చినట్టే.. మన చెన్నాల్రామలింగంకు గూడ పిల్లిని, ఆవును ఇచ్చిండు. అయితే.. ఆవుపాలు పిల్లికి వోసుడు ఎందుకో మనోనికి ఒప్పలేదు. రోజు పొద్దుగాల లేవంగనే గరంగరం పాలు దెచ్చి.. పిల్లికి పొయ్యవట్టిండు. ఆకలితోని జెల్దిన దాగవొయ్యెటాళ్లకు పిల్లికి నాలుక, మూతి కాలి.. ఇయ్యరమయ్యర వొర్రుతుండె. అట్లట్ల కొన్ని దినాలకు గా పిల్లికి పాలంటెనే బుగులు వట్టుకుంది. నెల దినాలైనంక పిల్లులు ఎట్లున్నయో సూద్దామనిపించి.. ఆటిని కచేరికి దోల్కరమ్మని జెప్పిండు రాజు. అందరు గట్లనే దీసుకొచ్చిండ్లు. గా పిల్లులన్ని సూశెతందుకు బండకుబండ లెక్క అయినయి.
అందరిట్ల చెన్నాల్రామలింగం పిల్లొక్కటే బక్కగ కనవడ్డది. దాన్ని సూశి కోపానికచ్చిన రాజు.. సంగతేందని అడిగిండు. “రాజా! నా పిల్లికి పాలంటనే వడది!” అంట జెప్పిండు చెన్నాల్రామలింగం. గా మాటిని అందరూ హైరాన్ అయ్యిండ్లు. ‘పాలంటె పాయిరం లేని పిల్లి ఎక్కన్నన్న ఉంటదా!’ అంట పాలు దెచ్చి, దాని ముంగట వెట్టిండ్లు. పాలను సూడంగనే చెంగు చెంగున దుంకుకుంట ఉరికింది గా పిల్లి. కతేందని రాజు అడిగితే.. “రాజా! మీరు ఎల్కలు వట్టనీకి మంచిగ పిల్లుల్ని ఇస్తిరి. గివ్విట్ని సాదెటందుకు ఆవులను ఇస్తిరి. కడుపునిండ పాలు దాగినంక.. ఇగ అవ్వి ఎల్కల్ను ఎందుకు తింటయి? గందుకే.. అందరి పిల్లులు మంచిగ పాలుదాగి వన్నయి. బగ్గ బలిశినయి. నా పిల్లి మాత్రమే ఎల్కలను ఏటాడి తింటది. గందుకే.. గిట్లుంది!” అంట జెప్పిండు చెన్నాల్రామలింగం.
-పత్తిపాక మోహన్