‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
చీకటి అంతకంతకూ దట్టమవుతున్నది. ఎన్నో రకాల భయాలు వికృతరూపం దాల్చి.. రత్తాలు గుండెల్లో నగ్నంగా నర్తిస్తున్నాయి. ఉద్యోగం కోసం పొద్దుటనగా ఊరిమీద పడ్డ ఆమె మొగుడు.. అర్ధరాత్రవుతున్నా తిరిగి రాలేదు.
‘నాన్న వస్తాడు! తినడానికేదో తెస్తాడు’ అని ఆశగా చూసి నిరాశపడ్డారు పిల్లలు. తల్లి పెట్టిన రెండు ఎంగిలి మెతుకులు తిని.. శోష వచ్చినట్టు పడుకుండి పోయారు.
రత్తాలుకు కాళ్లూ, చేతులూ ఆడటం లేదు.
‘ఇంతదాకా ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఎదురు చూస్తున్న పెళ్లాం – బిడ్డలు గుర్తు రాలేదా? లేక తన దారి తను చూసుకోవాలని ఎందులోనైనా దూకి..! ఛా.. ఛా!’.
ఆ ఆలోచనకు భయపడిపోయింది.
మెరుపు మెరిసింది. ఆ వెలుగులో వాసు వస్తూ కనిపించాడు. వెర్రి సంబరంతో పరుగున ఎదురెళ్లింది.
“పిచ్చిదానా! మనకు మంచిరోజులు వస్తున్నాయే!” అన్నాడు వస్తూనే.
“ఉద్యోగం దొరికిందా?” ఆశగా అడిగింది.
“ఒకళ్లిచ్చేదేంటి బోడి. నేనే కల్పించుకున్నాను. పిల్లలు నిద్రపోలేదు కదా! బిర్యానీ తెచ్చానే!”.
“డబ్బెక్కడిది?”.. అంటూ అనుమానంగా చూసింది.
“చెట్టంత మగాణ్ని. ఆ మాత్రం సంపాదించలేనా!? పద పద”..
ఇద్దరూ ఇంట్లోకెళ్లారు. అడ్డదిడ్డంగా పడుకున్న పిల్లల్ని చూసేసరికి వాసు కళ్లల్లో కన్నీటి అల భళ్లున పగిలింది.
“పాపం! ఇప్పటిదాకా నీకోసం కలవరిస్తూనే ఉన్నారు!” అంటూ పిల్లల్ని నిద్ర లేపింది రత్తాలు.
పిల్లలు కండ్లు నలుపుకుంటూ లేచి కూర్చున్నారు.
“మీ నాన్న బిర్యానీ తెచ్చాడు”.. సంబరంగా చెప్పింది తల్లి.
వాసు పార్సిల్ విప్పుతుంటే, గుప్పుమని వచ్చిన బిర్యానీ వాసనకు పిల్లల ముఖాలు వికసించాయి.
“మా నాన్న మంచోడు!” అని కొడుకు అంటే.. కూతురొచ్చి అమాంతం తండ్రి మెడను చుట్టేసింది.
ముందు తనకు పెట్టమంటే తనకు పెట్టమంటూ పిల్లలిద్దరూ పోటీపడ్డారు.
“చిన్నది కదా! ముందు నా బంగారానికి..” అంటూ బిర్యానీ ముద్ద కూతురు నోటికి అందివ్వబోతూ ఆగి
పోయాడు. కళ్ల నుంచి కన్నీళ్లు ధారలుగా కారుతూ ముద్దను తడిపేస్తున్నాయి.
“ఉహూ! నీకొద్దు చిట్టితల్లీ. నువ్వు మా అదృష్టానివి. అన్న పెద్దోడు. నా తర్వాత నా అంతవాడు కదా..” అంటూ వాడికి పెట్టబోయి ఆగి బావురుమన్నాడు.
వాసు ప్రవర్తనకు పిల్లలు ఆశ్చర్యపడితే, ఇల్లాలుఅనుమాన పడింది.
“ముందు నాకు
పెట్టు మావా..” అంటూ అతని చేతిని పట్టుకుని, ఆ ముద్దను తన నోట్లో పెట్టుకోబోయింది రత్తాలు.
గభాల్న చేయి లాగేసుకుని, బిర్యానీ పొట్లాన్ని చుట్టేసి బలంగా బయటికి విసిరేశాడు.
మళ్లీ ఏమనిపించిందో.. పరుగున వెళ్లి తీసి, ఇంటెనకాల మురుగు కాల్వలోకి విసిరేసి వచ్చాడు.
“ఏడ్సేవాళ్లూ మిగలకుండా అందరం కట్టగట్టుకుని చద్దామా మావా?”.
భార్యనూ, పిల్లలనూ వాటేసుకుని ఆకాశం బద్దలైనట్టు ఏడ్చాడు. తల కొట్టుకున్నాడు.
“నేను చేతకానివాణ్ని రత్తాలూ! ఎందుకూ పనికిరాను. దేనికీ పనికిరాను..” గోడకు చేరబడి అరచేతుల్తో ముఖం కప్పుకొని ఏడ్చాడు.
పిల్లలను తన ఒళ్లో పడుకోబెట్టుకుని జోకొడుతూ మొగుడి వంక ఆశ్చర్యంగా, వేదనగా చూసింది.
“నువ్వేమీ సెయ్యకుండానే ఇలాగున్నామా!? పిల్లగాళ్లను ఇంతోళ్లను చేశామా?!”.
“అదంతా ఎప్పటి మాటో! ఇప్పుడదేం చెల్లదు. అదంతా తుడిచి పెట్టుకుపోయింది రత్తాలూ! నా పని అయిపోయింది. ఇంక బతకడం వేస్ట్!”.
“నీ రెక్కలూ నా రెక్కలూ చల్లగా ఉన్నాయి మావా. ఏమీ మిగలనట్టు ఆ ఏడుపేంటి సెప్పు? ఉద్యోగం దొరక్కపోతే అంతా అయిపోయినట్టేనా!? మనకంటే నిష్ట దరిద్రులు ఎంతమంది లేరు. వాళ్లు బతకడం లేదా? మనల్నెందుకు మోయాలని భూదేవి మనల్నడిగిందా? లేదు కదా?”.
“నీకు తెలీదు రత్తాలూ! బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది”.
“నీ సిన్నప్పటి కన్నా సెడిపోయిందా?”.
ఆమె సూటిగా అడిగిన ప్రశ్న.. వాసు కాలర్ పట్టుకుని కూర్చోపెట్టింది. వెర్రిగా చూశాడు. జ్ఞాపకాల్లో కప్పడి
పోయిన గతం.. కండ్ల ముందు నిలిచింది.
అప్పట్లో పల్లెలో ఊరవతలున్న మాలపల్లెలో ఉండేవారు. తల్లీ తండ్రీ వ్యవసాయ కూలీలు. తండ్రి కూలి డబ్బులను తాగుడుకు తగలేసేవాడు. తల్లి తన కష్టంతో తననూ, మరో నలుగురు పిల్లల్నీ సాకేది. పేడ పోగేస్తూ, పరగ ఏరుతూ, గొడ్ల్లు కాస్తూ.. రూపాయీ అర్ధా సంపాదించేవారు. అయినా అంబలి తప్ప అన్నం దొరికేది కాదు. తినీ తినక మాడుతుంటే.. అమ్మమ్మ తనను నగరానికి తీసుకొచ్చింది.
“నా మనవడికి కూలి పనిప్పించు సామీ!” అని తెలిసిన అందర్నీ ప్రాధేయపడింది.
అంతా విదిలించేశారు. అయినా అధైర్యపడకుండా సార్ గారి స్కూలుకు తీసుకెళ్లింది.
“తిండి లేక మాడిపోతున్నాడయ్యా! వీణ్ని మీకాడ పెట్టుకుని ఒక ముద్దపెట్టండి సాలు” అంటూ సార్గారి కాళ్ల మీద పడింది అమ్మమ్మ.
తన వంక చూసి చప్పరించేశారాయన.
“మైనర్ని పనిలో పెట్టుకోకూడదు!”.
“అలాగనమాకండి. పెద్దదాన్ని, మీ కాళ్లట్టుకున్నాను. కనికరించండి సామీ. ఏ పని సెప్పినా సేత్తాడు. కుక్కలా నమ్మకంగా పడుంటాడు. కడుపుకింత అన్నం పెట్టండి చాలు. పెద్ద మనసు సేసుకోండయ్యా!”.. అంటూ ఆయన కాళ్లను గట్టిగా పట్టుకుని బతిమాలింది.
ఆయనెంత చెప్పినా, కోప్పడ్డా వినక పోయేసరికి..
“సరేలే! ఏదోటి చూస్తాన్లే! స్కూల్లో ప్యూన్గా పెట్టుకుంటాను. నెలకు రెండు వేలిస్తాను. ఎవరైనా అడిగితే నీ వయసు ‘పద్దెనిమిది’ అని చెప్పు” అన్నారు.
“తమరు నిజంగా దేవుడే. అలా సూత్తావేంట్రా! అయ్యగారి కాళ్ల మీదపడు” అంటూ తనను వంచింది.
సార్గారి పాదాలు పట్టుకుని నమస్కరించాడు.
అలాగ తను పద్నాలుగేళ్ల వయసులో సార్గారి ఆశ్రయంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరి వెనుదిరిగి చూడలేదు. సార్గారికీ, తర్వాత మేడమ్గారికీ చేతికింది మనిషయ్యాడు. స్కూలు పనీ, ఇంటి పనీ అని చూడకుండా.. చెప్పిన పనల్లా చేశాడు. ఇంట్లోనూ, ఆఫీసులోనూ శుభ్రం చేసేవాడు. కూరగాయలు తెచ్చేవాడు. అటకమీంచి సామాన్లు దించేవాడు. రోజూ సోఫాలూ, కుర్చీలూ మేడమ్ మెచ్చుకునేలా తుడిచేవాడు. మేడమ్ వెంట బజారుకు వెళ్లేవాడు. సరుకులు మోసేవాడు.
“వాసు బాగా ఆసరాగా ఉంటున్నాడు. వాడికి కారు డ్రైవింగ్ నేర్పిద్దాం. నమ్మకంగా మన దగ్గరే పడుంటాడు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు!” అంటూ సార్గారికి చెప్పి ఒప్పించింది మేడం.
ఆవిడే డ్రైవింగ్ స్కూల్లో చేర్పించింది. అది నేర్చుకుంటూ పొద్దుట్నుంచి రాత్రి దాకా ఇంట్లోనూ, స్కూల్లోనూ పనిచేసేవాడు. డ్రైవింగ్ బాగా వచ్చాక సార్గారి డ్రైవర్ అయ్యాడు. జీతం అయిదువేలు చేశారు.
మరి రెండేళ్లకు రత్తాలుతో పెళ్లయ్యింది. ఊరి చర్చిలో జరిగిన పెళ్లికి సార్గారూ, మేడం వచ్చి ఆశీర్వదించారు. ఇంటికి కావాల్సిన సామాన్లు కొనిపెట్టారు. ఆ స్కూల్లోనే ఆయాగా చేరింది రత్తాలు. కాలం చీకూ చింతా లేకుండా గడిచిపోతున్నది. ఇద్దరు పిల్లలు పుట్టారు.
ఒకరోజు తెల్లవారు జామున సార్గారికి గుండెపోటు వచ్చింది. త్వరగానే కోలుకున్నారు గానీ,
అమెరికాలో ఉంటున్న వాళ్లబ్బాయి ఒత్తిడి తెచ్చి స్కూల్ అమ్మించేశాడు. ఆ తర్వాత సార్గారూ, మేడం అమెరికా వెళ్లిపోయారు.
‘ఇదీ మంచికే’ అనుకున్నాడు తను. అప్పటికే చాలామంది డ్రైవర్లతో పరిచయాలు అయ్యాయి. ట్రావెల్ ఏజెంట్ దగ్గర కమీషన్కు పనిచేస్తే ఎక్కువ సంపాదించొచ్చని గ్రహించాడు. అలాగే చేశాడు.
ఆదాయం బాగుంది. మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చెల్లెళ్లకూ, తమ్ముళ్లకూ అండగా నిలబడ్డాడు.
“పిల్లల్ని స్కూల్లో చేర్చాలి. దానికి తగ్గట్టుగా సంపాదించాలి. డ్రైవర్గా ఉండి పోకూడదు. ఓనర్ కమ్
డ్రైవర్ను అవ్వాలి. అది నా కల” అనేవాడు రత్తాలుతో.. మెరుస్తున్న కండ్లతో.
షిరిడీ, తిరుపతి, విజయవాడలాంటి దూర ప్రదేశాల టూర్లకు ఇష్టంగా వెళ్లేవాడు. కమీషన్
రావడమేగాక బేటాలు మిగిలేవి. మెల్లగా కూడబెట్టడం మొదలెట్టాడు. మూడేళ్లు ఎద్దులా పనిచేశాడు. పిల్లల్ని స్కూల్లో చేర్చడమే కాదు.. ఫైనాన్స్ కంపెనీ సాయంతో కారు కొనగలిగాడు.
రత్తాలు ఓ మాల్లో స్వీపర్గా చేరింది. ఆమె సంపాదనా బాగుంది. దాంతో పిల్లల్ని ప్రైవేటు స్కూల్లోకి మార్చారు. త్వరత్వరగా కారు అప్పు తీర్చేస్తే.. కారు సొంతమైపోతుందన్న ఆశతో అటు ఓలాకూ, ఇటు
ఉబర్కు కూడా తిరిగాడు. ఎక్కువ గిట్టే సమయాల్లో ఎక్కువ తిరిగాడు. రోజువారీ టార్గెట్లు పూర్తిచేశాక గానీ డ్యూటీ దిగేవాడు కాదు. గోదావరి మీద పడవ ప్రయాణంలా తమ బతుకులు సాఫీగా సాగిపోతున్నాయి.
ఇంతలో కరోనా మహమ్మారి పంజా విసిరింది. లాక్డౌన్ ప్రకటించారు. కారు చక్రాలు ఆగాయి. భార్య పనీ పోయింది. అయినా కుంగిపోకుండా ఉన్నదంతా ఊడ్చుకు తిన్నారు. అప్పులు చేశారు. కానీ, కారు కిస్తీలు కట్టలేకపోయారు. ఫైనాన్స్ వాళ్లు కారు తీసుకుపోయారు. సర్వం కోల్పోయినట్టు అయిపోయారు. చిన్నా చితకా ఉద్యోగాల కోసం రోడ్డున పడ్డారు. మాల్స్ తెరవలేదు. ఎన్నో షాపులు, హోటళ్లు మూతపడ్డాయి. ఇంటినుంచి పనివల్ల సాఫ్ట్వేర్ వాళ్లు ఊళ్లకు వెళ్లిపోయారు. ట్యాక్సీలకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. డ్రైవర్ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రత్తాలు మాత్రం నాలుగిళ్లలో పనిమనిషిగా చేరింది. ఆ పనే తమకు ఒక ముద్ద పెడుతున్నది.
అప్పులవాళ్లూ, ఇంటి ఓనరూ ఒత్తిళ్లు పెంచారు. ఎన్నాళ్లని ఇలా అర్ధాకలితో బండి లాగించడం అనిపించింది. బతకడానికి దారి లేనప్పుడు చావడమే పరిష్కారం అనుకున్నాడు. చచ్చిపోతే తమ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు అన్నీ హుష్కాకి అయిపోతాయని చెప్పి.. బిర్యానీలో విషం కలిపి తెచ్చాడు..!
గతంలోంచి బయటికొచ్చి.. నిట్టూర్చాడు వాసు.
“ఆ బిర్యానీ తినేశామనుకో! అంతా కట్టకట్టుకుని చచ్చామనుకో! ఇదివరకటిదంతా పోయిందనుకో! మళ్లీ మొదలుకాడ్నుంచి స్టార్టు చేద్దాం మావా! నేను నాలుగు కాదు ఎనిమిదిళ్లలో పనిచేస్తా. నువ్వూ డ్రైవర్ అనేగాక చిన్నదో చిటికెదో ఏది దొరికితే అది చెయ్యి. బతుకు గాడిలో పడితే పరిగెత్తడం ఎంతసేపు మావా!?”..
రత్తాలు వంక పిచ్చిగా చూశాడు. ఆమె ధీమాకు అబ్బురపడ్డాడు.
ఆ మర్నాడు పనికెళ్లిన రత్తాలు.. గాలిలో తేలుతూ ఇంటికొచ్చింది.
“నేను పనిచేస్తున్న అపార్టుమెంటుల్లోని వాచ్మేన్ భార్యకు జబ్బు చేసిందట. వాళ్ల ఊరెళ్లిపోయారు. నీ గురించి చెప్పాను. తీసుకు రమ్మన్నారు. రా మావా వెళ్దాం!” చెయ్యి పట్టుకుని లాగింది.
“వాచ్మేన్ పనా! ప్యాంటూ, షర్టూ తొడుక్కుని సొంతకారు నడిపినవాణ్ని!”.
“అద్దె కట్టడం లేదని ఇంటి ఓనరు తన్ని తరిమేస్తే ఎక్కడ తల దాచుకోవాలన్న భయం, దిగులు పోయాయని సంతోషించు మావా. మనం ఉండటానికి ఇల్లు ఇస్తారు. కార్లూ, బైకులూ తుడిస్తే అదనంగా ఎంతో కొంత ముడుతుంది. నేనందులోనే ఇంకో రెండుమూడిళ్లలో పని చూసుకుంటాను. ఆ దగ్గర్లోనే సర్కారోడి స్కూలుంది..” సంబరంగా చెప్పుకుపోతున్నది రత్తాలు.
అతడా విషయాన్ని జీర్ణించుకోలేక రాయిలా ఉండిపోయాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. బలవంతాన అసోసియేషన్ సెక్రటరీ శ్రీరాములు దగ్గరికి లాక్కుపోయింది. వాసునూ, అతడి వాలకాన్నీ చూసి..
“వాచ్మేన్ పని చేయగలవా?” అడిగాడాయన.
తల నిలువుగా ఆడించాడు.
ఏదో అనుమానం రావడంతో..
“బట్టలు ఇస్త్రీ చేస్తావు కదా?” అడిగాడు శ్రీరాములు.
“మేం చాకళ్లం కాదండి!”.
“ఇస్త్రీ పని చేయడానికి చాకళ్లే కానక్కర్లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మొదట్నుంచీ వాచ్మేనే ఇస్త్రీ చేస్తున్నాడు. దానికోసం ఇంకొకర్ని పెట్టుకుంటామా?!”.
వాసు తటపటాయిస్తుంటే..
“పనిని గౌరవించేవారే చులాగ్గా పైకొస్తారు. నీకంత నామోషీగా ఉంటే.. వద్దులే” అన్నాడాయన.
శ్రీరాములు లేచి వెళ్లబోతోంటే ఆపింది రత్తాలు.
“అన్నీ నేర్చుకుంటాడు. మీరెలా చెబితే అలా చేస్తాం! తిండికి లేక పిల్లలు మాడిపోతున్నారు.
నికరించండి!”.. చేతులు జోడించింది రత్తాలు.
ఆ మర్నాడే వాచ్మేన్ గదికి మారిపోయింది వాసు కుటుంబం. ఆ రూమ్ చాలా చిన్నది. పడకకూ, వంటకూ అన్నిటికీ అదే. చాలా ఇరుగ్గా ఉంది.
అసంతృప్తిగా చూశాడు. అనునయించింది రత్తాలు.
వాసు ఉదయం ఐదింటికే లేచి.. స్పాంజి తీసుకుని పైపు నీళ్లతో కార్లు కడుగుతుంటే, మార్నింగ్ వాక్కు వెళ్తూ ఆగాడు శ్రీరాములు.
“ఇంకాస్త పొద్దుటే లేచి ఈ పని కానివ్వాలి. త్వరగా తెమిలెళ్లి చెత్త ఎత్తు!” అని చెప్పి వెళ్లిపోయాడు.
కార్లూ, బైకులూ తుడిచాక.. ప్లాస్టిక్ డ్రమ్ తీసుకుని ఒక్కో ఫ్లాట్కూ వెళ్లాడు వాసు. గుమ్మం పక్కన పెట్టిన చెత్తను అందులో పోశాడు. కొన్నిట్లలోంచి దారుణమైన వాసన వచ్చింది. ముక్కుకు కర్చీఫ్ కట్టుకుని ఆ పని పూర్తిచేశాడు. దాన్ని తీసుకెళ్లి గ్రౌండ్ ఫ్లోర్లో వెనక పక్కన ఉంచిన పెద్ద డ్రమ్ముల్లోకి చెత్తను మార్చాడు. తర్వాత చీపురందుకుని బాల్కనీలు చిమ్మి, టెర్రస్ మీదకెళ్లి మంజీరా నీళ్లు వదిలాడు. ఆ సరికి పూర్తిగా డీలా పడిపోయాడు. సానుభూతిగా చూసింది రత్తాలు.
“పిల్లల చేత పాల ప్యాకెట్లు, పేపర్ వేయిస్తే!..” ఆమె మాటలు పూర్తికాకుండానే కయ్యిమన్నాడు.
“వాళ్ల రాత నాలాగా కాకూడదు. బాగా చదువుకోవాలి. పస్తులుండైనా చదివిస్తా!”.
పిల్లల తలలు ఆప్యాయంగా నిమిరింది.
“అలవాటులేకే లే! మెల్లగా అలవాటు పడిపోతాను” ఆమెను నొప్పించలేక అన్నాడు.
మర్నాడు..
“వాసూ! ఇవాళ ఇస్త్రీ పెట్టె కొని తెచ్చేసుకో. ఇస్త్రీలు ఎప్పుడు మొదలుపెడతావని అంతా అడుగుతున్నారు” అన్నాడు శ్రీరాములు.
“ఇవాళ కొంటానండి. కానీ..” తలగోక్కున్నాడు.
“నీ భార్య చెప్పిందిలే. ట్రెజరర్ శర్మకు చెప్పాను. అడ్వాన్సు ఇస్తాడు, తీసుకో!”.
పక్క అపార్టుమెంటులోని వాచ్మేన్ను కలిశాడు. అతణ్ని తీసుకుని బజారుకెళ్లి ఇస్త్రీ పెట్టె కొన్నాడు. చాలా బరువుగా ఉంది. బరువు ఎక్కువ ఉంటేనే బట్ట బాగా నలుగుద్దని కొనిపించాడు.
ఒకరోజు ఇస్త్రీకే జబ్బలు పట్టేశాయి. ఏడుపు తన్నుకొచ్చింది.
“నేనీ పని చేయలేను. నాతరం కాదు..” ఏడుస్తూనే కస్సుమని కరిచేశాడు.
“పిల్లల మొకాలు చూసి ఓపిక పట్టు మావా! నేను ఇదివరకు మాల్లో స్వీపర్ని. ఇప్పుడు అంట్లూ, బాత్రూములూ కడగడం లేదూ! హరిశ్చంద్ర మారాజంతటోడే కాలం కర్మం కలిసి రాక.. కాటికాపరయ్యేడు!”.
మరి రెట్టించలేదు. తనలో తను రగుల్తూ ఉండిపోయాడు వాసు.
రోజులు భారంగా గడుస్తున్నాయి. అలాగని వాసు పని విషయంలో బద్ధకించలేదు. ఎంత బాగా చెయ్యగలడో అంతబాగానూ చేస్తున్నాడు. అంతా అతడి పనినీ, అంకిత భావాన్నీ మెచ్చుకొంటుంటే.. గుండెల మీంచి పెద్ద బరువు దిగిపోయినట్టు ఫీలవుతున్నది రత్తాలు.
కానీ, వాసుకు మాత్రం ఆనందంగా లేదు. ఎలాగైనా సరే.. పైకి ఎగబాకాలన్న కసితో కష్టపడుతున్నాడు.
అదే అపార్టుమెంటులో ఉంటున్న ఆనందరావు ఏదో ఏజెన్సీ తీసుకున్నాడు. ట్రక్ ఆటో కొన్నాడు. డ్రైవర్ కోసం చూస్తుంటే వెళ్లి కలిశాడు వాసు. తన డ్రైవింగ్ లైసెన్సు చూపించి, అనుభవం ఏకరువు పెట్టాడు.
“రోజుకు నాలుగైదు గంటల పని ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర సరుకు లోడ్ చేసుకుని, నేనిచ్చిన లిస్టు ప్రకారం సరుకును షాపులకు సప్లయి చేయాలి. అబ్బే నీకెలా కుదుర్తుందీ!”.
“కుదిరించుకుంటాను. పగలు ఖాళీయే కదండి. ఎలాగైనా చేసేస్తాను. అదయ్యాకే ఇస్త్రీ పని పెట్టుకుంటాను!”.
“ఇక్కడుండే వాడివి గనుక నిన్ను పెట్టుకుంటే నాకూ మంచిదే అనుకో! సరే ముందు సెక్రటరీ అనుమతి తీసుకో!”.
ఎగిరి గంతేశాడు.
“నాకు డ్రైవింగ్ ఎంతో ఇష్టమండి. చిన్న అవకాశం వచ్చింది సార్. మీరు పర్మిషనిస్తే..” శ్రీరాములును కలిసి అడిగాడు వాసు.
ఆయనకు వాసు మీద మంచి ఇంప్రెషన్ ఉంది. ఇతను వచ్చాకే.. అన్ని పనులూ సాఫీగా సాగిపోతున్నాయి మరి.
“వాచ్మేన్ డ్యూటీకి ఇబ్బంది లేకుండా చేసుకుంటానంటే.. చేసుకో. ఎవరి దగ్గర్నుంచీ ఎలాంటి కంప్లయింటూ రాకూడదు సుమా!” అని చెప్పాడు.
ఆ మర్నాడే కొత్త ట్రక్ ఆటో ముందు కొబ్బరికాయ కొట్టి ఎక్కాడు వాసు.
భార్యా బిడ్డలకు సంతోషంగా వీడ్కోలిచ్చి ముందుకు దూకించాడు.
అతనిలో ఉత్సాహం వెల్లువవడం చూసి మురిసిపోయింది రత్తాలు.
భవిష్యత్తు మీద భరోసా చిక్కింది వాసుకు. భార్యతో పిల్లలతో తెగ కబుర్లు చెబుతున్నాడు.
చక్కగానూ, వేగంగానూ చేస్తున్నందుకు ఆనందరావు ఎంతో సంతోషించాడు.
“నువ్విదే స్పీడుతో చేస్తానంటే.. మరిన్ని సరుకులకు ఏజెన్సీ తీసుకుంటాను”.
“తీసుకోండి సార్. అవసరమైతే కొన్ని బట్టలు ఇస్త్రీకి పక్క వాచ్మేన్కు ఇచ్చేస్తాను” అన్నాడు.
విషయం భార్యకు చెప్పి పొంగిపోయాడు.
“మనకు నిజంగానే మళ్లీ మంచి రోజులొస్తున్నాయే!”.
“మన కష్టమే మనల్ని కాపాడుతుంది!”.. భర్తను వాటేసుకుంటూ అన్నది రత్తాలు.
పిల్లలు కడుపు నిండా తింటూ బడికెళ్లి చదువుకుంటున్నందుకే.. ఆమెకు చెప్పరానంత ఆనందంగా ఉంది.
ఒకరోజున ఆటో దిగుతూనే వచ్చి రత్తాల్ని చుట్టేసి గిరగిరా తిప్పేశాడు వాసు.
“ఏవైంది మావా! ఈ పిచ్చి సంబరమేంది?” అడిగిందామె.
“నక్కను తొక్కానే! నేను సరుకు తెచ్చే డిస్ట్రిబ్యూటర్గారి అబ్బాయికి నేనూ, నా పనీ బాగా నచ్చాయి. వారి ఫార్మా కంపెనీలో ఉద్యోగుల్ని తీసుకురావడానికీ తీసుకెళ్లడానికీ, టాక్సీల కాంట్రాక్టు ఇస్తున్నారట. నన్ను అప్లయి చెయ్యమన్నారు”.
“మనకు కారు లేదుగా!”.
“వస్తుందే! వాళ్లే బ్యాంకుతో మాట్లాడి ఇప్పిస్తానన్నారు. బ్యాంకు కిస్తీ తగ్గించుకుని.. వాళ్లే తిన్నగా బ్యాంకుకు జమ చేసేస్తారు. మిగతాది మనకిస్తారు. నేను మళ్లీ ఓనర్ కం డ్రైవర్ను అయిపోతున్నా!”..
మిన్నంటేలా అరిచాడు వాసు. రత్తాలు నవ్వింది. వసంతకాలపు వేకువ వెలుగులా ఉందది!
కార్లూ, బైకులూ తుడిచాక..
ప్లాస్టిక్ డ్రమ్ తీసుకుని ఒక్కో ఫ్లాట్కూ వెళ్లాడు వాసు. గుమ్మం పక్కన పెట్టిన చెత్తను అందులో పోశాడు.
కొన్నిట్లలోంచి దారుణమైన వాసన వచ్చింది. ముక్కుకు కర్చీఫ్ కట్టుకుని ఆ పని పూర్తిచేశాడు.
దాన్ని తీసుకెళ్లి గ్రౌండ్ ఫ్లోర్లో వెనక పక్కన ఉంచిన పెద్ద డ్రమ్ముల్లోకి చెత్తను మార్చాడు. తర్వాత
చీపురందుకుని బాల్కనీలు చిమ్మి, టెర్రస్ మీదకెళ్లి మంజీరా నీళ్లువదిలాడు. ఆ సరికి పూర్తిగా
డీలా పడిపోయాడు.
చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్
‘సింహప్రసాద్’ పేరుతో రచనలు చేస్తుంటారు చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మల్లవరం స్వస్థలం. మొదటి కథ.. ‘కథగా ముగియని కథ’ 1973లో స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటివరకూ 445 కథలు, 70 నవలలు, 2 నాటకాలు, కొన్ని కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. 12 కథా సంపుటాలను వెలువరించారు. 112 కథలకు, 18 నవలలకు, 2 నాటకాలకు బహుమతులు అందుకున్నారు. ‘సింహప్రసాద్ సాహిత్య సమితి’ నెలకొల్పి కథా రచయితలను పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
-సింహ ప్రసాద్
98490 61668