చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : ద్వీప యువరాజు జాయప.. కాకతీయ ఆస్థాన నర్తకి నీలాంబతో కలిసి రాచనగరు నాట్యోత్సవంలో పాల్గొన్నాడు. ప్రాణంపెట్టి నటించాడు. అతని ప్రతిభను గుర్తించిన గణపతిదేవుడు.. నాణేల సంచిని బహుమతిగా అందించాడు. అతణ్ని మంచి నాట్యకారుణ్ని చేసి తమకు చూపాలంటూ గుండయామాత్యుడికి జాయపను అప్పగించాడు. అప్పటినుంచి జాయప.. నీలాంబ దగ్గర ఉంటూ, గుండయామాత్యుడి వద్ద శిక్షణ పొందుతున్నాడు. అయితే.. శిక్షణాలయంలో ఉన్న యువతులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం అతనికి కాకతి గుర్తుకు వస్తుండేది.
సాక్షాత్తూ చక్రవర్తే.. జాయపలోని ప్రతిభను గుర్తించి, దానికి తగిన శాస్త్రశిక్షణ అవసరమని అభిప్రాయపడి.. అతణ్ని గుండయామాత్యునికి అప్పగించడం.. గురుకులంలో గురువులకు, శిష్యులకు కూడా అబ్బురంగా తోచింది. అతణ్ని ఎగాదిగా చూసిన అక్కడి గురువులు, విద్యార్థులు చక్రవర్తి నిర్ణయాన్ని అభినందించారు. గుండయామాత్యుని గురుకులం ఓ అద్భుతమైన నాట్యశిక్షణ కేంద్రం. ఆయన ఎంతో పేరున్న నాట్యాచార్యుడు.
ఇక్కడ జాయప మరో కొత్త లోకాన్ని చూస్తున్నాడు. ప్రత్యూషవేళకు స్నానాదికాలు, సూర్య నమస్కారాలు, యోగాభ్యాసం, ధ్యానం పూర్తయిన తర్వాత శిక్షణ తరగతులు మొదలవుతాయి. ప్రతి ఉదయం నాట్య తరగతిని గురుదేవుడు గుండయామాత్యుడే ప్రారంభిస్తాడు.
శ్లో॥ ఓంకార నాద ప్రణవాంకిత జీవనాయ
ప్రాకార రూప నిఖిలాంతర చిన్మయాయ
కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ
శ్రీ హరాయ, శుభకరాయ, నమశ్శివాయ
(ఓంకార నాదమనే ప్రణవానికి జీవమూ, ప్రాకార రూపంలో ఉన్న సర్వ ప్రపంచానికి జ్ఞానజ్యోతి వంటివాడూ.. కామేశ్వరీదేవి (పార్వతి) ప్రణయం వల్ల రంజింపబడిన మనసు కలవాడూ.. శుభం కలుగజేయువాడూ అయిన పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను)
ఓం నన తోం ధిమికిట తోం ॥
ధిం ధిమి కిట నాం కిణి కిణిం ॥
అనే శబ్దాన్ని ప్రారంభించి.. విద్యార్థుల చేత అడుగులు వేయిస్తూ, లయ గతులలోని శ్రుతి పక్వాలను చేసి చూపెడుతూ.. శిక్షణ ప్రారంభిస్తాడు గుండయామాత్యులు.
“నాట్య శిక్షణకు పాఠ్యగ్రంథం భరతముని రచించిన నాట్యశాస్త్రం. రుగ్వేదం నుంచి పాఠాన్ని, సామవేదం నుంచి గీతాన్ని, యజుర్వేదం నుంచి అభినయాన్ని, అధర్వణ వేదం నుంచి రసాలను తీసుకుని.. పంచమవేదంగా నాట్య
శాస్ర్తాన్ని రచించాడు భరతుడు. మనిషి చైతన్యజీవి. ఎక్కడున్నా కాలో, చెయ్యో, నడుమో కదుపుతూ ఉంటాడు. అదే శాస్త్రరూపం తీసుకుంటే నాట్యం అవుతుంది.
మానవ సృష్టితోనే దేవుడు నాట్యాన్ని సృష్టించాడు. దానికి శాస్త్రరూపమిచ్చిన భరతుడు నాట్యదేవుడు. అందుకే నాట్యాన్ని ‘భరతం’ అనికూడా అంటారు.
భ అంటే భావం, ర అంటే రసం, త అంటే తాళం. ఆంగిక, వాచిక, సాత్విక అభినయాలకు పూర్తి న్యాయం చేయగలిగేది భరతం ఒక్కటే! నాట్యం ప్రణవనాదంతో మొదలై.. ప్రణయభావనతో ఎదిగి.. ప్రళయనాదంతో ముగుస్తుంది. అంటే నాట్యమే జీవితం! నాట్య విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం.
యతో హస్త స్తతో దృష్టి ర్యతో దృష్టి స్తతో మనః
యతో మనః స్తతో భావః యతో భావ స్తతో రసః॥
(హస్తం ఎటుచూపితే దృష్టి అటువైపు మళ్లుతుంది. ఎటువైపు దృష్టిమళ్లిందో అటువైపు మనసు పోతుంది. ఎటువైపు మనసు ఉన్నదో.. అక్కడ భావం పుడుతుంది. భావం ఉన్నచోట రసం పుడుతుంది).. నాట్యం లోకంలోని సర్వ భావాలను, సర్వ ప్రవృత్తులను ప్రకటిస్తుంది. సర్వభావ ప్రవృత్తులు మనసు ప్రభవములే కదా! వీటిని ప్రకటించడానికి అంగ విక్షేపము, అవయవ విన్యాసమే సాధనం. చారీ, మండల, కరణ, అంగహార సంయుతమై గీత వాద్యసహితమై శోభాకారణమూ, మంగళ ప్రదమై.. మీ జీవితాలను శోభాయమానం చేస్తుంది నాట్యం. నాట్యంపై ఇక్కడ బోధించే పాఠ్యప్రణాళికలో ఏకాదశ అధ్యాయాలు ఉన్నాయి. అవి 1. రసం, 2. భావం, 3. అభినయం, 4. ధర్మి, 5. వృత్తి, 6. ప్రవృత్తి, 7. సిద్ధి 8. స్వర, 9. అతోద్యం, 10. గానం, 11. రంగం. మన గురుకులంలో మీరు అంచెలంచెలుగా వీటిద్వారా నాట్యం పూర్తిగా నేర్చుకుంటారు. మీకు మా స్వాగతం!!”..
రాజాస్థానంలో గుండయామాత్యునికి, గురుకుల ప్రధాన నాట్యాచారుడు గుండయామాత్యునికీ హస్తిమశకాంతరం తేడా ఉంది. ఆయన ప్రధానగురువు కాగా నాట్య, గాత్ర, సంగీత, గీత, వాయిద్య శిక్షకులు.. ఇలా పాతికమంది గురువులు ఉన్నారు. అందరూ దిగ్దంతులు, పుంభావ సరస్వతులు. అందరూ ఎంతో నిష్ఠగా, శిక్షణలో ఎలాంటి అరమరికలు లేకుండా కళాబోధన చేస్తుంటారు. శిష్యుడన్నవాడు పరిహాసానికైనా వేలెత్తి చూపలేని విధంగా ఆ గురువులు ఉన్నారు. శిష్యుడు తలొంచుకుని వినమ్రుడిగా గురువు శుశ్రూషలో విద్యను నేర్వాల్సిందే! తరగతులు, తరగతికి ఇంతమంది విద్యార్థులు లాంటివి లేవు. విద్యలో ఆసక్తి అత్యంత ముఖ్యం. ఆసక్తిలేని శిష్యుణ్ని తొలిపరీక్షల్లోనే గురుకులం నుంచి పంపేస్తారు.
ఇక్కడ భరతం ప్రధానవిద్య. భరతం అంటే నాట్యం. సంగీతం, గాత్రం, వాద్యం, గీతం.. మొదలైన కళారూపాలు దానితో ముడిపడినవే. భరతఖండంలో ప్రతి అంశానికీ వేదాలలో లేదా పురాణాలలో ఒక కథ తప్పకుండా ఉంటుంది. అలాగే దానికి కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉంటాయి. నాట్యాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడు అని, ఆయనే భరతమునికి నేర్పాడని చెబుతుంది పురాణగాథ. నాట్యశాస్త్రం రచించిన భరతుడు క్రీ.శ. ఒకటో శతాబ్దంవాడని చరిత్ర చెబుతున్నది.
“అవును! భరతుడనే వాడే నాట్యశాస్త్రం రాశాడు. అది మనకు అర్థమయ్యేలా వ్యాఖ్యానం రాసింది అభినవ గుప్తుడు. ఇందులో ఈ పెద్దమనిషి ప్రక్షిప్తాలు ఎన్నోగాని.. మొత్తానికి నాట్యశాస్త్రం కాస్త నలుగురికి అర్థమయ్యేలా చేశాడు. అప్పటినుంచి ఇదొక కళగా, శాస్త్రంగా భారతీయ సమాజాన్ని రసభరితం చేస్తున్నది. నాట్యానికి శాస్త్ర రూపం ఇచ్చిన లాక్షణికుడిగా భరతుడు అఖండ భారతంలో నిలిచిపోయాడు. అటు కులీనులు, ఇటు పామరులు కూడా నాట్యాన్ని గొప్పకళగా ఆరాధిస్తూ.. తాము నాట్య కళాకారులుగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు” అన్నాడు త్రిపురశెట్టి.
కళలు ప్రవాహశీలమైనవి. నిరంతరం ప్రవహిసున్నట్లు కొత్తనీరు వచ్చిచేరి.. కొత్తరూపాన్ని సంతరించుకుంటాయి. ఎప్పుడూ కొత్త భంగిమలు, ముద్రలు, అభినయాలు.. అలాగే రూపకాలు, కథలు, పాటలు, అనుగుణ్యంగా నాట్యాంశాలు పుడుతుంటాయి. పరిశోధన, ప్రదర్శన అనుభవంతో ఎదుగుతూ మరింత శాస్త్రీయ మార్గీరూపం సంతరించుకుంటాయి.
జాయప చిన్ననాటి నుంచి ఉత్సాహంతో ఆడి పాడినవి.. కొండయ బృందంతో చేసిన నాట్యాంశాలకు, శిక్షణవేళ గురుకులంలో నేర్చుకుంటున్న నాట్యాంశాలతో బేరీజు వేసుకుంటాడు. అక్కడ నాట్యశిక్షణ లేదు. గురువు లేదా దర్శకుడు చెప్పింది, మనకు పాత్రోచితంగా ఉన్నదని భావించింది నర్తించడమే. దానికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ‘చెయ్యి, కాలు, వేలు ఎలా ఉంచాలి? ఎలా వంచాలి?’తో మొదలుపెట్టి.. ప్రతి అంశం కచ్చితంగా తెలుసుకుని.. అర్థం చేసుకుని, అన్నిటినీ సమన్వయించుకుంటూ రసాత్మక ప్రదర్శనం అనేది శాస్ర్తాధ్యయనం.
గురుశిక్షణలోని శాస్ర్తాధ్యయనంలో ప్రతిసూక్ష్మాంశానికీ అర్థం, పరమార్థం ఉన్నాయి. ఇదొక దీక్ష. ఇదొక తపస్సు. వీధుల్లో చేసే నాట్యాంశాలను దేశీ నాట్యాంశాలని.. గురుశిక్షణ ద్వారా చేసే శాస్త్రబద్ధమైన నాట్యాంశాలను మార్గి నాట్యాంశాలనే వర్గీకరణ తొలిరోజుల్లోనే చదువుకున్నాడు. ఆరోజు గుడిలో దేశీపద్ధతిలో ప్రహ్లాద విజయం ప్రదర్శించాడు. రాజాస్థానంలో నీలాంబ బృందంతో అదే ప్రహ్లాద విజయం.. మార్గీ పద్ధతిలో ప్రదర్శించాడు. రెండు ప్రదర్శనల్లో హస్తిమశకాంతరం తేడా ఉంది. అది సాక్షాత్తూ గణపతిదేవుడే గుర్తించాడు. అందుకే తనకు గురుముఖతః నాట్యశిక్షణ అవసరమని భావించి అక్కడికక్కడే గురుకులానికి పంపాడు.
గణపతిదేవుడు క్షణాల కాలంలో తనలోని ప్రతిభను విశ్లేషించడం.. అందుకు శిక్షణ అవసరమని భావించడం.. గురువుకు అప్పగించడం.. ఓహ్.. అద్భుతం!! గణపతిదేవుడు తనపట్ల చూపిన ఆ నిర్ణయాత్మక అద్భుతం జాయపకు నిత్యమూ గుర్తొస్తుంది. జీవితాంతం మర్చిపోడు.. మర్చిపోలేడు కూడా!!
సమస్త దేశీ, మార్గీ కళా ప్రపంచాన్ని ఆపోశన పట్టి.. అత్యుత్తమ కళారూపాలుగా మలచడం గురుకులంలో జరుగుతున్నది. దేశీ నాట్యరూపాలను మార్గి నాట్య
రూపాలుగా పెంపొందించడంలో అశోకుడు, దేశీ
సంగీతాన్ని మార్గి సంగీతంగా శాస్త్రబద్ధం చేయడంలో సుగ్రీవ, కొత్త వాద్య పరికరాలను కనుగొని శాస్త్రబద్ధం చేయడంలో కపీశ.. కొత్తకొత్త పాటలు రాసి పాడటంలో మాజీక.. ఈ నలుగురూ జాయపకు ఆప్తులు. ఇంకా ఇతర గురువులున్నా.. వీళ్ల మేధావిత్వం జాయపను
ఆకర్షించింది. అశోకుడు నడుస్తున్నా కూర్చున్నా ఎప్పుడూ నాట్యం చేస్తూనే ఉంటాడు. ముద్రలు పడుతూ, కరణాలు ఆలోచిస్తూ అన్నిటినీ కూర్చి..
“జాయపా! చూడు కొత్త భంగిమ..” అంటూ నాట్యం చేసి చూపిస్తాడు. అద్భుతం!
సుగ్రీవ ఎప్పుడూ రాగాలాపన చేస్తూనే ఉంటాడు. గుక్కతిప్పుకోకుండా రాగంతీస్తూ..
“నేను కొత్తరాగం కనిపెట్టాను జాయపా! వింటావా..” అంటూ జాయపకు వినిపిస్తాడు. తేనె
సరాసరి చెవిలోకి జాలువారినట్లు.. అబ్బ! ఏమిరుచి!!
ఇక్కడ భరతం ప్రధానవిద్య.
భరతం అంటే నాట్యం.
సంగీతం, గాత్రం, వాద్యం, గీతం.. మొదలైన కళారూపాలు దానితో ముడిపడినవే.
అలాగే కపీశ..
“కొత్తవాద్యం చూశాను జాయపా! మా ఊళ్లో ఓ సన్యాసి వాయిస్తుంటే విన్నాను. దాన్ని మాలదాసరి కన్నమ రూపొందించాడట. అబ్బ.. ఏమా శబ్దం. ఏమా మాధుర్యం. స్వర్గం కనపడిందనుకో. దాన్ని మరింత మెరుగుపెట్టాను. విను!” అంటూ వెంటపడతాడు. ఆ శబ్దమాధుర్యానికి శరీరం ఊగి సోలిపోతుంది.
కవి మాజీకుడు ఏవేవో తాళపత్రాలపై రాస్తూ, పాడుతూ కొత్తపదాలు కలుపుతూ.. ఓ పాట కడతాడు. దాన్ని సుగ్రీవతో పంచుకుంటాడు. ఇద్దరూ కలిసి సంగీత సాహిత్య యుగళగీతంగా పాడుతుంటే.. జాయపలో ఏవేవో కంపనాలు.. కొత్తభావనల తూనీగలు, మిణుగురులు సృజనాత్మకతపై వాలుతూ ఝుమ్మంటూ రివ్వు రివ్వున ఎగురుతూ.. ముసురుతూ.. వాలుతూ.. ఎగురుతూ.. ఉక్కిరిబిక్కిరైపోతాడు జాయప.
ఈ నలుగురి నూతన ఆవిష్కరణలు వింటూనే పెద్దలు జరిపే శాస్త్రచర్చల్లో పాల్గొనేవాడు. ఆ శాస్త్రచర్చ అతని సృజనాత్మకతను మరింత మెరుగుపరుస్తున్నది.
కొండయ బృందపు ప్రదర్శనలు గుర్తుకొస్తుంటాయి. శాస్త్రీయత లేని దేశీనాట్యాలకు సామాన్యులు ఎందుకు తన్మయులవుతున్నారు !?
వాటిలో ఉండే చమక్కులు.. కొందరి నటనలోని తాదాత్మ్యం.. ఊరి జనాల భాష!
కాకతి గుర్తొచ్చింది. అయిష్టంగా నటిస్తున్నా ఆమెలో ఓ సృజనాత్మకత ఉంది. కాకతిలోని ఆ సృజనాత్మకత శాస్త్రీయ నాట్యకారుల్లో కూడా లేదని అతని భావన.
భైరవకు, కొండయకు కబురు పంపాడు జాయప. వాళ్ల ప్రదర్శనల్లో అవకాశం ఇస్తే పాల్గొంటానని. వాళ్లు ఆనందంగా జాయపను ఆహ్వానించారు. అలా జాయప దేశీ, మార్గీ నాట్యవిధానాల్లో నటిస్తూ, అభ్యసిస్తూ.. కళా విశ్వంభర వీధుల్లో.. సృజనాత్మక దిగంతాలలో విహరిస్తూ పరవశిస్తూ మరింత ప్రౌఢత్వం సంతరించుకుంటున్నాడు దినదినమూ..
“అబ్బో.. ఇప్పుడు ఇంకా బాగా తొక్కుతున్నావ్ చిందు!!” ఆశ్చర్యంగా మెచ్చుకున్నది కాకతి.
గురుకులం ప్రభావంవల్ల తన నాట్యంలో వచ్చిన పరిణితి.. కాకతి అభినందనలో స్పష్టమైంది. ముచ్చట పడిపోయాడు.
“ఏంటీ! నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?”.
ఏమనాలో తెలియక అతను.. అతని నవ్వు అర్థంకాక కాకతి.. నవ్వారు మళ్లీమళ్లీ యుగళగీతంలా!
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284