పరాయి పాలన లేదు. కిరాయి సార్వభౌములు లేరు. తెల్లదొరసానీ చల్లగుండమంటూ.. స్తోత్ర పాఠాల్లేవు.ఇక మనం స్వతంత్రులం! మేరా భారత్ మహాన్.. అని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తాం. వందేమాతర గీతం.. గొంతెత్తి పాడుకుంటాం. జనగణమన.. గణగణ ఘంటారావం వినిపిస్తాం. పరాయి చట్టాలు, వలసవాద ఫత్వాలు.. ఇంకానా ఇకపై చెల్లవు. ‘భారత పౌరులమైన మేము..’ అంటూ రాజ్యాంగం సిద్ధం చేసుకుంటాం.ఇది మన గడ్డ. ప్రతి బిడ్డా సర్వస్వతంత్రుడే. దేశ ప్రధాని కన్నా.. సామాన్య పౌరుడే ప్రధానం. డెబ్బయి అయిదేండ్ల క్రితం.. ఎన్ని కలలు, ఎంత ఉద్వేగం..ముళ్లు పెట్టే బాధల్ని పళ్లతో బిగబట్టి కళ్లతో నవ్వే గులాబీలా.. ముచ్చటైన దేశం ముక్కలైన బాధను భరిస్తూనే.. అర్ధరాత్రి స్వాతంత్య్రం గురించి, అందమైన భవితవ్యం గురించీ నెహ్రూజీ ఉపన్యాసాన్ని ఆసక్తితో విన్నాం. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వైఫల్యాలను అనుభవాలుగా మార్చుకుంటూ, సమస్యల్లోనే అవకాశాలు సృష్టించుకుంటూ.. నాలుగడుగులు వెనక్కి పడిన సమయంలోనూ రెండడుగులు ముందుకేస్తూనే వచ్చాం. ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధ్యమంటూ.. ప్రపంచదేశాలు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు.
తరాలుగా బానిస బతుకులు బతికిన జాతికి తనను తాను పాలించుకోవడం తెలుసా? అంటూ మేధావులు నొసలు చిట్లించినా మనం వెనక్కి తగ్గలేదు. తడబడుతూనే తాబేలులా అడుగులేశాం. మన పరిమితులు మనకు ఉండొచ్చు. మన బలాలూ మనకున్నాయి. అవే, ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాయి. కాబట్టే, వజ్రోత్సవ సమయానికంతా.. ఓ వజ్రంలా భాసిల్లుతున్నది భారత్. మన స్వేచ్ఛ వెనుక.. సమరయోధుల సంకెళ్లున్నాయి. ఆ వీరుల త్యాగాలను, ఆ అమరుల ఆత్మార్పణలను గుర్తుచేసుకోవాల్సిన సందర్భమూ ఇదే. డబ్భు అయిదేళ్ల కింద సాధించిన స్వాతంత్య్రంతో ముడిపడిన డబ్భు అయిదు ఘట్టాలివి. ఆ గాథలను సగర్వంగా చదువుకుందాం. ఆ యోధులకు సవినయంగా జోహార్లు అర్పిద్దాం! ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరేద్దాం. గడపగడపలో జయభారత నినాదాలు వినిపిద్దాం. వజ్రోత్సవ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొందాం! ఇది మన విజయం, ఘన విజయం!
1. ఈస్టిండియా.. కంపెనీ ప్రస్థానం
భారతదేశంలో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో మాత్రం ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ పూర్తిగా భారతదేశం మీదనే దృష్టి సారించింది.
తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, భారతదేశంతో వర్తకం కోసం 1600 సంవత్సరంలో ఏర్పాటైన వాణిజ్య సంస్థ ఈస్టిండియా కంపెనీ. 1600 డిసెంబర్ 31న రాయల్ చార్టర్ ద్వారా ఇది ఏర్పాటైంది. ఒక వ్యాపార సంస్థగా భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ మొగల్ సామ్రాజ్య వైభవం క్షీణిస్తున్న దశలో వ్యాపారం మీద గుత్తాధిపత్యం కోసం దేశ రాజకీయాల్లోనూ తలదూర్చడం మొదలుపెట్టింది. అలా 19వ శతాబ్ది సగంనాటికి భారతదేశం కంపెనీ హస్తగతమైపోయింది.
అయితే, తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసమే కంపెనీ ప్రధానంగా ఏర్పాటైందన్నది సత్యం. కానీ, కంపెనీ దేశంలో ప్రవేశించేనాటికి భారతదేశ విదేశీ వర్తకం పోర్చుగీసు వాళ్ల చేతుల్లో ఉండింది. 1588లో పోర్చుగీసు, స్పెయిన్ దేశాల ఉమ్మడి సైన్యాలు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయాయి. అది భారతదేశంతోపాటు, ప్రపంచంలో వివిధ దేశాల వర్తకం మీద ఇంగ్లండ్ గుత్తాధిపత్యానికి అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో నెదర్లాండ్స్కు చెందిన ‘డచ్ ఈస్టిండియా కంపెనీ’ ఇండోనేషియాలో ఏకస్వామ్యాన్ని సాధించింది. అలా ఇంగ్లండ్కు పోర్చుగీసు, డచ్ రూపంలో వ్యాపార ప్రత్యర్థులు ఎదురయ్యారు.
భారత్లో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ కంపెనీ పూర్తిగా భారతదేశం మీదనే దృష్టి సారించింది. పోర్చుగీసులను ఓడించడంతో మొగలులు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మనదేశంలో వర్తక స్థావరాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అలా జహంగీర్ చక్రవర్తి హయాంలో.. 1613లో భారతదేశ పశ్చిమ తీరంలోని సూరత్ నగరంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు. పత్తి, పట్టువస్ర్తాలు, నీలిమందు, సూరేకారం, సుగంధ ద్రవ్యాలను ప్రధానంగా భారతదేశం నుంచి ఇంగ్లండ్, ఇతర ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేది. ఇంకా పర్షియన్ సింధుశాఖ, ఆగ్నేయ, తూర్పు ఆసియాకు కూడా కార్యకలాపాలను విస్తరించింది.
2. ఐరోపా దేశాలను అధిగమించి ఆధిపత్యం
భారతదేశానికి పశ్చిమ దేశాలతో ప్రాచీన కాలం నుంచే వర్తక సంబంధాలు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువగా భూమార్గంలో సాగేవి. 1453లో ఒట్టొమాన్ టర్కులు ఆధునిక టర్కీని ఆక్రమించుకున్నారు. అలా భూభాగంలో ఉన్న వర్తక మార్గాల మీద తురుష్కుల నియంత్రణ ఏర్పడింది.
..దాంతో ఆసియా ముఖ్యంగా భారత్, ఐరోపా దేశాల మధ్య సరకుల రవాణాకు ఆటంకం ఎదురైంది. ఈ కారణంగా పోర్చుగల్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ తదితర దేశాలకు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని కనుక్కోవడం తప్పనిసరైంది. 1498లో పోర్చుగల్ నావికుడు వాస్కో డ గామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, కేరళ రేవుపట్టణం కాలికట్ చేరుకున్నాడు. భారత్కు కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్న తొలి ఐరోపా నావికుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అలా భారత్లో వర్తక స్థావరాలు నెలకొల్పిన తొలి ఐరోపావారు పోర్చుగీసులే. వాళ్లు చాలావరకు సముద్ర తీరం ఉన్న దక్షిణ భారతదేశంలోనే తమ కార్యకలా పాలను కేంద్రీకరించారు. దాంతో 16, 17 శతాబ్దాలలో ఉత్తర భారతదేశంలో ప్రబలంగా ఉన్న మొగల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తలేదు.
1602లో, నెదర్లాండ్స్ నుంచి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. ఇంగ్లండ్ వ్యాపారులు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటుచేశారు. మొగల్ చక్రవర్తి జహంగీర్ కెప్టెన్ హాకిన్స్కు సూరత్లో ఫ్యాక్టరీ (వర్తక స్థావరం) ఏర్పాటు చేసుకునేందుకు ఫర్మానా జారీచేశాడు. తర్వాత సర్ థామస్ రో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతులు పొందాడు. పోర్చుగీసులు కట్నం కింద బొంబాయిని బ్రిటిష్ వాళ్లకు అప్పగించారు. బ్రిటిష్ వాళ్లు మొదట్లో మద్రాసు నుంచి తమ వ్యాపార విస్తరణను ప్రారంభించారు. 1698లో జాబ్ చార్నాక్ కలకత్తాను స్థాపించాడు. అలా బొంబాయి, మద్రాసు, కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన వ్యాపార కేంద్రాలుగా నిలిచిపోయాయి. తర్వాత బ్రిటిష్ వారి వర్తకానికి ఫ్రెంచి వారి రూపంలో తీవ్ర సవాలు ఎదురైంది. అయితే బ్రిటిష్ కంపెనీతో పోలిస్తే ఫ్రెంచి కంపెనీకి ప్రతిబంధకాలు ఎక్కువ. 1760లో వందవాసి యుద్ధంలో ఫ్రెంచి కంపెనీ ఓడిపోయింది. దాంతో భారత దేశంలో బ్రిటిష్ వారికి ఐరోపా దేశాల ముప్పు తొలగిపోయింది. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఏకచ్ఛత్రాధిపత్యానికి ద్వారాలు తెరుచుకున్నాయి.
3. బ్రిటిష్ పాలనకు నాంది… ప్లాసీ యుద్ధం
1757లో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా సైన్యాలు, బ్రిటిష్ కంపెనీ సైన్యాలు ప్లాసీ దగ్గర యుద్ధానికి దిగాయి. సిరాజుద్దౌలా సేనాని మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేస్తామని ప్రలోభపరిచి అతని మద్దతుపొందాడు రాబర్ట్ ైక్లెవ్. అలా సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ప్లాసీ యుద్ధంలో గెలుపొందింది కంపెనీ.
1757… బెంగాల్ను సిరాజుద్దౌలా పాలిస్తూ ఉండేవాడు. బ్రిటిష్ వారు వర్తకంలో లాభాల కోసం.. మొగల్ చక్రవర్తి తమకు ఇచ్చిన అనుమతులను దురుపయోగం చేసేవారు. సిరాజుద్దౌలా ఆజ్ఞలను గౌరవించే వాళ్లు కాదు. దాంతో కలకత్తా సమీపంలోని కాసింబజార్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు సిరాజుద్దౌలా. అక్కడినుంచి కలకత్తాలో ఉన్న కంపెనీ కోటను ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో మద్రాసు నుంచి కంపెనీ అధికారులు రాబర్ట్ ైక్లెవ్ నాయకత్వంలో బ్రిటిష్ నావికాదళాన్ని పంపారు. సిరాజుద్దౌలాతో ఎడతెగని చర్చలు జరిపారు. చివరికి 1757లో నవాబు సైన్యాలు, కంపెనీ సైన్యాలు బెంగాల్లోని ప్లాసీ దగ్గర యుద్ధానికి దిగాయి. సిరాజుద్దౌలా సేనా నాయకులలో ఒకరైన మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేస్తామని ప్రలోభ పరిచి అతని మద్దతుపొందాడు రాబర్ట్ ైక్లెవ్. అలా సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ప్లాసీ యుద్ధంలో గెలుపొందింది కంపెనీ. ఈ సంఘటన భారతదేశ ఆక్రమణకు నాంది పలికింది. అయితే, అప్పటికి కంపెనీ ఆసక్తి అంతా వ్యాపార విస్తరణ మీదే ఉండేది. రాజ్య పాలన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేదు.
కాగా మీర్ జాఫర్ కూడా పాలనలో బ్రిటిష్ వారి జోక్యాన్ని నిరసించాడు. దాంతో అతని స్థానంలో మీర్ ఖాసింను కూర్చోబెట్టారు. అతనికీ కంపెనీతో పొసగలేదు. కంపెనీ మీర్ ఖాసింను 1764లో బక్సార్ యుద్ధంలో ఓడించింది. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అక్కడినుంచి వ్యాపార విస్తరణ కాంక్ష నుంచి రాజ్య విస్తరణకు నడుంబిగించింది. అంతేకాకుండా భారతదేశంలో కంపెనీ ఖర్చులన్నీ భారతీయులే భరించాల్సి వచ్చింది. అలా 1764లో మొదలైన దోపిడీ పర్వం 200 ఏండ్లు కొనసాగింది. భారతీయుల రక్తం పీల్చి సేకరించిన సొమ్మును.. పత్తి, పట్టు కొనుగోలుకు, కంపెనీ సైన్యాలను పోషించడానికి, కంపెనీ పాలనను పటిష్ఠం చేసుకోవడానికి, గవర్నర్ జనరల్ సహా కంపెనీ పాలకవర్గం జీతభత్యాలు, పెన్షన్లకు ఉపయోగించుకున్నారు.
4. టిప్పు సుల్తాన్తో వివాదం… మైసూరు ఆక్రమణ
1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో కంపెనీ సైన్యాల చేతుల్లో టిప్పు సుల్తాన్ మరణించాడు. సుసంపన్న మైసూరు ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది.
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ 1751 డిసెంబర్ 1న బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో జన్మించాడు. తండ్రి హైదర్ అలీ మరణానంతరం 1782 డిసెంబర్లో మైసూరు గద్దెనెక్కాడు. అరేబియా సముద్ర తీరంలో ఉన్న మలబార్ (కేరళ) ప్రాంతం టిప్పు సుల్తాన్ నియంత్రణలో ఉండేది. అలా కంపెనీ కేరళలో కొనుగోలు చేసే మిరియాలు, యాలకుల వ్యాపారం మైసూరు ఛత్రం కింద ఉండేదన్నమాట. 1785లో టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని రేవుల నుంచి సుగంధ ద్రవ్యాల ఎగుమతిని నిలిపివేశాడు. పైగా కంపెనీతో వర్తకం చేయడానికి స్థానిక వర్తకులను అనుమతించ లేదు. పైపెచ్చు, బ్రిటిష్వారికి బద్ధశత్రువులైన ఫ్రెంచివారితో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. వారి సాయంతో తన సైన్యాన్ని ఆధునికీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి కోపానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ వారికి, మైసూరుకు మొత్తం నాలుగు యుద్ధాలు జరిగాయి. 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో కంపెనీ సైన్యాల చేతుల్లో టిప్పు సుల్తాన్ మరణించాడు. సుసంపన్నమైన మైసూరు ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. అయితే మైసూరును టిప్పు సుల్తాన్కు ముందు పరిపాలించిన ఒడయార్ల కుటుంబానికి అప్పగించారు. మిగిలిన ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేసుకున్నారు. మైసూరు సంస్థానంతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు.
5. సైన్య సహకారం… సామ్రాజ్య విస్తరణం
సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది. భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు.
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వ్యూహాల్లో సైన్య సహకార ఒప్పందం ఒకటి. దీని కారణంగా భారతీయ రాజ్యాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయి, బ్రిటిష్ వారికి దాసోహమైపోయాయి. లార్డ్ వెల్లస్లీ (1798- 1805) రూపొందించిన ఈ పథకం బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాణంలో కీలకంగా నిలిచిపోయింది. ఈ ఒప్పందాన్ని అంగీకరించే భారతీయ రాజ్యాలు తమ భూభాగంలో బ్రిటిష్ సైన్యాలు ఉండటానికి అంగీకరించాలి. వారి పోషణ ఖర్చును స్థానిక పాలకులే చెల్లించాలి. అలా చేయలేకపోతే కొంత భూభాగాన్ని కంపెనీకి ఇచ్చేయాలి. ఫలితంగా అంతర్గతంగా, బాహ్యంగా దాడులు జరగకుండా ఒప్పందానికి అంగీకరించిన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లు కాపాడతారు. అయితే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ, ఆచరణలో అది దాదాపుగా శూన్యం. అంతేకాకుండా ఒప్పందంలో భాగమైన రాజ్యం మరే ఇతర విదేశీ శక్తితో ఎలాంటి సంబంధమూ కలిగి ఉండకూడదు.
ఇంగ్లిష్ వాళ్లు కాకుండా ఇతర దేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. అప్పటికే ఎవరైనా ఉద్యోగంలో ఉంటే ఒప్పందం కాగానే తొలగించాలి. బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఇతర భారతీయ రాజ్యాలతోనూ ఒప్పందాలు చేసుకోకూడదు. అలా సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది. భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. రాజ్యాలు స్వతంత్రం కోల్పోయాయి. సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన తొలి భారతీయ పాలకుడు హైదరాబాద్ నిజాం కావడం గమనార్హం. నిజాం రాజు, కంపెనీ మధ్య ఈ ఒప్పందం 1798లో కుదిరింది. మైసూరు, తంజావూరు, అవధ్, పీష్వా, సిందియా, గైక్వాడ్ తదితర పాలకులు కూడా ఈ ఒప్పందానికి లోబడ్డవారే.
6. ఆధునిక.. భారతీయుడు
రాజా రామ్మోహన్ రాయ్ 1828లో కలకత్తాలో బ్రహ్మసమాజాన్ని ఏర్పాటుచేశాడు. హిందూమతాన్ని సంస్కరించడం, దేవుడు ఒక్కడే అని ప్రబోధించడం దీని ప్రధాన సిద్ధాంతాలు.
ఆధునిక భారతదేశంలో సామాజిక మత సంస్కరణల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అందుకే ఆయనను ‘భారతదేశపు మొదటి ఆధునికుడు’గా పరిగణిస్తారు. రాయ్ 1772లో పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయన స్వేచ్ఛగా, హేతుబద్ధంగా ఆలోచించేవాడు. హిందు, మహమ్మదీయ, క్రైస్తవ మతగ్రంథాలను క్షుణ్నంగా చదివాడు. బెంగాలీ, ఇంగ్లిష్, సంస్కృతం, పర్షియన్, అరబీ, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, హీబ్రూ తదితర భాషలు ఆయనకు కరతలామలకం. 1815లో ఆత్మీయ సభ స్థాపించాడు.
ఇదే 1828లో బ్రహ్మసభగా పరివర్తన చెందింది. దేవుడు ఒక్కడే అని రాయ్ బోధించాడు. ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్ ఆధారంగా తన బోధనలను ప్రచారం చేశాడు. రాయ్ అనంతరం మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్ బ్రహ్మసభ పేరును బ్రహ్మసమాజంగా మార్చాడు. రాయ్ కృషి వల్లే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ 1829లో సతీ సహగమన నిషేధ చట్టం అమలులోకి తెచ్చాడు. దీనితోపాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలకు అనుకూలంగా, ఆస్తిలో మహిళలకు హక్కుల కోసం పోరాడాడు. భారతీయ సమాజానికి కుల వ్యవస్థ ఆటంకమని రాయ్ భావించాడు. సర్వమానవ సమానత్వాన్ని కోరుకున్నాడు. ఆధునిక విద్యా విధానం ప్రవేశ పెట్టడానికి కృషిచేశాడు. 1817లో డేవిడ్ హేర్తో కలిసి హిందూ కాలేజీని స్థాపించాడు. బాలికల విద్య కోసం పాఠశాలలు ఏర్పాటుచేశాడు. పత్రికా రంగంలోనూ రాయ్ తనదైన ముద్రవేశాడు. తొలి బెంగాలీ వారపత్రిక సంవాద్ కౌముది ప్రారంభించాడు. పత్రికా స్వేచ్ఛ కోసం గొంతెత్తాడు. రాయ్ 1833లో ఇంగ్లండ్లోని బ్రిస్టల్లో మరణించాడు.
7. వివేక సూర్యోదయం
చికాగోలో 1893 సెప్టెంబర్లో జరిగిన విశ్వ మత మహాసభల్లో భారతీయ ధార్మిక పతాకాన్ని ఎగరవేసిన చిర యువకుడు స్వామి వివేకానందుడు. 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడి అసలుపేరు నరేంద్రనాథ్ దత్తా. కలకత్తా కాళీమాత గుడి పూజారి, వేదాంతి రామకృష్ణ పరమహంస ప్రభావం నరేంద్రనాథ్ను మహా సన్యాసిగా మార్చేసింది.
వేదాంత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి సన్యాసిగా మారి దేశవ్యాప్తంగా పర్యటించడమే కాకుండా, పశ్చిమ దేశాలకూ హిందూ ధర్మం, అద్వైత వేదాంతం, యోగసూత్రాలను పరిచయం చేశాడు వివేకానందుడు. 1886లో ఆయన సన్యాసం స్వీకరించాడు. బెంగాల్లో బేలూరు సహా భారతదేశంలో ఆయన ఎన్నో మఠాలను ఏర్పాటుచేశాడు. 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించాడు. 1902లో బేలూరులో మరణించాడు.
స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు భారతీయ వేదాంత శాస్ర్తాన్ని, యోగ సూత్రాలను పరిచయం చేశాడు. దీనజనుల ఉద్ధరణ కోసం సామాజిక సేవకు నడుం బిగించాడు. భారతీయ సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. విజ్ఞానశాస్త్రం, పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు.
బ్రిటిష్ వారి అణచివేతపై పోరాడాలని, సమాజసేవకు అంకితం కావాలని యువతకు విజ్ఞప్తిచేశాడు. మూఢనమ్మకాలను రూపుమాపడానికి తనవంతు ప్రయత్నించాడు. సమాజంలో మహిళలు ఉన్నతంగా ఉండాలని ప్రబోధించాడు. సమానత్వ స్ఫూర్తిని, స్వేచ్ఛా ఆలోచనలను కలిగి ఉండాలని కోరుకున్నాడు. హిందూమతాన్ని, జాతీయవాదాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకునే దిశగా ఆయన కృషిచేశారు. సాటి మనుషులకు సేవ చేయడమే అత్యుత్తమమైన ఆరాధన అనేది వివేకానందుడి సందేశం. “భగవద్గీత అధ్యయనం చేయడం కంటే, ఫుట్బాల్ ఆడటం ద్వారానే ఎవరైనా సరే స్వర్గానికి చేరువగా ఉంటారు” అని శారీరక, నైతిక శక్తి గొప్పవనే సత్యాన్ని చాటిచెప్పాడు.
ఎవ్వరూ ఆకలితో ఉండటానికి వీలులేని సమాజం అవతరించాలని కోరుకున్నాడు. జాతీయ వాదానికి… ప్రాచీన భారతదేశ వైభవం పట్ల గర్వంగా ఉండటం; నైతిక, శారీరక బలాన్ని అభివృద్ధి చేసుకోవడం; దేశ ప్రజలు నిరంతర చైతన్యంతో ఉండటం, ఉమ్మడి ఆధ్యాత్మిక ఆలోచనల మీద ఆధారపడిన ఐక్యత అనే నాలుగు అంశాలు జాతీయవాదానికి మూలస్తంభాలుగా ఉంటాయని వివేకానందుడు పేర్కొన్నాడు. స్వాతంత్య్రోద్యమంలో వివేకానందుడి ఉపన్యాసాలు సమకాలీన యువతరంలో విప్లవ భావాలు నెలకొనేందుకు కారణమయ్యాయి. ఇప్పటికీ భారతీయ యువత మీద అత్యంత ప్రభావం చూపే వ్యక్తి వివేకానందుడు.
8. రైలు మార్గాలు… వలస దోపిడికి బాటలు
దేశంలో రైలు మార్గాలు వేయకముందు రోడ్డు మార్గాలు, జల రవాణా రూపంలో.. రెండు రకాలుగా రవాణా జరిగేది. అయితే బ్రిటిష్ వారు వచ్చేటప్పటికి రోడ్ల యాజమాన్యం అంత సరిగ్గా లేకపోయింది.
..ఇలాంటి పరిస్థితుల్లో లండన్, మాంచెస్టర్ నగరాలకు చెందిన వ్యాపార సంస్థలు భారతదేశంలో రైలు మార్గాల అభివృద్ధికి చొరవ చూపించాయి. దీనివల్ల ఇంగ్లండ్ వస్త్ర పరిశ్రమకు అవసరమైన పత్తిని భారతదేశం నుంచి సులువుగా తరలించడానికి వీలవుతుందని వారి ఆలోచన. అంతేకాకుండా ఇంగ్లండ్లో తయారైన ఉత్పత్తులకు భారత్ మార్కెట్గా ఉపయోగపడుతుందని ఆంగ్లేయులు భావించారు. 1857 సిపాయీల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో రైలు మార్గాల నిర్మాణం ముమ్మరమైంది. అలా 1853 ఏప్రిల్ 16 నాడు భారతదేశంలో రైల్వే యుగం ఉదయించింది. బొంబాయిలోని బోరి బందర్ నుంచి థాణే వరకు 21 మైళ్ల దూరానికి తొలి రైలు పరుగులు పెట్టింది. 1860లో కేవలం 838 మైళ్లు ఉన్న భారతీయ రైలు మార్గాల నెట్వర్క్ 1901 నాటికి 25,373 మైళ్లకు చేరుకుంది. కానీ తొలి నాళ్లలో ప్రజలు రైల్వేలను అంత అబ్బురంగా ఏమీ చూడలేదు. పైపెచ్చు వీటికి బ్రహ్మరాక్షసులు అని ముద్దుపేరు పెట్టుకున్నారు.
రైల్వేల అభివృద్ధి కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే జరిగింది. భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. కేవలం మెకానిక్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చేవాళ్లు. అయితే రైల్వేల అభివృద్ధి వల్ల ఒనగూరిన ఫలితం ఏదైనా ఉందా అంటే, దేశ ప్రజలు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి వీలైంది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల అంశాలపట్ల అవగాహన పెరిగింది. ఆయా ప్రాంతాలకు చెందిన మేధావుల మధ్య భావప్రసారం జరగడంతో 1880ల నుంచి దేశమంతటా జాతీయ భావాలు వీయడం మొదలైంది. భారత స్వాతంత్య్రోద్యమ సారథి భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పడటానికి రైల్వేల అభివృద్ధి కూడా ప్రధాన కారణంగా నిలిచింది.
9. వీరపాండ్య కట్టబ్రహ్మన
బ్రిటిష్ కంపెనీ మేజర్ బెనెర్మన్ నేతృత్వంలో కట్టబ్రహ్మన మీద యుద్ధం ప్రకటించింది. అతను లొంగక పోవడంతో 1799 సెప్టెంబర్ 5న దాడి మొదలైంది. శివసుబ్రమణ్య పిైళ్లెని అదుపులోకి తీసుకున్నారు. కట్టబ్రహ్మన పుదుక్కొట్టాయ్కి పారిపోయాడు. పుదుక్కొట్టాయ్ పాలకుడు ఆయనను బ్రిటిష్ వారికి పట్టించాడు. అక్టోబర్ 17న కట్టబ్రహ్మనను ఉరితీశారు.
వీరపాండ్య కట్టబ్రహ్మన తమిళనాడులోని పాంచాలకుర్చి పాలెగాడు. కంపెనీ అధికారులు జేమ్స్ లండన్, కొలిన్ జాక్సన్ ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. ఇలాంటి మరికొన్ని సంఘటనలతో కట్టబ్రహ్మనకు, కంపెనీ అధికారులకు ఘర్షణ ఏర్పడింది. 1792లో కట్టబ్రహ్మన కంపెనీకి ప్రతి ఏటా కప్పం చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే ఆయన కంపెనీకి బకాయిపడ్డాడు.
కలెక్టర్ జాక్సన్ ఆయనను బెదిరిస్తూ లేఖలు రాశాడు. ‘వర్షం కురుస్తుంది కాబట్టి, పంటలు పండుతున్నాయి. దానికి బ్రిటిష్ వారికి పన్నులు ఎందుకు చెల్లించాలి?’ అని ఎదురుతిరిగాడు బ్రహ్మన. దాంతో కట్టబ్రహ్మనపై దాడికి జాక్సన్ మద్రాసు ప్రభుత్వం అనుమతి కోరాడు. కానీ అనుమతి లభించలేదు. తర్వాత కట్టబ్రహ్మన బకాయి సొమ్ము చెల్లించడానికి జాక్సన్ దగ్గరికి రామనాథపురం వెళ్లాడు. జాక్సన్ కోటలో ఆయనను చాలాసేపు నిలబెట్టే ఉంచాడు. అయితే జాక్సన్ తమను బంధించే ఉద్దేశంతో ఉన్నాడని కనిపెట్టిన కట్టబ్రహ్మన, ఆయన మంత్రి శివసుబ్రమణ్య పిైళ్లె తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు తలెత్తిన ఘర్షణలో కొంతమంది కంపెనీ ఉద్యోగులు మరణించారు. శివసుబ్రమణ్య పిైళ్లెని ఖైదుచేశారు. కట్టబ్రహ్మన మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
తర్వాత కట్టబ్రహ్మన నిరపరాధి అని విచారణలో తేలింది. శివసుబ్రమణ్య పిైళ్లెని కూడా విడుదల చేశారు. జాక్సన్ను పదవి నుంచి తప్పించారు. మళ్లీ 1799లో కంపెనీ మేజర్ బెనెర్మన్ నేతృత్వంలో కట్టబ్రహ్మన మీద యుద్ధం ప్రకటించింది. లొంగిపోక పోవడంతో 1799 సెప్టెంబర్ 5న దాడి మొదలైంది. శివసుబ్రమణ్య పిైళ్లెని అదుపులోకి తీసుకున్నారు. కట్ట బ్రహ్మన పుదుక్కొట్టాయ్ పారిపోయాడు. పుదుక్కొట్టాయ్ పాలకుడు ఆయనను బ్రిటిష్ వారికి పట్టించాడు. అక్టోబర్ 17వ తేదీన కట్టబ్రహ్మనను ఉరితీశారు. ఆ తర్వాత దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా తలెత్తిన రాణి కిట్టూరు చెన్నమ్మ, రాయలసీమలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి తదితర చిన్నచిన్న రాజ్యాల పాలకులు, పాలెగాళ్ల తిరుగుబాట్లు కూడా ప్రసిద్ధిచెందినవే.
10. సిపాయీల తిరుగుబాటు
బ్రిటిష్ వారు భారతదేశంలో పాలన ఏర్పరుచుకున్నాక వందేండ్ల వరకు ఏవో చిన్నచిన్న తిరుగుబాట్లే తప్ప పెద్దయెత్తున పోరాటాలు జరగలేదు. చివరికి 1857లో వందేండ్ల వేదనంతా ఒక్కసారిగా సిపాయీల తిరుగుబాటు రూపంలో బద్దలైంది.
వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఒక విదేశీ వర్తక సంస్థ మొగల్ సామ్రాజ్య వైభవం మసకబారుతున్న దశలో దేశంలో ఒక్కొక్క రాజ్యాన్నీ కబళించింది. తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుంది. దాంతో అసంతృప్తితో ఉన్న రాజులు కంపెనీకి వ్యతిరేకంగా కత్తిదూశారు. చేతివృత్తుల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం మీద ఒత్తిడి పెరిగింది. అలా రైతాంగంలో, చేతివృత్తుల వారిలోనూ అసంతృప్తి పేరుకుపోయింది. వీటికితోడు తమ సొంతదేశంలో తమను చిన్నచూపు చూడటం, భారతీయ సిపాయీలకు తక్కువ వేతనాలు లాంటివి కూడా సిపాయీల తిరుగుబాటుకు కారణాలు. ఇన్ని సమస్యలతోపాటు ‘పుండుమీద కారం చల్లినట్లు’ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన కొవ్వు పూతపూసిన కార్ట్రిడ్జిలు కూడా తిరుగుబాటును త్వరితం చేశాయి.
ఈ నేపథ్యంలోనే 1857 మార్చి 29న బారక్పూర్లో మంగళ్ పాండే అనే సిపాయి పూతపూసిన తూటాలను ఉపయోగించేది లేదని తేల్చిచెప్పాడు. అక్కడున్న అధికారులపై దాడిచేశాడు. ఒకరిని చంపేశాడు కూడా. దాంతో ఆంగ్ల ప్రభుత్వం మంగళ్ పాండేను ఉరితీసింది. తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది మాత్రం మే 10న మీరట్ సిపాయీలు ఢిల్లీ బాటపట్టినప్పుడే. 11న ఢిల్లీ చేరుకున్న సిపాయీలు వృద్ధుడైన బహదూర్ షాను తమ నాయకుడిగా ప్రకటించారు.
ఆ మరునాడు ఢిల్లీని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. బహదూర్ షా నేరుగా పోరాటంలో పాల్గొనక పోయినా ఆయన ప్రతినిధిగా బఖ్త్ఖాన్ (ఢిల్లీ), నానాసాహెబ్, తాంత్యాతోపే (కాన్పూర్), బేగం హజ్రత్ మహల్ (లక్నో), లక్ష్మీబాయి (ఝాన్సీ), కువర్ సింగ్ (జగదీశ్పూర్) బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ఆంగ్లేయులకు ఆధునిక ఆయుధాలు, రవాణా సాధనాలు అందుబాటులో ఉన్న కారణంగా తిరుగుబాటు రెండేండ్లలోపే సమసిపోయింది. తర్వాత మళ్లీ తొంభై ఏండ్లకు భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది.
11. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు
రెండేండ్ల పాటే సాగినా.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గోదావరి తీరంలోని ఏజెన్సీ ప్రాంతం కేంద్రంగా నడిపిన తిరుగుబాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఈ పోరాటం 1922 ఆగస్టు, 1924 మే మధ్యకాలంలో జరిగింది.
1897 జూలై 4న విశాఖపట్నం సమీపంలో జన్మించాడు సీతారామరాజు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు బలంగా నాటుకున్నాయి. తండ్రి మరణంతో రాజు చదువు మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత భారతదేశ పర్యటన చేశాడు. దేశ ప్రజల సామాజిక- ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి ఆదివాసుల కష్టాలు రాజును బాగా కదిలించాయి. అలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాలనే ఆలోచన రాజుకు కలిగింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకున్నాడు. ఆదివాసులను విద్యావంతుల్ని చేశాడు, వైద్య సాయం అందించాడు.
గోదావరి మన్యం ప్రాంతాన్ని బ్రిటిష్ వారిమీద పోరుగడ్డగా మలుచుకోవాలని అనుకున్నాడు. పోలీసులు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా ఆదివాసులను సంఘటితం చేశాడు. ఆదివాసుల నుంచి ప్రాచీన పోరాట విద్యను నేర్చుకున్నాడు. అయితే బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాలను సంప్రదాయ విల్లంబులు నిలువరింలేక పోయాయి. దాంతో ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై దాడులు మొదలుపెట్టాడు. 1922 ఆగస్టు 22న విశాఖపట్నం ఏజెన్సీలోని చింతపల్లి స్టేషన్ మీద తొలిదాడి జరిపిన రాజు.. కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ల మీద కూడా మెరుపు దాడులు నిర్వహించాడు. రాజు, అతని అనుచరులు ఆయుధాలను దోచుకున్నారు.
దీంతో విశాఖపట్నం, రాజమండ్రి, పార్వతీపురం, కోరాపుట్ ప్రాంతాల నుంచి బ్రిటిష్ అధికారుల నేతృత్వంలో సైనిక దళాలు పెద్దయెత్తున వచ్చాయి. రాజు తాను దాడిచేసే స్టేషన్లు, తేదీ, సమయాన్ని ముందే వెల్లడించేవాడు. మలబార్ ప్రత్యేక పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ బలగాలను రంగంలోకి దించింది బ్రిటిష్ ప్రభుత్వం. అయినా ఫలితం కనిపించలేదు. చివరికి టీ.జీ.రూథర్ఫర్డును రప్పించింది. ఎంతోకాలం వెతుకులాట తర్వాత సీతారామరాజు బ్రిటిష్ సైన్యాలకు పట్టుబడ్డాడు. 1924 మే 7న ఆయన అమరుడైనట్లు తెలుస్తున్నది. ఆయన అస్థికలను కృష్ణదేవిపేటలో పూడ్చిపెట్టారు. ఆ రోజుల్లోనే ఆయనను పట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 40 లక్షలకుపైగా ఖర్చు చేసిందంటే, రంప విప్లవం తెల్లదొరలను వణికించిన తీరు అర్థం అవుతున్నది.
12. బిర్సా ముండా పోరాటం
జార్ఖండ్ రాష్ట్రంలోని ఉలిహాటులో 1875 నవంబర్ 15న జన్మించాడు బిర్సా ముండా. తల్లిదండ్రులు.. సుగణ ముండా, కర్మి హాటు. పేదరికం మధ్య బిర్సా ముండా బాల్యం గడిచిపోయింది. తెల్లదొరలు ఆదివాసుల జీవితాల్లోకి చొరబడుతున్న తీరు అతణ్ని కదిలించింది.
డేవిడ్ అనే పేరుతో మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించాడు బిర్సా. బాల్యంలోనే ఆయన మీద జాతీయ భావాల ప్రభావం పడింది. కొంతకాలం తర్వాత బిర్సా తండ్రి అతణ్ని మిషనరీ పాఠశాల మాన్పించాడు. అక్కడినుంచి బిర్సాలో ప్రభుత్వ వ్యతిరేకత, మిషనరీ వ్యతిరేకత గూడుకట్టుకుని పోయింది. అలా 1890లో బ్రిటిష్ వాళ్లు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ఆదివాసులను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో, అప్పటివరకు ప్రకృతి మధ్య శాంతియుత జీవనానికి అలవాటుపడిన తమ జీవితాలను ఎలా అలజడికి లోనుచేస్తున్నాయో ప్రపంచానికి వివరించాడు.
ముండా తెగలో ‘ఖుంత్ఖత్తి’ పేరుతో ఉమ్మడి భూ యాజమాన్య విధానం అమలులో ఉండేది. దీనిని బ్రిటిష్ వాళ్లు జమీందారీ విధానంతో భర్తీచేశారు. అలా ముండాల ఆవాసాల్లోకి బయటివాళ్లు ప్రవేశించి, దోపిడి చేయడం మొదలుపెట్టారు. పులిమీద పుట్రలా అప్పటివరకు ద్రవ్య మారకం అంతగా అలవాటు లేని ముండాల మీద పేదరికం దాడిచేయడం మొదలుపెట్టింది. 1894లో బిర్సా ముండా బ్రిటిష్వాళ్లు, మైదాన ప్రాంతాలవారికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడతామని ప్రకటించాడు. అలా ముండాల మహాపోరాటం… ‘ఉల్గులన్’ మొదలైపోయింది. 19వ శతాబ్దంలో తలెత్తిన అతి ముఖ్యమైన ఆదివాసీ పోరాటాల్లో ముండాల తిరుగుబాటు ఒకటి. బిర్సా తనను తాను దేవదూతగా ప్రకటించుకున్నాడు. ముండాలు, ఖరియాలు, ఓరాన్లు అతణ్ని తమ నాయకుడిగా అంగీకరించారు. పన్నులు చెల్లించవద్దని సూచించాడు. 1895లో బిర్సాను అరెస్టు చేసి రెండేళ్ల తర్వాత విడుదల చేశారు. మళ్లీ 1899లో పోరాటం మొదలుపెట్టాడు బిర్సా. 1900లో బ్రిటిష్ పోలీసులు బిర్సాను చక్రధర్పూర్ జంకోపాయ్ అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. తన 25వ ఏట.. 1900 జూన్ 9న రాంచీ జైలులో బిర్సా మరణించాడు. ఓ ఉద్యమం ఆగిపోయింది.
13. జిత్తులమారి వారెన్ హేస్టింగ్స్
ఆంగ్లేయులు తమ దృష్టినంతా మైసూరు పాలకుడు హైదర్ అలీ మీద కేంద్రీకరించారు. పైగా హైదర్తో పోరాటంలో మహారాష్ర్టుల సహకారం తీసుకున్నారు. హైదర్తో యుద్ధం 1780లో ప్రారంభమైంది. తొలుత హైదర్ గెలిచినా, వారెన్ హేస్టింగ్స్ నక్కజిత్తులకు పాల్పడ్డాడు.
రాబర్ట్ ైక్లెవ్ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను వారెన్ హేస్టింగ్స్ (1772- 85) కొనసాగించాడు. తొలుత ఆయన మైసూరు పాలకుడు హైదర్ అలీతో పోరాటం చేశాడు. దీనికి హైదరాబాద్ నిజాం సహకారం తీసుకున్నాడు. ఆ తర్వాత మరాఠాల అంతర్గత రాజకీయాల్లో తలదూర్చడం ప్రారంభించాడు. బాలుడైన పీష్వా మాధవ రావు-2కు వ్యతిరేకంగా రఘునాథ రావును బలపరిచాడు. మాధవ రావుకు అండగా 18వ శతాబ్ది నాటి మరాఠా నాయకులలో ప్రముఖుడైన నానా ఫడణవీస్ ఉన్నాడు. అలా ఆంగ్లేయులు- మహారాష్ర్టులకు మధ్య 1775 నుంచి 1782 వరకు మొదటి యుద్ధం జరిగింది.
ఈ యుద్ధ సమయంలో మాత్రం వారెన్ హేస్టింగ్స్ మహారాష్ర్టులు, నిజాం, మైసూరు రాజ్యాల ఉమ్మడి దళాలతో పోరాడాల్సి వచ్చింది. అయితే ఈ ముగ్గురిని ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పడం ద్వారా వారెన్ హేస్టింగ్స్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఏది ఏమైనా మహారాష్ర్టులతో మొదటి యుద్ధంలో ఆంగ్లేయులకు అంతగా ఒరిగింది ఏమీ లేదు. చివరికి ఇద్దరి మధ్య యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత దొరికిన సంధి కాలంలో ఆంగ్లేయులు తమ దృష్టినంతా మైసూరు పాలకుడు హైదర్ అలీ మీద కేంద్రీకరించారు. పైగా హైదర్తో పోరాటంలో మహారాష్ర్టుల సహకారం తీసుకున్నారు. హైదర్తో యుద్ధం 1780లో ప్రారంభమైంది. తొలుత హైదర్ గెలిచినప్పటికీ వారెన్ హేస్టింగ్స్ నక్కజిత్తులకు పాల్పడ్డాడు.
నిజాం నవాబుకు, మరాఠాలకు ఆక్రమించిన ప్రాంతాలను ఇస్తామని ఆశపెట్టాడు. హైదర్ అలీ 1781లో ఐర్ కూట్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత, పోరాటం కొనసాగుతుండగానే 1782లో మరణించాడు. తర్వాత 1789లో హైదర్ అనంతరం మైసూరు గద్దెనెక్కిన టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిమీద పోరాటం కొనసాగించాడు. 1792లో కారన్వాలిస్ చేతిలో ఓడిపోయి శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. ఈ సంధి మేరకు సగం మైసూరు రాజ్యం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లింది.
14. పొట్ట పగిలేవరకు మేపడమే!
భారతదేశాన్ని ఆక్రమించడంలో ముఖ్యపాత్ర పోషించిన గవర్నర్ జనరల్స్లో వెల్లస్లీ (1798- 1805) ఒకరు. ఆయన వచ్చేప్పటికి అంతర్గత కలహాలతో మహారాష్ర్టులు, మూడో మైసూరు యుద్ధంలో ఓడిపోయి టిప్పు సుల్తాన్.. చాలా బలహీనపడ్డారు.
భారతదేశంలో బ్రిటిష్ ప్రాబల్యం విస్తరణకు అదే అదునుగా భావించాడు వెల్లస్లీ. భారతీయ రాజ్యాలను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి యుద్ధాలతోపాటు, ఒక కొత్త వ్యూహాన్ని అమలులోకి తీసుకు వచ్చాడు. అదే ‘సైన్య సహకార పద్ధతి’. సైన్య సహకారం అంటే ‘ఎద్దులను పొట్ట పగిలి వాటంతట అవే మరణించే వరకు మేపడం’ లాంటిదే. సైన్య సహకార ఒప్పందంలో చేరిన మొదటి భారతీయ పాలకుడు హైదరాబాద్ నిజాం (1798). ఆ తర్వాత 1801లో అయోధ్య నవాబు ఒప్పందంలో భాగమైపోయాడు.
టిప్పు సుల్తాన్ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మైసూరు సైన్యాలను ఆధునికీకరించడానికి ఫ్రెంచి వారి సహాయం కోరాడు. అయితే 1799లో జరిగిన నాలుగో ఆంగ్లో – మైసూరు యుద్ధంలో టిప్పు మరణించాడు. దాంతో వెల్లస్లీ దృష్టి మహారాష్ట్ర మీదికి మళ్లింది. పైగా బొంబాయి అప్పటికే వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో మహారాష్ట్ర సామ్రాజ్యం పీష్వా (పుణె), గాయిక్వాడ్ (బరోడా), సింధియా (గ్వాలియర్), హోల్కర్ (ఇండోర్), భోస్లే (నాగపూర్)… అయిదు వర్గాలుగా చీలిపోయింది.
వీరందరికీ పీష్వా రెండో బాజీరావు నామమాత్రపు పెద్ద. వీరి మధ్య అంతర్గత కలహాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బాజీరావును హోల్కర్ ఓడించాడు. దాంతో ఆయన వెల్లస్లీ పంచన చేరిపోయాడు. సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ ఒకవేళ అందరూ కలిసి ఉంటే మహారాష్ర్టులను ఓడించడం బ్రిటిష్ వారికి కష్టమైన పనే. కానీ, తమకు నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ వారు కలిసికట్టుగా ఉండటానికి ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. ఫలితంగా ఒక్కొక్కరినీ విడివిడిగా ఓడిస్తూ వచ్చారు. ఎంత విస్తరణ జరిగినా, వెల్లస్లీ విస్తరణ వాదం బ్రిటిష్ ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా పరిణమించింది. దాంతో ఆయనను భారత్ నుంచి వెనక్కి పిలిపించారు.
15. మరాఠాలను మట్టి కరిపించిన హేస్టింగ్స్
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్లిన గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ (1813- 1823). పైగా మరాఠాలు కూడా బ్రిటిష్ వారితో అంతిమ పోరు కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మహారాష్ర్టులు పీష్వా సారథ్యంలో ఒక్కటయ్యారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రెండో ఆంగ్ల మరాఠా యుద్ధంలో పీష్వా రెండో బాజీరావు బ్రిటిష్ సైన్యాల చేతిలో ఓడిపోయాడు. సంధి చేసుకుని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు తరలిపోయాడు. పీష్వా భూభాగాన్ని బొంబాయి ప్రెసిడెన్సీలో విలీనం చేసుకున్నారు. శివాజీ వారసుడిని సతారా ప్రాంతానికి అధిపతిగా చేశారు.
అలా 1818 నాటికి పంజాబ్, సింద్ మినహా మిగిలిన భారత ఉపఖండం అంతా బ్రిటిష్ వారి నియంత్రణలోకి వచ్చింది. 1839లో రణ్జీత్ సింగ్ మరణించగానే పంజాబ్లో పరిస్థితులు విషమించాయి. దాంతో 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులను ఓడించి డల్హౌసీ పంజాబ్ ఆక్రమణను పూర్తిచేశాడు. 1843లో చార్లెస్ నేపియర్ సింద్ దురాక్రమణకు పాల్పడ్డాడు.
16. డల్హౌసీ ఎత్తుగడ..
డల్హౌసీ (1848- 1856).. భారతదేశ ఆక్రమణకు ‘రాజ్య సంక్రమణం’ అనే శాంతియుతమైన ఎత్తుగడను
అమలుచేసిన గవర్నర్ జనరల్. నిస్సంతువులైన పాలకుల దత్తపుత్రులను రాజులుగా చేసేందుకు నిరాకరిస్తూ.. 1848- 54 మధ్యకాలంలో సతారా, నాగ్పూర్, ఝాన్సీ తదితర చిన్నచిన్న రాజ్యాలను కబళించాడు. దీంతో డల్హౌసీ వెళ్లిపోయిన ఒక్క ఏడాదిలోపే.. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయీల తిరుగుబాటుకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కాగా, మొగల్ సామ్రాజ్యంలో మిగిలిన అవశేష రాజ్యం అవధ్ను ఆక్రమించుకునేందుకు డల్హౌసీకి రాజ్య సంక్రమణం పనిచేయలేదు. దాంతో అవధ్ నవాబు వాజిద్ అలీ షా పరిపాలన సవ్యంగా లేదని సాకుగా చూపించాడు. ఆయనకు ఎంతోమంది కొడుకులు ఉన్నప్పటికీ 1856లో సారవంతమైన గంగా మైదానంలో ఉన్న అవధ్పైన దురాక్రమణ జరిపాడు. ఇక్కడితో దాదాపు భారత ఉపఖండమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రిటిష్ సామ్రాజ్యం ఛత్రఛాయ కిందికి వచ్చింది.
17. సామ్రాజ్య రథ తొలిసారథి
రాబర్ట్ ైక్లెవ్ (1765- 72)… ఈస్ట్ ఇండియా కంపెనీ తొలిదశ విస్తరణలో తన అసమానమైన సైనిక నైపుణ్యాలను ప్రదర్శించిన వ్యక్తి. బెంగాల్ను ఆక్రమించుకున్న తర్వాత ఆయన అక్కడ ‘ద్వంద్వ ప్రభుత్వం’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అలా బెంగాల్లో కేవలం పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని తమ దగ్గర ఉంచుకుని, పరిపాలన బాధ్యతలను నవాబు మీర్ జాఫర్కు వదిలిపెట్టాడు. అంటే బాధ్యతలు లేకుండా అధికారాన్ని అనుభవించడం అన్నమాట. పైగా ఈ విధానం వల్ల భారతీయ సరుకులు కొనడానికి బ్రిటన్ నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన అగత్యం కూడా తప్పిపోయింది. అంటే మన దగ్గర వసూలు చేసిన డబ్బులతోనే మన సరుకులు కొనుక్కున్నారు. వాటిని విదేశాల్లో అమ్ముకున్నారు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ భారత
దేశంలో చేసిన యుద్ధాలను ఇక్కడ పెడుతున్న పెట్టుబడులుగా పరిగణించింది.
18. ఇల్బర్ట్ బిల్ వివాదం
ఇంగ్లండ్ పత్రికలు కూడా ఐరోపావారి పక్షమే వహించాయి. దాంతో భారతదేశంలో, బ్రిటన్లో ఉన్న ఆంగ్లేయులను సంతృప్తి పరచడం రిప్పన్కు తప్పలేదు. అలా బిల్లును సవరించారు. అయితే భారతీయులను బ్రిటిష్ వారు ఎప్పటికీ తమతో సమానంగా చూడరనే సత్యాన్ని ఇల్బర్ట్ బిల్లు వివాదం నిరూపించింది.
బ్రిటిష్ వారి కాలంలో భారతీయులకు, ఆంగ్లేయులకు న్యాయం వేర్వేరుగా అమలయ్యేది. ఈ విధానాన్ని 1883లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ తొలగించాలని అనుకున్నాడు. అప్పుడు అమలులో ఉన్న న్యాయం మేరకు.. ఆంగ్లేయులు, ఇతర ఐరోపావారిని ఐరోపాకు చెందిన న్యాయమూర్తి మాత్రమే విచారణ చేయాలి. భారతీయ న్యాయమూర్తులకు ఆ అధికారం లేదు. అలా భారతీయ న్యాయమూర్తుల పట్ల ఈ విధానం వివక్ష పూరితంగా ఉండేది. దీంతో భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా న్యాయవ్యవస్థలో గూడు కట్టుకుపోయిన వివక్షను రద్దుచేయడానికి 1883లో గవర్నర్ జనరల్ న్యాయ సంఘంలో సభ్యుడైన సీపీ ఇల్బర్ట్ ఒక బిల్లును ప్రవేశపెట్టాడు. ఐరోపావారిని భారతీయ న్యాయమూర్తులు విచారణ చేయవచ్చన్న ఇల్బర్ట్ కమిటీ సిఫారసులోని నిబంధన ఐరోపావారికి రుచించలేదు.
దాంతో దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని ఖండించడానికి వారంతా కలిసి లక్ష యాభైవేల రూపాయల నిధిని సేకరించారు. డిఫెన్స్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఇంకా భారతీయ న్యాయమూర్తులు ఐరోపా వారిని విచారణ చేసేకంటే, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ముగింపు పలకడం మంచిదని సలహా కూడా ఇచ్చారు. ఇంగ్లండ్ పత్రికలు కూడా ఐరోపావారి పక్షమే వహించాయి. దాంతో భారత దేశంలో, బ్రిటన్లో ఉన్న ఆంగ్లేయులను సంతృప్తిపరచడం రిప్పన్కు అని వార్యమైంది. అలా బిల్లును సవరించారు. అయితే భారతీయులను బ్రిటిష్ వారు ఎప్పటికీ తమతో సమానంగా చూడరనే సత్యాన్ని ఇల్బర్ట్ బిల్లు వివాదం నిరూపించింది. దేశంలో జాతీయవాదం ప్రబలేందుకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. తన ఆశయం నెరవేరకపోవడంతో.. రిప్పన్ గవర్నర్ జనరల్ పదవికి రాజీనామా సమర్పించాడు. రిప్పన్ వెళ్లిపోయిన ఏడాదికే..1885లోనే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడం కాకతాళీయమేమీ కాదు. ఆ తర్వాత కూడా ఎన్నో మలుపులు..
19. రైతు పోరాటాల మార్గదర్శి నీలిమందు విప్లవం
1859- 60లలో బ్రిటిష్ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. 18వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. అక్కడి వస్త్ర పరిశ్రమకు అవసరమైన నీలిరంగు కోసం వారు భారతదేశంలో నీలిమందును పెద్దయెత్తున సాగుచేసేందుకు పూనుకున్నారు.
..ఈ క్రమంలో రైతులు బలవంతగానైనా నీలిమందు పంట సాగుచేసేలా పీడనకు దిగారు. ముఖ్యంగా బెంగాల్, బీహార్ రైతులు పీడనకు గురయ్యారు. దీనికోసం రైతులు స్థానిక జమీందార్లు, బ్రిటిష్ తోటల యజమానుల నుంచి డబ్బులు అడ్వాన్సుగా పొందేవాళ్లు. రైతులు వారి భూముల్లో ఆహార ధాన్యాలు సాగుచేయకుండా, కేవలం నీలిమందు మాత్రమే పండించేలా బ్రిటిష్ వారు ఒప్పంద పత్రాలను రాయించుకునేవాళ్లు. అయితే నీలిమందు పండించినందుకు వారికి చాలా కొద్దిమొత్తమే దక్కేది. దాంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయేవారు. ఈ దుస్థితిని తప్పించుకోవడానికి.. తోటల యజమానులపై పోరాటమే మార్గంగా భావించారు బ్రిటిష్ వారు.
నీలిమందు విప్లవం 1859 మార్చిలో మొదలైంది. బెంగాల్ రాష్ట్రం నడియా జిల్లాలోని (ఇప్పుడు బంగ్లాదేశ్) రైతులు విప్లవంలో పెద్దయెత్తున పాల్గొన్నారు. ఉద్యమానికి దిగంబర్ బిశ్వాస్, బిష్ణుచరణ్ బిశ్వాస్ నాయకత్వం వహించారు. ఇకనుంచి నీలిమందు పండించకూడదని రైతులు తీర్మానించారు. ఉద్యమానికి బాగా ప్రచారం లభించడంతో బెంగాల్లోని ఇతర ప్రాంతాలకూ పాకిపోయింది. స్థానిక జమీందార్లు రైతుల పక్షం వహించారు. బెంగాలీ విద్యావంతులు కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. కలకత్తా దినపత్రికలు ఉద్యమాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేశాయి. రైతులపై ఆంగ్లేయ తోటల యజమానుల అకృత్యాల నేపథ్యంతో దీనబంధు మిత్రా ‘నీలదర్పణ్’ నాటకం రాశారు. పరిస్థితి విషమిస్తుండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ‘నీలిమందు చట్టం’ ఆమోదించింది. నీలిమందు విప్లవం బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటేమీ కాదు. అయితే, సంఘటితంగా పోరాడితే పీడన నుంచి విముక్తి పొందవచ్చని నిరూపించింది.
20. ప్రార్థనలు,విజ్ఞప్తులు..మితవాదుల మార్గాలు
భారత ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే అఖిల భారత స్థాయి వేదికను స్థాపించడానికి బ్రిటిష్ ప్రభుత్వంలో సివిల్ సర్వెంటుగా పదవీ విరమణ చేసిన అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ చొరవ చూపించాడు. అలా 1885లో బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్కళాశాలలో కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది.
ఉమేశ్ చంద్ర బెనర్జీ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు. ఈ సమావేశానికి 72 మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో అన్ని మతాల వాళ్లూ ఉన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ నాయకులు చర్చించారు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి నుంచీ లౌకిక విలువలు కలిగిన సంస్థగానే ఉండిపోయింది. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి కాంగ్రెస్ చరిత్రను మూడు దశలుగా చెప్పుకోవచ్చు. మొదటిది, 1885- 1905 మధ్య బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయంగా ఉంటూ, భారతీయుల ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని అనుకునే మితవాద దశ. 1906- 1916 నుంచి అతివాద జాతీయోద్యమ దశ. మూడోదశ… 1917- 1947 మధ్య మూడు దశాబ్దాల పాటు మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమాల దశ.
స్థాపించిన తొలినాళ్లలో కాంగ్రెస్కు బ్రిటిష్ ప్రభుత్వం అండదండలు దొరికాయి.
బ్రిటిష్ చట్టాలు, ఆంగ్లేయుల సౌహార్దం పట్ల మితవాదులు చాలా నమ్మకంతో ఉండేవాళ్లు. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాలను అనుసరించారు కాబట్టి, వారిని మితవాదులుగా పేర్కొన్నారు. వారి డిమాండ్లు..చట్టసభలను విస్తరించాలి. భారతీయులకు మరింత ప్రాతినిధ్యం ఉండేలా సంస్కరించాలి. ఉన్నతోద్యోగాలలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షను ఇంగ్లండ్తోపాటు భారతదేశంలోనూ నిర్వహించాలి. న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుంచి వేరుచేయాలి. స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి. రైతులకు అధిక పన్నుల నుంచి విముక్తి కల్పించాలి. సైన్యం మీద ఖర్చును తగ్గించుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటుచేసుకునే స్వేచ్ఛ ఉండాలి.
ఇక తమ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించడానికి మితవాదులు విజ్ఞాపనలు, తీర్మానాలు, సమావేశాలు, కరపత్రాలు, మెమొరాండమ్లు, ప్రతినిధులను పంపించడం లాంటి మార్గాలను ఎంచుకున్నారు. అయితే వారి రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా విద్యావంతులకే పరిమితం
అయిపోయాయి.
21. అతివాదుల సారథ్యం.. స్వదేశీ ఉద్యమం
స్వదేశీ ఉద్యమాన్ని లాంఛనంగా 1905 ఆగస్టు 7న ప్రకటించారు. కలకత్తా టౌన్హాల్లో జరిగిన సమావేశంలో ‘బహిష్కరణ’ తీర్మానాన్ని ఆమోదించారు. బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న అమలులోకి వచ్చింది.
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా.. కలకత్తాలో హర్తాళ్కు బెంగాలీ నాయకులు పిలుపునిచ్చారు. ఒకరోజు మౌనవ్రతం పాటించాలని ప్రకటించారు. రోజంతా ఉపవాసం ఉన్నారు. ఎవరి ఇళ్లలోనూ వంట చేసుకోలేదు. ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపిస్తూ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. బెంగాలీలు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని సంఘీభావాన్ని చాటుకున్నారు. ఈ ఉద్యమం కాంగ్రెస్ కొత్తతరాన్ని బాగా ఆకట్టుకుంది. లోకమాన్య బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ (లాల్, బాల్, పాల్), అరబింద ఘోష్ నాయకత్వంలో భారత జాతీయోద్యమంలో కొత్తతరం అతివాదులుగా ప్రసిద్ధిచెందారు. స్వదేశీ ఉద్యమం దాదాపు ఆరేండ్లపాటు కొనసాగింది. 1905లో బెంగాల్ విభజన అనంతరం మరింత ఉధృతంగా మారింది. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ స్వదేశీని అధికారికంగా ఆమోదించింది. జానపద సంగీతం, చిత్రకళ, బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబింప జేయడంతో దీనిని సాంస్కృతిక ఉద్యమంగా కూడా పరిగణిస్తారు. సాంస్కృతిక ఔన్నత్యం, రాజకీయ ఉద్యమాలతో పాటు ఆర్థికంగా కూడా స్వదేశీ అవసరమని, మనదైన భారతీయ విద్యా విధానం కూడా అవసరమని అప్పటి నాయకులు ప్రబోధించారు. ఈ నేపథ్యంలో బెంగాలీ మధ్య తరగతి మేధావి వర్గం సహకారంతో ఈ ఉద్యమం ఊపందుకుంది. తిలక్, లజపతిరాయ్ ప్రకారం స్వదేశీ ఉద్యమం అంటే ‘స్వయం నిశ్చయం’, ‘స్వయం సహకారం’, ‘స్వావలంబన’ దిశగా జరిగిన శిక్షణ. ఇలా ఉంటే దాదాభాయి నౌరోజీ, బిపిన్చంద్ర పాల్ రచనల ద్వారా కూడా.. ఆంగ్లేయుల వలస పాలనలోని దేశ ఆర్థిక దుస్థితికి విరుగుడుగా స్వదేశీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతేకాకుండా, తర్వాత కాలంలో భారత జాతీయోద్యమం దిశను నిర్దేశించింది స్వదేశీ ఉద్యమమే.
22. నోబెల్ ‘ఆత్మవిశ్వాస’ పురస్కారం
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్.. 1861 మే 7న జన్మించాడు. కవి, రచయిత, నాటకకర్త, గేయ రచయిత, తాత్వికుడు, సంఘ సంస్కర్త, చిత్రకారుడుగా టాగూర్ ప్రతిభ బహుముఖీనమైంది.
1913లో గీతాంజలి కావ్యానికి నోబెల్ పురస్కారం పొందడం ద్వారా భారతీయ సాహిత్యంలో తొలిసారి ఆ గౌరవం పొందిన మొదటి ఐరోపాయేతర వ్యక్తిగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాదు ఈ గుర్తింపు పొందిన మొదటి ఆసియా వాసి కూడా ఆయనే. 103 కవితల సంకలనమైన ‘గీతాంజలి’ని టాగూర్ బెంగాలీ భాషలో రచించాడు. ఇది 1910లో ప్రచురితమైంది. వీటినే ‘గీతాంజలి: సాంగ్ ఆఫరింగ్స్’ పేరుతో ఇంగ్లిష్లోకి అనువదించాడు. ప్రముఖ ఆంగ్ల కవి విలియం బట్లర్ యీట్స్ పరిచయ వాక్యాలతో ఈ పుస్తకం 1912లో ప్రచురితమైంది. గీతాంజలి కవితలకు మధ్యయుగాల భారతదేశపు భక్తి ఉద్యమం నేపథ్యంగా నిలిచింది. వీటికి ఆయనే సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో ప్రేమ ప్రధాన అంశంగా కనిపిస్తుంది. కొన్ని కవితలు మాత్రం ఆధ్యాత్మిక భావనలు, ఇహలోక కోరికల మధ్య అంతర్ సంఘర్షణలా అనిపిస్తాయి. ఇందులో దాగిన కాల్పనికతకు ప్రేరణ ప్రకృతి నుంచి తీసుకున్నాడు టాగూర్.
వ్యాకులత, నిశ్శబ్దం ఇందులో ప్రధానమైన ఉద్వేగాలుగా కనిపిస్తాయి. అయితే, ‘గీతాంజలి’ టాగూర్ రాసిన అతిగొప్ప కావ్యం మాత్రం కాదనే విమర్శకులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, గీతాంజలికి నోబెల్ పురస్కారం రావడం అన్నది.. బ్రిటిష్ పాలనలో న్యూనతలో కూరుకుపోయిన భారతీయులకు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించింది. భారతీయ సాహితీవేత్తలు ప్రపంచ స్థాయి కలిగిన వారని నిరూపించింది. తర్వాత రెండు దశాబ్దాలలోపేవిజ్ఞానశాస్త్ర రంగంలో చంద్రశేఖర వెంకటరామన్కు నోబెల్ బహుమతి దక్కింది. ఆ తర్వాత కాలంలో హర్గోవింద్ ఖురానా, మదర్ థెరెస్సా, అమర్త్య సేన్, సుబ్రమణ్యం చంద్రశేఖర్, వెంకటరామన్ రామకృష్ణన్, కైలాష్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ మనదేశానికి వివిధ రంగాల్లో నోబెల్ పురస్కారాన్ని సంపాదించి పెట్టారు. ఒకవేళ,‘గీతాంజలి’కి నోబెల్ పురస్కారం దక్కకపోయి ఉంటే.. జపాన్ కాకుండా మిగిలిన ఆసియా దేశాల్లా భారత్ కూడా ఆ పురస్కారానికి ఆమడ దూరంలో ఉండిపోయేదేమో!
23. జనగణమన అధినాయక జయహే…
‘జనగణమన అధినాయక జయహే..’ గీతాన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీలో రచించాడు. అయితే సంస్కృత ప్రభావం ఉన్న బెంగాలీ మాండలికమైన ‘సాధుభాష’ను ఎంచుకోవడం విశేషం.
జనగణమనకు ఎన్నో ప్రత్యేకతలు. ఇందులో ప్రయోగించిన పదాలు కూడా దేశ వ్యాప్తంగా అన్ని భాషల వారికి బాగా పరిచయం ఉన్నవి కావడం గమనార్హం. అందుకే అందరి ఆమోదాన్ని, ఆదరణను పొందగలిగింది. ఈ గీతాన్ని భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల సందర్భంగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో తొలిసారిగా ఆలపించారు. దీనిని 1912లో తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ శీర్షికన ప్రచురించారు. ఇక కలకత్తాకు బయట ‘జనగణమన’ను చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్న బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో 1919 ఫిబ్రవరి 28న స్వయంగా రవీంద్రనాథ్ టాగూర్ ఆలపించారు. దేశం స్వాతంత్య్రం పొందిన 1947 ఆగస్టు 14 మధ్యరాత్రి రాజ్యాంగ సభ తొలిసారిగా ఒక సార్వభౌమ సంస్థగా సమావేశమైంది. ఆ సమావేశాన్ని ‘జనగణమన’ ఆలాపనతోనే ముగించారు. ‘జనగణమన’ను భారతదేశ జాతీయగీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే, తగ్గించిన భాగాన్ని పాడటానికి 20 సెకండ్లు పడుతుంది. జాతీయగీతం దేశ ప్రజలకు గర్వకారణం. జాతీయగీతానికి సంబంధించిన నైతిక నియమావళిని జాతి గౌరవ చట్టం, 1971లో పొందుపరచారు.
ఒక దేశం తన స్వతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని బలంగా ప్రకటించే ప్రతీకల్లో అతి ప్రధానమైనది జాతీయగీతం. భారతదేశంలో విభిన్నమైన భాషల వాళ్లు నివసిస్తున్నప్పటికీ జనగణమనను అందరూ సులువుగా అర్థం చేసుకుంటారు. దేశానికి వెన్నెముకగా నిలిచే సంప్రదాయాలు, విలువలను జాతీయగీతం చక్కగా అందిస్తుంది. భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్క జనగణమన మాత్రమే కాదు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ సోనార్ బంగ్లా’ కూడా టాగూర్ రాసిందే. అంతేకాదు శ్రీలంక జాతీయగీత రచనలోనూ రవీంద్రుడి ముద్ర కనిపిస్తుంది.
24. ద్రవిడ సిద్ధాంత కర్త.. పెరియార్ రామస్వామి
పెరియార్ ఈరోడ్ వెంకటప్ప రామస్వామి నాయకర్ 1879లో ఈరోడ్లో జన్మించాడు. ఆత్మగౌరవ ఉద్యమం, తమిళుల అస్తిత్వం, ఆత్మగౌరవానికి పెరియార్ను ప్రతీకగా చెప్పుకొంటారు. ద్రవిడుల కోసం ద్రవిడ నాడు ప్రత్యేకంగా ఉండాలని ఆయన కాంక్షించాడు. ద్రవిడ కజగం (డీకే) పేరుతో ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.
పెరియార్ కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ విధానాలు తనకు సరిపడక పోవడంతో 1925లో ఆ పార్టీకి రాజీనామా చేశాడు. జస్టిస్ పార్టీతో అనుబంధం పెంచుకున్నాడు. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ రెండూ సామాజిక, ఉద్యోగ రంగాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవి కావడం గమనార్హం. జస్టిస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1924లో వైకోమ్ సత్యాగ్రహంతో పెరియార్ పేరు తమిళనాడంతా వ్యాపించింది. దీనికి గుర్తుగా ఆయనను ‘వైకోమ్ వీరుడు’ అనీ పిలుస్తారు.
అలా 1920, 30లలో పెరియార్ కాంగ్రెస్ పార్టీని, తమిళనాడులో ఛాందస
వాదాన్ని సవాలుచేశాడు. కులాన్ని, సంస్కృతాన్ని ఉత్తరాది ఆర్య బ్రాహ్మణులే తమిళనాడుకు తీసుకువచ్చారని వాదించాడు. 1930లలో తమిళనాడులో కాంగ్రెస్ మంత్రివర్గం హిందీని రుద్దడానికి ప్రయత్నించింది.
పెరియార్ దానిని తమిళ అస్తిత్వంపై దాడిగా అభివర్ణించాడు. అలా పెరియార్ కనుసన్నలలో తమిళ జాతి ఉనికిని చాటేందుకు ద్రవిడ ఉద్యమం ఒక పోరాటంగా రూపొందింది. 1940లో పెరియార్ ద్రవిడ కజగాన్ని స్థాపించాడు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ప్రాంతాలతో ద్రవిడ నాడు ప్రత్యేకంగా ఉండాలని ద్రవిడ కజగం భావించింది. అలా ద్రవిడ ఉనికిని, ద్రవిడ భాషలను పునాదిగా చేసుకున్నాడు. తమిళనాడులో ఈ ఆలోచనలు రాజకీయ సంస్కృతిని రూపుదిద్దడంలో పెను ప్రభావం చూపాయి. అవి ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. 94 ఏండ్ల వయసులో.. 1973లో పెరియార్ మరణించాడు. ఆయనను ఆసి యా సోక్రటీస్గా ప్రశంసించింది యునెస్కో సంస్థ. సామాన్య తమిళుడికి పెరియార్ అంటే ఒక సిద్ధాంతం. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, భాషాభిమానం.. ఈ మూడు అంశాలకూ ఆయన కట్టుబడ్డాడు. సంఘ సంస్కర్తగా సామాజిక, సాంస్కృతిక, లింగ అసమానతల మీద దృష్టిసారించాడు. అయితే కాలక్రమంలో పెరియార్ ఆలోచనలు పలుచబడిపోయాయనేది ఎంతోకొంత వాస్తవమే.
25. ఆనకట్టల వ్యతిరేక పోరాటం
ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్టల వ్యతిరేక ఆందోళన ఎక్కడ జరిగిందనే విషయం భారతదేశం సహా, బయటి ప్రపంచానికి కూడా అంతగా తెలియకపోవచ్చు. అది మనదేశంలోనే జరిగింది.
1920లలో మహారాష్ట్రలో పుణె సమీపంలోని ముల్శీ గ్రామస్తులు ప్రభుత్వ అండతో టాటాలు నిర్మించ తలపెట్టిన ఆనకట్టకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీనికి ఇంగ్లండ్లో చదువుకున్న జాతీయవాది పాండురంగ మహాదేవ బాపట్ (సేనాపతి బాపట్) నాయకత్వం వహించాడు. ఆయనకు స్థానికులలో ఎంతో గౌరవం ఉండేది. ఆనకట్ట నిర్మాణంతో నీళ్లలో మునిగిపోతున్న తమ భూములను కాపాడుకునేందుకు పోరాటం చేయాలనుకున్న రైతులతో మమేకమై ముందుకు సాగిపోయాడు సేనాపతి బాపట్.
అలా ప్రపంచంలోనే మొదటి ఆనకట్ట వ్యతిరేక ఉద్యమం.. ముల్శీ ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను శ్రద్ధగా నిర్మించడంతో మొదలవుతుంది. ముల్శీ లోయ నీట మునిగిపోయే ప్రమాదాన్ని నివారించే లక్ష్యంతో ఈ పోరాటం కొనసాగింది. తమ లక్ష్య సాధన కోసం ముల్శీ రైతులు నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ప్రదర్శనలు నిర్వహించారు. ఆనకట్ట వ్యతిరేక పోరాటం అంటే కేవలం ముల్శీ ప్రజలు, టాటాల మధ్య కాదని, రెండు భిన్నధ్రువాల ఆర్థిక వ్యవస్థల మధ్య పోరాటంగా చూడాలని అంటారు. ఒక పథకం ప్రజలకు ప్రయోజనాలను కలిగిస్తుందని రుజువులు చూపించలేకపోతే, ఎవ్వరి భూమినీ సేకరించే హక్కు ఉండదనే సత్యాన్ని ముల్శీ సత్యాగ్రహం నిరూపించింది. జాతి ప్రమాదంలో పడినప్పుడు, జాతీయ విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ చేయవచ్చు. అయితే ముల్శీ దగ్గర ఆనకట్ట విషయంలో అలాంటి అత్యవసర పరిస్థితి ఏదీలేదు. అందుకని ఆ భూములు ఒక ప్రైవేటు కంపెనీకి ప్రయోజనం కలిగించేలా నిర్ణయం తీసుకోవడాన్ని తమకు జరుగుతున్న అన్యాయంగా ప్రజలు భావించారు. సాగు భూములను తీసుకునే విషయంలో న్యాయంగా వ్యవహరించకపోతే జరిగే పరిణామాలకు తొలి ఉదాహరణగా ముల్శీ సత్యాగ్రహం నిలిచిపోతుంది.
26. దేశమాత ప్రతీక… అబనీంద్రనాథ్ టాగూర్ చిత్రం
భారతమాత చిత్రపటం అనగానే అభయముద్రతో, జాతీయ పతాకంతో సింహవాహిని అయిన స్త్రీమూర్తి.. భారత ఉపఖండం నేపథ్యంతో దర్శనమిస్తుంది. కాగా, భారతమాత భావన తొలిసారిగా ప్రముఖ బెంగాలీ నవలా రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ ప్రసిద్ధ నవల ‘ఆనందమఠం’లో కనిపిస్తుంది.
ఒకరకంగా భారతమాతను దుర్గాదేవికి ప్రతిరూపంగానే భావిస్తారు. 1911 వరకు కలకత్తా బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఉండేది. అంతేకాకుండా ఆ నగరం బెంగాల్ (పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ కలిసిన ప్రాంతం) ప్రెసిడెన్సీ రాజధాని కూడా. అందువల్ల రాజకీయంగా, సాంస్కృతికంగా కలకత్తా సహా బెంగాల్ అంతా చైతన్యంతో కూడిన వాతావరణమే దర్శనమిచ్చేది. రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, హెన్రీ వివియన్ డెరోజియో, బంకించంద్ర ఛటర్జీ, ఆనందమోహన్ బోస్, స్వామి వివేకానంద, సురేంద్రనాథ్ బెనర్జీ ఇలా ఆ రాష్ట్రం నుంచి జాతీయ భావాలు ఉన్న నాయకులే ఎక్కువగా కనిపించేవారు. దాంతో భారతదేశంలో తమ పరిపాలనకు బెంగాల్ నుంచే సవాళ్లు ఎదురవుతాయని గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ భావించాడు. అంతే బెంగాల్ విభజనకు ‘విభజించి పాలించు సిద్ధాంతం’ పాచికగా విసిరాడు. 1905 ఆగస్టులో బెంగాల్ను తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజించాడు. దీనికి విశాల ప్రాంతం, అధిక జనాభా సాకుగా చూపించారు. కానీ, ప్రధాన కారణం మాత్రం హిందువులు అధికంగా ఉండే పశ్చిమ బెంగాల్, ముస్లింలు ఎక్కువగా ఉండే తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్) ను మతపరంగా చీల్చే కుట్రగా కనిపిస్తుంది.
సరిగ్గా ఈ సమయంలోనే ప్రముఖ చిత్రకారుడు అబనీంద్రనాథ్ టాగూర్లో భారతదేశ వారసత్వాన్ని నిరూపించడానికి కళను ఉపయోగించుకోవాలన్న కోరిక చిగురించింది. అలా అదే సంవత్సరంలోనే భారతమాత చిత్రం ఆవిర్భవించింది. ఆయన చిత్రకళ మీద అజంతా, పహాడీ, మొగల్ సూక్ష్మ చిత్రకళ ప్రభావం కనిపిస్తుంది. అబనీ టాగూర్ గీసిన భారతమాత చేతిలో… తెల్లటి వస్త్రం, పుస్తకం, వరికంకులు, రుద్రాక్షమాల దర్శనమిస్తాయి. ఇవి వరసగా బట్టలు, విద్య, ఆహారం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. భారతమాతకు సంబంధించిన ఈ ప్రతీకలు హిందువులు, ముస్లింలు రెండు మతాలవారినీ ఆకట్టుకున్నాయి. ఈ విధంగా తన చిత్రకళ ద్వారా అబనీంద్రనాథ్ టాగూర్ స్వదేశీ ప్రతీకలతో జాతీయ భావాలను స్పష్టంగా ప్రదర్శించగలిగాడు.
27. దుర్భరం సెల్యులార్ జైలు జీవితం
ఇక్కడ జైలు జీవితం అత్యంత అమానవీయంగా, క్రూరంగా ఉండేది. అర్ధాకలితో మాడ్చేవారు. కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు. తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు.
బ్రిటిష్ పాలనలో కర్కశత్వానికి ప్రతీకగా నిలిచే కట్టడాలలో ప్రధానమైంది, ప్రముఖమైంది అండమాన్ సెల్యులార్ జైలు. ఆ జైలు ఓ బలిపీఠం. భారత్, బర్మా దేశాల్లో తీవ్రమైన నేరాలకు శిక్షపడిన ఖైదీల కోసం బెన్కోలెన్ (1787లో మొదటిది), మలక్కా, సింగపూర్, అరకాన్, టెనాస్సెరిమ్లో శిక్షా శిబిరాలు ఏర్పాటుచేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటిలో చివరిదే అండమాన్. భారత గడ్డపైన మాత్రం ఇదే మొదటిది. 1857 సిపాయీల తిరుగుబాటు తర్వాత విప్లవకారుల ద్వీపాంతర జైలుశిక్షకు అండమాన్ను ఎంచుకున్నారు. అలా, తొలి విడతగా.. 1858 మార్చి 10న రాజకీయ ద్రోహులుగా 200 మంది దక్షిణ అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు చేరుకున్నారు. అప్పటినుంచి స్వతంత్రం వచ్చేవరకు కొన్ని వేలమంది స్వాతంత్య్ర సమరయోధులు దుర్భరమైన జీవితం అనుభవించారు అక్కడ.ఉద్యమ ఖైదీలు బ్రిటిష్వారికి వ్యతిరేకంగా విప్లవభావాలు వ్యాప్తిచేస్తారేమో అనే సందేహంతో అండమాన్ సెల్యులార్ జైలు నిర్మాణంలో సకల జాగ్రత్తలూ తీసుకున్నారు.
దూరందూరంగా 693 గదులతో (సెల్స్తో) సెల్యులార్ జైలు 1906లో అందుబాటులోకి వచ్చింది. అలీపూర్ బాంబ్ కేసు, నాసిక్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, బనారస్ కుట్ర కేసు, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు, ఢాకా కుట్ర కేసు వగైరా కేసులు, మలబారుకు చెందిన మోప్లా ఆందోళనకారులు, ఆంధ్ర నుంచి రంప విప్లవకారులు, మణిపూర్ స్వాతంత్య్ర సమరయోధులను అండమాన్లోనే ఉంచారు. ఇక్కడ జైలు జీవితం అత్యంత అమానవీయంగా, క్రూరంగా ఉండేది. ఖైదీలను అర్ధాకలితో మాడ్చేవారు. కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు. తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు. ఆ త్యాగాలకు గుర్తుగా సెల్యులార్ జైలును 1979లో జాతీయ స్మారకంగా ప్రకటించింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం.
28. స్ఫూర్తిమంత్రం ‘వందేమాతరం’
భారత స్వాతంత్య్ర పోరాటానికి మారుపేరుగా, దాదాపు 50 ఏండ్లపాటు స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిమంత్రంగా నిలిచిన గేయం.. వందేమాతరం. ఈ గేయాన్ని ప్రఖ్యాత బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర ఛటోపాధ్యాయ సంస్కృతంలో 1870లో రచించాడు. భారత స్వాతంత్య్ర పోరాటంలో జాతీయవాదుల స్ఫూర్తిమంత్రంగా కీలకపాత్ర పోషించిన వందేమాతరం గేయాన్ని ‘జాతీయ గేయం’గా గౌరవించాలని రాజ్యాంగ సభ అధ్యక్ష హోదాలో డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న ప్రకటించారు. అలా జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన హోదాను దక్కించుకుంది. బెంగాల్లో తలెత్తిన సన్యాసుల ఉద్యమం నేపథ్యంగా రాసిన ‘ఆనందమఠం’ నవలలో బంకిం చంద్ర ఈ గేయాన్ని చేర్చాడు. 1896 కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వందేమాతరాన్ని రవీంద్రనాథ్ టాగూర్ తొలిసారిగా ఆలపించాడు.
29. సంతాల్ ఆదివాసీల పోరుబాట…
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా కొండప్రాంతాల్లో నివసించే ప్రధాన తెగ సంతాల్. సంతాలీ మాట్లాడతారు. వేట, ఆహార సేకరణ ప్రధాన వృత్తి. అప్పటివరకూ జరిగిన రాజకీయ పరిణామాలేవీ వీరి జీవనం మీద అంతగా ప్రభావం చూపలేదు. కానీ ప్లాసీ యుద్ధం తర్వాత సంతాలుల నివాస ప్రాంతాలు బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్లాయి. 1793లో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారీ విధానం ప్రవేశపెట్టింది. దాంతో ఈ ప్రాంతాలమీద జమీందారుల ఆధిపత్యం పెరిగింది. వడ్డీ వ్యాపారులూ ప్రవేశించారు. అన్ని రకాలుగా సంతాలులు దోపిడీకి గురికావడం మొదలైంది. దాంతో 1855 నాటికి బ్రిటిష్వారు, వారి ఏజెంట్ల పట్ల సంతాలులకు ద్వేషం పెరిగిపోయింది. ఆ సంవత్సరం సిదు ముర్ము, కన్హు ముర్ము నేతృత్వంలో బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతాల వారిపై పోరు మొదలుపెట్టారు. కానీ, బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాల ముందు సంతాలుల విల్లంబులు నిలువలేక పోయాయి. బ్రిటిష్ సైనికుల చేతిలో 20వేల సంతాలులు మరణించినట్లు తెలుస్తున్నది. 1856 నాటికి ఉద్యమం కనుమరుగైంది.
30. ఆధునిక విద్యా వ్యవస్థ
బ్రిటిష్ సామ్రాజ్యం రూపుదిద్దుకుంటున్న దశలో భారతదేశంలో సంప్రదాయ విద్యా వ్యవస్థ ఆచరణలో ఉండేది. 1813లో భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధి కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 1835లో విలియం బెంటింక్ ప్రభుత్వం మెకాలే కమిషన్ను నియమించింది. ఆయన సూచనల మేరకు బ్రిటిష్వారికి విధేయులుగా ఉండే విద్యా విధానానికి అంకురారోపణ జరిగింది. కాగా, 1854లో వుడ్స్ నివేదిక మేరకు 1857లో మూడు ప్రెసిడెన్సీ నగరాలైన బొంబాయి, కలకత్తా, మద్రాసులో విశ్వవిద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది భారతీయులు ఆధునిక విద్యను అభ్యసించారు. ఫలితంగా కొత్త తరం న్యాయవాదులు, సివిల్ సర్వెంట్లు, పాత్రికేయులు, ఆచార్యుల సృష్టి జరిగింది. అదే బ్రిటిష్ వారినుంచి భారతదేశ విముక్తి కోసం 1885లో కాంగ్రెస్ స్థాపనకు ముఖ్య కారకంగా నిలిచింది. మధ్యతరగతి మేధావులే ఆధునిక భారతదేశానికి అవసరమైన దార్శనికతను ప్రసాదించారు.
31. జాతీయ పతాకం పరిణామ క్రమం
భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న స్వరాజ్ పతాకాన్నే భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్నమార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని గ్రహించారు. జెండా పరిణామ క్రమం ఇదీ…
మొదటి జెండా: 1906 ఆగస్టు 7న కలకత్తా నగరం పార్సీ బగాన్లో ఎగరవేశారు. ఈ పతాకంలో పైనుంచి కిందికి ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు పట్టీలు ఉండేవి. ఆకుపచ్చ పట్టీలో 8 రాష్ర్టాలకు గుర్తుగా 8 కమలం పూలు, పసుపుపచ్చ పట్టీలో ‘బందేమాతరం’ అని ఉండేవి. ఎరుపురంగు పట్టీలో ఎడమ వైపు చంద్రుడు, కుడివైపు సూర్యుడిని ఉంచారు.
భికాజీ కామా పతాకం: 1907లో మొదటి దానికి కొంచెం మార్పులు చేసి భికాజీ కామా రెండో జెండా రూపొందించాడు. దీనిని అదే సంవత్సరం పారిస్లో భారతీయ విప్లవకారుల మధ్య ఎగరవేశారు. పై పట్టీలో ఎనిమిదికి బదులుగా ఏడు కమలం పూలు, ఎరుపు స్థానంలో కాషాయాన్ని ఉపయోగించారు. పైనుంచి కిందికి కాషాయం, పసుపుపచ్చ, ఆకుపచ్చ రంగులు వరసగా ఉంటాయి.
హోంరూల్ పతాకం: హోం రూల్ ఉద్యమంలో భాగంగా అనీబిసెంట్, లోకమాన్య తిలక్ కొత్తజెండా రూపొందించారు. ఇందులో ఒక రంగు తర్వాత మరో రంగు వచ్చే ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ పట్టీలను కలిగి ఉన్నాయి. వీటిపై సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలు ఉండేవి. పైభాగంలో ఒక మూలన చంద్రరేఖ, మరో మూలన యూనియన్ జాక్ (బ్రిటిష్ ఇండియా పతాకం) ఉండేవి.
గాంధీజీ త్రివర్ణ పతాకం:
1921లో మధ్యలో చరఖా గుర్తుతో త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ ప్రతిపాదించాడు. ఇందులో వర్ణాలు ప్రధాన మతాలకు ప్రతీకలుగా ఉండాలనుకున్నాడు. తర్వాత రంగులు లౌకికవాదం ప్రతిబింబించేలా ఉండాలని భావించాడు. ఈ పతాకంలో దిగువన ఉన్న ఎరుపు త్యాగాన్ని, మధ్యలో ఉన్న ఆకుపచ్చ ఆశను, పైన ఉన్న తెలుపు శాంతికి ప్రతీకలు.
పింగళి వెంకయ్య పతాకం: ప్రస్తుత పతాకానికి చాలా దగ్గరగా ఉన్నది 1923లో ఉనికిలోకి వచ్చింది. దానిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించాడు. ఇందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. తెలుపు భాగంలో చరఖా ఉండేది. దీనిని 1923 ఏప్రిల్ 13న నాగపూర్లో ఎగరవేశారు. దీనికి స్వరాజ్ పతాకం అని పేరుపెట్టారు.
32. గదర్ ఉద్యమం
20వ శతాబ్దం తొలినాళ్లలో అమెరికా, కెనడా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం చేయడానికి లేవనెత్తిన ఉద్యమమే గదర్ ఉద్యమం. ‘గదర్’ అనే ఉర్దూ పదానికి అర్థం.. తిరుగుబాటు.
1900 తొలినాళ్లలో గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో చాలామంది బ్రిటిష్ పాలన తప్పించుకోవడానికి పంజాబ్ నుంచి వలసవెళ్లిన రైతులే. వారు అమెరికా, కెనడా దేశాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. 1913 జూలై 15న గదర్ పార్టీని స్థాపించారు. వారి లక్ష్యం మాత్రం భారతదేశాన్ని బ్రిటిష్ వారినుంచి విముక్తం చేయడమే. గదర్ పార్టీ స్థాపనలో భాయీ పరమానంద్, విష్ణు పింగ్లే, కర్తార్ సింగ్ సరభా, అబ్దుల్ హఫీజ్ బర్కతుల్లా, రష్ బిహారీ బోస్, గులాబ్ కౌర్ ముఖ్య నేతలు. గదర్ పార్టీ ప్రధాన కేంద్రం అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ఫ్రాన్సిస్కో. వారు ‘హిందుస్థాన్ గదర్’ పేరుతో ఉర్దూ, పంజాబీ భాషల్లో ఒక వార్తాపత్రికను కూడా ప్రారంభించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలకు సిద్ధపడిన వీరుల కథలను ఈ పత్రికలో ప్రముఖంగా ప్రచురించేవారు. విదేశాల్లో ఉన్న భారతీయులను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం చేయడమే వారి ముఖ్యలక్ష్యం.
1914 మే 23న ‘కొమగటమారు’ నౌక కెనడాలోని వాంకూవర్ రేవులో లంగరువేసింది. అందులో బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చిన భారతీయులు 376 మంది ఉన్నారు. వారికి కెనడా ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతి నిరాకరించింది. దాంతో 1914 సెప్టెంబర్ 27న ‘కొమగటమారు’ కలకత్తా దగ్గర లంగరువేసింది. వారిలో గదర్ నాయకులు ఉన్నారని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆందోళన చెలరేగింది. పోలీసు కాల్పులలో 20 మంది మరణించారు. ఇది గదర్ విప్లవకారులకు ఆగ్రహం తెప్పించింది. అంతకుముందే 1914 జూలై 28న మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. దీనిని కూడా గదర్ ఉద్యమకారులు అవకాశంగా తీసుకున్నారు. ఎంతోమంది గదర్ సభ్యులు విడతలుగా పంజాబ్కు తిరిగివచ్చారు. బ్రిటిష్ వారు భద్రత కట్టుదిట్టం చేయడంతో గదర్ నాయకులు సముద్ర తీరంలో నౌకలు దిగీదిగడంతోనే అరెస్టు చేసింది. కొంతమందికి ఉరిశిక్ష పడింది. దాంతో పార్టీకి దిశానిర్దేశం కరువైంది. ఉద్యమమూ నిలిచిపోయింది. ఆ స్ఫూర్తి ఆ తర్వాత కూడా కొనసాగింది.
33. ఆర్యసమాజం పునరుజ్జీవ వాదం
ఆర్యసమాజాన్ని 1875లో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించాడు. ఆయన జ్ఞానానికి మూలం వేదాలే అని నమ్మాడు. ‘వేదాలకు మళ్లండి’ అని పిలుపునిచ్చాడు. విగ్రహారాధన, బాల్యవివాహాలు, కులవ్యవస్థను వ్యతిరేకించాడు. కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. ఇతర మతాలలోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి మార్చడానికి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. తన ఆలోచనలను ‘సత్యార్థ ప్రకాశ్’ అనే గ్రంథంలో పొందుపరిచాడు. ఆర్యసమాజం బొంబాయిలో స్థాపించినా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రభావాన్నే చూపించింది. సంఘ సంస్కరణతో పాటు విద్యా రంగంలోనూ ఆర్యసమాజం విశేష కృషిచేసింది. భారతదేశంలో జాతీయవాదాన్ని పెంపొందించడంలోనూ ఆర్యసమాజం పాత్ర మరవలేనిది.
34. దేశ విభజనకు బీజం… లక్నో ఒప్పందం
దేశ విభజనకు బీజాలు 1916 నాటి లక్నో ఒప్పందంలో ఉన్నాయి. ఆ ఏడాది కాంగ్రెస్ వార్షిక సమావేశం లక్నోలో జరిగింది. ముస్లిం లీగ్ 1906లో ఢాకాలో ఏర్పాటైంది. అయితే, రోజురోజుకూ కాంగ్రెస్ ప్రాబల్యం పెరుగుతుండటం జీర్ణించుకోలేకపోయిన, బ్రిటిష్ పాలకులు లీగ్ను జాతీయవాదానికి విరుగుడుగా ఉపయోగించుకోవాలని అనుకున్నారు. దేశంలోని వివిధ మతాలను విభజించి పాలించే కుతంత్రానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే 1909 మార్లే మింటో సంస్కరణల్లో ముస్లింలకు ఎన్నికలలో ప్రత్యేక నియోజకవర్గాలను వలస పాలకులు ప్రసాదించారు. అంటే ముస్లింలు ఎన్నికల్లో పోటీచేసే చోట వారికి ముస్లింలే ఓటు వేస్తారన్నమాట. ఇక జిన్నా 1913లో ముస్లిం లీగ్లో చేరినప్పటికీ, 1916 నాటికి కాంగ్రెస్లోనూ సభ్యత్వం కలిగి ఉన్నాడు. అసలు ఆయన చొరవతోనే ముస్లిం లీగ్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. రెండు పార్టీల నాయకులు ఉమ్మడి సమావేశం నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికలలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను అంగీకరించింది. ఏది ఏమైనప్పటికీ, ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం మాత్రం హిందూ ముస్లిం ఐక్యత. కానీ, రెండు వర్గాల మధ్య ఐక్యత కొద్దికాలం మాత్రమే కొనసాగింది. తర్వాత కాలంలో లీగ్, కాంగ్రెస్ మధ్య దూరం బాగా పెరిగిపోయింది. చివరికి, దేశం భారత్, పాకిస్తాన్ రెండు భాగాలుగా విడిపోయింది. అలా, ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలకు అంగీకరించడం ద్వారా దేశంలో రెండు విభిన్న మతాలు ఉన్నాయని కాంగ్రెస్ ఒప్పుకొన్నట్లయిందని విమర్శకుల వాదన.
35. యువతరం త్యాగాలు…
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో శాంతియుత పోరాటం జరిగింది. అయితే 20వ శతాబ్దం తొలినాళ్ల నుంచి ఆవేశపూరితులైన యువకులు ఆంగ్లేయ అధికారులు, వారి సానుభూతిపరులపై హత్యాయత్నాలు చేయడం, సామ్రాజ్యవాద వ్యవస్థలను ధ్వంసం చేయడం మొదలైన చర్యలకు సిద్ధపడ్డారు. ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అనేది వారి విధానం. 1907లో బెంగాల్లో క్రూరుడైన న్యాయమూర్తి కింగ్స్ఫర్డ్ను హత్యచేయడానికి ఖుదీరామ్ బసు, ప్రఫుల్ల చాకీ బాంబుదాడి చేశారు. ఇందులో న్యాయమూర్తి కాకుండా వేరే మహిళ ఒకరు మరణించారు. ప్రఫుల్ల చాకీ ఆత్మహత్యకు పాల్పడగా, ఖుదీరామ్ను ఉరితీశారు. ఇక 1911లో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్పిడి సందర్భంగా గవర్నర్ జనరల్ హార్డింగ్పైనే బాంబుదాడి జరిగింది. ఆయన తప్పించుకున్నాడు. ఈ కేసులో భాయీ బాలముకుంద్, అవధ్ బిహారీ, వసంత్ విశ్వాస్, అమీర్ చంద్కు ఉరిశిక్షలు పడ్డాయి. ఒరిస్సాలోని బాలాసోర్లో బాఘా జతిన్ (జతీంద్రనాథ్ ముఖర్జీ) పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు విప్లవ కార్యకలాపాలకు విరామం ఏర్పడింది.
36. హోం రూల్ ఉద్యమం
ఉత్తర భారతదేశంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తదితరులు హోం రూల్ బాధ్యతలు తలకెత్తుకున్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్నసమయంలో ప్రభుత్వం అనీబిసెంట్, జార్జి అరుండేల్, బి.పి.వాడియాను నిర్బంధించింది. రాజకీయ కార్యకలాపాలలో విద్యార్థులు పాల్గొనకూడదని ఆజ్ఞలు జారీచేసింది.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయత ప్రకటించారు. దానికి ప్రతిఫలంగా స్వాతంత్య్రం ఇవ్వాలని మేడమ్ అనీబిసెంట్ ప్రకటించింది. 1916 సెప్టెంబర్ 15న మద్రాసులో హోం రూల్ లీగ్ను స్థాపించింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం కృషిచేసింది. అదే సమయంలో బర్మాలోని మాండలేలో కారాగార శిక్ష పూర్తిచేసుకుని వచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్కు దేశంలో ఒకరకమైన నిస్పృహతో కూడిన వాతావరణం కనిపించింది. 1915లోనే “స్వపరిపాలనకు మేము అర్హులం కామా?” అని తిలక్ నినదించాడు. అనీబిసెంట్ కంటే ముందే 1916 ఏప్రిల్లోనే తిలక్ కూడా మరో హోం రూల్ లీగ్ను స్థాపించాడు. అయితే తిలక్ కార్యకలాపాలు బొంబాయి ప్రావిన్స్, మధ్య ప్రావిన్సులకు పరిమితం. మిగతా దేశంలో అనీబిసెంట్ లీగ్ విస్తరించింది. మహమ్మద్ ఆలీ జిన్నా సైతం హోం రూల్ ఉద్యమంలో చేరడం గమనార్హం. హోం రూల్ సిద్ధాంతాల ప్రచారానికి అనీబిసెంట్ ‘న్యూ ఇండియా’, ‘కామన్వీల్’ పత్రికలు ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో అప్పటికే దివ్యజ్ఞాన సమాజం శాఖలు ఉండటంతో హోం రూల్ ప్రచారం సులువైపోయింది. ఉత్తర భారతదేశంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తదితరులు హోం రూల్ బాధ్యతలు తలకెత్తుకున్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రభుత్వం అనీబిసెంట్, జార్జి అరుండేల్, బి.పి.వాడియాను నిర్బంధించింది. రాజకీయ కార్యకలాపాలలో విద్యార్థులు పాల్గొనకూడదని ఆజ్ఞలు జారీచేసింది. అయితే అనీబిసెంట్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా సభలు జరిగాయి. ఇక 1918లో ఒక పరువునష్టం కేసు విషయమై లండన్కు వెళ్లడంతో తిలక్ హోం రూల్ లీగ్ కూడా కనుమరుగైపోయింది. అయితే 1920 నుంచి గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమాలకు కావాల్సిన దన్నును సమకూర్చడంలో హోం రూల్ ఉద్యమం విజయం సాధించింది. భారతదేశానికి స్వపరిపాలన ఇవ్వాలనే నినాదాన్ని ప్రజల్లో పాదుకొల్పగలిగింది.
37. ఆజాద్ హింద్ ఫౌజ్
తొలిదశ భారతీయ విప్లవకారుడు రశ్ బిహారీ బోస్, కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) ఏర్పాటుచేశారు. దానికి సుభాష్ చంద్ర బోస్ 1943 అక్టోబర్ 21న పునరుజ్జీవం ప్రసాదించాడు.
ఐఎన్ఏ స్థాపనలో జపాన్ సహకారం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున పోరాడేందుకు తూర్పు దేశాలకు భారతీయ సైనికులు వెళ్లారు. అయితే సింగపూర్ను జపాన్ ఆక్రమించుకున్న తర్వాత వారిలో దాదాపు 45,000 మంది యుద్ధఖైదీలుగా పట్టబడ్డారు. బ్రిటిష్ సైన్యాలు, వారికి సహాయంగా ఉన్న మిత్రపక్షాల సైన్యాలతో భారత జాతీయ సైన్యం దళాలు జపాన్ సైనికులతో కలిసి యుద్ధంలో పాల్గొన్నారు. అలా బర్మా, ఇంఫాల్, కోహిమాలో జరిగిన యుద్ధాల్లో ఐఎన్ఏ సైనికులు పోరాడారు. సింగపూర్లో 1943 అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ప్రొవిజనల్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. రాజ్యాధిపతి, ప్రధానమంత్రి, యుద్ధమంత్రిగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తనను తాను ప్రకటించుకున్నాడు. ఈ ప్రభుత్వాన్ని వివిధ దేశాలు గుర్తించాయి. దాంతో బ్రిటిష్ వలస పాలనలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకునేందుకు ఐఎన్ఏ బయల్దేరింది. అప్పటికే నేతాజీ భారత స్వాతంత్య్ర సమరంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి, విదేశాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా తెలుసు. అలా భారత జాతీయ సైన్యాన్ని ఆయన విజయవంతంగా నడపగలరని భావించారు. అంతేకాకుండా ఎంతోమంది పౌరులను కూడా ఐఎన్ఏ పోరాటంలో పాల్గొనే దిశగా స్ఫూర్తి నింపగలిగాడు. పైపెచ్చు తన వెంట నడవడానికి మహిళలను కూడా చైతన్య పరచగలిగాడు. ఈ క్రమంలోనే 1943 అక్టోబర్లో రాణి లక్ష్మీబాయి రెజిమెంట్ పేరుతో మహిళా పటాలం ఏర్పడింది. దీనికి లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించారు. వీటన్నిటికి మించి భారతీయులకు మద్దతు ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపాడు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిన జపాన్ అమెరికా మిత్రపక్షాలకు లొంగిపోయింది. దీంతో సింగపూర్ రేడియో నుంచి 1945 ఆగస్టు 15న భారత జాతీయ సైన్యం పాత్ర ముగిసిందని నేతాజీ ప్రకటించాడు. ఆ తర్వాత మూడు రోజులకు ఓ విమాన ప్రమాదంలో మరణించాడని అంటారు.
38. మహాత్ముడి ఆయుధం సహాయ నిరాకరణం
భారతీయుల్ని నిరాయుధుల్ని చేసే రౌలట్ చట్టం, జలియన్వాలా బాగ్ మారణకాండ, ఖిలాఫత్ నేపథ్యంలో భారతదేశానికి ఒక్క ఏడాదిలోపు స్వాతంత్య్రం వస్తుందనే హామీతో మహాత్మా గాంధీ 1920 ఆగస్టులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు.
బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, పదవులను త్యజించడం, స్థానిక సంస్థల సభ్యత్వాన్ని వదులుకోవడం, ఎన్నికలను బహిష్కరించడం, ప్రభుత్వ విధుల నుంచి విరమించుకోవడం, న్యాయస్థానాలు, ప్రభుత్వ విద్యాలయాలు, కళాశాలలను, విదేశీ వస్ర్తాలు, సరకులను బహిష్కరించడం, స్వదేశీ వస్ర్తాలు- ప్రత్యేకించి ఖద్దరును ధరించాలని గాంధీజీ పిలుపునిచ్చాడు. గాంధీజీ బ్రిటిష్ వారు ప్రసాదించిన బిరుదులను పరిత్యజించడంతో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైపోయింది. మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ తదితర నాయకులు తమ లాభదాయకమైన న్యాయవాద వృత్తిని పరిత్యజించారు. విద్యార్థులు బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలను వదిలిపెట్టారు. ఇలాంటి వారికోసం జాతీయ పాఠశాలలను స్థాపించారు. చట్టసభలకు ఎన్నికైన వాళ్లు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 1921లో జరిగిన ఎన్నికలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పాల్గొనలేదు. దేశమంతా సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం కనిపిస్తుండటంతో ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టింది. గాంధీజీ మినహా మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ తదితర జాతీయ నాయకులను జైళ్లకు తరలించింది.
కాంగ్రెస్ పార్టీ మీద నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశమంతటికీ స్వదేశీ సందేశం వ్యాప్తిచెందింది. దేశంలోని చాలా ఇండ్లలో చరఖాలతో ఖద్దరు వడకడం, ఖద్దరు ధారణ మామూలు విషయంగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విదేశీ వస్ర్తాలను దహనం చేశారు. ఇంత ఉధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమం 1922 ఫిబ్రవరి చౌరీచౌరా సంఘటనతో ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ వెంటనే మార్చి 10వ తేదీనాడు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసింది.రైతులు, కార్మికులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, మహిళలు… ఇలా ప్రతి ఒక్కరూ పాల్గొన్న నిజమైన తొలి ప్రజాపోరాటం సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమంతో భారతదేశం మారుమూల ప్రాంతాలకు కూడా జాతీయోద్యమం వ్యాపించింది.
39. తిరుగుబాటు నాయకుడు తురేబాజ్ ఖాన్
ఖాన్ 1859 జనవరి 8న కారాగారం నుంచి తప్పించుకున్నాడు. చివరికి జనవరి 24న తూప్రాన్ దగ్గర తురేబాజ్ ఖాన్ను చంపేశారని తెలుస్తున్నది. ఈ ద్రోహానికి పాల్పడింది తూప్రాన్ తాలూకాదార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్.
హైదరాబాద్ నగరంలో సిపాయీల తిరుగుబాటు అనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు తురేబాజ్ ఖాన్. మరికొంతమంది తిరుగుబాటుదార్లతో కలసి ఖాన్ హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ మేజర్ డేవిడ్సన్కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. హైదరాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మౌల్వీ అల్లావుద్దీన్ తీవ్రస్వరంలో ఉపన్యాసాలను ఇచ్చాడు. ఆ స్ఫూర్తితో తురేబాజ్ ఖాన్, మరో 500 మంది రోహిల్లాలతో కలిసి తిరుగుబాటు కొనసాగించాడు. కోఠిలో బ్రిటిష్ రెసిడెన్సీలో బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్ను విడిచిపెట్టడానికి తిరుగుబాటు జరిగింది. తురేబాజ్ ఖాన్ నాయకత్వంలో రోహిల్లాలు రెసిడెన్సీ మీద దాడి నిర్వహించారు. దాడులకు అబ్బాన్ సాహెబ్, జయగోపాల్ దాస్ అనే వ్యాపారుల ఇళ్లను ఆశ్రయంగా చేసుకున్నారు. అప్పుడు హైదరాబాద్ ప్రధానిగా ఉన్న సాలార్జంగ్ తిరుగుబాటు గురించి రెసిడెంట్ డేవిడ్సన్కు ఉప్పందించాడు. దాంతో బ్రిటిష్ సైన్యాలు ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. మేజర్ ఎస్సీ బ్రిగ్స్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాలు రోహిల్లాల మీద దాడులు జరిపాడు. కేవలం ఒక్క రాత్రిలోనే తిరుగుబాటును అణచివేశాడు. తురేబాజ్ ఖాన్ సహా తిరుగుబాటులో పాల్గొన్నవారిని పట్టుకొని జీవిత ఖైదు విధించారు. అయితే ఖాన్ 1859 జనవరి 8న కారాగారం నుంచి తప్పించుకున్నాడు. చివరికి జనవరి 24న తూప్రాన్ దగ్గర తురేబాజ్ ఖాన్ను చంపేశారని తెలుస్తున్నది. ఈ ద్రోహానికి పాల్పడింది తూప్రాన్ తాలూకాదార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్. ఖాన్ పార్థివదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి రెసిడెన్సీ దగ్గర వేలాడదీసినట్లు చారిత్రక రికార్డుల నుంచి తెలుస్తున్న సమాచారం.
40. చౌరీచౌరా హింసాకాండ…
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలోని ఓ గ్రామం చౌరీచౌరా. 1922 ఫిబ్రవరి 4న ఖిలాఫత్ ఉద్యమకారులు, కాంగ్రెస్ మద్దతుదారులు ఏకమై స్థానిక పోలీసులతో ఘర్షణపడ్డారు. పోలీసులు కార్యకర్తల మీద లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇది తెలిసిన చుట్టుపక్కల ఊళ్ల జనం అలా ఎందుకు చేశారని సబ్ ఇన్స్పెక్టర్ను ప్రశ్నించారు. రాజీ కుదరడంతో ప్రజలు వెనుదిరిగిపోయారు. ఇంతలో పోలీసులు వెళ్లిపోతున్న గుంపు మీద కాల్పులకు తెగబడ్డారు. జనంలో ఇద్దరు చనిపోయారు. దాంతో జనం రాళ్లదాడికి ఒడిగట్టారు. పోలీసులు స్టేషన్ లోపలికి వెళ్లి తలుపులు మూసివేశారు. ప్రజలు స్టేషన్కు నిప్పంటించారు. అందులో ఉన్న 23 మంది భారతీయ పోలీసులు అగ్నికి ఆహుతయ్యారు. ఇది సహాయ నిరాకరణ ఉద్యమం మీద పెద్ద ప్రభావమే చూపించింది. చౌరీచౌరా హింసాకాండను గాంధీజీ తప్పుపట్టారు. మరింత హింస తలెత్తవచ్చనే అనుమానంతో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేశారు.
41. ఖిలాఫత్ ఉద్యమం
టర్కీ ఖలీఫాకు మద్దతుగా భారతీయ ముస్లింలు లేవనెత్తిన పిడికిలి.. ఖిలాఫత్ ఉద్యమం. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ మిత్రపక్షాలకు టర్కీ లొంగిపోయింది. దాంతో ఇస్లాం ధర్మానికి రక్షకుడిగా- టర్కీ సుల్తాన్కు ఉన్న ఖలీఫా హోదాను రద్దు చేస్తారనే భయాందోళనలు మహమ్మదీయుల్లో నెలకొన్నాయి. భారతీయ ముస్లింలు కూడా ఖలీఫా వ్యవస్థ కొనసాగాల్సిందేనని తీర్మానించారు. ఇలా ఉంటే 1920 ఆగస్టులో జరిగిన సెవర్స్ ఒప్పందంతో టర్కీ సుల్తాన్ అధికారాలన్నీ రద్దయిపోయాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా అసంతృప్తి, అశాంతి నెలకొన్నాయి. మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా ఆజాద్ నాయకత్వంలో ఖలీఫాకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కూడా ముస్లింల అభ్యంతరాలకు మద్దతు ప్రకటించింది. 1922 నాటికి టర్కీలో రాజకీయపరమైన మార్పులు వచ్చాయి. టర్కీ అధ్యక్షుడిగా వచ్చిన ముస్తాఫా కమాల్ 1924లో ఖలీఫా పదవిని రద్దుచేశాడు. దాంతో ఖిలాఫత్ ఉద్యమం ముగిసిపోయింది.
42. జలియన్వాలాబాగ్ మారణకాండ
వందలాది ప్రజలు బ్రిటిష్ వారి తూటాలకు బలైన సంఘటనకు పంజాబ్లోని అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ మైదానం బలిపీఠమైంది. అప్పట్లో పంజాబ్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు గుమిగూడటంపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలియని సుమారు ఐదువేల మంది ప్రజలు పంజాబీల పర్వదినం ‘బైశాఖి’ సందర్భంగా జలియన్వాలాబాగ్ మైదానంలో వేడుకలకు హాజరయ్యారు. వారిమీద కాల్పులు జరపడానికి జనరల్ డయ్యర్ సైన్యాలకు హుకుం జారీచేశాడు. దాంతో 10 నిమిషాలపాటు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో తమను బుల్లెట్ల వర్షం నుంచి కాచుకునేందుకు ప్రజలు మైదానంలోని బావిలో దూకారు. బ్రిటిష్ ప్రభుత్వం మేరకు ఈ దుర్ఘటనలో 350 మంది ప్రజలు మరణించారు. కాంగ్రెస్ మాత్రం 1,000 మంది చనిపోయారని ప్రకటించింది. దుర్ఘటనకు ప్రధాన కారకుడైన డయ్యర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. మారణకాండకు ప్రతీకారంగా అప్పటి పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఒడ్వయార్ను సర్దార్ ఉదమ్సింగ్ హత్య చేశాడు.
43. స్వరాజ్య పార్టీ స్థాపన
గాంధీజీ 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకున్నాడు. దాంతో దేశంలో ఒకరకమైన రాజకీయ శూన్యం ఆవరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ 1923లో స్వరాజ్య పార్టీని స్థాపించారు. చట్టసభల్లో ప్రవేశించి బ్రిటిష్వారి పాలనా ప్రక్రియను అడ్డుకోవాలన్నది ఈ పార్టీ ప్రధాన లక్ష్యం. కేంద్ర శాసనసభ, ప్రొవిన్షియల్ సభలకు 1923 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో స్వరాజ్య పార్టీ మధ్యప్రదేశ్లో పూర్తి మెజారిటీ సాధించింది. బెంగాల్, యునైటెడ్ ప్రావిన్సెస్, అస్సాంలో కూడా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కేంద్ర శాసనసభలో 101 స్థానాలకు 42 దక్కించుకుంది. సర్దార్ పటేల్ సోదరుడు విఠల్భాయి పటేల్ కేంద్ర శాసనసభ స్పీకర్గా నియమితులయ్యారు. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన, రాజ్యాంగ రచనకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే తీర్మానాలు ఆమోదం పొందాయి. అయితే 1927 నాటికి స్వరాజ్య పార్టీ తన ఉనికిని కోల్పోయింది.
44. సైమన్… వెనక్కి వెళ్లు!
భారతదేశంలో పాలనా సంస్కరణల కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబర్లో సైమన్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఇందులో ఏడుగురు సభ్యులు. అందరూ ఆంగ్లేయులే. భారతీయులకు స్థానం లేకపోవడంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లడైంది. కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సైమన్ కమిషన్ను బాయ్కాట్ చేశాయి. 1928 ఫిబ్రవరి 3న కమిషన్ బొంబాయి చేరుకుంది. ఆ రోజున దేశవ్యాప్తంగా హర్తాళ్ జరిగింది. కమిషన్ వెళ్లిన చోటల్లా నల్లజెండాల ప్రదర్శనలు, ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలే కనిపించాయి. పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. 1928 అక్టోబర్లో లాలా లజపతిరాయ్ ‘సైమన్ కమిషన్’ వ్యతిరేక హర్తాళ్లో పాల్గొన్నాడు. లాఠీచార్జీలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. 1928 నవంబర్ 17న మరణించాడు. మద్రాసులో జరిగిన నిరసనల్లో ఒకరు మరణించారు. అదే సమయంలో ప్రకాశం పంతులు అక్కడికి వచ్చాడు. చనిపోయిన వ్యక్తిని చూడాలని పట్టుబట్టాడు. పోలీసులు నిలువరించారు. ‘దమ్ముంటే కాల్చండి’ అంటూ ప్రకాశం ముందుకే వెళ్లాడు. పోలీసులు ఆయనను ఏమీ చేయలేకపోయారు.
45. పూర్ణ స్వరాజ్య తీర్మానం
1929లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం లాహోర్ వేదికగా జరిగింది. ఈ సమావేశానికి ఓ ప్రాముఖ్యం ఉంది. భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుంచి పూర్తిగా స్వపరిపాలన దక్కేలా ‘పూర్ణ స్వరాజ్య’ తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. ఈ సమావేశంలోనే రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ స్వరాజ్ పతాకాన్ని ఎగరవేశాడు. అంతేకాకుండా దేశ ప్రజల ముందున్న ఒకే ఒక లక్ష్యం బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్వాతంత్య్రాన్ని సాధించడమే అని పిలుపునిచ్చాడు. కాంగ్రెస్తోపాటు, ఇతర జాతీయవాదులు కూడా పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలని సభ్యులంతా అంగీకరించారు. 1930 జనవరి 26 నాడు ‘పూర్ణ స్వరాజ్య’ దినంగా జరుపుకోవాలని ఈ సమావేశంలోనే కాంగ్రెస్ నిర్ణయించింది. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం పొందింది. అయితే 1930 జనవరి 26కు గుర్తుగానే భారత రాజ్యాంగాన్ని 1950 సంవత్సరంలో జనవరి 26న అమలులోకి వస్తుందని రాజ్యాంగ సభ ప్రకటించింది.
బ్రిటిష్ వారు భారతీయుల మీద విధించిన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించిన శాంతియుత ప్రజా పోరాటమే ఉప్పు సత్యాగ్రహం. సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి 1930 మార్చి 12న అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దాదాపు 325 కిలోమీటర్ల దూరంలోని అరేబియా సముద్ర తీర గ్రామం దండికి యాత్ర మొదలుపెట్టాడు.
ప్రభుత్వం ఉప్పు చట్టం ఉల్లంఘనను చాలా తేలిగ్గా తీసుకుంది. గాంధీజీ సామాన్యుడి నాడి తెలిసిన మనిషి. ప్రతి మనిషికి ఉప్పు అవసరం కాబట్టి, గాంధీజీ మంత్రం దేశ ప్రజల మీద బాగా పనిచేసింది. 1882లో ఉప్పు చట్టం వచ్చే వరకు భారతీయులు సముద్ర జలాల నుంచి ఉప్పును స్వేచ్ఛగా తయారుచేసుకునే వాళ్లు. ఆ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉప్పు మీద బ్రిటిష్ ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 8.2% ఉప్పు నుంచి వచ్చేది. అందువల్ల ఉప్పు చట్టం ఉల్లంఘనను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోదని గాంధీజీ భావించాడు. తన యాత్ర, ప్రణాళిక గురించి గాంధీజీ 1930 మార్చి 2నే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్కు తెలియజేశాడు. అలా 1930 మార్చి 12న 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ గ్రామాల గుండా ఉద్దండమైన దండియాత్రను ప్రారంభించాడు. మార్గమధ్యంలో వేలాది మంది గాంధీజీ యాత్రలో భాగమయ్యారు. దారి పొడవునా ఉపన్యాసాలు ఇస్తూ, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడుతూ, దినపత్రికలకు వ్యాసాలు రాస్తూ గాంధీజీ యాత్రను కొనసాగించాడు. ఏప్రిల్ 5 నాటికి దండి చేరుకున్నాడు. అప్పటికీ ఆయన వెంట 50,000 ప్రజానీకం భాగస్వాములుగా ఉన్నారు. అలా 6వ తేదీ ఉదయం గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు.
ప్రభుత్వం ఉద్యమ తీవ్రతను పసిగట్టింది. గాంధీజీని వెంటనే అరెస్టు చేసి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించింది. మరో 60,000 మంది సత్యాగ్రహులను కూడా చెరసాలలకు తరలించారు. అయితే దేశవ్యాప్తంగా శాసనోల్లంఘనకు విస్తృతమైన స్పందన లభించింది. ప్రభుత్వం మరిన్ని చట్టాలు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు. ఎన్ని చేసినప్పటికీ సత్యాగ్రహులు మాత్రం వెరవకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఉప్పు సత్యాగ్రహం 1934 వరకు కొనసాగినప్పటికీ ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు రాబట్టుకోవడంలో ఫలవంతం కాలేకపోయింది. ముస్లింల మద్దతు కూడా అంతంత మాత్రమే దక్కింది.
1921 నవంబర్లో గాలి ఆడని రైలుపెట్టెలో 67 మంది మోప్లా ఖైదీలను తిరూర్ నుంచి పొదనూర్ సెంట్రల్ జైలుకు తరలిస్తుంటే ఉక్కపోతకు తాళలేక మరణించారు. ఈ ఘట్టంతో దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మలయాళంలో మాపిళ అంటే అల్లుడు అని అర్థం. మోప్లాలు చాలావరకు భూమిని స్వయంగా దున్ని సేద్యం చేసే రైతులే. ఇక జెన్మీలుగా అగ్రవర్ణ హిందువులు ఉండేవాళ్లు. జెన్మీలకు వ్యతిరేకంగా 1836 నుంచి 1896 మధ్య కాలంలో పలుమార్లు అలజడులు తలెత్తాయి. 1919లో టర్కీలో ఖలీఫాను మళ్లీ నియమించడానికి మద్దతుగా భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది. దానికి కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. ఖిలాఫత్కు మద్దతుగా కేరళలో నిర్వహించిన సమావేశాలు మోప్లాల్లో మత భావనలకు కారణమయ్యాయి. అలా మోప్లా ఉద్యమం బ్రిటిష్వారికి, హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా మారిపోయింది. ఈ క్రమంలో పెద్దయెత్తున హిందువులు, బ్రిటిష్ అధికారుల మీద దాడులు జరిగాయి. మోప్లా తిరుగుబాటుకు అలీ ముసలియార్, కున్హమ్మద్ హాజీ ప్రముఖ నాయకులు. అలా 1921 ఆగస్టు నుంచి ఆ ఏడాది చివరి వరకు మలబార్లో చాలావరకు తిరుగుబాటుదారుల నియంత్రణలోనే ఉండిపోయింది. చివరికి మలబార్ స్పెషల్ పోలీసు దళాలను రప్పించి బ్రిటిష్ వాళ్లు మోప్లా తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేశారు. 1921 నవంబర్లో గాలి ఆడని రైలుపెట్టెలో 67 మంది మోప్లా ఖైదీలను తిరూర్ నుంచి పొదనూర్ సెంట్రల్ జైలుకు తరలిస్తుంటే ఉక్కపోతకు తాళలేక మరణించిన ఘట్టంతో దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిని ‘వేగన్ ట్రాజెడీ’ అని పిలుస్తారు. ఇక ఉద్యమం స్వభావం విషయానికి వస్తే కొంతమంది దీనిని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన జాతీయవాద పోరాటంగానే పేర్కొంటారు. కొందరు మాత్రం మతపరమైనదిగా పరిగణిస్తారు.
1930ల నాటికి డా. బీఆర్ అంబేద్కర్ జాతీయ స్థాయి కలిగిన నాయకుడిగా అవతరించాడు. 1930, 1932లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో భారతదేశంలో దళితుల స్థితిగతులను వివరించాడు. వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో 1932లో బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ఒక ప్రకటన చేశాడు. దానికే కమ్యునల్ అవార్డ్ అని పేరు. దీని ప్రకారం దళితులను ప్రత్యేక సముదాయంగా పరిగణిస్తారు. వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తారు. దీనిని గాంధీజీ నిరసించాడు. 1932 సెప్టెంబర్ 20న కమ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. చివరికి డా.అంబేద్కర్, గాంధీజీ మధ్య ఒప్పందం కుదిరింది. అదే పూనా ఒప్పందం. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా, కొన్ని స్థానాలను రిజర్వ్ చేయడానికి అంగీకారం కుదిరింది. అలా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభల్లో దళితులకు జనాభా ప్రాతిపదికన స్థానాలను రిజర్వేషన్ కల్పించడానికి పూనా ఒప్పందం నేపథ్యంగా నిలిచింది.
గుజరాత్లో ఉన్న బార్దోలీ తాలూకాను 1925లో వరదలు, కరువులు వరుసపెట్టి దాడిచేశాయి. ఇది రైతులను ఆర్థికంగా ప్రభావితం చేసింది. రైతులు కష్టాల్లో ఉన్నా బొంబాయి ప్రభుత్వం పన్నులను పెంచింది. దాంతో 1928 జనవరిలో రైతులు పన్నుల చెల్లింపు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాలని వల్లభ్భాయి పటేల్ను ఆహ్వానించారు. పటేల్ ఉద్యమానికి నాయకుడిగా ఉండటానికి అంగీకరించాడు. అయితే ప్రభుత్వం పన్నులను తగ్గించేది లేదని తేల్చి చెప్పింది. ఈ సత్యాగ్రహాన్ని శాంతియుతంగా నిర్వహించడంలో పటేల్ అద్వితీయమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. తాలూకాను శిబిరాలుగా విభజించి, వందలాది స్త్రీలు, పురుషులను సంఘటితం చేశాడు. పటేల్కు ‘సర్దార్’ అనే బిరుదును ఇచ్చింది కూడా బార్దోలీ సత్యాగ్రంహంలో పాల్గొన్న మహిళలే కావడం విశేషం. ఉద్యమ తీవ్రతను గమనించిన ప్రభుత్వం పన్నులను 6.03% శాతం తగ్గించింది. జప్తు చేసిన భూములను రైతులకు తిరిగి ఇచ్చేశారు. పటేల్కు జాతీయ నాయకుడిగా ప్రాచుర్యం లభించేందుకు బార్దోలీ సత్యాగ్రహం చేసిన దోహదం ఎంతో!
ఆధ్యాత్మిక, రాజకీయ నాయకురాలు రాణి గైడెన్ల్యూ రోంగెమీ తెగలో జన్మించింది. మణిపూర్ రాష్ట్రంలోని లువంగకావ్ ఆమె స్వగ్రామం. 13 ఏండ్ల వయసులోనే స్వాతంత్య్ర యోధుడు, మత నాయకుడు హాయిపో జడోనాంగ్ ప్రభావానికి లోనైంది. ఆయన ‘హెరాకా ఉద్యమం’ ప్రారంభించాడు. ఇది పురాతన నాగా మతం మీద ఆధారపడి, స్వతంత్ర నాగా రాజ్య స్థాపన లక్ష్యం కలిగింది. అలా జడోనాంగ్తో రాణి గైడెన్ల్యూ అనుబంధం ఆమెను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. జడోనాంగ్ను ఉరితీసిన తర్వాత నాగా ఉద్యమానికి రాణి నాయకత్వం వహించింది. అది నెమ్మదిగా ధార్మికం నుంచి రాజకీయ రూపం దాల్చింది. అలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం గైడెన్ల్యూకు జీవితకాల శిక్ష విధించింది. 14 ఏండ్ల శిక్ష తర్వాత 1947లో విడుదలైంది. గైడెన్ల్యూ పోరాటాన్ని గుర్తించిన జవహర్లాల్ నెహ్రూ ఆమెను ‘గిరిపుత్రిక’ అని పిలిచాడు. ‘రాణి’ అనే బిరుదును ప్రసాదించాడు. బ్రిటిష్ పాలనలో అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించిన అతికొద్దిమంది మహిళలలో రాణి గైడెన్ల్యూ ఒకరు.
భారతీయ వర్ణవ్యవస్థలో ఓ వికృత పార్శం అంటరానితనం. మనిషిని మనిషి తాకడానికి కూడా సందేహించడం అమానవీయం. బహిరంగ ప్రదేశాలను దళితులు కూడా ఉపయోగించుకునే దిశగా జరిగిందే మహద్ సత్యాగ్రహం. దీనికి డాక్టర్ అంబేద్కర్ నాయకత్వం వహించాడు. 1927 మార్చి 20న ఆయన వేలాదిమంది దళితులతో కలిసి మహద్లోని చావ్దార్ చెరువు దగ్గరికి ఊరేగింపుగా వెళ్లాడు. చెరువు నీళ్లు వాడుకోవడం దళితుల హక్కు అని వాదించాడు. తరతరాలుగా సాగుతున్న వివక్షను ఉల్లంఘిస్తున్న దానికి గుర్తుగా అంబేద్కర్ ఆ చెరువు నుంచి దోసిట్లో నీళ్లు తీసుకుని తాగాడు. ఈ సంఘటన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని గుర్తుకుతెస్తుంది. ఇది అంతకు మూడేళ్ల ముందే జరగడం గమనార్హం. మహద్ సత్యాగ్రహానికి గుర్తుగా ఇప్పటికీ, ఏటా వేలాది మంది ఊరేగింపుగా మహద్కు తరలివెళ్తారు. అప్పటి స్ఫూర్తిని చాటుకుంటారు. భారత రాజ్యాంగంలో అధికరణ-15లో ‘బావులు, చెరువులు, స్నానఘట్టాలను ఉపయోగించుకునే విషయంలో ఏ మనిషిపట్లా వివక్ష ప్రదర్శించకూడద’ని పొందుపరిచారు.
భారతదేశంలో కొన్ని కులాల వారికి అనాదిగా దేవాలయాల్లోకి ప్రవేశం లేకుండింది. కేరళలో అయితే వారికి దేవాలయానికి దారితీసే మార్గాల్లో నడిచేందుకు కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితి. 1924 ఫిబ్రవరిలో టి.కె.మాధవన్, కె.కేలప్పన్ దళితులకు దేవాలయ ప్రవేశం కోసం, కులభేదాలు లేకుండా హిందువులు అందరూ రోడ్లను వాడుకునే విషయమై ‘కేరళ పర్యటనం’ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా ఉద్యమం 1924 మార్చి 30న మొదలైంది. వైకోమ్లోని మహాదేవ ఆలయంలో బోర్డు అవర్ణులకు ప్రవేశాన్ని నిరాకరించింది. దీనిని నిరసిస్తూ సత్యాగ్రహులు ముగ్గురుముగ్గురుగా బృందాలుగా వచ్చి ఆలయంలోకి ప్రవేశించారు. కానీ, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. గాంధీజీ, శ్రీనారాయణ గురు వైకోమ్ సత్యాగ్రహానికి మద్దతు ప్రకటించారు. పెరియార్ కూడా వైకోమ్ తరలివచ్చాడు. ఆయనను కూడా అరెస్టుచేశారు. చివరికి 1925 నవంబర్ 23న ఒక్క తూర్పు ద్వారం మినహా, వైకోమ్ దేవాలయం మిగిలిన ద్వారాలు హిందువులు అందరికీ ప్రవేశం కల్పించడానికి తెరుచుకున్నాయి.
భారతదేశ స్వాతంత్య్రం కోసం అమరులైన విప్లవ వీరులు.. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు త్యాగానికి ఏ మాత్రం తీసిపోనిది జతీంద్రనాథ్ దాస్ పోరాటం. చిన్నతనంలోనే ఆయన జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. పదిహేడేండ్ల వయసులో సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అనంతర కాలంలో గాంధీ మార్గం నుంచి తప్పుకొని విప్లవ పంథా అనుసరించాడు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్తో చేతులు కలిపాడు. అంతలోనే, సాండర్స్ హత్య కేసులో అరెస్టయ్యాడు. లాహోర్ జైలులో శిక్ష అనుభవించాడు. తోటి రాజకీయ ఖైదీల హక్కుల కోసం 1929లో నిరాహార దీక్షకు కూర్చున్నాడు. జతిన్ను బ్రిటిష్ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. దాంతో ఆయన ఊపిరితిత్తులు పాడైపోయాయి. పక్షవాతంతో అచేతనుడయ్యాడు. అయినా దీక్షను కొనసాగించాడు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయనను విడుదల చేయాలన్న తోటి ఖైదీల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. 63 రోజుల తర్వాత జతిన్ దాస్ అమరుడయ్యాడు. సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నట్లు జతిన్ ‘యువ దధీచి’.
1907లో జర్మనీలోని స్టట్గర్ట్లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అక్కడ భారతదేశం గుర్తుగా పతాకాన్ని ఆవిష్కరించిన దేశభక్తురాలు మేడం భికాజీ కామా. ఐరోపా ఖండంలో భారత స్వాతంత్య్రోద్యమం గురించి తెలిసింది ఆమె వల్లే. భికాజీ కామా లండన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కురువృద్ధుడు దాదాభాయి నౌరోజీని కలుసుకున్నారు. కాంగ్రెస్ ఆశయాల సాధన కోసం పనిచేయడం మొదలుపెట్టారు. భారతదేశాన్ని బ్రిటిష్వాళ్లు దోచుకుంటున్న వైనాన్ని వెల్లడిచేయడానికి 1907లో స్టట్గర్ట్ వెళ్లారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో చైతన్యం తీసుకురావడం ఆమె పర్యటన ప్రధాన ఉద్దేశం. ఇంతలో కామాను ఇంగ్లండ్ నుంచి తరలిస్తారని వదంతులు బయల్దేరాయి. దాంతో ప్యారిస్ వెళ్లిపోయారు. అక్కడ ఆమె ఇల్లు భారత స్వాతంత్య్ర యోధులకు ఆశ్రయంగా మారిపోయింది. ఫ్రాన్సులో ఉంటూ భారతీయులతోనే కాకుండా ఇతర దేశాల విప్లవకారులతోనూ ఆమె సంప్రదింపులు జరిపారు. 1935లో భారత్ తిరిగి వచ్చాన ఆమె, 1936లో మరణించారు.
బొంబాయి రేవులో అడుగుపెట్టిన వారికి బ్రిటిష్ వాళ్లు నిర్మించిన ‘గేట్ వే ఆఫ్ ఇండియా’తోపాటు మరో భవనమూ ఠీవిగా నిలబడి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. అది తాజ్ హోటల్. బ్రిటిష్ వారు భారతీయులకు ప్రవేశం నిరాకరించిన ‘అపోలో హోటల్’కు దీటుగా.. స్వాభిమానాన్ని చాటుతూ పారిశ్రామికవేత్త జంషెడ్జీ టాటా దీనిని నిర్మించాడు. దాని రూపశిల్పి సీతారాం ఖండేరావ్ వైద్య. 1898లో మొదలైన తాజ్ నిర్మాణం 1903 నాటికి పూర్తయింది. అదే ఏడాది ప్రారంభమైంది. హోటల్ నిర్మాణం, పరికరాల కోసం టాటా అప్పట్లోనే న్యూయార్క్, ప్యారిస్ నగరాలను సందర్శించాడు. మొదట్లో తాజ్కు పెద్దగా ఆదరణ లేదు. ఓసారి బికనేర్ మహారాజు ఇందులో విడిది చేశాడు. అక్కడినుంచి హోటల్కు వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. భారత స్వాతంత్య్రోద్యమంతోనూ తాజ్కు సంబంధం ఉంది. 1916లో తాజ్ వేదికగా ముస్లిం లీగ్ నాయకులు కాంగ్రెస్తో చర్చలు జరిపారు. ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు ఒకే సూట్లో దాదాపు ఇరవై ఏండ్లు అతిథిగా ఉన్నారు.
1906 డిసెంబర్ 30న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటైంది. సంక్షిప్తంగా ముస్లిం లీగ్గా ప్రసిద్ధిచెందింది. మహమ్మద్ అలీ జిన్నా 1913లో లీగ్లో చేరాడు. నిజానికి దేశంలో పెరుగుతున్న జాతీయవాదాన్ని తొక్కిపెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి లీగ్ ఒక పరికరంగా ఉపకరించింది. అయితే తొలినాళ్లలో దేశ విభజన అనేది లీగ్ సభ్యుల అభిమతం కానేకాదు. అది 1930 తర్వాత అంకురించిన ఆలోచన మాత్రమే. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వందల ఏండ్లుగా కలిసి నివసిస్తున్న హిందువులు, ముస్లింలు ఒకే జాతికి చెందినవారు కారని లీగ్ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. 1937 ఎన్నికలలో ముస్లిం లీగ్కు ఎక్కడా మెజారిటీ రాలేదు. దాంతో జిన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలను తీవ్రంగా దుయ్యబట్టడం మొదలుపెట్టాడు. 1940లో లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసంలో భారతీయులు ఒక్క జాతిగా నివసించడం అసంభవం అని పేర్కొన్నాడు. అలా 1940 మొదలుకొని 1947లో పాకిస్తాన్ ఏర్పాటుచేసే వరకు జిన్నా వెనక్కి తగ్గలేదు. చివరికి 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పాటైంది.
సూర్యసేన్ 1894 మార్చి 22న బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ సమీపంలో జన్మించాడు. డిగ్రీలో ఉన్నప్పుడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయనను విప్లవ సిద్ధాంతాలు బాగా ఆకర్షించాయి. 1918లో చిట్టగాంగ్లో లెక్కల మాస్టర్గా చేరిపోయాడు. బోధనతోపాటు సేన్ యువకులకు ఆయుధాలు ఉపయోగించడం నేర్పించాడు. ప్రభుత్వ ఆయుధాగారం నుంచి ఆయుధాలు సమకూర్చుకునేందుకు 1930 ఏప్రిల్ 18న సేన్ అనుచరులతో కలిసి చిట్టగాంగ్ ఆయుధాగారం మీద దాడిచేశాడు. చిట్టగాంగ్ను మిగతా భారతదేశంతో కలిపే టెలిఫోన్, టెలిగ్రాఫ్, రైలు మార్గాలను ధ్వంసం చేశారు. ఆయుధాగారం మీద సేన్ జాతీయ పతాకం ఎగరవేశాడు. తాత్కాలిక విప్లవ ప్రభుత్వం ఏర్పడిందని ప్రకటించాడు. 1934 జనవరి 12న సేన్ను ఉరితీశారు. ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో దాదాపు 4 సంవత్సరాల పాటు సూర్య సేన్ బృందం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించింది. దేశమాత కోసం ప్రాణాలు అర్పించిన సేన్ భారత్, బంగ్లాదేశ్లో ప్రాతఃస్మరణీయుడు.
ఇది ఉత్తరప్రదేశ్లోని దారుల్ ఉలూమ్ దేవ్బంద్తో సంబంధాన్ని కలిగి ఉంది. భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం చేయడానికి అఫ్గానిస్తాన్, టర్కీ దేశాలను ఆహ్వానించే ప్రణాళికను కలిగిన ఉద్యమం పట్టులేఖ ఉద్యమం. అదే సమయంలో భారతదేశంలో తిరుగుబాటును లేవదీయాలని అనుకున్నారు. ఒబేదుల్లా సింధీ, మౌలానా మహమూద్ హసన్ ఈ ఉద్యమంలో ముఖ్య నాయకులు. కాగా, పట్టు వస్ర్తాల మీద రాసిన కొన్ని లేఖలు 1916లో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాయి. అందుకే దీనికి ‘పట్టులేఖల ఉద్యమం’ అనే పేరువచ్చింది. వీటిని అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి ఒబేదుల్లా సిందీ మక్కాలో ఉన్న మహమూద్ హసన్కు రాశాడు. ఇవి బ్రిటిష్ వారికి పట్టుబడ్డాయి. అందుకని ‘పట్టులేఖల ఉద్యమం’ అనే పేరు స్థిరపడిపోయింది. పాకిస్తాన్లోని సియాల్కోట్కు చెందిన ఒబేదుల్లా 1915లో అఫ్గానిస్తాన్ వెళ్లిపోయారు. గదర్ పార్టీ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. అక్కడే రాజా మహేంద్ర ప్రతాప్తో కలిసి ప్రవాస భారత ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించాడు. అలా ప్రవాస ప్రభుత్వం వివరాలతో టర్కీ, అఫ్గానిస్తాన్ దేశాలను బ్రిటిష్ వారిపైకి దాడికి ఆహ్వానిస్తున్న వివరాలు పట్టులేఖల్లో బయటపడ్డాయి. ఈ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగింది. అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కూడా భారతీయ విప్లవకారుల మీద అసహనం వ్యక్తంచేసింది. అదే సమయంలో హిజాజ్ కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. దాంతో మౌలానా మహమూద్ హసన్ను అరెస్టు చేశారు. దాంతో తిరుగుబాటు ప్రణాళిక భగ్నమైపోయింది.
బ్రిటిష్ పార్లమెంట్ 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తిని ఇస్తూ అఖిల భారత సమాఖ్యను ఏర్పాటుచేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అయితే ఈ చట్టంలో సమాఖ్య భాగం అమలులోకి రాలేదు. కానీ రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి మాత్రం 1937 నుంచి ఆచరణలోకి వచ్చింది. కొత్త రాజ్యాంగ సంస్కరణలు భారతీయుల ఆకాంక్షలకు ఆమడ దూరంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ మెజారిటీని సాధించుకోగలిగింది. ముస్లిం లీగ్ మాత్రం ప్రజల మద్దతు పొందలేకపోయింది. యునైటెడ్ ప్రావిన్సులు, మద్రాసు, బొంబాయి, బీహార్, ఒరిస్సా సహా మొత్తం 8 ప్రావిన్సులలో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పాటయ్యాయి. బెంగాల్, పంజాబ్ ప్రావిన్సులలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండానే ఇంగ్లండ్ నాజీ జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది. దాంతో మంత్రివర్గాలకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదేశించింది. ఆ మేరకు మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేసిన రోజును ముస్లిం లీగ్ ‘విముక్తి దినం’గా పాటించాయి. కాంగ్రెస్ మంత్రివర్గాలు రెండేండ్లకు పైగానే అధికారంలో ఉన్నాయి. ఈ స్వల్పకాలంలోనే యునైటెడ్ ప్రావిన్సులు, బీహార్ ప్రావిన్సులలో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను రక్షించడానికి కౌలు చట్టాలను ఆమోదించారు. కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నా వర్గ పోరాటానికి దూరంగా ఉన్నారు. అలా రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ కేవలం ఉద్యమ పార్టీగానే కాదు, ప్రభుత్వాన్నీ సమర్థంగా నడపగలదని నిరూపించుకుంది.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ సారథ్యంలో జరిగిన చిట్టచివరి పెద్ద ప్రజా పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం. దీనిని 1942 ఆగస్టు 8న గాంధీజీ బొంబాయిలో అధికారికంగా ప్రారంభించారు. దీనికే ఆగస్టు క్రాంతి అని కూడా పేరు. గాంధీజీ ఈ ఉద్యమం ప్రారంభంలో ఇచ్చిన ‘క్విట్ ఇండియా’, ‘భారత్ ఛోడో’, ‘పోరాడండి, లేదా చావండి’ (డూ ఆర్ డై) నినాదాలే ఉద్యమ తీవ్రతను కండ్లకు కడతాయి.
క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదముద్రపడింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతంకావాలి. అన్ని రకాలైన సామ్రాజ్యవాదం, ఫాసిస్టు శక్తుల నుంచి భారతదేశం తనను తాను కాపాడుకోగలదని గాంధీజీ ప్రకటించారు. బ్రిటిష్ వాళ్లు దేశం విడిచిపెట్టి వెళ్లగానే భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. ఇక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘనకు అనుమతిని ఇచ్చారు.
ప్రజలకు గాంధీజీ సూచనలు… ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయకూడదు. కానీ కాంగ్రెస్కు విధేయంగా ఉండాలి. సైనికులు ప్రభుత్వంతోనే ఉండాలి కానీ, సాటి దేశీయులపై ఆయుధాలు ప్రయోగించకూడదు. జమీందారులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకులు అయితేనే రైతులు కౌలు చెల్లించాలి. లేకుంటే లేదు. విద్యార్థులు తట్టుకుంటామని అనుకుంటే చదువులను వదిలిపెట్టాలి. స్వదేశీ సంస్థానాధీశులు ప్రజల సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. అలానే, పాలకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకం అయితేనే సంస్థానాధీశులను సమర్థించాలి. పైగా తాము భారత దేశంలో భాగంగా ప్రకటించుకోవాలి.
క్విట్ ఇండియా తీర్మానం ఆమోదం పొందిన మర్నాడే గాంధీ, నెహ్రూ, పటేల్, మౌలానా ఆజాద్ సహా జాతీయ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం జైళ్లకు తరలించింది. దాంతో ఉద్యమం జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా తదితర యువనాయకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం హింసాకాండకు తెగబడింది. మహిళలు, పిల్లల మీద కూడా కనికరం చూపించలేదు. ఇంత జరిగినా మత ఘర్షణలు లేకపోవడం క్విట్ ఇండియా ఉద్యమం విశిష్టత. ప్రజలు కూడా గాంధీజీ పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించారు. అయితే నాయకత్వ శూన్యం ఏర్పడటంతో ప్రజలు అక్కడక్కడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా సమ్మెలు, ప్రజా ప్రదర్శనలు జరిగాయి. ఫ్యాక్టరీలలో సమ్మెల ద్వారా కార్మికులు క్విట్ ఇండియా ఉద్యమానికి దన్నుగా నిలిచారు. అలా 1944 వరకు క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగింది.
చౌరీచౌరా సంఘటన అనంతరం గాంధీజీ 1922లోనే సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేశాడు. దీంతో ఉధృతంగా సాగుతున్న ఉద్యమంపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. ఈ నిర్ణయం అప్పటి యువతరంపైనా ప్రభావం చూపించింది.
శాంతియుత సత్యాగ్రహంతో స్వాతంత్య్రం కల్లగా వారు భావించారు. ఆయుధాలు పడితేనే దేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి అనుకున్నారు. ఈ క్రమంలో రామ్ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో 1923లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) ఏర్పడింది. శచీంద్రనాథ్ సన్యాల్, జోగేశ్ చంద్ర ఛటర్జీ ఆయనకు సహకారం అందించారు. ఉత్తరప్రదేశ్లోని ముఖ్య నగరాల్లో హెచ్ఆర్ఏ శాఖలు ఏర్పాటయ్యాయి. స్వాతంత్య్ర పోరాటంలో తమతో చేరిపోవాలని వీరు యువతకు పిలుపునిచ్చారు. భారతదేశంలో సామ్యవాద రాజ్య స్థాపన వీరి ధ్యేయం. 1925లో చాలామంది యువకులు హెచ్ఆర్ఏలో చేరిపోయారు. వారిలో భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ ప్రముఖంగా కనిపిస్తారు. తమకు అవసరమైన డబ్బు, ఆయుధాలు, మందుగుండు కోసం హెచ్ఆర్ఏ దోపిడీలకు, దాడులకు పాల్పడింది. వీటిలో అత్యంత ప్రసిద్ధిచెందింది కకోరీ రైలు దోపిడీ సంఘటన. ఇది 1925 ఆగస్టు 9న జరిగింది. లక్నో సమీపంలో ప్రభుత్వ ఖజానాను తీసుకువెళ్తున్న ఒక రైలును రామ్ప్రసాద్ బిస్మిల్, అసఫఖుల్లా ఖాన్, రాజేంద్రనాథ్ లాహిరి, రోషన్ సింగ్ దోచుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ ప్రయాణికుడు మరణించాడు. ప్రభుత్వం కకోరి కేసు విచారణ జరిపించింది. బిస్మిల్, ఖాన్, లాహిరి, సింగ్ నలుగురినీ 1927లో ఉరితీసింది. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తప్పించుకోగలిగాడు. తర్వాత ఏడాది, అంటే 1928లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో హెచ్ఆర్ఏ సభ్యులు ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లాలో సమావేశం అయ్యారు. తమ సంస్థకు సోషలిజం (సామ్యవాదం) అనే పదం చేర్చి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ)గా మార్చారు.
మరణశిక్షకు ముందు “నిరంకుశత్వాన్ని, అన్యాయాన్ని సహించలేక ఫైజాబాద్ జైలు నుంచి మృత్యుభూమికి వెళ్తున్నాను” అని అసఫఖుల్లా ఖాన్ కవితాత్మకంగా ఎలుగెత్తాడు. ఆ పదునైన వాక్యాలు ప్రజల్లో ఉద్యమావేశాన్ని రగిలించాయి.
1946 ఫిబ్రవరి 18. బొంబాయిలో లంగరు వేసిన రాయల్ ఇండియన్ నేవీ యుద్ధనౌక హెచ్ఎంఐఎస్ ‘తల్వార్’లోని నావికాదళ సైనికులు సమ్మెకు దిగారు. నాసిరకం ఆహారం, ప్రతికూల జీవన పరిస్థితులే సమ్మెకు ప్రధాన కారణం. అక్కడితో ఆగకుండా సైనికులు నావికా దళానికి చెందిన ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. వాటిమీద కాంగ్రెస్, ముస్లింలీగ్తోపాటు ఎర్ర జెండాలను ఎగురవేశారు. తమ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వాలని బొంబాయి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. బ్రిటిష్ నౌకాదళం చరిత్రలో ఇదే అతిపెద్ద తిరుగుబాటు. నావికాదళం సైనికుల పిలుపు మేరకు బొంబాయి, కరాచీ, కలకత్తా తదితర ప్రాంతాల్లో మూకుమ్మడి ప్రజా ప్రదర్శనలు జరిగాయి. ఊరేగింపుల్లో పాల్గొన్న వారిపై బ్రిటిష్ సైనికులు అణచివేత చర్యలకు పాల్పడ్డారు. కాల్పుల్లో వందలమంది మరణించారు. వేలమంది గాయపడ్డారు. నావికా దళంలో తిరుగుబాటు ఉధృతంగా సాగుతున్న దశలో జాతీయ నాయకుల నుంచి మద్దతు కొరవడింది. ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గాంధీజీ సూచించారు. సైనికులు క్రమశిక్షణతో ఉండాలని నెహ్రూ సలహా ఇచ్చారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వారం రోజులలోపే.. 1946 ఫిబ్రవరి 24న సర్దార్ పటేల్ సలహా మేరకు నావిక దళం సైనికులు తమ తిరుగుబాటును విరమించుకున్నారు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన పోరాటాల్లో చివరిది రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటే కావడం గమనార్హం. ఈ సంఘటన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించింది. భారతీయ సైనికులపై భరోసా పెట్టుకుని బ్రిటిష్వారు ఇంకెంత మాత్రమూ భారతదేశాన్ని పాలించలేరనే వాస్తవాన్ని వెల్లడించింది.
స్వాతంత్య్రం అనంతరం భారతదేశానికి ఎదురైన మొదటి, ప్రధాన సమస్య దేశంలో విసిరేసినట్లుగా ఉన్న 500కు పైగా చిన్నాపెద్దా సంస్థానాలను విలీనం చేయడం. స్థానిక పాలకుల చేతుల్లో ఉన్న ఈ సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వం ప్రాపకంలోనే మనుగడ సాగించాయి. అయితే బ్రిటిష్ వారు వెళ్లిపోయేటప్పుడు తమకున్న అధికారాన్ని, స్వతంత్రతను భారత ప్రభుత్వానికి అప్పగించడానికి అవి సిద్ధంగా లేకపోవడం గమనార్హం. అలా భారత ప్రభుత్వానికి సమస్యాత్మకంగా మారిన సంస్థానాలలో ముఖ్యమైనవి జోధ్పూర్, భోపాల్, ట్రావెన్కోర్ స్వాతంత్య్రానికి ముందునాటివి. స్వాతంత్య్రం తర్వాతకాలంలో జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ సమస్యాత్మకంగా పరిణమించాయి.
భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి చిన్నాచితకా 540కిపైగా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇవి ఇలా ఉండటం అంటే దేశ అంతర్గత, బాహ్య భద్రత ప్రమాదంలో పడటమే. వీటిని విదేశీ శక్తులు భారతదేశంపై దాడికి స్థావరాలుగా ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. అయితే సంస్థానాలను బుట్టలో వేసుకునేందుకు ఒక్క భారత ప్రభుత్వమే కాదు, పాకిస్తాన్ కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేసింది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా సంస్థానాలను కలుపుకొని దేశాన్ని ఐక్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్, జునాగఢ్ సహా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాడు. అలా దాదాపు 540 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. భారత భూమి ఐక్యతామూర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు.
దాదాపు 200 ఏండ్లపాటు సాగిన పాలనకు బ్రిటిష్ ప్రభుత్వం ‘భారత స్వాతంత్య్ర చట్టం, 1947’తో తెరదించింది. ఈ చట్టానికి 1947 జూలై 18న రాజముద్ర పడింది. ఈ చట్టం ద్వారా భారత ఉపఖండం భారత్, పాకిస్తాన్ దేశాలుగా విభజన జరిగింది. భారత స్వాతంత్య్ర చట్టాన్ని బ్రిటన్లో లేబర్ పార్టీ ప్రభుత్వం రూపొందించింది. అప్పుడు ప్రధాని క్లెమెంట్ అట్లీ. దీనికి జూన్ 3 ప్రణాళిక (మౌంట్ బాటన్ ప్రణాళిక అని కూడా పేరు) ఆధారం. ఈ చట్టాన్ని కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులను సంప్రదించిన తర్వాత రూపొందించారు. మౌంట్ బాటన్ కూడా భారతీయులకు అధికారం బదిలీ చేయడానికి గవర్నర్ జనరల్గా రావడం గమనార్హం. అయితే మౌంట్ బాటన్ దేశాన్ని ముక్కలుముక్కలు చేసే కుట్రకు ఒడిగట్టాడు. దానిని నెహ్రూ తిరస్కరించాడు. దాంతో విభజన ప్రభావం తగ్గిస్తూ మౌంట్ బాటన్ జూన్ 3 ప్రణాళికను ముందుకు తీసుకువచ్చాడు.
విభజన తప్పనిసరి కావడంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు జూన్ 3 ప్రణాళికకు అంగీకరించాయి. దీని ప్రకారం బ్రిటిష్ భారతదేశం… భారత్, పాకిస్తాన్ రెండు స్వతంత్ర దేశాలుగా విడిపోతుంది. పాకిస్తాన్కు కొత్త రాజ్యాంగ సభ ఏర్పాటవుతుంది. ఇక బెంగాల్, పంజాబ్ శాసనసభలు ఆ రాష్ర్టాల విభజనకు అంగీకరించాయి. దాంతో మత ప్రాతిపదికన రెండు రాష్ర్టాలు భారత్, పాకిస్తాన్లో చేరిపోయాయి. సింద్ రాష్ట్రం పాకిస్తాన్లో చేరాలని నిర్ణయించుకుంది. వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అస్సాంలో భాగంగా ఉన్న సిల్హేట్ జిల్లా రిఫరెండం ఆధారంగా పాకిస్తాన్లో చేరిపోయాయి. అలా ఆగస్టు 14 15 అర్ధరాత్రి భారత్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.
మహాత్మ జ్యోతిరావ్ గోవింద్రావ్ ఫూలే సతారా జిల్లాలో 1827లో మాలి (మాలాకారులు) కుటుంబంలో జన్మించాడు. మరాఠీ, మిషన్ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన ఫూలే 1848లో సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టాడు. అణగారిన వర్గాల బాలబాలికల విద్య కోసం పాటుపడ్డాడు. దళితులు, బాలికల కోసం పాఠశాలలు తెరిచాడు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా కృషిచేశాడు. కుల సమానత్వాన్ని ప్రచారం చేయడానికి ఆయన 1873లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించాడు. జ్యోతిరావ్ ఫూలే బ్రాహ్మణుల ఆధిక్యతను సవాల్ చేశాడు. బ్రాహ్మణులను ఆర్యులుగా భావించిన ఫూలే, భారతదేశపు మూల నివాసులను అణచివేశారని వాదించాడు. కాబట్టి, ఈ దేశంలో అధికారం, వనరులు మూలవాసులకే దక్కాలని ఆకాంక్షించాడు. బ్రాహ్మణీయ ఆధిపత్యం రూపుమాసిపోవడానికి శూద్రులు, అతిశూద్రులు (దళితులు) ఒక్కటి కావాలని ప్రతిపాదించాడు. అదే సమయంలో లోకమాన్య తిలక్ లాంటి జాతీయవాదులు ఆర్యుల కాలం స్వర్ణయుగం అని పేర్కొన్నారు. కానీ, ఫూలే మాత్రం ఆర్యులకు ముందు సమాజమే గొప్పగా ఉండేదని గుర్తుచేశాడు. ఫూలే ప్రసిద్ధ రచన ‘గులాంగిరి’ (బానిసత్వం). దీనిని అమెరికాలో నల్లజాతి బానిసల విముక్తి కోసం పోరాడిన వారికి అంకితం ఇచ్చాడు. ఆ రకంగా భారతదేశంలో అణగారిన వర్గాలను, అమెరికా నల్లజాతివారితో పోల్చినట్లయింది. ఫూలే వేసిన మార్గంలో 20వ శతాబ్దంలో పయనిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ కుల సంస్కరణ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే కాకుండా మహిళలకు విద్యావకాశాల రంగంలోనూ ఫూలే సాటిలేని కృషిచేశాడు. ఇందులో ఆయనకు భార్య సావిత్రీబాయి సహకారం మరువలేనిది.
భారత ఉపఖండంలో 1946 నాటికి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అధికారానికి చివరి రోజులు సమీపిస్తుండటం గ్రహించిన బ్రిటిష్ పాలకులు స్వతంత్రం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అది ఎలా అనేదే ప్రశ్న. కాంగ్రెస్ అఖండ భారతానికి కట్టుబడగా, ముస్లిం లీగ్ పాకిస్తాన్ కోసం పట్టుబట్టింది. తన పంతం నెగ్గించుకోవడానికి లీగ్ 1946 ఆగస్ట్ 16న ‘ప్రత్యక్ష చర్య’కు పిలుపునిచ్చింది. బెంగాల్లో అధికారంలో ఉన్న లీగ్ నాయకుల ఉపన్యాసాల కారణంగా కలకత్తాలో మత కలహాలు చెలరేగాయి. ఎంతోమంది మరణించారు. ఇదే ‘కలకత్తా మహా మారణకాండ’గా ప్రసిద్ధిచెందింది. అక్టోబర్ 10న బంగ్లాదేశ్లోని నవఖాలిలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. లీగ్ ప్రభుత్వం అల్లర్లను అరికట్టడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. నవఖాలి అలజడులలో దాదాపు 5,000 మంది హిందువులు మరణించారని అంచనా. పరిస్థితులను చక్కదిద్దడానికి గాంధీజీ నవఖాలిని సందర్శించాడు. ఈ అల్లర్లను అహింసా సిద్ధాంతానికి పరీక్షగా ఆయన భావించాడు. ఘర్షణల కారణంగా దాదాపు 50,000 మంది నిరాశ్రయులు అయ్యారు. హింసను తప్పించుకోవడానికి పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపుర రాష్ర్టాలకు తరలి వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. దేశ విభజన తర్వాత నవఖాలి బంగ్లాదేశ్లో భాగమైపోయింది. కలకత్తా, నవఖాలితోపాటు 1946 మత ఘర్షణలు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకూ పాకి
పోయాయి. అలా దేశ విభజన సమయంలో జరిగిన మత ఘర్షణల్లో రక్తసిక్తమైన ప్రదేశంగా నవఖాలి నిలిచిపోయింది.
హైదరాబాద్ రాజ్యంలో బడి మొదలుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు రోజువారీ ప్రార్థనలో భాగంగా నిజాం రాజు శాశ్వతంగా వర్ధిల్లాలని కోరుకునేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రార్థనకు హిందువులు, ముస్లింలకు వేర్వేరు గదులు ఉండేవి. మామూలుగా అయితే విద్యార్థి ఏ మతానికి చెందినవాడైనా సరే నిజాం ఘనతను పొగడాల్సిందే. కానీ, 1938 నవంబర్ 16న అందుకు భిన్నంగా జరిగింది. ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న ఔరంగాబాద్లోని ఇంటర్మీడియెట్ కాలేజీలో నిజాం రాజ్యాన్ని కొనియాడటానికి బదులుగా ‘వందేమాతరం’ ఆలపించారు. ఇది రాజ్యమంతా వ్యాపించింది. దాంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు విద్యా సంస్థల్లో వందేమాతరం ఆలపించడాన్ని నిషేధించారు. అదే నెలలో రంజాన్ రావడంతో సెలవులు ఇచ్చారు. పండగ తర్వాత విశ్వవిద్యాలయం తెరిచారు. విద్యార్థులు వందేమాతరం మీద నిషేధం ఎత్తివేయమని వైస్ చాన్స్లర్కు విజ్ఞప్తిచేశారు. ఆయన ఒప్పుకోలేదు. దాంతో నవంబర్ 28న బీ హాస్టల్లో హిందువులు వందేమాతరం ఆలపించారు. ఆ మరుసటి రోజే విద్యార్థులను తరగతులకు హాజరవకుండా, హాస్టళ్లలో ఉండకుండా బహిష్కరించారు. విద్యార్థులు కూడా నిరసనకు దిగారు. ఇది ఇతర కళాశాలలు, పాఠశాలలకు కూడా వ్యాపించింది.
దాంతో డిసెంబర్ 12న 350 మంది విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. మరో 1,200 మందిని ఇతర విద్యాసంస్థల నుంచి బహిష్కరించారు. వీరికి నాగపూర్ విశ్వవిద్యాలయం ప్రవేశాలను ఇచ్చింది. అలా పీవీ నరసింహారావు నాగపూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న హిజ్లాప్ కాలేజీలో తన చదువు కొనసాగించారు.
1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. ఆ ప్రకంపనలు హైదరాబాద్ రాజ్యంలో కూడా ప్రభావం చూపించాయి. బొంబాయి వేదికగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమావేశానికి హైదరాబాద్ నుంచి స్వామి రామానంద తీర్థ హాజరయ్యారు. అక్కడ ఆయన గాంధీజీని కలిశారు. హైదరాబాద్ రాజ్యంలో క్విట్ ఇండియా ఉద్యమం ముందుకు తీసుకువెళ్లడానికి అనుమతి తీసుకున్నారు. అలా స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టింది. బొంబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న రామానంద తీర్థను నాంపల్లి స్టేషన్లో అరెస్టు చేశారు. అయితే తనను అరెస్టు చేసే విషయాన్ని ఆయన ముందే పసిగట్టారు. అందుకే స్టేట్ కాంగ్రెస్ కోరికలను తెలుపుతూ రాసిన ఒక లేఖను డా. మేల్కోటేకు పంపించారు. మేల్కోటే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ స్టేట్ కాంగ్రెస్ తరఫున ఒక లేఖ రాశారు. ఇలా ఉంటే, “క్విట్ ఇండియా” నినాదాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాదులోని కొన్ని విప్లవ శక్తులు బ్రిటిష్ వారు భారతదేశం నుంచి విరమించుకుంటున్నారంటే, హైదరాబాద్ కూడా స్వతంత్రం పొందినట్లే అని “ఆజాద్ హైదరాబాద్” నినాదం ఇచ్చారు.
హైదరాబాద్లో పండిత్ నరేంద్రజీ, విమలాబాయి మేల్కోటే, జీ.ఎస్. మేల్కోటే, జేఠేంద్ర రాష్ట్రవాది, పద్మజా నాయుడు తదితరులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రెసిడెన్సీ భవనం మీద కాంగ్రెస్ పతాకం ఎగరేసినందుకు గాను పద్మజా నాయుడును అరెస్టు చేశారు. ఇలా ఉంటే 1942 ఉద్యమ కాలంలో అబిద్ హసన్ సఫ్రానీ, ప్రొఫెసర్ సతీశ్ చంద్ర అనే హైదరాబాదీలు సుభాష్ చంద్రబోస్ ఏర్పాటుచేసిన భారత జాతీయ సైన్యంలో చేరారు.
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కార్యకలాపాల్లో ముఖ్యమైన సంఘటన ఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీపై బాంబు దాడి. సెంట్రల్ అసెంబ్లీ అంటే ఇప్పటి పార్లమెంట్. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ ఈ దాడికి పాల్పడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవేశపెడుతున్న బిల్లులను అడ్డుకోవడం, తమ గోడు వినిపించుకోని ప్రభుత్వానికి తమ గొంతు వినపడేలా చేయడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశం. అందుకే కేవలం పొగబాంబును మాత్రమే విసిరారు. దాంతో ఎవరికీ ఏమీ కాలేదు. ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి), సామ్రాజ్యవాదం నశించాలి అని నినాదాలు ఇస్తూ ఇద్దరూ పోలీసులకు లొంగిపోయారు. దీనికిగాను ఇద్దరికీ జీవితకాలం దేశాంతర వాస శిక్ష విధించారు. అయితే ఇదే సమయంలో శాండర్స్ హత్య కేసుతో భగత్ సింగ్కు సంబంధం ఉందని తేలింది. దానిని లాహోర్ కుట్ర కేసుగా విచారణ జరిపి 1931లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్కు ఉరిశిక్ష విధించారు. చంద్రశేఖర్ ఆజాద్ పోలీసు కాల్పుల్లో మరణించాడు. అలా 1931 నాటికి హెచ్ఎస్ఆర్ఏ తన ఉనికిని కోల్పోయింది. అయినప్పటికీ భారత జాతీయోద్యమ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు, జతిన్ దాస్ తదితర విప్లవకారులు తమ త్యాగాలతో భారతీయులకు చిరస్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిపోయారు.
భారత దేశ పాలనకు అత్యున్నతమైన చట్టం ‘భారత రాజ్యాంగం’. దీనిని రాజ్యాంగ సభ రూపొందించింది. ఇది కేబినెట్ మిషన్ ప్రణాళిక సిఫారసుల మేరకు ఏర్పాటయింది. సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఇందులో మొత్తం 389 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 296 మంది బ్రిటిష్ ఇండియా నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ సభలో భారత సమాజంలోని అన్ని మతాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూశారు. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగసభ తొలిసారి సమావేశమైంది. డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్రప్రసాద్ను సభకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సువిశాలమైన భారతావనికి సరిపోయే రాజ్యాంగం రూపొందించడం సభ లక్ష్యం. డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ‘ఆబ్జెక్టివ్ రిజల్యూషన్’ తర్వాత రాజ్యాంగ ప్రవేశికగా ఒదిగిపోయింది. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ. భారతదేశాన్ని సార్వభౌమ, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రవేశికలో పేర్కొన్నారు. పైగా రాజ్యాంగానికి కర్తలు ‘భారత ప్రజలే’ అని నొక్కిచెప్పారు. అందరికీ న్యాయం, సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛకు హామీ ఇచ్చారు. డా. అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. దానిమీద విస్తృతంగా చర్చ జరిగింది. చివరికి.. 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న సభ ఆమోదం పొందింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
స్వాతంత్య్ర సమరయోధుల కష్టాలకు మౌనసాక్షి బూఢా బర్గద్గా పిలిచే ఒక పురాతన మర్రిచెట్టు. సట్టిచోరా, బీబీగఢ్ సంఘటనలతో ఆంగ్లేయ అధికారులు దిగ్భ్రమచెందారు. ఉత్తరప్రదేశ్లో అతిపెద్దదైన కాన్పూర్ నగరమంతా ఆ సమయంలో బ్రిటిష్వారి కనుసన్నలలోకి వచ్చింది. అగ్నికి ఆజ్యంలా క్రూరుడైన
బ్రిటిష్ అధికారి కల్నల్ నీల్ 1857 జూలై 25న కాన్పూర్ నగరం అధికారిక ఇన్చార్జిగా వచ్చాడు. భారతీయుల పట్ల నీచంగా వ్యవహరించేవాడు ఆయన. ప్రస్తుతం నానారావ్ పార్కుగా వ్యవహరిస్తున్న ప్రాంతంలోని ఓ చెట్టుకు 133 మందిని ఉరితీయించాడు. ఇప్పుడు ఆ చెట్టు లేదు. అయినా ఆ మహావృక్షం ఆనవాళ్లు ఉన్న చోటు.. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నది.
భారతదేశంలో పరిపాలన సంస్కరణల కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1928లో జాన్ సైమన్ అధ్యక్షతన ఒక సంఘాన్ని పంపించింది. ఇందులో భారతీయులకు సభ్యత్వం లేకపోవడంతో దేశమంతా ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తింది. ఈ సమయంలో లాహోర్లో జరిగిన సైమన్ వ్యతిరేక ర్యాలీకి లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించాడు. పోలీసులు లాఠీ చార్జి చేయడంతో లాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిరోజుల్లోనే తన 63వ ఏట ఆయన మరణించాడు. ఈ సంఘటన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. లాఠీ చార్జికి బాధ్యుడు జేమ్స్ స్కాట్ అనే ఆంగ్ల అధికారి, కాగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు పొరపాటున జాన్ శాండర్స్ అనే మరో పోలీసు అధికారిని తుపాకీతో కాల్చివేశారు. అయినప్పటికీ, తమ చర్యను హెచ్ఎస్ఆర్ఏ సమర్థించుకుంది.
వల్లీయప్పన్ ఉళగనాథన్ చిదంబరం పిైళ్లె స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, కార్మిక నాయకుడు. కాంగ్రెస్ నాయకుడు కూడా. 1905 స్వదేశీ ఉద్యమం సమయంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయడానికి తనవంతు కృషిచేశాడు. సరకు రవాణాలో బ్రిటిష్ వారి గుత్తాధిపత్యాన్ని నిలువరిస్తూ 1906లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీ స్థాపించాడు. బ్రిటిష్ నౌకలకు పోటీనిస్తూ ట్యూటికోరిన్- కొలంబో మధ్య స్వదేశీ స్టీం నేవిగేషన్ తరఫున షిప్పింగ్ ప్రారంభించాడు. అందుకే భారతదేశంలో ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన ట్యూటికోరిన్ నౌకాశ్రయానికి చిదంబరం పిైళ్లె పేరుపెట్టారు. ఆ చొరవ తెల్లవారికి నచ్చలేదు. ఆయన మీద బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపింది. జీవితకాల జైలుశిక్ష విధించింది. ఆయన న్యాయవాద లైసెన్స్ రద్దుచేసింది.
మనుషులంతా సమానమే అని చాటుతూ కేరళకు చెందిన సంఘసంస్కర్త శ్రీనారాయణ గురు ఇచ్చిన నినాదమే… ‘ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం, మనుష్యను’ (మనుషులంతా ఒకే జాతి, ఒకే మతం, ఒకే దైవానికి చెందినవారు). నారాయణ గురు అసలుపేరు నాను అసన్. ఆయన 1856 ఆగస్టు 22న తిరువనంతపురం సమీపంలో జన్మించాడు. కేరళలో అణగారిన ఎజవ సామాజిక వర్గానికి చెందిన నారాయణ గురు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేశాడు. 1888 ఫిబ్రవరి 18, శివరాత్రి నాడు అరవిప్పురంలో కుల కట్టుబాట్లను అతిక్రమిస్తూ శివుణ్ని ప్రతిష్ఠించాడు. మనలోపల దాగి ఉన్న పరమాత్ముణ్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తాను నిర్మించిన ఆలయాలలో అద్దాన్ని ప్రతీకగా నిలిపేవారు నారాయణ గురు. 1903లో శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్ఎన్డీపీవై) పేరుతో ధార్మిక సేవా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పటికీ కేరళలో తన ఉనికిని చాటుకుంటుండటం విశేషం. ఆదిశంకరుల అద్వైత వేదాంతానికి మద్దతుదారైన నారాయణ గురు అద్వైత దీపిక, ఆశ్రమ లాంటి రచనలు చేశారు. 1920 సెప్టెంబర్ 20న మరణించారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన ‘చేయండి లేదా చావండి’ నినాదంతో స్ఫూర్తి పొందిన ప్రజలు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. అలాంటివారిలో చిత్తూ పాండే ఒకడు. పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లా రట్టుచక్ గ్రామంలో జన్మించాడు. ఆయనను స్థానికంగా ‘శేర్ ఎ బలియా’ (బలియా సింహం) అని పిలుచుకుంటారు. ఆయన బలియాలో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1942 ఆగస్టు 19న బలియా జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. అలా బలియా కలెక్టర్ నుంచి అధికారం లాక్కోవడంలో పాండే విజయం సాధించాడు. ప్రభుత్వం అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయించాడు. అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు. ఆగస్టు 22- 23 రాత్రికల్లా బ్రిటిష్ సైన్యాలు బలియాలో ప్రవేశించాయి. అలా జాతీయ ప్రభుత్వం కనుమరుగైపోయింది. చిత్తూ పాండే తప్పించుకుని పోయాడు. బలియా మార్గంలోనే బెంగాల్లో తామ్లుక్ జాతీయ సర్కార్, మహారాష్ట్రలో సతారా ప్రతి సర్కార్ ఏర్పడ్డాయి. సతారా ప్రతి సర్కార్ను నానా పాటిల్ స్థాపించాడు. ఇది 1943 నుంచి 46 వరకు మనుగడ సాగించింది.
…? చింతలపల్లి హర్షవర్ధన్