ఆ నారసింహుడి అవతారం కొద్ది ఘడియలే! అసురుడ్ని సంహరించి ప్రహ్లాదుడిని కాపాడాడు స్వామి. ఈ నారసింహుడి పదవీ కాలం ఐదేండ్లే. కానీ, శతాబ్దాలకు కావాల్సిన మార్గాన్ని నిర్దేశించాడు. ఆయన ఉగ్ర నరసింహుడు కావడంతో వచ్చీ రావడంతోనే చకచకా పనులు చక్కబెట్టాడు. ఈయన సాత్విక నరసింహుడు, శాంత నరసింహుడు! అందుకే, ఆచితూచి స్పందించాడు. చితికిన దేశ ఆర్థికస్థితిని గాడిన పెట్టడంలో మన్మోహనాస్త్రం సంధించాడు. పదవిలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆర్థిక సంస్కరణల శంఖాన్ని పూరించాడు. అవసరమైన చోట ఆగమేఘాల మీద స్పందించాడు. అనవసరం అనుకున్న చోట ‘నో డెసిషన్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్’ సూత్రాన్ని ఎంచుకున్నాడు.
నరసింహుడు తెచ్చిన 1991 సంస్కరణలు కంటితుడుపు చర్యలు కావు. గాయంతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్కు పట్టీ కట్టి, పత్యం చెప్పి ఇంటికి పంపించిన బాపతు అసలే కాదు. అవసరమైన సామగ్రి లేకున్నా, సరైన సదుపాయాలు కరువైనా పెద్దాపరేషన్కు పూనుకున్నాడు పెద్దాయన. ఈ క్రమంలో అడ్డొచ్చిన స్తంభాలను చాణక్యనీతితో బద్దలు కొట్టాడు. బద్దలైన నిబంధనల స్థానంలో సరళీకృత విధానాలను తీసుకొచ్చాడు. పారిశ్రామిక విధానంలో మార్పులు, ఆర్థిక విధానంలో మార్పులు, పన్నుల విధానంలో మార్పులు.. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కసారిగా గంపగుత్తగా, సమూలాగ్రంగా విధానాలు మార్చేశాడు. ‘ఏదైనా జరగాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ దానిని ఆపలేదు’ అన్న మాటలు నరసింహారావు కృత నిశ్చయాన్ని చాటి చెబుతాయి. ఆ కఠిన నిర్ణయాలే ప్రపంచం ముందు డిఫాల్టర్గా మిగలాల్సిన దేశాన్ని నూతన శక్తిగా నిలబెట్టాయి. భారతాన్ని ప్రపంచ కొనుగోలు శక్తిగా మార్చాయి. ఎన్నో రంగాల్లో ఉత్పాదక శక్తిగా తీర్చిదిద్దాయి. మేధోసంపన్న దేశంగా మార్చాయి. పీవీ విధానాలతో భారతీయ కంపెనీలు కూలిపోతాయన్నారు కొందరు. కానీ, అవి ఊహించనంతగా అభివృద్ధి చెందాయి. ఆయన దార్శనికతను నేటికీ నిరూపిస్తూనే ఉన్నాయి.
ఫోన్ కావాలంటే వెయిటింగ్. గ్యాస్ రావాలంటే వెయిటింగ్. బండి కొనాలంటే వెయిటింగ్. చూడాలంటే ఒకటే దూరదర్శన్. ఎక్కాలంటే ఒకటే అంబాసిడర్, మహా అయితే ఫియట్. చేయాలంటే ఒకటే ప్రభుత్వోద్యోగం. ఆయన అవతారం పరిసమాప్తి అయ్యేసరికి అన్నిటా ఎన్నో ఆప్షన్లు. చేయడానికి కొలువులు కోకొల్లలు. కొనడానికి వాహనాలు వందలు. తిరగడానికి విదేశీ కార్లు. భారతం సమూలంగా మారిపోయింది. ఆర్థికంగా నిలబడింది. అనంతశక్తిగా ఎదిగింది. పీవీ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వాలు, కొత్త పాలకులు అందరూ ఈ హాఫ్ లయన్ విధానాలనే కొనసాగిస్తుండటం విశేషం. అందుకే మన దేశానికి వెంకట నరసింహుడు కరావలంబం (ఆపన్న హస్తం) అయ్యాడనడం కాదనలేని సత్యం. 1971లో పీవీ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అభినందన పూర్వకంగా రాసిన పద్యం ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది.
కక్షగ హిరణ్యకశిపుని లక్షణంబు
కలుగు చోట్లను గోళ్ల బెగల్చవలయు
సత్పదార్థంబు గాపాడ జన నృసింహ!
యీ వు దైవంబుగా నుండ నెంతువేని
‘లోకంలోని రాక్షస లక్షణాలను సంహరించి, మంచిని కాపాడటానికి నీవు నిజంగా నరసింహ అవతారాన్ని ధరించాలి. హిరణ్యకశిపుని చీల్చిన నృసింహునిలా నీవూ అసురులను నీతి అనే గోళ్లతో తుంచివేయాలి’ అన్న ఈ పద్యభావం ఈ నారసింహుడి పటిమకు అద్దం పడుతుందనడంలో సందేహం లేదు.ఏదో శాపం పట్టింది. వీడని గ్రహణం చుట్టు ముట్టింది. ఆర్థిక నిల్వలు అడుగంటాయి. మారక ద్రవ్యాన్ని మారక యోగం పీడిస్తున్నది.
లైసెన్స్ పర్మిట్ రాజ్, అసంబద్ధ వాణిజ్య విధానాలు, సంప్రదాయ విదేశీ విధానాలు.. ఆసురీశక్తులై దేశాన్ని కుదేలు చేశాయి. ఏవరో ఒకరు రాక పోతారా, దేశాన్ని ఉద్ధరించక పోతారా.. అని ప్రహ్లాదుడిలా నమ్మకంతో ఉంది భారతావని.. అప్పుడొచ్చాడు ఓ పెద్దాయన. కృతయుగంలో నృసింహుడికి మల్లే ఈ యుగంలో ఉన్నట్టుండి ఊడి పడ్డాడు. ఊహించకుండా వచ్చాడు. సంస్కరణలకు సంబంధించినంత వరకూ అది నృసింహావతారమే!