న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ వ్యూహాకర్త వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చార్(Ajay Kochhar).. శుక్రవారం నాడు నేవీ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మిలిటరీలోని టాప్ నేతల మార్పులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అజయ్ కొచ్చార్ పదోన్నతి పొందారు. త్రివిధ దళాలు కొత్త చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్.. ఆదివారం రోజున తమ కొత్త బాధ్యలు స్వీకరించనున్నారు. ఇక శుక్రవారం రోజున ముంబైలోని వెస్ట్రన్ నావెల్ కమాండ్కు కమాండర్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి.. శని, ఆదివారాల్లో పదవీవిరమణ చేయనున్నారు. ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. జూన్ 30వ తేదీన ఆర్మీ చీఫ్గా రిటైర్ కానున్నారు.
వైస్ అడ్మిరల్ కొచ్చార్ది.. హర్యానాలోని కర్నాల్. ఆయన తండ్రి హర్యానా ఇరిగేషన్ శాఖలో మాజీ ఇంజినీర్. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ వార్ మెమోరియల్ వద్ద కొచ్చార్ పుష్పగుచ్ఛం ఉంచారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నేవీకి చెందిన ప్లానింగ్ను అడ్మిరల్ కొచ్చార్ చేశారు. ముంబై నుంచి ఆయన ఆ ఆపరేషన్ నిర్వహించారు. పశ్చిమ సముద్ర ప్రాంతంలో ఉన్న శత్రు సమస్యను ఆయన తన ప్లానింగ్తో ఎదుర్కొన్నట్లు చెప్పారు. సాంప్రదాయ, సాంప్రదాయేతర శైలిలో వెస్ట్రన్ కమాండ్ ఆ సమయంలో రెస్పాండ్ అయ్యింది.
వైస్ అడ్మిరల్ కొచ్చార్ 1988 జూలైలో నేవీలో చేరారు. గన్ డిజైన్, మిస్సైల్ సిస్టమ్స్లో ఆయన స్పెషలిస్టు. ఐఎన్ఎస్ నషాక్, ఐఎన్ఎస్ విభూతి, ఐఎన్ఎస్ కిర్పన్ యుద్ధ నౌకలను ఆయన కమాండ్ చేశారు. ఐఎన్ఎస్ త్రికండ్కు కమాండింగ్ ఆఫీసర్గా చేశారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యను కూడా ఆయన కమాండ్ చేశారు. ఏప్రిల్లో ఇద్దరు కొత్త కమాండర్లు నేవీలో చేరిన విషయం తెలిసిందే. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు.