Ramaayanam | ఓసారి తాతయ్య వాళ్ల ఊరికి వెళ్లాం. మధ్యలో వాగుదాటి వెళ్లాలి.. ఆ ఊరికి. అమ్మ పుట్టిల్లు బమ్మెర ఓ వైపూ, నాన్న సొంతూరు కూనూరు మరోవైపూ ఉంటాయి. మేముండే ఊరి నుంచి ఈ రెండూర్లూ సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కూనూరులో తాతయ్య, నానమ్మతోబాటు మా ఇద్దరు చిన్నాయనల కుటుంబాలు ఉండేవి.
తాతయ్య వాళ్ల ఇంట్లో అయిలమ్మ అనే మహిళ పనిచేసేది. ఒకరోజు ఇంచుమించు మా వయసే ఉన్న ఓ ఆడపిల్లను వెంటబెట్టుకుని వచ్చి.. అందరితో మాట్లాడుతున్న నాన్న కాళ్లమీద పడి ఏడవడం మొదలుపెట్టింది అయిలమ్మ. “తిండికే ఎల్తలేదయ్యా! నా బతుక్కు నల్గురు ఆడి ముండలు పుట్టిన్రు. ఏమి జెయ్యాలె! ఎట్ల సాదాలె! గీ సంసారం ఎల్లదియ్యలేక సస్తాన! దొరా.. నీ దండం బెడుత. కాల్మొక్కుత.. గీ పొల్లను ఒక్కదాన్ని మీ కాడ ఉంచుకొని గింత కూడు పెట్టున్రి. మీరు కొట్టినా, తిట్టినా మంచిదే! పని జెప్పున్రి. ఎట్లనన్న గీ పోరి బరువు నాకు అల్కన జెయ్యుండ్రి!” అంటూనే.. “దొర కాల్మొక్కు పోరీ!” అంటూ ఆ పిల్లను కూడా బలవంతంగా నాన్న కాళ్లమీద పడేసింది.
“ఏయ్! ఏంటిదే అయిలీ! ఎట్లనో సాదుకోవాలె గానీ.. గింత పిల్లను ఎట్ల తీసుకపోతరు? మళ్ల పొరుగూరికి?!” అని మా చిన్నాన్న వాళ్లు అడ్డుపడ బోయారు. కానీ, ఆమె వదల్లేదు. నాన్న మనసు అప్పటికే మెల్టింగ్ పాయింట్కు చేరుకుంది. “ఎడ్వకు.. తీసుకపోయి ఇంత బువ్వ, బట్ట ఇయ్యమా గానీ, గింత చిన్నపిల్ల.. నిన్ను ఇడిచిపెట్టి ఉంటదా మరి!” అన్నాడు.
“ఏం కాదయ్యా.. ఉంటది. ఈడ తిండికే లేక సత్తానం” అని మొత్తానికి నాన్నను ఒప్పించింది. ఆ పిల్ల పేరు ‘యాదమ్మ!’ అని పుట్టినప్పుడు పెట్టి ఉంటారు గానీ, ‘యాది’ అని తప్ప ఎవరూ పిలవరు! తిండికే లేని దుర్భర దారిద్య్రం ఎలా ఉంటుందో మొదటిసారి చూసిన అనుభవం అది!
ఆ మర్నాడు మేం కచ్చడంలో మా ఊరికి వచ్చేటప్పుడు.. యాది కూడా మాతోపాటే ఓ చిన్నసంచితో వచ్చింది. బండిలో ఇక చోటు లేనందువల్ల నాన్న నడిచే వచ్చినట్టు జ్ఞాపకం.
మా చతుశ్శాల ఇంట్లో పడమటి గది నాదీ, అక్కదీ. మాకు అప్పుడు మంచాలేవీ లేవు. ఇద్దరమూ చాప మీద సన్నటి పరుపు వేసుకుని పడుకునేవాళ్లం. ఒక్కతే పడుకుంటే భయపడుతుందని యాదిని కూడా మా గదిలోనే చాపా దుప్పటీ వేసుకుని పడుకొమ్మని చెప్పింది అమ్మ. రాత్రి ఏడింటికే పడుకునేది యాది. మొదట్లో కొంచెం బెంగగా ఉన్నా.. రానురానూ మాతో కలిసిపోయింది.
ఇక యాదిని నానమ్మ మెచ్చేలాగా తీర్చిదిద్దే బాధ్యత అమ్మే తీసుకుంది. మా ఇంట్లో బయటి పనులకు పనిమనిషి ఉండేది కాబట్టి.. యాదికి పెద్దగా పనేమీ ఉండేది కాదు. శుభ్రంగా ఉండటం, పూలు తెంపడం, ఎవరైనా వస్తే చూసి చెప్పడం, వడియాలు, వొరుగులు లాంటివి ఎండబెట్టినపుడు కాపలా ఉండటం, ఏదైనా అగ్గిపెట్టెలాంటి అర్జెంట్ అవసరాలను.. ఇంటి పక్కనుండే షాప్ నుంచి తీసుకురావడం లాంటివి అమ్మ చెప్పే పనులు.
నేను చిర్రగోని, గోళీలు ఆడేటప్పుడు యాది నాకు అసిస్టెంట్గా ఉండేది. అలా ఆడేటప్పుడు తను నవ్వుతూ, తుళ్లుతూ చిన్న మేకపిల్లలా ఎంతో సంతోషంగా కనిపించేది. అక్క యాదికి తలదువ్వి, పేలు తీసి జడలు వేసేది. గోచి పెట్టుకుని కాకుండా.. లంగా కిందికి జార్చి కట్టుకోవడం కూడా అక్కే నేర్పింది.
అప్పుడప్పుడూ మేం చదువుకుంటూ ఉండగా.. నానమ్మ టైమెంతయిందో కనుక్కోమని యాదిని మా దగ్గరికి పంపేది. “ఎంత పెట్టిన్రో పెద్దొరసాని అడుగుమంటున్రు” అని మమ్మల్ని అడిగేది యాది. మాకేమీ అర్థం కాక.. “పెట్టుడు ఏంది? ఏం పెట్టమని అడిగిందో కనుక్కో!” అనేవాళ్లం. వెనక్కి వెళ్తే నానమ్మ కోప్పడుతుందనో ఏమో.. “గిప్పుడు ఎంత పెట్టిందో చెప్పుండి” అనేది. రెండు మూడుసార్లు అడిగాక, గడియారం దగ్గరికి తీసుకెళ్లి చూపించి.. “గిదెంత పెట్టిందో అడుగుమంటున్రు” అని చెప్పేది. మాకు నవ్వు ఆగక నానమ్మ దగ్గరికి వెళ్లి.. “ఇప్పుడు ఎనిమిది పెట్టింది!” అని చెప్పేవాళ్లం.
యాదికి చదువు చెప్పే బాధ్యత మాపై పెట్టింది అమ్మ. తనకోసం పలకా, బలపాలూ, పుస్తకాలూ తెప్పించింది. అయితే తనకు చదువు చెప్పడం మా వల్ల అయ్యే పనికాదని కొద్దికాలంలోనే తెలిసిపోయింది. మేం పలక మీద అక్షరాలు పెట్టించి దిద్దమని ఇచ్చి, అయిదు నిమిషాల తర్వాత చూస్తే.. తను గోడకు జారగిలబడి ఎప్పుడో నిద్రలోకి జారుకుని ఉండేది. పలక పక్కకు పడిపోయి దీనంగా చూస్తూ ఉండేది. గట్టిగా అడిగితే.. “వాయ్యో! వావ్వో!” అంటూ ఏడవడం మొదలుపెట్టేది. చివరికి అమ్మే దానికి అక్షరాలు నేర్పింది. అమ్మ ఏది చెప్పినా.. అది వెంటనే వినేది.
పుట్టినప్పటి నుంచీ పల్లెటూళ్లోనే ఉండటం వల్ల యాదికి ఏమీ తెలియదు. తను బస్సును కూడా ఎప్పుడూ ఎక్కలేదన్న విషయం మాకెంతో ఆశ్చర్యం కలిగించింది. తనకు బస్సు ఎక్కాలని ఉందని తెలుసుకుని.. ఓసారి బస్సులో బమ్మెరకు తీసుకెళ్లాం. కిటికీ దగ్గర కూచొని ఎంత సంతోషపడిందో!
నెలకో, రెండు నెల్లకో ఓసారి యాది వాళ్లమ్మ వచ్చి.. రెండు మూడ్రోజులుండి వెళ్లేది. వాళ్లతోబాటు యాదిని ఎక్కడ తీసుకుపోతారోనని మాకు భయం వేసేది. బడి నుంచి రాగానే మా కళ్లు యాది కోసమే వెతికేవి. “అమ్మా! యాది వాళ్లమ్మతోని పోయిందా?!” అనడిగేవాళ్లం. అమ్మ నవ్వుతూ.. “వాళ్లమ్మ అడిగింది గానీ.. అది ‘రాను! ఇక్కడ్నే ఉంట!’ అన్నది” అని అమ్మ చెప్పగానే మా మనసులు తేలికపడేవి.
అలా మా ఇంటికి వచ్చిన యాది.. రెండున్నర ఏళ్లపాటు మా ఇంట్లోనే ఉండి, తరువాత వాళ్లమ్మ వచ్చి తీసుకుపోతే వెళ్లలేక వెళ్లలేక వెళ్లింది. అప్పటికి వాళ్ల పెద్దక్క పెళ్లి అయిపోయింది. “నాట్లు, కలుపులు, కోతలు.. గసుమంటి ఎవుసం పనులు తెలువకుండ మొద్దు లెక్క అయింది. ఆడికి తీస్కపొయ్యి అన్ని నేర్పియ్యకుంటె ఎట్ల బతుకుతది?! మీ ఇంట్ల ఉండి దొర్సాని లెక్క అయింది. గిట్లుంటె మాకెట్ల నడుస్తది?” అని వాళ్లమ్మ తీసుకువెళ్లింది. ఇంతకూ అయిలమ్మ ‘మొద్దు’ అన్నది.. మాకు కూడా వర్తిస్తుందా!? అని మాకు అనుమానం వచ్చింది. చాలా రోజులపాటు యాది పదేపదే యాదికి వచ్చేది. తరువాత ఓసారి నానమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు.. యాది ఎలా ఉందో చూద్దామనిపించింది. విచారిస్తే.. తనకు పెళ్లయి ఏదో ఊరిలో ఉంటుందని తెలిసింది. చిన్న వయసులో పెళ్లి చేసేందుకే వాళ్లమ్మ తీసుకుపోయిందని అప్పటిదాకా మాకు తెలియదు.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి