ప్రత్యేక ప్రతినిధి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కు హరితహారం కార్యక్రమం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. దేశంలోనే అత్యధికంగా మొక్కలు నాటిన రాష్ట్రం గా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జీసీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ.. 2019-20వ సంవత్సరంలో అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణలో అత్యధికంగా మొక్కలు నాటారని తెలిపారు. ఆ ఏడాది దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటితే ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటారని పేర్కొన్నారు.
పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి తెలంగాణ మొద టి స్థానంలో నిలువగా, 34.54కోట్ల మొక్క లు నాటి మహారాష్ట్ర రెండోస్థానంలో, 22.59 కోట్ల మొక్కలతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచినట్టు చెప్పారు. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం వల్ల కేవలం మొదటి మూడేండ్లలోనే భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 4% పచ్చదనం పరుచుకుందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. తక్కువకాలంలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ప్రారంభమైన హరితహారం ఆరేండ్లలోనే 90% లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది.
దేశంలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో రూపొందించిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కృషిచేసిన అటవీశాఖతోపాటు పంచాయతీరాజ్, ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులను మంత్రి అభినందించారు.
దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రం గా తెలంగాణ నంబర్వన్ గా నిలవడం ఎంతో సంతోషంగా ఉన్నదని ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ చేశారు. సీఎం మార్గదర్శకంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం మంచి ఫలితాన్నిచ్చిందనడానికి ఇది నిదర్శనమన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ చెట్లు ఉన్న పచ్చని ప్రముఖ నగరాలలో ఒకటిగా హైదరాబాద్ను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఆర్బర్ డే ఫౌండేషన్’ సంస్థ ఇటీవల ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 150.23
తెలంగాణలో 38.17
మహారాష్ట్రలో 34.54
ఉత్తరప్రదేశ్ 22.59