జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. కానీ అంతటితో కథ సుఖాంతం కాలేదు. ఎన్నో మలుపులు. యుద్ధం రూపంలో ఓ తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది.
విష్ణువర్ధనుడి శిబిరం కోలాహలంగా ఉంది. మంత్రులు, సైన్యాధికారులు, చారులు, యుద్ధ నిపుణులు రహస్య సమావేశంలో కొలువుదీరి ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిమాత్రం నిరాసక్తంగా ఉన్నాడు. ఆ వ్యక్తి రాజాస్థానంలో ప్రముఖుడు. రాజకీయ, సాహిత్యరంగాల్లో విష్ణువర్ధన మహారాజుకు ప్రధాన సలహాదారుడు.
అతడే.. రాజాదిత్యుడు!
రాజాదిత్యుడు ముఖ్యంగా గణితశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సాధించాడు. ‘వ్యవహార గణితం’, ‘లీలావతి’, గణితశాస్త్ర గ్రంథాలను అనితర సాధ్యమైన రీతిలో రచించాడు. అందుకే, రాజాదిత్యుడంటే విష్ణువర్ధనుడికి గురి ఎక్కువ. రాజకీయ వ్యవహారాల్లో, లౌకిక విషయాల్లో ఏ విధమైన సలహా ఇచ్చినా, అది ఒక లెక్కసరిగా ఉంటుంది. అయితే, అనవసరంగా విష్ణువర్ధనుడు ఈ యుద్ధాన్ని సంకల్పించాడని ఈ సమయంలో, అది సరైన నిర్ణయం కాదని బలంగా భావిస్తున్నాడు రాజాదిత్యుడు.
కానీ, ‘ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి ఎలా చెప్పాలా?’ అనే సంశయంలో, సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు.
ఆ సమయం రానే వచ్చింది.
యుద్ధ ప్రకటన చేశాక, కృష్ణానదీ తీరందాక తరలి వచ్చాక.. ఇక వెనక్కి వెళ్లడమనే ప్రసక్తే లేదు. కానీ, విష్ణువర్ధనుడు అందరినీ సమావేశపర్చి ఒకటే అడిగాడు..
“హొయసల సామ్రాజ్య శ్రేయోభిలాషులారా! వీరులారా! మనం మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలిగే శుభతరుణం ఆసన్నమైంది. ఒక్కొక్క వీరుడు ఒక్కొక్క దుర్గమై, మహా సామ్రాజ్య విస్తరణకు మార్గం వేయాలి. అందరూ ఇందుకు సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. విజయమో.. వీర స్వర్గమో..”
విష్ణువర్ధనుడి మాటలు అందరిలో కొత్త ఉత్సాహాన్ని రగిలించాయి. కానీ, రాజాదిత్యుడికి రుచించలేదు. ముభావంగా ఉండిపోయాడు. అది గమనించాడు విష్ణువర్ధనుడు. తనలో తానే చిన్నగా నవ్వుకొన్నాడు.
“రాజాదిత్యా! ఎందుకు ముభావంగా ఉన్నారు?”
రాజుగారి మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు రాజాదిత్యుడు.
“అలాంటిదేమీ లేదు ప్రభూ! నా భావం ఏదైనా, ప్రభువులు చేసిన నిర్ణయమే కదా, మేము అనుసరించవలసింది?”
వినయంగా అన్నాడు.
“అవును, నిర్ణయం జరిగిన తర్వాత.. అది శాసనమే అవుతుంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పక్కనపెట్టి, రాజాజ్ఞను పాటించవలసిన ధర్మం అందరిపైనా ఉంటుంది. కానీ, మేము ఇప్పుడు చేస్తున్నది పునఃసమీక్ష! చేస్తున్న పని, చేయవలసిందే! చేయాల్సిన క్రమం మాత్రం మరోసారి ఆలోచించుకోవాలి. అందుకే మీ సలహాలు కోరుతున్నాం” నిర్ద్వంద్వంగా చెప్పాడు విష్ణువర్ధనుడు.
“పాటించే వారికి కదా సలహాలు ఇవ్వాలి..”
“కాదు! ఆస్థానంలో.. ఆ స్థానంలో ఉన్నారు కనుక, సలహాలు ఇవ్వాలి. సలహా అనేది ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అంతేతప్ప తప్పక పాటించాలి అనుకొంటే.. దాన్ని సలహా అనరు. శాసనం అంటారు” అన్నాడు విష్ణువర్ధనుడు.
“ఏ విషయంలో సలహా చెప్పమంటారు?” అడిగాడు రాజాదిత్యుడు.
ఈ ధోరణి రాజుకు చికాకు కలిగించింది. కోపం వచ్చింది..
అయినా తమాయించుకొన్నాడు.
“రాజాదిత్యా! నీవు ఈ విధంగా అడగడం మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. యుద్ధం పైన మీ అభిప్రాయం ఏమిటి?”
“మహారాజా! యుద్ధం దేనికోసం? యుద్ధం అనేది యుద్ధం కోసమా? లేక విజయం కోసమా? ఒకవేళ విజయం కోసమే అయితే, మనం ఆలోచించవలసింది మన శక్తియుక్తుల గురించి కాదు. ఎదురుపక్షం శక్తియుక్తుల గురించి. ‘విజయం’ అనేది సంకల్పంతో రాదు. సాధించే సామర్థ్యం ఉన్నప్పుడే వస్తుంది”.. రాజుగారే స్వయంగా అడిగారు కనుక తన అభిప్రాయం విస్పష్టంగా చెప్పడంలో తప్పు లేదనుకొన్నాడు రాజాదిత్యుడు.
“మనం విజయం సాధించలేమని నీ అభిప్రాయమా? అందుకు మన శక్తియుక్తులు సరిపోవని సందేహమా? నీవు గణితంలో ఘనాపాఠీవయినా.. నీ లెక్క తప్పొచ్చేమో కానీ, శక్తియుక్తుల గణనలో మా లెక్క తప్పదు. అంతెందుకు.. మా సౌజన్యం వల్ల ఎదురు మాట్లాడే స్నేహితులున్నారేమో గానీ, మాకు ఎదురు లేదు. ఎదుర్కొనే శక్తి ఉన్నవాళ్లు లేరు..” ఒక రకమైన ఉద్వేగం ధ్వనించింది విష్ణువర్ధనుడి మాటల్లో!
“ప్రపంచంలో ఎదురే నిలువని శక్తి ఎవరికీ ఉండదు. దేనికైనా పరిమితి ఉంటుంది. ‘అతి విశ్వాసం అనర్థదాయకం’ అని ప్రభువులకు సవినయంగా విన్నవించుకొంటున్నాను”
“రాజాదిత్యా! మా విజయపరంపర ఒకసారి నీకు గుర్తు చేస్తాను విను! ‘గంగావాడి’ తెలుసుగా, అది చోళుల ఆక్రమిత ప్రాంతం. మా అన్నగారు ‘వీర బళ్ళాలుడి’ పాలనలో అది చోళుల ఆక్రమణకు గురైంది. మేము పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అత్యంత శక్తివంతంగా పోరాడి, మళ్లీ స్వాధీనం చేసుకొన్నాం. అంతేకాదు, ఆ అప్రతిహత జైత్రయాత్ర అక్కడ మొదలై.. ఇప్పటి వరకూ విజయపథాన కొనసాగుతున్నది” అని చెబుతూ విజయగర్వంతో అందరికేసీ చూశాడు.
“అవును ప్రభూ! ఈ జైత్రయాత్రకు ఎదురేలేదు. తమ ధైర్యానికి, శౌర్యానికి, యుద్ధ రచనా నైపుణ్యానికి దేశదేశాలు గడగడలాడుతున్నాయి. ‘మీరెప్పుడు ఆదేశాలిస్తారా.. ఎప్పుడెప్పుడూ దేశదేశాలను తమ పాదాక్రాంతం చేయాలా?’ అని మా గరుడదళం ఉవ్విళ్లూరుతున్నది” గరుడ దళాధ్యక్షుడు ఆవేశపూరితంగా అన్నాడు.
విష్ణువర్ధనుడు రాజాదిత్యునికేసి చూస్తూ.. పరిహాసంగా నవ్వాడు.
“ఇంకా గుర్తుతెచ్చుకో రాజాదిత్యా! నీలగిరి ప్రాంతంలో తలఎత్తి చూసిన ‘చెంగల్వాలు’, ‘కొంగల్వాల’ మెడలు వంచాం. మాకు సామంతులం అనిపించాం. నిడుగళు చోళ పాలకుడు ‘ఇరుక్కువేలా’ మా వజ్ర హస్తాల నడుమ ఇరుక్కొని, గిలగిల కొట్టుకొని ‘దాసోహం’ అన్నాడు. నోలంబవాడి, బనవాసి, కడంబాలు (గోవా), తుంగభద్ర సమీపాన ఉచ్చంగి పాండ్యాలు, తుళునాడు అలుపాలు, హొసగుండ సంతారాలు.. ఈ వంశాల పాలకులంతా మా పాదాక్రాంతమై, కప్పాలు కడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇది కాదా విజయం? ఇవి కాదా శక్తియుక్తులకు సజీవ సాక్ష్యాలు” గర్జించాడు విష్ణువర్ధనుడు.
మాట్లాడలేదు రాజాదిత్యుడు.
“ఏం రాజాదిత్యా! మాట ఆగిపోయిందా? మహారాజు మనవాడే కదా, మనం ఏమన్నా మళ్లీ మనల్ని ఏమీ అనని ఒక సౌజన్యశీలి కదా అనుకొన్నావేమో! ఆయుధాలు వదిలేసి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి.. దిక్కు తోచక ‘దేవుడే దిక్కు’ అనుకొంటున్న.. త్రిభువనమల్లుడా మాకు ఎదురు నిలిచేది? అతడినా నువ్వు మహా వీరుడనుకొంటున్నావు. మాకు పిరికిమందు నూరి పోస్తున్నావు? ఏ విధంగా మన యుద్ధ నైపుణ్యం, శక్తియుక్తులు సరిపోవని నువ్వనుకొంటున్నావో నాకు స్పష్టంగా తెలియాలి. నువ్వు అలా చెప్పలేకపోతే నీ ఉద్దేశం సదుద్దేశం కాదని మేమనుకోవలసి వస్తుంది”.
ఇప్పుడు అందరి దృష్టీ రాజాదిత్యుడిపైనే ఉంది. ఏం చెప్తాడు. ప్రభులవారి ఆగ్రహానికి గురికాకుండా ఎలా తప్పించుకొంటాడు?
“ప్రభూ! మీరేవిధంగా తీసుకొన్నా నేను చెప్పాలనుకొన్నది చెప్పక తప్పదు. మీరన్నట్లు విలువైన మీ ఆస్థానంలో నా స్థానం సలహాదారు పదవే! మీకు నచ్చినట్టు ఉండాలని నేను అభిప్రాయం చెబితే.. అది సలహా కాదు. పొగడ్త అవుతుంది. సరైన మార్గం తెలిసుండీ మిమ్మల్ని తప్పుదారికి మళ్లించినట్లు అవుతుంది. మీకు నచ్చినా.. నచ్చకపోయినా నేను ఇచ్చే సలహా, సరైన మార్గం చూపడంలో మీకు సహాయపడాలి. నిపుణులు చెప్పినదాన్ని పరిశీలించి, పరీక్షించి, పలు విధాలుగా ఆలోచించి.. ‘వద్దు’ అనుకొంటే, అది ఉత్తమం! మా పనితనానికి ఫలితం. అలాకాదు.. ‘నాకు నచ్చని మాటలు చెప్పొద్దు’ అంటే మా జ్ఞానానికి, అనుభవానికి పదును పెట్టుకోవాల్సిన శ్రమ మాకు ఉండదు. మీ ఉప్పు తింటున్నాం కనుక, మీకు ఏ ముప్పూ రాకుండా ఆలోచించాల్సిన అవసరం, బాధ్యత మాకుంటుంది. ఈ విషయాన్ని సవినయంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా”
రాజాదిత్యుడు చెప్పింది విన్నాక కాస్త మెత్త
బడ్డాడు విష్ణువర్ధనుడు.
“ప్రియమిత్రుడా! రాజాదిత్యా! నువ్వు చెప్పాలనుకొన్నది నిర్భయంగా చెప్పొచ్చు. నీ అభిప్రాయంతో మమ్మల్ని ఎలా ప్రభావితం చేద్దామనే సదుద్దేశంతో నువ్వు ఉన్నావో.. మేమూ అంతే! మా శక్తి యుక్తులను, సానుకూల అంశాలను నీకు మరోమారు గుర్తుచేసి, నీ అభిప్రాయాన్ని సరైన విధంగా ప్రభావితం చేయాలని మేమనుకొన్నాం”.
ఈ మాటలతో అక్కడి వాతావరణం కొంత తేలికపడింది.
“ప్రభూ! మీరింత స్పష్టంగా చెప్పిన తరువాత, రాజాదిత్యులవారు మరొక విధంగా మాట్లాడతారని నేనుకోను. ఏ యుద్ధంలోనైనా ‘విజయమో, వీర స్వర్గమో’ అని సిద్ధపడే.. దళాలు ముందుకు వెళ్తాయి. కానీ, ప్రస్తుతకాలంలో బలహీనుడైన త్రిభువనమల్లుని సైన్యంతో మనం చేసే ఈ పోరాటంలో.. విజయం మనది – వీర స్వర్గం మన శత్రువైన త్రిభువనమల్లుడిది!” గరుడ దళాధ్యక్షుడు సాధికారికంగా పలికాడు.
ఈ సంభాషణ వింటున్న వారందరికీ ఒకటే అనిపించింది.
‘రాజాదిత్యుడు అర్థం లేకుండా మాట్లాడి.. తనకున్న గౌరవ మర్యాదలను మంట గలుపుకొంటున్నాడేమో’ అని..
రాజాదిత్యుడికి పరిస్థితి అర్థమైంది.
“ప్రభూ మీ విజయ పరంపర గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. మీ ఆస్థానంలోని ఆత్మీయుడిగా, ఈ రాజ్య పౌరుడిగా.. ఆ విజయాల పట్ల నాకు గర్వం కూడా ఉంది. మీ ఏలుబడిలో హొయసల రాజ్యం ఒక సువిశాల మహా సామ్రాజ్యంగా రూపుదిద్దుకోవాలని.. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ..”
“ఇంకా కానీ.. ఏమిటి రాజాదిత్యా!”
అసహనంగా అడిగాడు విష్ణువర్ధనుడు.
“ప్రభూ! ప్రవహించే నదిలాంటిది కాలం! ఎప్పుడూ ఒకేలా ఉండదు. విధి ఒకసారి మనిషిని ఆకాశం అంచులదాకా తీసుకెళ్తుంది. అదే విధి.. వక్రిస్తే! ఆ మనిషిని క్షణంలోనే పాతాళంలోకి పడేస్తుంది”
ఆయన మాటలకు అడ్డొస్తూ అన్నాడు
విష్ణువర్ధనుడు..
“ఆగాగు మిత్రమా, నువ్వు చెప్తున్నది గణితమా? జ్యోతిషమా? ఇప్పుడు మనం ఆలోచించవలసింది విధి లేదా దుర్విధి గురించి కాదు. మనం చేయవలసిన ‘విధి’ ఏమిటి? దాన్ని నెరవేర్చుకోవలసిన విధానం ఏమిటి? అని.. అర్థమైందా?”
“అర్థమైంది ప్రభూ! మన విధి మనం నిర్వర్తించాలి. మన ప్రజల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. అది నేనూ ఒప్పుకొంటాను. కానీ, ఇక్కడో విషయం మనం సూక్ష్మంగా గమనించాలి. పరిశీలించాలి” ఆలోచిస్తూ ఆలోచిస్తూ అన్నాడు రాజాదిత్యుడు.
“ఏమిటి ఆ సూక్ష్మమైన విషయం? నువ్వొక్కడివే గమనించిందీ.. మేమూ పరిశీలించ లేకపోయిందీ!” హేళనగా అన్నాడు మహారాజు.
“ఏమీలేదు ప్రభూ! తమ చేతిలో ఓడిపోయిన వంశాల రాజులందరూ చిన్నస్థాయి వారు. అవి పిడికిలి తగిలితే కుప్పకూలిపోయే బలహీన వ్యవస్థలు. వారిపైన విజయం గొప్పదే కావొచ్చేమో కానీ, మన బలగాల సామర్థ్యాలకు అది ప్రమాణం కానేకాదు. చాళుక్య రాజుల ఏలుబడి ప్రాంతాలూ, సైన్యాల శక్తీ అపరిమితం! మీరు అనుకొన్నట్టు త్రిభువనమల్లుడు తన జీవితానికి ‘దేవుడే దిక్కు’ అని తూర్పు తిరిగి దండం
పెట్టినా.. మనకు ఒరిగేదేమీ లేదు. అతని సైన్యాధిపతుల్లో అనంతపాలుని వంటివారు అనేకులున్నారు. యుద్ధరంగంలో వారిని నిలువరించడం సులభం కాదు. మనం ఎంతోమంది సైనికులను కోల్పోక తప్పదు. అదీకాక, మాకు లభించిన సమాచారం ఏంటంటే.. అతని శత్రువులైన నరవర్మ వంటివారు కూడా నిరాయుధుడిగా ఉన్న త్రిభువనమల్లుని ఏమీ చేయలేక, పలాయన మంత్రం పఠించారని!”
“అయితే ఇప్పుడేం చేయమంటావు? శిబిరాన్ని ఎత్తేసి, సైన్యాలను వెనక్కి పంపించేసి రాజధాని నగరంలో విందులూ, వినోదాలూ ప్రకటించాలా?” అసహనంగా అన్నాడు
విష్ణువర్ధనుడు.
“కాదు ప్రభూ! యుద్ధం వద్దని నేననడం లేదు. గెలుపు కావాలంటే ఓపిక కావాలి. సమయం తీసుకొని, సమయం చూసి దెబ్బతీయాలి. విజయాన్ని సొంతం చేసుకోవాలి”.
“ఎప్పుడో ఆ సమయం?” అడిగాడు
విష్ణువర్ధనుడు.
“త్వరలోనే! తమ సారథ్యంలో సైన్యాలు విజృంభించి చాళుక్య సామ్రాజ్యాన్ని, త్రిభువనమల్ల చక్రవర్తినీ నేలమట్టం చేసే ముహూర్తం దగ్గర్లోనే ఉంది”.
రాజాధిత్యుని మాటలు విని కుతకుత ఉడికిపోయాడు గరుడ సైన్యాధ్యక్షుడు. ఈ గణిత పండితుడు అయోమయానికి గురై.. లెక్కలు మారుస్తున్నాడు.
“మహా మేధావీ.. రాజాదిత్యా! పరుగులు తీసే గుర్రాల కాళ్లలో కట్టెలు పెట్టకండి. మనం విజయం సాధించాలంటే సరైన సమయం ఇదే! ప్రభువుల సంకల్పం, మన గరుడ దళాల సామర్థ్యం అద్భుత ఫలితాన్నిచ్చే శుభ ముహూర్తం ఇదే! జయహో విష్ణువర్ధన మహారాజుకీ.. జయహో హొయసల సామ్రాజ్య లక్ష్మికీ!”
అది రణ నినాదంగా మారి.. సభ అంతా
‘జయజయ’ ధ్వానాలతో ప్రతిధ్వనించింది.
‘అర్థమైందిగా.. ఇక నువ్వు చెప్పవలసినదేమీ లేదు’ అన్నట్టుగా తల పంకించి.. లేచాడు విష్ణువర్ధనుడు.
అందరూ లేచి నిలబడ్డారు.
“ప్రభూ! తొందర పడకండి. ఇదిగో మన గూఢచారులు తెచ్చిన ఈ లేఖ చూడండి” అంటూ రాజదిత్యుడు ఒక లేఖను మహారాజుకు అందించాడు.
ఈ లేఖ రాసింది ఎవరు?
allanisreedharthewriter@gmail.com
(మిగతా వచ్చేవారం)