‘ఎక్కడ సమస్య ఉందో అక్కడ అడుగుపెట్టు. కష్టాల్లో చిక్కుకోకుండా లాభాలవైపు ప్రయాణించు’ అంటున్నారు మణి వాజ్పేయి. ‘ఎటువైపుగా పయనం?’ అనే డోలాయమానంలో ఉన్నవారికి ఆయన చెప్పేదొక్కటే.. ‘ఎవరికో లాభాలు వస్తున్నాయని వ్యాపారంలోకి రావొద్దు. ఎక్కడ సమస్యకు పరిష్కారం చూపగలమో, ఏ పరిష్కారం కోసం ఎంతమంది కస్టమర్లు ఎదురుచూస్తున్నారో అంచనా వేసి.. ఆచరణ మొదలుపెట్టు’ అంటారు. స్నేహితుడు రాజ్ మదన్గోపాల్తో కలిసి ‘బన్యాన్’ పేరుతో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ సృష్టించిన మణి వాజ్పాయ్ రీసైకిల్ స్టోరీ ఆయన మాటల్లోనే..
నాన్నది కోల్కతా. రైల్వే ఉద్యోగి. దీంతో హైదరాబాద్లోనే పెరిగాను. వరంగల్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చదివాను. పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లాను. రెండేండ్ల తర్వాత చదువు మధ్యలోనే ఆపి, క్వాల్కమ్ కంపెనీ (కాలిఫోర్నియా)లో చేరాను. ఐ ఫోన్ల తయారీ ప్రాజెక్టులో పనిచేశాను. పదేండ్ల తర్వాత.. యూసీ బర్క్లీ, కొలంబియా బిజినెస్ స్కూళ్లలో ఒకేసారి డబుల్ ఎంబీఏలో చేరాను.
చదువు.. ఉద్యోగం.. వ్యాపారం న్యూయార్క్లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో స్టార్టప్లను ఇంక్యుబేట్ చేస్తారు. అక్కడికి తరచూ దిగ్గజాలు వస్తుంటారు. వాళ్ల సూచనతో ఓ కంపెనీ స్థాపించాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి మేలు చేసే.. ప్లాస్టిక్ వ్యర్థాల వ్యాపారమైతే మేలనే నిర్ణయానికి వచ్చాను. బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్స్ నా ఐడియా బాగుందన్నారు. నిపుణులు మంచి సలహాలు ఇచ్చారు. కంపెనీ స్థాపన, వ్యాపార వ్యూహం, నిధుల సమీకరణ గురించి అక్కడే తెలుసుకున్నాను. ‘నేర్చుకున్నది చాలు. ఉద్యోగం మానేసి, కంపెనీ మొదలుపెట్టు’ అని భుజం తట్టారు ఆత్మీయులు. కొంతమంది ఇన్వెస్టర్లను పరిచయం చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే రాజు తారసపడ్డాడు. తనది హైదరాబాదే అయినా, అమెరికాలోనే పరిచయం. పీహెచ్డీ కోసం వచ్చాడు. మేమిద్దరం రూమ్మేట్స్. ఆరునూరైనా భారత్లోనే కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అమ్మానాన్నలు సరేనన్నారు. ఇద్దరం మాతృదేశానికి వచ్చేశాం.
హైదరాబాదే కాదు, భారతదేశంలోని ప్రతి నగరంలో చెత్త సేకరణ గొప్పగా ఉంది. కానీ, రీసైక్లింగ్ కంపెనీల నుంచి వచ్చే ఉత్పత్తులే నాసిరకంగా ఉంటున్నాయి. భూమిలోంచి పెట్రోలు తీస్తాం. పెట్రోలు నుంచి ప్లాస్టిక్ తీస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఎంత కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తే.. అంతమేర కొత్త ప్లాస్టిక్ అవసరం తగ్గుతుంది. భూమికి భారమూ వదులుతుంది.
భారత్లో వేస్ట్ మేనేజ్మెంట్ విధానంపై రెండేండ్లు అధ్యయనం చేశాం. ఇక్కడి సమస్యలను ఎలా పరిష్కరించాలనే నిర్ణయానికి వచ్చాం. ధైర్యం చేసి పనులు మొదలుపెట్టాం. 2013 నుంచి 2018 వరకు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ మెషీన్లు రూపొందించుకుని, సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాం. ఆ నాలుగేండ్లలో కూడా.. ‘ఈ చెత్త పని ఎందుకు చేస్తున్నారు? ఇంత చదివి చెత్త ఏరుకునే వాళ్లతో లావాదేవీలు ఏమిటి?’ అని ఇంట్లోవాళ్లు, బయటివాళ్లు ప్రశ్నించేవారు. మేం ఓపికగా సమాధానాలు ఇచ్చేవాళ్లం. ‘ఎవరో ఒకళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలను
సేకరించి, మళ్లీ ఉపయోగించేలా తయారు చేయకపోతే దేశంలో చెత్త కుప్పలు పెరిగిపోతాయి’ అని వివరించేవాళ్లం. అనేక దశలు దాటుకుని.. 2018లో రీసైకిల్ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేశాం. చాలా కంపెనీలు మా ప్లాస్టిక్ను పరీక్షించాయి.
సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే ఆర్డర్లు ఇచ్చాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఐఎంఎఫ్) మేం అభివృద్ధి చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ మోడల్కి 2018లో అవార్డు ఇచ్చింది. భారత్లో రీసైక్లింగ్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. మా కంపెనీకే మొదటగా ఆ అవార్డు వచ్చింది. చిన్న కంపెనీకి అంతర్జాతీయ అవార్డు వచ్చేసరికి… ‘ఏమిటి వాళ్ల ప్రత్యేకత’ అని అందరూ మాపై దృష్టి సారించారు. మా గురించి తెలుసుకున్నారు. మా రీసైకిల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని పెద్ద పెద్ద కంపెనీలు చూడటం, అభినందించడం, ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. 2019 తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను మళ్లీ వినియోగంలోకి తెచ్చాం. మేం ఉత్పత్తి చేసే హెచ్డీపీఈ, పాలీ ప్రొపలీన్ ప్లాస్టిక్… సర్ఫ్ ఎక్సెల్, హార్పిక్, షాంపూ, లోషన్ బాటిల్స్గా మార్కెట్లోకి వస్తున్నాయి. వ్యాపారంలో విజయం, పర్యావరణ పరిరక్షణ కోసం సాగిస్తున్న ప్రయాణం..
ఈ రెండూ మాకెంతో సంతృప్తిని ఇస్తున్నాయి.
ఉద్యోగం కోసం చదవడం, ఉద్యోగం చేయడమే జీవిత పరమార్థం కాదని నా అభిప్రాయం. సోషల్ ఆంత్రప్రెన్యూర్ కావాలన్నది నా కల. కాబట్టే, ప్లాస్టిక్ వ్యర్థాల మీద దృష్టి సారించాను. విలాసవంతంగా బతకాలన్న కోరిక లేదు. అందువల్లే రిస్క్ ఉన్న ఈ రంగంలోకి వచ్చాను. లేకపోతే
అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీయే పెట్టేవాడిని. ఇంత కష్టపడాల్సిన అవసరమూ ఉండేది కాదు. కాకపోతే, ఇన్ని అవార్డులు, ఇంత గుర్తింపు వచ్చేవి కాదు.
– మదన్గోపాల్
– నాగవర్ధన్ రాయల