పుస్తకంలోని అక్షరాల వెంట కళ్లు మునుముందుకు పరుగులు తీస్తున్నప్పుడు, మనసు జ్ఞాపకాలను తవ్వుకుంటూ గతంలోకి వెళ్లిపోతుంది. పుస్తకం చదవడమే కాదు..సినిమా చూస్తున్నా, పాటలు వింటున్నా.. మనసులో ఏదో ఒక జ్ఞాపకం ఠక్కున మెదులుతుంది. జీవితమే ఓ అనుభవాల పూదోట! అప్పుడప్పుడూ ఆ తోటలోకి వెళ్లి.. జ్ఞాపకాల పరిమళాల్ని ఆస్వాదించి రావడం హాయినిచ్చే విషయం. అందుకేనేమో, జీవితానుభవాలకు దగ్గరగా ఉన్న పాటల్ని మళ్లీమళ్లీ వింటాం. మళ్లీమళ్లీ పాడుకుంటాం. అలాంటి సినిమాలను పదేపదే చూస్తాం. ఆ అనుభూతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని పంచుకున్నా ఏదో ఒకటి మిగిలి పోతుంది.
కొన్ని జ్ఞాపకాలు మాత్రం.. నిలువెల్లా దహించివేస్తాయి. పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. జరిగిపోయినదాన్ని మార్చలేం. మనసుకు తగిలిన గాయాల్నీ మాన్పలేం. కానీ మనం చేయాల్సిందల్లా తప్పును తెలుసుకోవడం. భవిష్యత్తులో మళ్లీ జరగకుండా జాగ్రత్తపడటం. .. వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన వ్యక్తుల అనుభవాలు ఇవి. బతుకు మలుపుల్లో నిర్ణయాల పాత్ర ఏమిటో? భావోద్వేగాల ప్రభావమెంతో.. ఆ మాటలే చెబుతున్నాయి. ప్రశంసను, విమర్శను ఎలా చూడాలో తెలిస్తే, అహాన్ని సులభంగా గెలవొచ్చనీ, విజయ తీరాన్ని కచ్చితంగా చేరుకోవచ్చనీ చెబుతున్నారీ సుప్రసిద్ధులు. మీరే చదవండి. ఒక్కో జీవితం ఓ గెలుపు కథే. ప్రతి మజిలీలో ఎన్నో బిజిలీలు. సున్నిత హృదయులే అయినా సమాజాన్ని ఎదిరించారు. అనుకున్నది సాధించారు. అన్ని సందర్భాల్లోనూ ఆ గెలుపు ఆర్థికమైనది కాకపోవచ్చు.
లంచం.. ఇవ్వనని చెప్పేశాను
బ్రిటిష్ రాజ్ అంతరించాక దేశం అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు. కానీ ‘లైసెన్స్ రాజ్’ అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. ఇక, బ్యూరోక్రాట్లకు సాఫ్ట్వేర్ రంగం గురించి అవగాహనే లేదు. ఆ సమయంలోనే ఇన్ఫోసిస్ మొదలైంది. ఆ జర్నీలో ఎన్నో ఒడుదొడుకులు. దాంతోపాటే, భారత ఐటీ రంగ ప్రయాణాన్ని కూడా చెబుతున్నారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..
నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మానాన్న చదువు, క్రమశిక్షణ, నిజాయతీ గురించి చెప్పేవారు. మహాత్మాగాంధీ తన పిల్లలకు ఆదర్శాలను బోధించినట్టే, మా నాన్న కూడా మంచివాళ్ల గురించి, మంచి విషయాల గురించీ కథలు కథలుగా చెప్పేవారు. ఇప్పటికీ నన్ను ఆ ఆదర్శాలే నడిపిస్తున్నాయి. ప్రతి విద్యార్థీ చదువుకోవడానికి ఒక టైమ్ టేబుల్ రూపొందించుకోవాలని నాన్న చెప్పేవారు. భూగోళం, చరిత్ర అంటే నాకు ఆసక్తి ఉండేది కాదు. ఆ విషయం నాన్నకు తెలిసింది. నువ్వు ఆ రెండు సబ్జెక్టులకూ ఇప్పుడు సమయం కేటాయించకపోతే, ఇంకెప్పుడూ నేర్చుకోలేవని హెచ్చరించారు. మొత్తానికి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నానే కానీ, వాటిపట్ల అయిష్టత పోలేదు.
అమ్మ చూపిన బాట
పేదలపట్ల దయ, కరుణ అమ్మ నుంచే నేర్చుకున్నాను. సొంత ఆస్తుల కంటే ప్రజల ఆస్తులే విలువైనవిగా పరిగణించాలని స్కూల్ టీచర్లు నాకు నేర్పారు. ప్రతి లావాదేవీనీ వేర్వేరుగా చూడాలని, సున్నాతో మొదలుపెట్టి లాభనష్టాలను లెక్కించుకోవాలనీ.. ఒక లావాదేవీలో లాభాలను, మరో లావాదేవీలోని నష్టాలతో కలిపి లెక్కించకూడదని ఐఐఎం అహ్మదాబాద్లో నా ఉన్నతాధికారి జె.జి. కృష్ణయ్య చెప్పాడు. ఇలా ఎన్నో అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను.
లైసెన్స్ రాజ్లో లంచాలు
ఇన్ఫోసిస్ ట్యాగ్లైన్.. ‘తెలివితేటలే ఆధారం, విలువలతో ప్రయాణం’ (Powered by intellect, driven by values).. నా నాయకత్వంలోనే ఈ విలువల సూత్రాన్ని ఆమోదించాం. చాలాసార్లు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగారు. ‘మీరు మాతో మంచిగా ఉంటే, మేమూ మీతో మంచిగా ఉంటాం’ అని బేరాలు పెట్టేవారు. అయినాసరే, లంచాలు ఇవ్వకూడదని మేం నిర్ణయించుకున్నాం. దీంతో ప్రారంభంలో అనుమతులు ఆలస్యంగా వచ్చేవి. కొన్నిసార్లు తిరస్కరించేవారు. ఒక్కోసారి కొద్ది మొత్తం ఫీజు చెల్లించాల్సినచోట, ఎక్కువ మొత్తం కట్టాల్సి వచ్చేది. ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లాం. ఆ తీర్పులు ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత వచ్చేవి. వ్యవస్థలోని అవినీతి, బేజవాబుదారీతనం మమ్మల్ని తీవ్రంగా బాధించాయి. అయినాసరే, నిజాయతీగా కంపెనీ నడపాలనే నిర్ణయించుకున్నాం. క్రమంగా వేధింపులు తగ్గాయి. ఆంత్రప్రెన్యూర్స్కు నా సలహా ఒకటే.. నిజాయతీగా ఉంటే కొంతకాలం బాధలు తప్పవు. అయినా, అవినీతికి లొంగకండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ లంచం
అడగరు.
నాలోని కమ్యూనిస్టు
ఫ్రాన్స్లో ఉన్నపుడు నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ప్యారిస్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో సమాజంలో మార్పు గురించి లెఫ్టిస్టులు, రైటిస్టులతో చర్చించేవాడిని. ఆ సందర్భంగా మూడు అనుభవాలు కమ్యూనిస్టునైన నన్ను క్యాపిటలిస్ట్గా మార్చాయి.
పాశ్చాత్య దేశాలు ఫ్రీ మార్కెట్ ఫిలాసఫీని స్వీకరించిన తర్వాతే నిరుద్యోగ సమస్య, పేదరికం తగ్గాయి. సామాన్యుడి సంపద పెరిగింది. ఫ్రాన్స్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, నిజాయతీ, అవినీతి, విద్య, ఆరోగ్య వసతులు, ఇండ్లు, ఆహార భద్రత చూసి ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా నెహ్రూ సామ్యవాద భావనల పట్ల నా మనసులో గూడుకట్టుకున్న నమ్మకాలన్నీ సడలిపోయాయి. కొంత గందరగోళానికీ గురయ్యాను. మనదేశం ఐరోపా దేశాల్లా ఎప్పుడు అభివృద్ధి చెందుతుందా అనే కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాను.
ఆరంభంలో అగచాట్లు
ఇన్ఫోసిస్ మొదటి అయిదేళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నది. వ్యవస్థాపకుల్లో నేను తప్ప మిగతావాళ్లంతా అమెరికాలోనే ఉండేవారు. కంప్యూటర్ల దిగుమతికి, సాఫ్ట్వేర్ ఎగుమతుల అనుమతికి బ్యూరోక్రాట్లతో సమస్యలు వచ్చేవి. వాటిని నేనొక్కడినే ఎదుర్కోవాల్సి వచ్చేది. బ్యాంకు రుణాలు, లైసెన్స్లు ఓ పట్టాన లభించేవి కాదు. టెలిఫోన్ కనెక్షన్ కోసం ఏడేళ్లు ఎదురుచూశాను. మూడు లక్షల డాలర్ల విలువ చేసే కంప్యూటర్ల దిగుమతికి 30 సార్లు ఢిల్లీకి తిరిగాను. బ్యాంకులకు సాఫ్ట్వేర్ గురించి అవగాహన ఉండేది కాదు. అప్పు అడిగితే.. ఐపీఓకి పొమ్మనేవారు. ఆ కష్టకాలంలో ఒక మార్పు నాకు కొంత ఉపశమనం కలిగించింది. అమెరికాకు సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరిగాయి. అవకాశాలు విస్తరించాయి. భారతీయ యువతకు సంపదను సృష్టించే శక్తి కూడా పెరిగింది.
నాయకుడి బాధ్యతలు
సంస్థ కోసం సమర్థంగా పనిచేయగల అనుచరులను ఎంచుకోవడమే కార్పొరేట్ నాయకత్వంలో విజయ రహస్యం. అలా అని, విజయగర్వాన్ని ఎప్పుడూ తలకెక్కనివ్వొద్దు. ఇతరులపట్ల వినయంగా ఉండటం నేర్చుకోవాలి. పనితీరును బట్టే సహోద్యోగులు, కింది స్థాయి ఉద్యోగుల నుంచి గౌరవం లభిస్తుంది. పనితీరే గుర్తింపును తెస్తుంది. ఆ గౌరవంతో అధికారం వస్తుంది. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉంది. సరైన నిర్ణయాలే విజయాలను నిర్దేశిస్తాయి. నేటితరం కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. ప్రతిభకు కొదవ లేదు. ఆ రోజుల్లో ఇంత పోటీ లేదు. కానీ, నేటి పారిశ్రామికవేత్తలు నాకంటే తెలివైనవారని నేను
అంగీకరిస్తాను. అందుకే వారిని గౌరవిస్తాను.
నేనెవరికీ.. రోల్ మోడల్ కాదు
ఎన్నో ఉద్యోగాలు, ఉన్నతమైన పదవులు చేపట్టారు.. ఆర్థికవేత్త బిబేక్ డెబ్రాయ్. అయినాసరే, ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగే వారట. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా ఉన్న బిబేక్ జీవితంలో ఎన్నో వైఫల్యాలు. వాటికి కారణాలు అనేకం. కానీ, కించిత్ కూడా పశ్చాత్తాపం లేదని అంటున్నారు..
స్వాతంత్య్రానంతరం.. మావాళ్లు దేశ విభజన గురించి పదేపదే మాట్లాడుకునేవారట. అప్పట్లో మావాళ్లు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉండేవారు. బంగ్లాదేశ్కు పశ్చిమాన ఉన్న ప్రాంతంలో ఏం జరుగుతుందోనని నిత్యం భయపడేవారట. అప్పటికే తూర్పున బంగ్లాదేశ్ ఆవిర్భావం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తర్వాత తీసుకునే నిర్ణయాలు ఇంకెత తీవ్రంగా ఉంటాయోనని మా కుటుంబం బిక్కుబిక్కుమంటూ బతికిందట. మా పూర్వికులు నేటి బంగ్లాదేశ్ నుంచి షిల్లాంగ్కు వలస వచ్చారు. మార్గమధ్యంలో ఉన్నప్పుడు నేను పుట్టాను. నాన్నకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. షిల్లాంగ్లో లోయర్ డివిజన్ క్లర్క్గా చేశారు. అనివార్యమైన వలస కారణంగా మా వాళ్లు బంగ్లాదేశ్లో ఆస్తులన్నీ కోల్పోయారు.
నాన్న మోపిన భారం
నా జీవితంలో మరచిపోలేని రెండు ఘటనలూ 1965లోనే జరిగాయి. ఒకటి, ఆల్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. నాన్నకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్లో ప్రమోషన్ వచ్చింది. దీంతో ఆర్థిక స్తోమత పెరిగింది. హయ్యర్ సెకండరీ స్కూల్లో ఫిజిక్స్ చదవడానికి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాలనుకున్నా. ఆ నగరంలో వామపక్ష ప్రభావం ఎక్కువ. ఆ ఉద్యమాలతో నిత్యం అలజడులే. ఆ భయంతో మా కుంటుంబం ఒప్పుకోలేదు. నా మనసు మార్చాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నాన్న ఒక షరతు మీద సరేనన్నారు. సైన్స్ కాకుండా, ఎకనామిక్స్ మాత్రమే చదవాలన్నారు.
జేబులో రాజీనామా
ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఎకనామిక్స్లో పట్టా అందుకున్నాక.. పై చదువులు ఎక్కడ చదవాలనే సందిగ్ధంలో పడ్డాను. కలకత్తా విశ్వవిద్యాలయమా? ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్సా? అనే తర్జనభర్జనకు గురయ్యాను. చివరికి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరాను. పీహెచ్డీ కోసం కేంబ్రిడ్జ్ వెళ్లాను. నా పరిశోధనకు గైడ్గా ఉన్న ప్రొఫెసర్ ఆర్థికశాస్త్రంలో సుప్రసిద్ధుడు. నా సిద్ధాంత గ్రంథంలో చాలా సవరణలు చెప్పాడు. నాకది నచ్చలేదు. రాసింది మార్చడం ఇష్టంలేక పీహెచ్డీ వదులుకున్నాను. అప్పటికే ఉన్న డిగ్రీతో మూడేళ్ల కాలానికి ప్రెసిడెన్సీ కాలేజీలో (తాత్కాలిక) లెక్చరర్గా చేరాను. 1983లో ఆ వ్యవధి పూర్తయింది. పూణెలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్కు దరఖాస్తు చేశాను. వీఎం దండేకర్ మార్గదర్శకత్వంలో అక్కడ పనిచేశాను. అప్పటిదాకా అర్థశాస్త్ర సిద్ధాంతాలే చదివిన నేను, అర్థశాస్త్ర అన్వయం గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. ఆ తర్వాత వేదాలను, పురాణాలను అనువదించాను. తర్వాత రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ సైన్స్ డైరెక్టర్గా పనిచేశాను. 2015లో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పుడు సభ్యుడిగా ఎంపికయ్యాను. 2017 నుంచి ప్రధానమంత్రి ఆర్థిక సలహా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేనెప్పుడూ ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఇప్పటికీ ఏదీ పట్టుకుని వేలాడను. నా జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా ఉంటుంది. అసంతృప్తిగా అనిపిస్తే క్షణం కూడా ఉండను.
క్రికెట్, సంగీతం.. రెండూ నన్ను నిలబెట్టాయి
ఈ చరిత్రకారుడికి క్రికెట్ అంటే ప్రేమ. క్రికెట్ ఆడి చెడిపోయాడని, క్రికెట్ వల్ల కెరీర్లో నష్టపోయాడని ఎవరో ఒకరిని ఉదాహరణగా చూపుతారు చాలామంది. అయితే.. క్రికెట్తో తాను లాభపడ్డానని చెబుతున్నారు రామచంద్ర గుహ. ఆ జ్ఞాపకాలను మనసు విప్పి పంచుకుంటున్నారిలా..
పదహారేళ్లప్పుడు అనుకుంటా.. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనే సంశయంతో ఉన్నాను. రోజూ క్రికెట్ ఆడుకోవడానికి తీరిక ఉంటుందన్న ఆలోచనతో సోషల్ స్టడీస్ తీసుకున్నాను. నాకు ఇంగ్లిష్ లిటరేచర్ చదవాలని ఉండేది. 1970లలో దాన్ని అమ్మాయిల సబ్జెక్టుగా భావించేవారు. దీంతో ఎకనామిక్స్ తీసుకున్నాను. కానీ, ఇది నాకు సరిపోదని త్వరలోనే అర్థమైంది. క్రికెట్ నాకు ఎన్నో నేర్పింది. కలిసికట్టుగా ఆడటం వల్ల ఎన్నో సంతోషాలు ఉంటాయని బోధించింది. డక్ ఔట్ అయినా సరే, మన టీమ్ గెలిస్తే సంతోషిస్తాం. అలానే .. ఓటమిని అంగీకరించడం కూడా ఇక్కడే తెలిసింది. నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. కానీ, సెంచరీలు కొట్టింది లేదు. నా ఆటతీరు మధ్యస్థాయిలో ఉండేది. జట్టులో నాకంటే బాగా ఆడేవాళ్లు ఎంతోమంది ఉండేవారు.
జంధ్యం వేసుకోలే
మా అమ్మానాన్న నన్ను బాగా పెంచారు. వాళ్లకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. కుల, మత ప్రస్తావనలు లేని వాతావరణంలో పెరిగాను. జంధ్యం వేసుకోనని తిరస్కరించాను. కులతత్వాన్ని వ్యతిరేకించాను. నేను చదివిన కాలేజీ నన్ను ఓ తెలివైన విద్యార్థిగా మలిచేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. కానీ, నేనే కలగజేసుకుని చాలా పనులు చేసేవాడిని. కాలేజీ రోజుల్లో చదరంగం ఆడేవాడిని. క్విజ్ పోటీల్లో పాల్గొనేవాడిని. కాలేజీ మ్యాగజైన్ పనులు చూసేవాడిని. ఆ రోజుల్లో కొంతమంది స్నేహితులతో ఓ గ్యాంగ్ ఏర్పాటుచేశాను. ఆడుతూ పాడుతూ పెరిగిన నేను, 21 ఏళ్ల వయసులో బ్రిటిష్ ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ వెరియర్ ఎల్విన్ రాసిన పుస్తకాలు చదివాను. అప్పటినుంచి సమాజ శాస్త్రం, సమాజ పరిణామ శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ రోజుల్లోనే నా గర్ల్ఫ్రెండ్ను కూడా కలుసుకున్నాను. ఆ తర్వాత ఆమెను పెండ్లి చేసుకున్నాను. ఆమె అసాధారణమైన ప్రజ్ఞావంతురాలు. ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లలో ఒకరు.
గాంధీ అనంతరం..
ఒక ప్రచురణకర్త సూచిస్తే ‘గాంధీ అనంతర భారతదేశం’ రాశాను. అప్పుడే క్రికెట్, జీవితచరిత్రలు, ఇంకొన్ని విషయాల గురించి రాయడం మొదలుపెట్టాను. భారత స్వర్ణోత్సవ వేడుకలు మొదలై ఏడాది అవుతున్నది. 1998లో బ్రిటిష్ పబ్లిషర్ పీటర్ స్ట్రాస్ నేను రాసిన ‘గాంధీ అనంతర భారతదేశం’ చదివారట. అందులోని కొన్ని వ్యాసాలు ఆయనకు నచ్చాయి. నన్ను కలవడానికి వచ్చారు. ఆ సందర్భంగానే ‘స్వతంత్ర భారతదేశ చరిత్ర ఎందుకు రాయకూడదు?’ అనడిగారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారత్ ప్రభావం చెప్పుకోదగినంత ఉందిప్పుడు.
ఈ యాభై ఏండ్ల కాలంలో జరిగిన పరిణామాలనూ చరిత్రకు అందుబాటులో ఉంచాలన్నారు. అప్పటికి భారత దేశ చరిత్ర అంటే 1947 నాటి స్వాతంత్య్ర ఘట్టానికి పూర్వపు చరిత్రే. ఆ తర్వాత ఏం జరిగిందో ఏవరికీ తెలియదు. అప్పటికి నా వయసు 40 సంవత్సరాలు. ఆ రచన పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. యువతకు నేను చెప్పేది ఒక్కటే. కెరీరే జీవితం అనుకోకండి. మీ అభిరుచులకు కొంచెం భిన్నంగా ఉన్నవాళ్లను జీవిత భాగస్వామిగా ఎంచుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరినుంచి మరొకరు కొత్త విషయాలు నేర్చుకోండి.
నా పొగరే నా బలం!
అందాల ఆకాశంలో తళుకుల తార సుస్మితాసేన్.. సినిమాలు, వివాదాలు, ఇంకేవో కారణాల వల్ల ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అనుకునే గ్లామర్ ప్రపంచంలో, ఆమె మాత్రం.. దీపం ఉన్నప్పుడే మనకు నచ్చిన పనులు చేయాలనే నియమం పెట్టుకున్నారు. అవరోధాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకుసాగుతున్నారు.
దశాబ్దం క్రితం నటిగా ఎంతోకొంత కనుమరుగయ్యాను. అప్పటికే నేను ఇద్దరు పసిబిడ్డల తల్లిని. ‘దత్తత తీసుకున్నా..’ అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నా బిడ్డలు నా బిడ్డలే. రక్తం పంచుకోలేకపోవచ్చు. కానీ ప్రేమను పంచుకున్నాను, పెంచుకున్నాను. మధ్యప్రాచ్యంలో మాకు ఆభరణాల వ్యాపారం ఉంది. ఒక నిర్మాణ సంస్థనూ స్థాపించాం. ఈ రెండిటి బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నాను. వాటిని లాభాలవైపు నడిపించాను. అలీషాకి ఎనిమిదేండ్లు వచ్చాక, మళ్లీ నటనవైపు అడుగులు వేశాను. ఓటీటీల్లో చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు పంపాను. ‘ఆర్య’ వెబ్ సిరీస్ నన్ను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసింది.
ఏదీ అన్నివేళలా సత్యం కాదు. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. క్లిష్టమైన సమయాల్లో కూడా నేను నమ్మకంతో జీవించాను. ఇతరుల అభిప్రాయాలు, నిర్ణయాలపై ఆధారపడి నన్ను నేను తీర్చిదిద్దుకోలేదు. అలా చేస్తే, ఎంతటి శక్తిమంతులైనా పూర్తిగా పరాధీనమైపోతారు. నేను ఎవరిపైనా ఆధారపడకుండా నన్ను నేను నమ్మకున్నాను. ఏదైనా నేనే ఎంచుకుంటాను. ప్రొఫెషనల్, పర్సనల్, ఎమోషనల్.. ఏదైనా సరే, అన్నిట్లో నాదే నిర్ణయం. అది మంచి అయినా, చెడు అయినా, అసహ్యించుకునేది అయినా సరే.. అవన్నీ నా నిర్ణయాలే.
బలమైన బలహీనత
నాలోనూ ఎన్నో లోపాలున్నాయి. అవేవీ నా ఎదుగుదలను ఆపలేకపోయాయి. ఓ అరుదైన హార్మోన్ల సమస్య నన్ను బాధపెట్టింది. వ్యాధి నిరోధక శక్తిలో లోపాల వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెప్పారు. స్టెరాయిడ్లు వాడుతూ సమస్యను అధిగమించవచ్చు. కానీ, వాటి ప్రతికూల ప్రభావం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ప్రత్యామ్నాయ చికిత్సకు అవకాశం ఉందని తెలిసినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాను. అప్పటికి నాపై చాలా బాధ్యతలు ఉన్నాయి. పిల్లలు చిన్నవాళ్లు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ క్షణంలో తెలిసివచ్చింది.
ఇప్పుడు బాగానే ఉన్నాను. నా మనసు కూడా గతంలో కంటే ప్రశాంతంగా ఉంది. నేనిప్పుడు ఏదైనా చేయగలను. మనల్ని దాటుకుని ప్రపంచమంతా వాయువేగంతో ముందుకు పోతున్నదని బాధపడొద్దు. ఇతరుల వెంట పరుగెత్తాల్సిన అవసరం మనకు లేదు. మీ వేగం వేరని గుర్తించాలి. పయనించాల్సిన దిశ వేరని గుర్తించాలి. మీదైన దానికోసం వెదకండి. మీ ప్రయాణం మీ సొంత వేగంతో ఉంటుంది. అప్పుడు మీరూ ప్రశాంతంగా ఉంటారు. మన ఎదుగుదలకు తోడ్పడని వాటిని వెంటనే వదులుకోవాలి. అలా చేయడానికి మనకు చాలా ధైర్యం కావాలి. భయానికి లొంగకుండా కొంతకాలం ఉంటే అదే ధైర్యంగా మారుతుంది. నా సినిమాల ఎంపిక, నేను కలిసి పనిచేసే వ్యక్తుల గురించి నా మేనేజర్లు ఎప్పుడూ అభ్యంతరం చెబుతుంటారు. నేను ధైర్యవంతురాలిని. కాబట్టే నా మీద ఇన్ని విమర్శలు ఉన్నాయి.
కొత్త వాళ్లకు సలహా
శక్తిమంతంగా ఉండండి. ఇక్కడ చాలా పోటీ ఉంటుంది. మిమ్మల్ని పీల్చిపిప్పి చేసేవాళ్లు, వాడుకుని బయటికి విసిరేసేవాళ్లు ఎంతోమంది. అన్నిటినీ తట్టుకునేంత శక్తి మీలో ఉండాలి. స్క్రీన్ మీద ఎక్కువ కాలం కనిపించాలనే తపనతో జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. సినిమాతోపాటు టీవీ, ఓటీటీ, ప్రకటనల్లో కూడా అవకాశాలు వెతుక్కోండి. నేను పీఆర్ వ్యవస్థను నమ్ముకోలేదు. మిమ్మల్నీ అలానే ఉండమని నేను చెప్పడం లేదు. మీ ఎంపిక మీది. మీ యుద్ధం మీది.
సంతోషాన్ని మించిన డబ్బు లేదు!
ఫ్యాషన్ ప్రపంచంలో రీతూ కుమార్ గురించి పరిచయమే అవసరం లేదు. కళలు, సంస్కృతి పట్ల అమితమైన అభిమానం ఆమెకు. కాబట్టే, అంతరిస్తున్న భారతీయ అద్దకపు కళను మళ్లీ ఆవిష్కరించారు. దేశాన్ని పాశ్చాత్య ఫ్యాషన్లు శాసిస్తున్న రోజుల్లో భారతీయ ఆత్మకు జీవం పోశారు. ఈ ప్రయాణంలో ఒడుదొడుకులు, కష్టసుఖాలు అనేకం. వాటిలో కొన్నిటిని పంచుకుంటున్నారు..
నేనెప్పుడూ ఆర్టిస్ట్నే, డిజైనర్నే. ఫ్యాషన్ డిజై నర్ని కాదు. ఆ రంగం గురించి కూడా నేనెప్పుడూ అంతగా ఆలోచించలేదు. స్కాలర్షిప్ వస్తే అమెరికా వెళ్లాను. తర్వాత కలకత్తా వచ్చి మ్యూజియాలజీ కోర్సు చేశాను. అప్పుడే, కోల్కతాకు అవతల ఉన్న ఒక చారిత్రక ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అలా, గ్రామీణ బెంగాల్ను మొదటిసారిగా చూశాను. అక్కడ చారిత్రక ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. నేనూ ఉండాల్సి వచ్చింది. నా కళ్లతో అపారమైన కళా సంపదను చూశాను. అప్పుడే, మ్యూజియాలజిస్ట్గా మారాలనుకున్నాను. ప్రజలకు పురావస్తు విశేషాలు వివరించాలని అనుకున్నాను. వివరించాను కూడా. నేను ఫ్యాషన్ డిజైనర్ను కాదు. ైస్టెలిస్ట్ను.
ఉత్తమ ైస్టెలిస్ట్ను. అంతే!
మలుపుతిప్పిన ప్రయాణం ఒకప్పుడు మన ఫ్యాషన్ ప్యారిస్, న్యూయార్క్ నగరాలనూ శాసించేది. నెమ్మదిగా మనదేశం తనదైన గుర్తింపును పోగొట్టుకుంది. మన కళాత్మకత మ్యూజియాలకే పరిమితమైంది. ఇప్పుడు జనం పాశ్చాత్య దేశాల నుంచి ఏం వస్తే అదే ధరిస్తున్నారు. దుస్తుల రూపకల్పన మొదలుపెట్టిన పదేళ్ల తర్వాత.. నేనూ మంద మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నానని అర్థమైంది. కానీ అప్పటికే నేను అందులో కూరుకుపోయాను. ఎంతో డబ్బు పెట్టుబడిగా పెట్టాను. భారతీయతనే నమ్మకున్నవాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? అని ఆరా తీశాను. గంగా తీరంలోని సేరంపూర్లో ఉంటున్న కలంకారీ కళాకారుల గురించి ఎవరో చెప్పారు. కానీ, తమకు ఉపాధి చూపని కళ మీద కోపంతో.. తమ కలంకారీ ముద్రికలన్నిటినీ తగులబెట్టారని తెలిసింది. దీంతో ఎక్కడా దేశీయ డిజైన్లు లేకుండా పోయాయి. వాటిని పునఃసృష్టి చేయాలన్నా దేశాలు దాటాల్సిందే. ఇంగ్లండ్ వెళ్లి, పురావస్తుశాలల సాయంతో మళ్లీ ప్రాచీన డిజైన్లను రూపొందించాను. అది ఎంతో కష్టమైన పని. కోల్కతాలో మూతపడిన ఓ దుకాణాన్ని రెండొందల రూపాయలకు అద్దెకు తీసుకున్నాను. మొదట్లో పక్కబట్టల్లా ఉన్నాయని ఎగతాళి చేశారు. అయినా మేం ఆగిపోలేదు. ఆ ప్రయత్నం వస్త్ర ప్రపంచంలో భారతీయత స్థానాన్ని సుస్థిరపరిచింది.
అందాల పోటీల్లో
ఓసారి గోవాలో జరిగే అందాల పోటీలకు నన్ను పిలిచారు. ఆ పోటీలో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్ సమ ఉజ్జీల్లా ఉన్నారు. ఇద్దరిలో ఒకరిని విజేతగా ఎంపిక చేసేందుకు నేను ఒక ప్రశ్న అడగాల్సి వచ్చింది. ‘ఈ దేశపు వస్ర్తాల గురించి మీకు తెలిసినదేమిటి?’ అని ప్రశ్నించాను. అప్పుడు సుస్మితా సేన్ ‘ఖాదీ ఒక్కటే యంత్రాలు, రసాయనాలు లేకుండా ప్రాణం పోసుకునే వస్త్రం’ అని చెప్పింది. ఆ జవాబుతో నా మనసునే కాదు, ‘మిస్ ఇండియా’ కిరీటాన్నీ గెలిచింది. నాకు బాగా గుర్తుంది. ప్రపంచ సుందరి పోటీ కోసం జరిగిన రిహార్సల్స్లో ఐశ్వర్యా రాయ్ ఎర్రని బాంధనీ షిఫాన్ చీర కట్టుకుని ర్యాంప్ మీద నడిచింది. మిగతా అమ్మాయిలంతా జీన్స్ వేసుకున్నారు. అందరి చూపులూ ఐశ్వర్యారాయ్ మీదే. ప్రపంచాన్ని ఆకట్టుకునేంత గొప్పగా ఆమె దుస్తులు రూపొందించాను. అదో గర్వించదగిన అనుభవం.
విజయతీరాలకు..
కెరీర్ తొలిరోజుల్లో బెంగాల్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పనిచేశాను. కలంకారీ ముద్రలు కనుమరుగైపోయాక.. వాటికోసం ఫరూఖాబాద్ వెళ్లాను. చక్కగా తయారుచేయగల నిపుణులను గుర్తించాను. అక్కడే ఉండి, వందల అద్దకపు ముద్రలను తయారు చేయించాను. మేం రూపొందించిన అద్దకపు చీర డిజైన్లకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అప్పుడు జర్దోసీని వస్త్ర ప్రపంచానికి భారతదేశపు కానుకగా ప్రచారం చేశాం. హస్తకళలు మన డీఎన్ఏలోనే ఉన్నాయి. కానీ, వాటిని కోల్పోతున్నందుకే చాలా బాధగా ఉంది. ఆరేడేళ్లు అద్దకపు రంగంపై పరిశోధన చేశాను. ఆ సమయంలో చాలా దేశాలు తిరిగాను. భారతదేశంలో మాత్రం ఒక్క భారతీయ అద్దకపు ముద్రను కూడా కనుక్కోలేకపోయాను. ఒకసారి చిన్నపాటి ప్రదర్శన నిర్వహించాను. ఓమోస్తరు గదిలో 20 చీరలు ప్రదర్శనకు పెట్టాను. వాటిలో రెండు నా స్నేహితులు కొన్నారు. మిగతావారెవరూ కొనలేదు. నా గొప్ప పరాజయం, గొప్ప విజయం ఈ అద్దకంలోనే ఉంది. నేను మొదట్లో ఒక పొరపాటు చేశాను. ముతకచీరలపై అద్దకం చేయడం వల్ల అవి అందంగా రాలేదు. అవే అద్దకపు డిజైన్లను షిఫాన్ చీరపై ముద్రిస్తే సెక్సీగా ఉన్నాయని ఆ చీరలు కొన్నారు. ఒక్కటీ మిగల్లేదు. కొనుగోలు దారుల నాడి పట్టుకోవడం అంటే ఇదే. మనం మార్పును కోరుకుంటున్నప్పుడు.. మార్పును స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. లేకపోతే నిలదొక్కుకోలేం. ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.
ఆనందాల రహస్యం
మీరు మీలా ఉండండి. మరొకరిలా ఉండే ప్రయత్నం చేయకండి. శ్రమకు ప్రత్యామ్నాయం లేదు. విపరీతంగా డబ్బు సంపాదించడమే మీ లక్ష్యం అయితే జీవితంలో ఎంతో నష్టపోతారు. కాఫీ వాసన ఆస్వాదించడం, ప్రయాణంలో దారిపొడవునా పచ్చని చెట్లను కళ్లారా చూడటం మరిచిపోవద్దు. మనసుకు ఉల్లాసం కలిగించే ఏ వ్యాపకాన్నీ వదులుకోవద్దు. విజయాలు బాగానే ఉంటాయి. కానీ, వాటికోసం ఎంతో జీవితాన్ని కరిగించుకోవాలి. ప్రతిరోజూ ఒక సవాలుగా గడిచిపోతుంది. ఇష్టమైన పనిచేస్తుంటే ఇంట్లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నంత సంతోషంగా ఉంటుంది.