‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
“అ రేయ్ బాలూ! ఇంట్లకురా. అచ్చి అన్నం తినిపో!”..
తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా బాలమల్లు పెరట్లో తూనీగలు పట్టుకునే పనిలో ఉన్నడు.
వాటివెనుక తిరుగుతూ ఎంత ప్రయత్నించినా.. ఒక్కటీ చేతికి దొరకడం లేదు. అయినా వాడు పట్టుదలగా వేటాడుతున్నడు.
చలికాలం చివరిరోజులు. ఎండ బాగానే కాస్తున్నది. ఒక్క మబ్బయినా లేకుండా.. ఆకాశం మైదానంలా ఉంది. కొంచెం ఎత్తులో హెలికాప్టర్ల మాదిరి చక్కర్లు కొడుతూ.. రంగురంగుల తూనీగలు స్వేచ్ఛగా తిరుగుతున్నయి. మధ్యమధ్య అలుపు తీర్చుకునేందుకన్నట్టు మొక్కల మీదా, పాత గోడల మీదా వాలుతూ.. అంతలోనే మళ్లీ ఎగిరిపోతున్నయి.
“బాలిగా! ఇనవడ్తలేదా? చెవులల్ల ఏంబెట్టుకున్నవు.. ఎన్నిసార్లు పిలువాలె? ఇంట్లకొచ్చి కూడు తినిపో!”.. తల్లి మరోమారు కేకేసింది.
బాలమల్లు ఈసారీ వినిపించుకోలేదు. గునుగు మొక్కమీద అప్పుడే వాలిన నీలం రంగు తూనీగ మీద వాడి దృష్టి పడింది. చప్పుడు కాకుండా అటు నడిచాడు. నీలి తూనీగలు కొంచెం అరుదుగా కనిపిస్తుంటయి. మిగతావాటి కంటే అందంగా ఉండి, హుషారుగా ఎగురుతూ అంత సులువుగా దొరకవు.
తూనీగల్ని వెంటాడి పట్టుకోవడం, వాటితో ఆడుకోవడం పిల్లలకు ఇష్టమైన సరదా. సన్నగా కొంచెం పొడవైన దేహం, పారదర్శకమైన వెడల్పాటి రెక్కలు, మెరుస్తున్న గుండ్రటి కళ్లతో.. రకరకాల రంగుల్లో కనిపించే ఈ కీటకాలు, వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తూ తిరుగుతుంటయి. తూనీగ చేతికి చిక్కగానే ఏ సీసాలోనో, అట్టడబ్బాలోనో వేసి మూతపెట్టడం, లేదా తోకకు దారంకట్టి అది చిన్నగా ఎగురుతుంటే కేరింతలు కొట్టి ఆనందించడం.
‘ఓరి పోరగాండ్లు! వాటిని అట్ల గోస పెట్టొద్దు.. పాపం తగుల్తది!’ అని పెద్దలు మందలించినా పిల్లలు ఊరుకోరు. మరింత ఉత్సాహంగా వాటిని గోసపెడుతూ ఆడుతరు.
“బాలూ! ఎన్నిసార్లు చెప్పాలె ఇంట్లకు రమ్మని?
నేను పెరట్ల కొచ్చిన్నంటే నీ వీపు పగుల్తది” అదే చివరి హెచ్చరిక అన్నట్టు తల్లి గట్టిగా చెప్పింది. తల్లి నుంచి ఇలాంటి బెదిరింపులు మామూలే గనుక.. ఈసారి కూడా వాడు లెక్కచెయ్యలేదు.
తొమ్మిదేళ్ల బాలమల్లుకు కుటుంబాలు, కుటుంబంలో మనుషుల గురించి కొంత అవగాహన ఉంది. తన దోస్తులు కొంతమందికి నాన్నలున్నరు, కొందరికి లేరు. వాడు రెండో కోవలోకి వస్తాడు. తండ్రి ఎట్లా ఉంటడో వాడికి తెలియదు. ఎన్నడూ చూడలేదు. తల్లి ఏనాడూ తండ్రి ప్రస్తావన వాడి ముందు తేలేదు. అందుకే తను ఏదైనా తప్పుచేస్తే.. తండ్రి కోపంగా చెంపమీద కొట్టే ప్రమాదం తనకు లేదనుకుంటడు. తల్లి తనను ఎప్పుడూ కొట్టదు. ఆమె చేతులు కష్టపడి పనిచేయడం.. తనను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం మాత్రమే వాడు చూశాడు.
బాలమల్లు నిశ్శబ్దంగా నక్కుతూ పోయి బొటనవేలు, చూపుడువేలు పట్టుకారులా ముందుకు చాపాడు. మెల్లగా నీలంరంగు తూనీగ తోకను పట్టుకోబోయాడు. ఈలోగా తల్లి మళ్లీ పిలిచింది.
“అబ్బా! ఉండవే.. వొస్తన్నా!” అని విసుగ్గాఅరిచాడు.
దాంతో కొద్దిలో చేతికి చిక్కబోతున్న తూనీగ ఎగిరిపోయింది. వాడు నిరాశగా చూశాడు. కానీ, కొన్నిక్షణాలే! తర్వాత పట్టుదలగా వేటాడి.. చిట్టచివరికి ఒకదాన్ని దొరికించుకొని సంతోషంతో గంతేశాడు.
ఇంతలో తల్లి కోపంగా పెరట్లోకి వచ్చింది. బాలమల్లు ఆమెకు దొరికిపోయాడు. వాడి రెండుచేతుల్నీ బిగించి పట్టుకుంది.
“నీకు వేరే ఆటలే లేవా..? ఎన్నిసార్లు చెప్పినా ఇనవేందిరా. తూనీగల్ని పట్టుకొని ఆడొద్దు. పాపం దాన్ని ఇడిసిపెట్టు” అంటూ, బాలమల్లు రెండువేళ్ల నడుమ బందీగా ఉన్నదాన్ని విడిపించింది. తనెంతో కష్టపడి పట్టుకున్న తూనీగ ఎగిరిపోవడం చూసి నిరాశ చెందాడు. వాడికి ఉక్రోషం కలిగింది.
“ఎప్పుడు చూసినా తూనీగల్ని పట్టొద్దంటవు. ఎందుకు పట్టుకోవొద్దు? ఏమైతదట..?” చేతులు విడిపించుకుని అడిగాడు.
“తూనీగలు మామూలువి కావు బిడ్డా! అవి సచ్చిపోయిన మన పెద్దల ఆత్మలు. మన పితరులు.. తూనీగల రూపంల ఎగురుతూ మనచుట్టే తిరుగుతుంటరు”.
“అయితే సచ్చిపోయినోళ్లందరు తూనీగలైతరా?”.
“అవును! వాళ్ల ఆత్మలు వాటి రూపాల్లో తిరుగుతుంటయని చిన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పేది. ఇప్పుడు బతికి ఉన్న పెద్దవాళ్లు ఎవర్నడిగినా.. ఈ మాటనే చెప్తరు. మీ తాత, మీ నాయినమ్మ, వాళ్ల నాయిన, వాళ్లమ్మ, ఇంకా మన చుట్టాలు, దగ్గరోళ్లు, మన పాలోళ్లు.. ఇట్లా అందరి ఆత్మలు తూనీగలై మన చుట్టుపక్కలనే తిరుగుతయి. మన మంచిచెడ్డ చూస్తుంటయి. వాటి భాష మనకు ఇనపడకపోయినా.. అవి మనల్ని పలుకరిస్తుంటయి. మన క్షేమాన్ని కోరుతుంటయి”.
తల్లి మాటలు బాలమల్లుకు ఆశ్చర్యం కలిగించినయి. వాడిలో ఆసక్తిని పెంచినయి. హఠాత్తుగా మనసులో ఒక సందేహం మెదిలి తల్లిని అడిగాడు..
“అట్లయితే మా నాయిన ఎప్పుడో సచ్చిపోయిండు గద. ఆయినె కూడ తూనీగయిండా?”.
“తప్పురా బాలు.. అట్లనొద్దు” అన్నదామెవారిస్తున్నట్టు.
“ఎందుకనొద్దు? తప్పెట్లయితది..? నాయిన కూడ మన ఇంటిపెద్దనే. సచ్చినంక తూనీగ అయితడు గద. మరైతే నాయిన ఏ రంగు తూనీగలో ఉంటడో చెప్పమ్మా.. నేను దాన్ని పట్టుకుంట. ఎప్పటికి
మనకాడనే పెట్టుకుందం”.
కొడుక్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె కొన్నిక్షణాలు మౌనంగా చూస్తుండి పోయింది. ముఖంలో విషాద ఛాయలు పరుచుకున్నయి. బాధించే జ్ఞాపకాలేవో ఆమె గుండెను తడిచేసినయి.
“మా నాయిన తప్పకుండ నీలంరంగు తూనీగనే అయ్యుంటడు. నాకు తెలుసు. అన్ని తూనీగల కంటే అవే మంచిగుంటయి. నేను ఎట్లనన్న నీలం రంగుతూనీగనే పట్టుకుంట!”..
తల్లి చేతుల్ని విడిపించుకొని పరుగెత్తబోయాడు బాలమల్లు. కానీ, ఆమె అతణ్ని వదిలిపెట్టలేదు.
ఎన్నో రంగురంగుల తూనీగలు తలల మీదినుంచి ఎగురుతూ పోతుంటే.. వాడు నిరాశగా చూశాడు. వాటిలో కొన్ని నీలం రంగువి కూడా కనిపించినయి.
“అమ్మా! పైకి సూడు! మన పెద్దలు, పితరులు ఎంతమంది తిరుగుతున్నరో. వాళ్లలో మా నాయిన
ఎవరో సరిగా చెప్పు” ఆరాటంతో అడిగాడు.
ఇప్పుడు కూడా జవాబు చెప్పలేని నిస్సహాయతలో ఆమె వాడిమీద కావాలని కోపం తెచ్చుకున్నది.
“అడ్డదిడ్డంగ మాట్లాడకు. ఇంట్లకు పోదాం రా.. అన్నం తిందువు” అని బలవంతంగా లాక్కుపోయింది.
తల్లి గడప ముంగిట్లో కూర్చొని ఉంది. ఆమేదో చెబుతుంటే.. బాలమల్లు వింటున్నాడు. వాడామెకు కొద్దిదూరంలో ఈతచాప మీద పడుకొని పలకమీద రాస్తూ.. మధ్యమధ్య ప్రశ్నలు వేస్తున్నాడు. కొడుకు పాత అంగికున్న చిరుగుల్ని సూది దారంతో కుడుతున్నదామె.
బాలమల్లుకు తండ్రి గురించి తెలుసుకోవాలని మనసులో బలంగా ఉన్నది. కానీ, తల్లి ఏమీ చెప్పదని తెలుసు. ఇదివరకు కూడా ఎన్నోసార్లు అడిగాడు. ఎప్పుడూ చెప్పలేదు. మంకుపట్టి అడిగితే కోపగించుకుంటది. అయినా సరే, మళ్లీ ధైర్యం చేసి అడిగాడు..
“నాయిన ఎక్కడున్నడమ్మా? ఎప్పుడడిగినా సరిగ చెప్పనే చెప్పవు!”.
“గిప్పుడు నాయిన ముచ్చటెందుకురా నీకు? ఆమాట అడుగొద్దని ఎన్నిసార్లు జెప్పిన?” విసుక్కున్నదామె.
బాలమల్లు మరోసారి నిరాశ చెందాడు. నాయిన
ఎక్కడని అడిగితే తల్లి ఎందుకు చెప్పదో అర్థంకాదు.
వాడిలో రోషం పొడుచుకొచ్చింది.
“నిజం చెప్పమ్మా..! అసలు నాయిన బతికి ఉన్నడా.. సచ్చిపోయిండా?” అని మొండిగా అన్నాడు.
“ఏమో.. ఎవలకెరుక? యాడబోయి సచ్చిండో?” ఆమె గద్దించి పెట్టింది.
“అట్లయితే సచ్చిపోయిన నాయిన తూనీగై
తిరుగుతుండా..?”.
“బాలిగా.. నీకు దండం పెడుత. నాకు యాష్ట దెప్పియ్యకు. నోరు మూస్కోని పండుకో”.
గట్టిగా మందలించడంతో ఇక మాట్లాడకుండా వాడు చాపమీద పడుకున్నడు.
ఆమెకు బాధ కలిగింది. పాపం, వాడికేం తెలుసు.. పోరడు. తండ్రి యాదికొచ్చినప్పుడల్లా అడుగుతడు.
కానీ, నిజం ఎట్ల చెప్పాలె? వాడి తండ్రి అమ్మను ఇడిసిపెట్టి పోయిండని చెబితే ఏమనుకుంటడు? అసలా ముచ్చట చిన్న పిల్లగానికి చెప్పొచ్చో చెప్పకూడదో కూడా ఆ స్థితిలో ఆమెకు అర్థంకాలేదు. మనసు అశాంతిగా, అలజడిగా ఉన్నది. తనమీద తనకే కోపంగా ఉన్నది.
బాలమల్లు తండ్రి ఇంటినుంచి వెళ్లిపోయి చాలా కాలమైంది. ఎక్కడికి పోయిండో, ఇప్పుడెక్కడున్నడో తెలియదు. ఆమె చాలారోజులు ఎదురుచూసింది. అతను రాకపోవడంతో ఆశలు చంపేసుకున్నది. పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కొడుకుతో కలిసి జీవన పోరాటం చేస్తున్నది. బతుకుదెరువు కోసం నాలుగిళ్లలో పనిచేస్తుంది. ఇంకా బయటెక్కడైనా పని దొరికితే కూలికి కూడా పోతుంది. కొడుకు తప్ప ఆమెకు నా అనేవాళ్లెవరూ లేరు. కొడుకు.. తండ్రి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ ఆమె మనసు కల్లోలమవుతుంది.
ఆవేదనతోనూ, చుట్టుముట్టే ఆలోచనలతోనూఉక్కిరిబిక్కిరవుతుంది.
‘ఇప్పుడా మనిషి యాడున్నడో..?’ తనలో తనేఅనుకున్నది.
‘ఎవలకెరుక? ఏ సుట్టాల మార్గమో.. ఏదన్న పనిమీదనో కాదుగదా పోయింది? అయినా ఆయనకేమైతది? మొగోడు.. మారాజులా యాడున్నా మస్తు సంతోషంగ ఉండి ఉంటడు’ అనుకుంటూ.. కళ్లు తుడుచుకున్నది.
అప్పటికే కళ్ల నుంచి రెండు కన్నీటి చుక్కలు జారి
పిల్లవాడి అంగి మీద పడ్డయి.
ఆమె కొడుకు అంగి కుట్టడం పూర్తిచేసి.. మునిపంటితో దారాన్ని కొరికి తెంపేసింది. సూది, దారం పక్కనపెట్టి అంగికి ఇంకెక్కడైనా చిరుగులున్నయేమోని పరిశీలించి చూసింది. చంక కింద ఒకచోట చిరిగినట్టు కనిపిస్తే.. అదికూడా కుట్టేసి మడతపెట్టి ఒడిలో పెట్టుకున్నది. మొగుడు తనను ఎందుకు కాదన్నాడో, తననూ.. చంటి పిల్లాణ్ని ఎందుకు వదిలేసిపోయిండో, అసలు తనలో ఉన్న లోపమేమిటో ఎంత వాపోయినా ఆమెకు
అర్థం కాలేదు.
ఆ దినం అతను వెళ్లిపోతుంటే ఎంతనో బతిమాలింది. ఏడ్చింది. కాళ్లమీద పడ్డది. కానీ ఎంత చీదరించుకున్నడు? ఎంతగా విదిలించి కొట్టిండు? పసిబిడ్డ గురించి కూడా ఆలోచించకుండ.. ఇంట్లో తన వస్తువులన్నీ సర్దుకొని పోయిండు.
బయటెవరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నడని,
ఆమెతోనే లేచిపోయిండని ఊళ్లో అందరూ
అనుకుంటుంటే విన్నది.
‘నాలుగేండ్ల సంసారానికే నామీద మొఖం మొత్తింది. మొగోడు గద.. ఇంకోదాంతో లేచిపోయిండు!’ నిస్సహాయంగా అనుకున్నది.
ఆమె భర్త కట్టెల కార్ఖానలో కార్పెంటరుగా పనిచేసేవాడు. కొద్దిరోజులు ఎదురుచూసిన తర్వాత అతను పనిచేసిన కార్ఖానకు వెళ్లి కనుక్కుంది. వారం రోజుల క్రితమే అతను పని మానేశాడని, తనకు రావాల్సిన జీతం బకాయిలు మొత్తం తీసుకొని పోయాడని అక్కడివాళ్లు చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చింది.
ఆలోచనల్లో మునిగిన ఆమె.. అట్లా కొడుకు పక్కన ఎంతసేపు కూర్చుండి పోయిందో తెలియదు. తేరుకొని బాలమల్లు వైపు చూస్తే.. వాడు పలక పక్కన పెట్టుకొని అట్లాగే నిద్రపోయాడు. ఆమె కొడుకును ఎత్తి పక్కమీద పడుకోబెట్టింది. అప్పటిదాకా పలకమీద వాడు గీసింది ఏమిటాని చూసింది. అదో తూనీగ బొమ్మ. రెక్కలు చాపుకొని గాలిలో ఎగురుతున్నది. విచిత్రంగా దానికి మనిషి ముఖం ఉన్నది.
నిశ్శబ్దంగా ఇంట్లోకొచ్చి నిలబడ్డ అపరిచిత వ్యక్తివైపు కోపంగా చూశాడు బాలమల్లు. మొదట చూడగానే దొంగేమోననే అనుమానం వచ్చి.. వాడికి భయమేసింది.
లోపలున్న తల్లిని పిలుద్దామని అనుకున్నాడు.
కొత్తవ్యక్తి ఏదో తప్పుచేసినోడిలా మాట్లాడక నిలుచునున్నాడు. పైగా చిన్నపిల్లల్ని ఎప్పుడూ చూడనివాడిలా.. బాలమల్లు వైపు గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. అట్లాగే కొద్దిసేపు పరీక్షగా చూసిన అతని కళ్లు మెరిశాయి.
“నీకు నేను తెలుసా? నన్ను గుర్తుపట్టినవా బిడ్డా..!” అన్నాడు.
అపరిచిత వ్యక్తిని పరిశీలనగా చూసి.. తనకు తెలియనట్టు తిరస్కారంగా తల తిప్పాడు బాలమల్లు.
కొత్తమనిషి అలా నిలబడి.. మిడిగుడ్లతో తననే చూడటం అస్సలు నచ్చలేదు. వాడి కళ్లకు అతను చెడ్డవాడిలా కనిపించాడు.
“ఎవరు నువ్వు? మా ఇంట్లకొచ్చిన వెందుకు?” కోపంగా అడిగాడు.
అప్పటికీ అతనేమీ మాట్లాడలేదు. బాలమల్లునే ఆప్యాయంగా చూస్తూ చిన్నగా నవ్వాడు. ఈలోగా లోపలినుంచి వచ్చిన బాలమల్లు తల్లి.. ఆగంతకుణ్ని ఆశ్చర్యంతో చూసింది. క్షణాల్లో తల్లి ముఖంలో మార్పు రావడం బాలమల్లు గమనించాడు. ఆగంతకుడు ఎవరో గుర్తించినట్టు ఆమె కళ్లు విభ్రాంతితో విప్పార్చుకున్నయి. ఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకొంటూ మరింత ముందుకొచ్చి చూసింది.
ఆమె కళ్లు కదలకుండా ఆగంతకుని మీదే నిలిచిపోయాయి. అతని పరిస్థితీ అలాగే ఉన్నది. రెండడుగులు ముందుకేసి సన్నిహితంగా ముందుకొచ్చాడు. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఉద్వేగంతో హఠాత్తుగా ఆమెను ఆలింగనం చేసుకున్నాడు.
ఈ పరిణామం బాలుకు కోపం తెప్పించింది. కొత్తవ్యక్తిని చూసి తల్లి ఏడవటం ఆశ్చర్యం కలిగించింది. తల్లి ఎలాంటి ప్రతిఘటన లేకుండా అతణ్ని హత్తుకోవడం.. వాడికి అస్సలు నచ్చలేదు.
ఆగంతకుడు ఆమె ముఖం మీద అదేపనిగా ముద్దులు పెట్టాడు. అదిచూసి బాలమల్లు ఆవేశం పట్టలేకపోయాడు. ఎవరో ముక్కుముఖం తెలియని మనిషి..
తన్ను కావలించుకొని ముద్దులు పెడుతున్నా తల్లి ఏమీ అనకుండా ఏడుస్తూ అట్లాగే ఉండిపోవడం వాడికి
చీదర కలిగించింది. తల్లి ఆవిధమైన ప్రవర్తన వాడెప్పుడూ చూడలేదు.
కొత్తవ్యక్తి బాలమల్లును అభిమానంగా చూస్తూ..
“ఈ పిల్లగాడెవరు? మనకొడుకేనా? నేను చూసినప్పుడు చాలా చిన్నగ ఉండె. ఇప్పుడు పెద్దగయిండు. ఎంత సక్కగున్నడు.. నీతీర్గనే!” అన్నాడామెతో.
తల్లి అతని మాటలకు ఒకింత సిగ్గుపడటం, అప్పటికీ అతనికి దూరం తొలగకుండా సన్నిహితంగా ఉండిపోవడం బాలు గమనించాడు.
తల్లి ప్రవర్తన పట్ల ఎందుకో దిగులేసింది.
“చెప్పు.. ఈ పిల్లోడు మన బిడ్డనే గద!” మళ్లీఅడిగాడు.
“అవునయ్యా.. వీడు మన బిడ్డనే!” ఆమె అన్నది.
“నువ్విప్పటికే మళ్లా పెండ్లి జేసుకొని ఉంటవనుకున్న!” అతను హీనస్వరంతో అన్నాడు.
“అయ్యో.. అదెట్ల? నువ్వుండంగ నేనెట్ల పెండ్లి జేసుకుంట?” అన్నదామె.
అంతేకానీ..
‘భార్యను నేనుండగా నువ్వెందుకు ఇంకో ఆడదానితో లేచిపోయి మనువు జేసుకున్నవ్? నాలో ఏం లోపమున్నది? పెండ్లాం మీద మనసు లేకుంటే పాయే.. కనీసం కొడుకుమీద ఉండాలె గద. చంటిపిల్లోని మొఖం కూడ నిన్ను పోకుండ ఆపకపాయె!’.. అని ఆమెలోని సగటు స్త్రీ నిలదీసి అడగలేకపోయింది.
“గిన్ని దినాలకు మేమెట్ల యాదికొచ్చినం?” అని మాత్రమే అడిగింది.
“పిల్లోని మీద మనసు గుంజులాడింది. నువ్వు కూడ మాటిమాటికి యాదికొచ్చినవు”.
‘మరి నువ్వు మోజుపడి తీస్కపోయిన ఆడది యాడబోయింది?’ అని అడగాలనుకొని.. మానుకుంది.
అతను బాలమల్లు దగ్గరగా వచ్చి అన్నాడు..
“ఏం పేరు కొడుకా నీది?”.
“బాలమల్లు!”.. కొడుకుకన్నా ముందు ఆమెనే చెప్పింది.
“నేనెవరో తెలుసునా? నీ కన్న తండ్రిని. నన్ను
‘నాయినా!’ అని పిలువు బిడ్డా!” చెయ్యి పట్టుకుంటూ అడిగాడు.
బాలమల్లు కోపంగా విదిలించికొట్టాడు.
“నువ్వెవరో నాకు తెల్వది. నువ్వు మా నాయిన కాదు” అన్నాడు.
మధ్యలో తల్లి జోక్యం చేసుకుంది.
“అది నిజం కొడుకా..! ఈయన మీ నాయినే!” అన్నది సర్దిచెబుతూ.
“లేదు.. నాకు నాయిన లేడు. సచ్చిపోయిండు”.
“తప్పుబిడ్డా! అట్లనొద్దు. నీకు తండ్రి ఉన్నడు. ఈయనే నీ తండ్రి”.
“ఈన మా నాయిన కాదు. మా నాయినెప్పుడో సచ్చిపోయిండు” గట్టిగా అరిచిండు బాలమల్లు.
దీనికి అతను బాధపడినట్టు కనిపించాడు. అదిచూసి ఆమెకూడా బాధపడింది. అనునయంగా అతని భుజాలపై చేతులువేసి.. గుండె మీద తలవాల్చింది. కాసేపటివరకూ అట్లాగే ఉండిపోయింది.
“వాడు చిన్న పోరడు. వాని మాటలకు మనసు కష్టపెట్టుకోవొద్దు” అన్నది.
అతను అమె నుంచి విడివడి దూరం జరిగాడు. ఉన్నట్టుండి కింద కూలబడి రెండుచేతుల్లో ముఖం దాచుకున్నాడు. అతణ్ని ఆ స్థితిలో చూసి.. ఆమె ఏడవసాగింది. ఇదంతా బాలమల్లు సహించలేకపోయాడు. ఇంతకాలంగా సంతోషంగా ఉంటున్న అమ్మ.. ఇప్పుడిట్లా బాధపడడానికి కొత్తమనిషే కారణమని వాడు భావించాడు. తక్షణం అతణ్ని ఇంట్లోంచి బయటికి వెళ్లమని చెప్పాలనుకున్నడు. ఈలోగా తల్లి వాణ్ని బుజ్జగిస్తూ.. “బాలూ! ఆయన నీ తండ్రేరా. అంత ప్రేమగ పిలుస్తున్నడు గదా.. దగ్గరికి పో బిడ్డా! ‘నాయినా!’ అని పిలువు” అన్నది.
“ఈ మనిషి మా నాయిన కాడు. నేను పిలువను. ముందు ఆయన్ను ఇంట్లనుంచి పొమ్మని చెప్పు”
గట్టిగా అన్నాడు.
“తప్పురా.. అట్ల అనొద్దు! మీ నాయిన సూడు
ఎంత బాధపడ్తండో !”.
“అతను మా నాయిన కాదంటుంటే ఇనవేంది?
నాకసలు నాయినే వొద్దు!”.
“గట్ల మాట్లాడకు. నా మాట విని.. మీ నాయిన
దగ్గరికిపో!” కొడుకును బలవంతంగా అతనివైపు నెడుతూ చెప్పింది.
బాలమల్లు తల్లి చేతుల్ని విదిలించి కొట్టాడు.
“నేను పిలువను. నాకు తండ్రి లేడు. ఎప్పుడో సచ్చిపోయిండు. ఈనెవరో నాకు తెల్వది”.
ఆ మాటలతో ఆమె కోపం పట్టలేక కొడుకు చెంపమీద కొట్టింది. బాలమల్లు నిర్ఘాంతపోయాడు. ఏనాడూ
చిన్న దెబ్బయినా వేయని తల్లి.. మొదటిసారి తనని కొట్టింది. వాడికి కోపమూ, రోషమూ ఏకకాలంలో పొంగుకొచ్చినయి.
తండ్రినని చెప్పుకొంటున్న ఆగంతకుణ్ని కసితో చూశాడు. దీనికంతటికీ ఇతనే కారణం. ఆవేశం కలిగినా.. అతణ్ని ఏమీచేయలేని నిస్సహాయతతో పెద్దగా ఏడవసాగాడు. కోపంగా కాళ్లు నేలకేసి బాదుకుంటూ.. దూరంగా వెళ్లిపోయి కూర్చున్నాడు. అదిచూసి కొత్తవ్యక్తి
లేచి బాలమల్లు దగ్గరికొచ్చాడు. వాడి తలమీద చెయ్యేసి చిన్నగా నిమిరాడు.
“నిజం బిడ్డా! నేను నీ తండ్రినే” అనునయించాడు.
“కాదు! అంతా అబద్ధం. నువ్వు మోసగానివి. నాకు నాయిన లేడు.. సచ్చిపోయిండు”.
“లేదు బాబు. మీ అమ్మకూడ చెప్తున్నదిగద.
నేనే నీ తండ్రిని”.
“నీకసలు బుద్ధుందా..? గింత పెద్దగైనవు! ఎన్నిసార్లు చెప్పాలె.. మా నాయిన సచ్చిపోయిండని?” గట్టిగా అరుస్తూ బాలమల్లు అక్కణ్నుంచి లేచి విసురుగా లోపలికి పోయాడు. మరో రెండు నిమిషాల తర్వాత తిరిగొచ్చిన వాడిచేతిలో చిన్న అట్టపెట్టె ఒకటి ఉన్నది. దాన్ని ఆగంతకుని చేతిలో పెట్టి..
“మా నాయిన సచ్చిపోయి పితరుల్లో కలిసి తూనీగ అయిండు. నీలంరంగు తూనీగ. ఈ పెట్టెల ఉన్నడు కావాల్నంటే సూడు..” అన్నాడు.
కొత్తవ్యక్తి కుతూహలంతో పెట్టె తెరిచాడు.
మూత తీయగానే.. లోపలున్న నీలంరంగు తూనీగ ఒకటి బయటికొచ్చి, బలహీనంగా గాల్లోకి ఎగురుతూ పోయింది.
అదిచూసి అతను నివ్వెరపోయిండు.
బాలమల్లు తల్లి.. శిలాప్రతిమే అయ్యింది!
ఎగుమామిడి అయోధ్యారెడ్డి
రైతు కుటుంబంలో పుట్టి, జర్నలిస్టుగా ఎదిగి, రచయితగా రాణిస్తున్నారు అయోధ్యారెడ్డి. పొలిటికల్ సైన్స్లో ఎంఏ, డాక్టరేట్ చేశారు. 1983లో ‘ఉదయం’ దినపత్రికలో జర్నలిస్టుగా వృత్తిజీవితాన్ని మొదలుపెట్టారు. మూడు దశాబ్దాలు దక్కన్ క్రానికల్ సంస్థలో పనిచేసి.. న్యూస్ ఎడిటర్గా విరమణ పొందారు. పాఠశాల రోజుల నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీ రోజుల్లోనే కలం చేతపట్టి.. కథలు రాశారు. తొలికథ ‘మృత్యువులో వ్యత్యాసం’. 1974లో గులాబి మాసపత్రికలో అచ్చయింది. ఇప్పటివరకు 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 40కి పైగా విదేశీ కథలు, ఒక విదేశీ నవలను తెలుగులోకి అనువదించారు. ఆరు పుస్తకాలను వెలువరించారు. నాటి ప్రసిద్ధ పత్రికలైన భారతి, యువ, స్రవంతి, ప్రగతి మొదలుకొని.. నేటితరంలోని అన్ని ప్రముఖ దిన, వార, మాస, వెబ్ పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. పలు పత్రికలు, ఆలిండియా రేడియో కోసం సాహిత్య విమర్శలు, వాణిజ్య, క్రీడారంగ వ్యాసాలు రాశారు. కొన్ని కథలకు ప్రధాన పత్రికల నుంచి బహుమతులు పొందారు. నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు, సాహితీ గౌతమి, పాకాల యశోదారెడ్డి, మాడభూషి, తెలుగు వర్సిటీ పురస్కారాలు అందుకున్నారు.
ఎగుమామిడి అయోధ్యారెడ్డి
9399962117