జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. కానీ అంతటితో కథ సుఖాంతం కాలేదు. ఎన్నో మలుపులు. యుద్ధ రూపంలో ఓ తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది.
తెలతెలవారుతున్న సమయం. నదీ తీరం..దూరంగా ఉన్న ఆలయం నుండి అర్చక స్వాములు పఠిస్తున్న శ్రావ్యమైన సుప్రభాతం వినిపిస్తున్నది.ప్రాతఃకాల పూజాధికాలు నిర్వహించుకొనేవారు నదీ స్నానం చేస్తున్నారు. మరికొందరు స్నానం ముగించి.. నదీ మాతను, వారి వారి ఇష్టదైవాలను ప్రార్థిస్తూ.. ఎవరికివారు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై, మరొకరిని పట్టించుకోకుండా ఉన్నారు.పచ్చని చెట్లను ఆశ్రయించుకొని ఉన్న పక్షుల కిలకిలా రావాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
నదీ తీరంలో వేద పాఠాలు, ప్రవాహ ధ్వని, పశుపక్ష్యాదుల జీవ శబ్దాలు కలగలిసి.. ఉదయాన్ని సుమధుర నాదమయంగా మారుస్తున్నాయి.ఆ సమయంలో..ఒక మూడేండ్ల వయస్సున్న పసిపిల్లవాడు తడబడే అడుగులతో పరుగులు తీస్తూ, నీటి ప్రవాహం దగ్గరకు వస్తున్నాడు.
ముందున్నది నది అని, మునిగితే ప్రాణాలు పోతాయని తెలియని వయసు.
తపతపమంటూ అడుగులు వేస్తూ వస్తున్న ఆ పసివాడిని చూసింది.. అక్కడకు దూరంగా ఉన్న ఒక నిండు ముత్తయిదువ.
బంగారు రంగు శరీర ఛాయ. ముక్కుకు చక్కని నగిషీలు చెక్కిన ముక్కెర, నుదుటన గుండ్రటి పెద్ద కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసల గొలుసు, ముత్యాల హారం, మామిడి పిందెల మూడు వరుసల ముప్పేట గొలుసు. ఎవరోకానీ, పెద్దింటి ఆడబిడ్డలా ఉంది. వయస్సు పాతికేళ్లకు మించి ఉండదు. చెవులకు కమ్మలు, కళ్లకు కాటుక.. పెద్ద పెద్ద కళ్లతో అటూ ఇటూ చూస్తున్న ముత్తయిదువకు నీటి ప్రవాహం కేసి పరుగులు తీస్తున్న పసిపిల్లవాడు కనిపించాడు.
“నాయనా.. ఆగు!” అక్కణ్ణించే అరిచింది.
అంతే! ఏదో మంత్రం వేసినట్టు ఆ పిల్లవాడు ఆగిపోయాడు.
వెనక్కి తిరిగి చూశాడు.
అమ్మలాంటి అమ్మ కనిపించింది.
అటూ ఇటూ ఊగుతూ, బుడిబుడి అడుగులు వేస్తూ తనను పిలిచిన అమ్మ దగ్గరకు చేతులు చాచి వస్తున్నాడు.
తనూ ముందుకు పరిగెత్తి, పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడింది.
ఆ పిల్లవాడు ఆమె ముఖం చూసి నవ్వడం మొదలుపెట్టాడు.
‘ఈ పిల్లవాడు ఒక్కడే ఎలా వచ్చాడు? సంబంధించినవారు ఎవరూ లేరా?’ అన్నట్టు చుట్టూ చూసింది.
దూరంగా కనిపించారు భార్యాభర్తలు.. ఇద్దరూ!
ఒక చెట్టుకు చేరగిలబడి ఉన్నారు. ఎటో చూస్తున్నారు కానీ, ఆ చూపుల్లో చైతన్యం లేదు.
పసివాడు ఒక్క ఉదుటున ఈ అమ్మ చేతుల్లోంచి జారి, కిందపడి..
“అమ్మా.. నాయనా!” అంటూ పరుగులు తీశాడు.
పిల్లవాడి అరుపులకు ఈ లోకంలోకి వచ్చారు. ఎవరో కలిగిన వారిలానే ఉన్నారు.
వారిలో, భార్య ముందుగా తేరుకొని.. తనకోసం పరుగులు పెట్టి వస్తున్న బిడ్డను చూసింది.
“చెన్నయ్యా!” అని గట్టిగా అరిచింది. లేచి ముందుకు పరిగెత్తుకొచ్చింది.
ఆమె అరుపులు విని భర్త కూడా తల తిప్పి చూశాడు.
పిల్లవాడు ఎక్కడున్నాడో.. అసలు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో కాసేపు అతనికి ఏమీ అర్థం కాలేదు.
తనూ లేచి పిల్లవాడి దగ్గరకు వెళ్లాడు.
“ఏ ఆలోచనల్లో ఉన్నారు మీరిద్దరూ? పిల్లవాడు తెలియక నది దగ్గరకు ఒక్కడే వెళ్తుంటే, నేనే ఆపి తీసుకొచ్చాను. బిడ్డను అలా వదిలేస్తే ఎలా?” చిరుకోపంతో మందలించింది.. ఆ ముత్తయిదువ.
“అమ్మా.. మీరెవరో కానీ, వేలవేల దండాలు. మా బిడ్డను చల్లగా కాపాడినందుకు” దండం పెట్టింది ఆ పిల్లవాడి తల్లి.
“మా బిడ్డను మీరు రక్షించారు. నమ్ముకొన్న వాళ్లు నట్టేట ముంచారు. అసలు నీటిలో పడవలసింది.. ఈ పసిపిల్లవాడు కాదమ్మా.. మేమిద్దరం” దుఃఖం గొంతులో అడ్డం పడుతుంటే ఆగాడు ఆ పిల్లవాడి తండ్రి.
“నీటిలో పడి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది” వారికేసే చూస్తూ అడిగింది.
“బతికి ఉండగలిగే పరిస్థితులు.. భగవంతుడు కల్పించనప్పుడు, చేసిన అప్పులు పెను తిప్పలై.. రుణ పాశాలు, యమ పాశాలుగా మారినప్పుడు, పరువు నిలుపుకోవడం.. పెద్ద బరువైనప్పుడు, శ్వాస పీల్చే ఆశ.. నిరాశా నిస్పృహలుగా మారినప్పుడు.. ప్రవహించే నీరు మా కన్నీరు తుడిచే సంజీవనిలా కనిపిస్తుంది. భూమ్మీద బతుకే భారమైనప్పుడు.. భూమిని వదిలి నీటిలో కలిసిపోతే మంచిదనిపించింది. నదీ గర్భంలో మేము మునిగితే వెన్నంటి ఉన్న కష్టాలు, బాధలు మాతోపాటే మునిగిపోతాయి. అందుకేనమ్మా.. ఇక్కడికొచ్చాం. చప్పున దూకి చచ్చే ధైర్యంలేక తటపటాయిస్తూ కూర్చున్నాం. కనులు తెరిచి చూస్తే ఈ లోకంలో నరకమే కనిపిస్తున్నది. కను మూస్తేనన్నా ఆ నరకాన్ని తప్పించుకోవచ్చని అనుకొంటున్నాం..”
భర్త మాటలు వింటూ, తలూపుతూ తనూ కన్నీటి పర్యంతమైపోయింది ఆ ఇల్లాలు. తరువాత తేరుకొని ఆ తల్లికి తన బాధ చెప్పుకొన్నది..
“అమ్మా.. వెంకటాపురం మా గ్రామం. ఈయన పేరు నారాయణ. నాపేరు వరలక్ష్మి. పేరుకే కాదు చూడటానికీ లక్ష్మీనారాయణుల్లా ఉన్నామని మా పెళ్లిలో అందరూ దీవించారు. దేవుళ్లపేరు పెట్టుకొన్నంత మాత్రాన కష్టాలు రాకుండా ఉంటాయా? మా పేర్లలో ఉన్న లక్ష్మి.. జీవితాల్లో లేకుండా పోయింది..”
ఆ ఇల్లాలి మాటలు వింటున్న ఆ ముత్తయిదువ ఆలోచిస్తున్నట్టు తలూపింది.
భార్య చెప్తున్న మాటలను అందుకొంటూ, భర్త నారాయణ చెప్పాడు..
“అమ్మా.. మా తలరాతను దేవుడు ఎందుకిలా రాశాడో తెలియదు. నేను వ్యాపారస్తుణ్ణి. న్యాయబద్ధంగా, అతి తక్కువ లాభంతో పది మందికీ కావలసిన వస్తువులను అమ్ముకొనేవాణ్ణి. ఊళ్లలో పంటలు పండక కరువొచ్చింది. ఎవరి చేతిలోనూ చిల్లి గవ్వ లేదు. కానీ ఆకలికీ, అవసరానికీ కళ్యాణమైనా ఒకటే.. కరువైనా ఒకటే! సరుకులిచ్చాను కానీ పైకం అడుగలేక పోయాను. ఉంటే, అడక్కుండానే వచ్చి మరీ ఇచ్చేవారిని.. లేనప్పుడు ఇవ్వమని ఎలా వేధించేది? అందుకే ఇచ్చినప్పుడు తీసుకొన్నవాడిని, ఇవ్వలేనప్పుడు ‘నా ప్రాప్తం ఇంతే!’ అనుకొన్నాను. కానీ, నాకు అప్పు ఇచ్చినవాళ్లు ఒప్పుకోలేదు. పరాయివాళ్లు కాదు. మేము తెలియనివాళ్లూ కాదు. అయినవాళ్లే.. ఒకప్పుడు ఆత్మీయులే! మనిషికీ మనిషికీ మధ్యన ఉండేది ధనబంధమే అనుకొన్నారు. నిప్పులా బతికిన మమ్మల్ని నిలువునా కాల్చేసే ప్రయత్నాలు చేశారు. భరించలేక పోయాం. రుణ బాధ.. దారుణమై, మరణాన్ని మించిన మందు ఇంకోటి లేదనిపించింది..” చెప్పలేక చెప్పాడు.
“ఆగాగు.. ఆత్మహత్య మహాపాపం కదా! ఈ జన్మలోని దోషం.. ఈ జన్మతోనే పోదుకదా! అది వచ్చే జన్మలో కూడా వెంటాడకుండా ఉంటుందా?” అడిగిందామె.
“అమ్మా.. వేరే మార్గం కనబడలేదు. మేము మనుషులు అనుకొన్నవాళ్లు మా పాలిట రాక్షసులయ్యారు. మేము దండంపెట్టే దేవుడు.. రాయిలో ఉన్నవాడు, రాయిలోనే ఉన్నాడు” పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకొంటూ అన్నది వరలక్ష్మి.
“దేవుడు రాయికాదు. మనుషులు రాక్షసులూ కారు. మీలో తలెత్తిన తప్పుడు ఆలోచనే.. అడవిని కాల్చేసే నిప్పులాగా మీ మనసులను కాల్చేస్తున్నది. ప్రతి తప్పుకూ ప్రాయశ్చిత్తం ఉన్నట్టే.. ప్రతి రుణానికీ విమోచనం ఉంటుంది. మీరు అప్పులే చేశారు. తప్పులు చేయలేదు. సంపాయించి, కూడబెట్టుకొని మేడలు కట్టి.. కట్టాల్సిన వాళ్లకు ఎగ్గొట్టలేదు. కాలం కలిసిరాక, కట్టలేక పోయారు. మీరు బతికుంటేనే ఆ రుణం తీర్చుకొనే అవకాశమూ బతికుంటుంది. బలవంతంగా మీరు పోతే.. మీరు మాత్రమే ఈ లోకం నుండి పోతారు. రుణాలు పోవు. ఆ దోషమూ పోదు..” స్థిరంగా పలికిందామె కఠం.
నారాయణ, లక్ష్మీ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తమ కన్నీటి కథకు ఈమె కంట కన్నీరు రాకపోయినా సరే.. కానీ, అదేదో మామూలు విషయంలాగా తీసి పారేయడం.. వారికి మింగుడు పడలేదు.
“కష్టాలు, అప్పుల బాధలు అనుభవించిన వారికే తెలుస్తాయి. కానీ, కథలాగా వినేవారికి అది కథలాగానే కనిపిస్తుంది. సరే, మా సమస్యకు పరిష్కారం మీకు తెలిసి ఏదైనా ఉందా?” కాస్త హేళనగా అడిగాడు నారాయణ.
“ఎందుకు లేదు.. ఉంది!” అన్నది ఆ ముత్తయిదువ.
“ఉందా..?” ఒక్కసారిగా ఆశ్చర్యంగా అన్నారిద్దరూ.
“ఇదిగో.. ఇది చూడండి” అంటూ ఒక పెద్ద తమలపాకును వారికిచ్చింది. తమలపాకు నిండా కుంకుమ ఉన్నది.
వారు చూస్తుండగానే గాలికి ఆ కుంకుమ ఎగిరిపోయింది.. నెమ్మది నెమ్మదిగా!
అప్పుడు కనిపించాయి.. ఆ ఆకుపైన రాసిన అక్షరాలు.. స్పష్టంగా!
‘నరసింహా’
ఎప్పుడెప్పుడు యుద్ధరంగానికి వెళ్దామా? ఎంత తొందరగా విజయం సాధిస్తామా? త్రిభువనమల్లుడిని ఓడించి, అతడిని తన సామంతుడిగా ప్రకటించి.. తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకొందామా? అని తహతహలాడి పోతున్నాడు హొయసల సామ్రాజ్యాధీశుడు విష్ణువర్ధనుడు.
కానీ, తన ఆస్థానంలోని ప్రముఖుడు, గణిత శాస్త్రవేత్త, పాలనా వ్యవహారాల సలహాదారుడు రాజాదిత్యుడు.. తన నిర్ణయానికి వ్యతిరేకంగా వాదించడం నచ్చలేదు మహారాజుకు. అయినా, సంయమనం పాటించి అతని వాదనను నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాడు.
ఈ విషయానికి సంబంధించి ఒక లేఖ వచ్చిందని చెప్పడంతో, ఆ లేఖ ఏమిటో.. దానిలో ఏమి రాసుందో చూస్తే గానీ, రాజాదిత్యుని మాటలను విశ్వసించలేము అనుకొన్నాడు విష్ణువర్ధనుడు. సైన్యాధికారి నుండి ఆ లేఖను రాజాదిత్యుడు అందుకొని.. మహారాజు చేతికి అందించాడు.
అందులో ఇలా ఉంది..
హొయసల సామ్రాజ్యాధీశులు, పరాక్రమవంతులు, అరివీర భయంకరులు శ్రీశ్రీశ్రీ విష్ణువర్ధన మహారాజులవారికి అనేక నమస్కారములు తెలియజేసుకొంటూ.. తమ స్నేహితుడు ‘నరవర్మ’ రాయు లేఖార్థములు!
ఇటీవలనే నేను త్రిభువనమల్లునిపై దాడిచేసి అతడిని మృత్యువు అంచులదాకా తీసుకువెళ్లాను. అతడు మరణించాడని భావించి, వెళ్లిపోయాను. కానీ, కొన ఊపిరితో కోట చేరిన త్రిభువనమల్లుడు బతికి బట్టకట్టాడు. అయితే, మునుపటి త్రిభువనుడు కాదు. ముల్లు తీసిన మల్లుడిగా మారిపోయాడు. మీరు అతడిని జయించాలంటే, ఇదే సరైన సమయం. వేరే ఆలోచన లేకుండా.. ముందుకు వెళ్లండి.ఇట్లు.. మీ విజయాభిలాషి మరియు శ్రేయోభిలాషి.. నరవర్మ లేఖను బిగ్గరగా చదివిన విష్ణువర్ధనుడు పెద్దగా నవ్వాడు.
“రాజాదిత్యా! నీకు గణిత జ్ఞానం ఉందికానీ, ఇంగిత జ్ఞానం లేదేమో అనిపిస్తున్నది. ‘యుద్ధం వద్దు.. మనం ఓడిపోతాం’ అని నువ్వు భయపడింది, నన్ను భయపెట్టింది ఈ లేఖను చూశా? ఆశ్చర్యంగా ఉందే! ‘త్రిభువనమల్లుడు శక్తి హీనుడైనాడు, ఒక్క దెబ్బకు కుప్పకూలిపోతాడు’ అని నరవర్మ స్వయంగా రాసి పంపాడు. ఇది చూస్తుంటే, వెంటనే అతడి మీదకు యుద్ధానికి వెళ్లి ఘన విజయం సాధించాలని ఉంది”.
రాజాదిత్యుడు తన ప్రభువుకేసి చూశాడు.
“ప్రభూ! మీరు ఈ లేఖలో నరవర్మ రాసిన వాక్యాలే చదివారు. కానీ, వాటి వెనుక ఉన్న అర్థమూ, ఉద్దేశ్యమూ మనం అవగాహన చేసుకోవాలి. నరవర్మ చేతికి త్రిభువనుడు ఒక్కడే చిక్కాడు. పదిమంది సాయుధులున్నా అతడిని ఏమీ చేయలేక పోయారు”.
“రాజాదిత్యా! ఏమీ చేయలేక పోవడమేమిటి? త్రిభువనమల్లుడిని స్పృహలేని స్థితిలో లోయలో పడవేసి వెళ్లారు. తెలుసుకదా?” ఇంకా ఏమిటీ వాదోపవాదాలు అనుకొన్నాడు విష్ణువర్ధనుడు.
“కానీ, అతను చావలేదు.. బతికాడు. మళ్లీ కోటలో రాజ్యపాలన చేస్తున్నాడు”.
“ఆగాగు రాజాదిత్యా! చావుతప్పి, కన్ను లొట్టపోయి, బతికి బట్టకట్టి.. ఈసురోమని కాలం వెళ్లదీస్తున్న త్రిభువనుడు ఇంకా నీ కంటికి శక్తివంతుడిలా కనిపిస్తున్నాడా?”
“ప్రభూ! నరవర్మకు త్రిభువనమల్లుడు ప్రత్యక్ష శత్రువు. సింహాసనం మీద తన అన్నను కూర్చోబెట్టాడని నరవర్మకు త్రిభువనమల్లుడిపైన కోపం! అంత కోపం ఉన్నవాడు, తనే దండెత్తి వెళ్లి త్రిభువనుడి అంతం చూడాలి కదా? మరి మీకెందుకు లేఖ రాశాడు? అనేదే నా సందేహం” అన్నాడు రాజాదిత్యుడు.
ఆ సందేహాన్ని కొట్టి పడేశాడు విష్ణువర్ధనుడు.
“రాజాదిత్యా! లేనిపోని అనుమానాలతో నిప్పుల మీద నీళ్లు చల్లకు. యుద్ధం అనివార్యం! అభిలషణీయం.. అందరూ సంసిద్ధులు కండి!”
తీవ్రమైన స్వరంతో పలికాడు విష్ణువర్ధనుడు.
అప్పుడే.. జయజయ ధ్వానాలు వినవచ్చాయి.
“ప్రభువులకు జయము.. ఒక శుభవార్త ప్రభూ!” అంటూ ప్రవేశించి, వినయంగా అభివాదం చేశాడు సైన్యాధికారి వీరమల్లుడు.
“ఏమిటా శుభవార్త వీరమల్లా..?” వీరమల్లుని ఉత్సాహాన్ని గమనించి, సంతోషంగా అడిగాడు మహారాజు.
“ప్రభూ! మొదటి దశలోనే మనం, త్రిభువనమల్లుడిపైన ఘన విజయం సాధించాం.. మహావీరుణ్ణని విర్రవీగే అనంతపాల సేనానిని చావుదెబ్బ తీశాం. అనంతపాల సేనాని త్రిభువనమల్లుని సైనిక శక్తిలో అతి ముఖ్యమైన యోధుడు. అతని సహచర యోధులను యుద్ధరంగంలో మట్టుపెట్టి, చాళుక్య సైన్యం అడుగు ముందుకు వేయకుండా అడ్డగించాం. సరిహద్దు దుర్గాన్ని స్వాధీనం చేసుకొన్నాం. ఇదంతా మీ ఘనతే ప్రభూ.. మీ శిక్షణలో, పర్యవేక్షణలో మన సైన్యం అజేయ శక్తిగా రూపుదిద్దుకొన్నది. విజయం మనదే ప్రభూ!” గొప్ప సంతోషంతో పలికాడు వీరమల్లుడు.
ఆ మాటలు వింటూనే అందరూ ముక్త కంఠంతో విజయ నినాదాలు చేశారు.
“విష్ణువర్ధన మహారాజుల వారికి జయము..
హొయసల సామ్రాజ్య లక్ష్మికి విజయము..”
జయజయ ధ్వానాలు వింటూ.. రాజాదిత్యుడికేసి పరిహాస పూర్వకంగా చూశాడు విష్ణువర్ధనుడు.
‘ఇంక నేను చెప్పాల్సిందేమీ లేదు’ అన్నట్టుగా తల దించుకొన్నాడు రాజాదిత్యుడు.
“రేపు ఉదయమే.. మన జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. సర్వం సన్నద్ధం కావాలి”
ప్రభువుల ఆజ్ఞ వెలువడింది. ఆ ప్రకారమే యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి.
(మిగతా వచ్చేవారం)
-అల్లాణి శ్రీధర్