ఆమె పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ఆమె ప్రభావితం చేయని పల్లె లేదు.ఆమెను తలుచుకోని రైతు ఉండడు. తెలంగాణలో అధికంగా పండేవరి వంగడం ఆమె నేతృత్వంలో ఆవిష్కారమైనదే. పప్పు, నువ్వులు,మక్కలు, జీలుగు, జనుము.. పంటలకు సంబంధించి కూడా అనేక వంగడాలు అభివృద్ధి చేశారు. నర్సాపూర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ డాక్టర్ శోభారాణి కలల పంటల గురించి ఆమె మాటల్లోనే..
మా నాన్న భద్రయ్య హెడ్ మాస్టర్. సొంతూరు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాకు యాభై ఎకరాల సేద్యం ఉంది. కూలీలు ఉన్నా కుటుంబ సభ్యులు కూడా కష్టపడక తప్పదు. చదువుకునే రోజుల్లో నేనూ పొలానికి వెళ్లేదాన్ని. అప్పట్లో ఇన్ని పనిముట్లు లేవు. ఇన్నిన్ని వంగడాలు లేవు. నేను హైదరాబాద్లోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదివాను. అప్పట్లో హైదరాబాద్లో మత ఘర్షణల వల్ల చాలా రోజులు కాలేజ్ మూసేశారు. క్లాసులు సక్రమంగా జరిగేవి కాదు. దీంతో ఎంసెట్ సరిగా రాయలేకపోయాను. చదివితే వ్యవసాయ శాస్త్రమే చదవాలనే పట్టు దలతో డిగ్రీలో చేరలేదు. ఎంసెట్ రెండో ప్రయత్నంలో మంచి ర్యాంక్ వచ్చింది. బీఎస్సీ (అగ్రికల్చర్)లో చేరాను. రెండో సంవత్సంలో ప్లాంట్ బ్రీడింగ్ పరిచయమైంది. కొత్త వంగడాల గురించి ఇందులో ఉంటుంది. పీజీలో ప్లాంట్ బ్రీడింగ్ చదవాలంటే ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ రావాలి. అందుకే పట్టుదలగా చదివాను. ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఎమ్మెస్సీలో ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలైజేషన్ చేశాను. సీఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది. ధార్వాడ్లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్లో చేరాను. పొద్దుతిరుగుడు పంటలో పేరెంటల్ లైన్స్ (ఆడ, మగ) సాగు మీద పరిశోధన చేశాను. మూడేళ్లలోనే పీహెచ్డీ పట్టా సాధించాను.
పీహెచ్డీ పూర్తికాగానే మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సైంటిస్ట్ కొలువు వరించింది. నన్ను ప్రత్యేక బాధ్యతలతో వరంగల్లోని రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్కు పంపారు. అప్పట్లో ఇంత నీటి లభ్యత లేదు. ఆరుతడి పంటలే ఎక్కువ. కంది చేలు వైరస్ను తట్టుకోలేకపోయేవి. తక్కువ దిగుబడి పంటలనే రైతులు సాగు చేసేవారు. అధిక రాబడినిచ్చే, వైరస్ తెగుళ్లను తట్టుకునే కొత్తరకం వంగడాలపై అక్కడ పరిశోధన జరిగేది. నేనూ భాగస్వామినిఅయ్యాను. డబ్ల్యూఆర్జీఈ93, డబ్ల్యూఆర్జీఈ97, డబ్ల్యూఆర్జీ255 వంగడాలను అభివృద్ధి చేశాం. తెలంగాణ రైతులు అత్యధికంగా సాగు చేస్తున్నది ఈ కంది వంగడాలనే. ఆపైన కరీంనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానానికి బదిలీ అయ్యాను. ఇక్కడ ఎండు తెగులును తట్టుకునే హైబ్రిడ్ మొక్కజొన్న కేఎన్ఎంహెచ్4010131, యాసంగిలో తక్కువ కాలంలో దిగుబడి నిచ్చే కేఎన్ఎంహెచ్ 4010141 పేరెంటల్ లైన్స్ని అభివృద్ధి చేశాం.
పొలాసలోని రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో అసోసియేట్ బ్రీడర్గా వరి వంగడాలపై పరిశోధన చేశాను. ఉల్లికోడు పురుగు వల్ల ఎక్కువగా నష్టపోతున్నామని రైతులు చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగా తక్కువ వ్యయంతో, అధిక లాభాలిచ్చేలా కొత్త వంగడాల రూపకల్పనకు పూనుకున్నది మా బృందం. రెండేళ్లు కష్టపడి ‘ప్రద్యుమ్న’ రకం తయారు చేశాం. ఇది తక్కువ కాల పరిమితిలో మంచి దిగుబడిని ఇస్తుంది. వానకాలం, యాసంగి పంటగా వేసుకోవచ్చు. ఉల్లికోడును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే ‘బతుకమ్మ’ రకం వరి వంగడాన్నీ మేమే అభివృద్ధి చేశాం. సన్న వడ్లలో ‘జేజీఎల్ 24423’ రకం వంగడాన్ని అభివృద్ధి చేశాం. ఈ రకం వరిని సాగుచేస్తే మొక్క పడిపోదు. గింజ రాలిపోదు. సన్న వడ్లలో అధిక దిగుబడినిచ్చే ‘కేఎన్ఎం1638’ వంగడాన్నీ అభివృద్ధి చేశాం. మన రైతుల ప్రాధాన్యం ఈ వరి వంగడాలే. తెలంగాణలో సాగు అవుతున్న వరిలో కేఎన్ఎం1638, జేజేఎల్24423లే ఎక్కువ.
అయిదేళ్ల క్రితం.. నర్సాపూర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్కు సీనియర్ సైంటిస్ట్గా బదిలీ అయ్యాను. ఇక్కడ ఆగ్రో ఫారెస్ట్రీలో రీసెర్చ్ చేస్తున్నాను. ైైప్లె ఉడ్ పరిశ్రమ దేశంలో శరవేగంగా ఎదుగుతున్నది. ఆ కంపెనీలకు కావాల్సిన చెక్క మన దగ్గర అందుబాటులో లేదు. మన వేప ఉద్యాన సాగుకు అనువైంది కాదు. కొమ్మలు ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడి తగ్గుతుంది. కొమ్మలు కత్తిరించడం రైతుకు సమస్యే. వీటిని అధిగమించేందుకు మలబార్ వేపతో ఎన్టీపీఎంబీ01 అనే మ్యూటెంట్ (ఉత్పరివర్తనం చెందించిన) వేపను అభివృద్ధి చేశాను. ఈ వేపచెట్టు నిలువుగా పెరుగుతుంది. కొమ్మలు వాటంతట అవే రాలిపోతాయి. తెలంగాణలో ఉద్యాన పంటలు పెరుగుతున్నాయి. టమాట, వంగ లాంటి మొక్కల పెంపకానికి ఊతంగా నిలువు కర్రల సాయం అవసరం అవుతుంది. ఇప్పటి వరకు మన రైతులకు ఈ సమస్యపై అవగాహన లేదు.
భవిష్యత్ అవసరాల కోసం దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి సేకరించిన పద్దెనిమిది వెదురు జాతులను నర్సాపూర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో పెంచుతున్నాం. ఉద్యాన పంటల సాగులో వీటి ఉపయోగాన్ని అధ్యయనం చేస్తున్నాం. భవిష్యత్ అవసరాల కోసం టిష్యూ కల్చర్ ద్వారా కొత్తరకం వెదురు మొక్కను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాను. తెలంగాణ రైతులకు ఇది మా కానుక.
…? నాగవర్ధన్ రాయల
– గడసంతల శ్రీనివాస్