చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : జాయప, కాకతి..
మిథునశిల్పాలకు ప్రతీకలుగా నిలబడుతున్నారు. జాయపుని కోసం ఏమైనా చేస్తుంది కాకతి. జాయపుడు కళ కోసం నిలబడితే.. ఆమె జాయపుని కోసం నిలబడింది. ఇటు జాయపుని ఆలోచనలూ అలాగే ఉన్నాయి. తనకోసం ఇంత చేస్తున్న కాకతికి ఏమివ్వగలడు?! జీవితం ఇవ్వాల్సిందేనా!? మరోవైపు నారాంబ.. పలకరిస్తే పలకలేనంత పని ఒత్తిడిలో ఉంది. జాయపునికి వివాహ సంబంధాలు చూస్తూ.. రేయింబవళ్లూ అదే ధ్యాస – అదే పని!
గణపతిదేవుడు కూడా.. ఆయనతో జాయపుని పెళ్లి గురించి ప్రస్తావించిన వాళ్లను ఆనందంగా నారాంబ వద్దకు పంపేసి, చేతులు దులుపుకొంటున్నాడు. ఆమె వివాహసంబంధ ఆలోచనల్లో ఎంతగా మునిగిపోయిందంటే.. జాయపుడు ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడో కూడా గుర్తించలేనంత! జాయపుడు రానురానూ అంతఃపురానికి రావడం తగ్గించి, ఎక్కువ సమయం చతుష్పథ పురనివాసంలోనే గడుపుతున్నాడు. చివరికి నారాంబ చర్చించి చర్చించి.. మదించి మదించి.. ఓ సంబంధం ఖాయం చేసింది. భర్తకు నివేదించింది. గణపతిదేవుడు ఆ సంబంధం వివరాలన్నీ కూలంకషంగా విన్నాడు.
“జాయపుని అంగీకారం ముఖ్యం. అతనితో చర్చించు. నువ్వు అనవసరంగా ఓ అమ్మాయి పట్ల ఇష్టం పెంచుకోకు. జాయపుడు ‘వద్దు!’ అంటే మళ్లీ నువ్వే అవమానపడతావు.. తస్మాత్ జాగ్రత్త!!” అన్నాడు.
మంచి సమయం చూసి ఓరోజు ప్రకటించింది.
“జాయా.. నీకు వివాహ సంబంధం నిర్ణయించాను. బావగారు కూడా సుముఖులే!”.
జాయపుడు ఉత్సుకతతో ఆగిపోయాడు.
“అక్కా.. తాళి కట్టాల్సిన వాణ్ని. వివరాలు తెలుసుకోవచ్చునా?”.
“నీకు బాగా తెలిసిన.. నువ్వు మెచ్చిన అమ్మాయి.. ఇంద్రాణి!”.
ప్రభాత వేళ.. రాజనగరి ఉద్యానవనంలో ప్రౌఢ మహిళలు, ముదుసలి జంటలు సాధారణ వ్యాయామాలు చేస్తున్నారు. లోపలికి రాకుండానే ప్రాకారం నుంచి లోపలికి చూశాడు జాయపుడు. అతని వెదుకులాట ఇంద్రాణి కోసం. ఆమె జాడ లేదు.
ఇంద్రాణిని తనకు భార్యగా ఎంపికచేసినట్లు నారాంబ చెప్పినప్పుడు స్థాణువైపోయాడు జాయపుడు. చాలాసేపు స్తబ్ధుగా ఉండిపోయాడు. ఇంద్రాణి తగిన వధువు అవునో.. కాదో తరువాతి అంశం. ఆమె ముమ్మడిని ఇష్టపడుతున్నదని పుళిందపుడు చెప్పాడు. ఆమె ముమ్మడితో మాట్లాడటం తను కూడా చూశాడు. ఇంద్రాణి రాజకులీన వంశీయురాలు. ఆ ఆభిజాత్యం మిక్కుటం. అలాంటి ఆభిజాత్యమే ఒంటినిండా ప్రవహించే వ్యక్తి ముమ్మడి. ఆమె రాజాస్థానపు మార్గీ తరహా గొప్పగాయని. ఇవన్నీ బేరీజు వేసుకుంటూ ఆమెను అంగీకరించాలా.. తిరస్కరించాలా!? అనే రెండు నిర్ణయాలకు మధ్యగా నిలబడి ఉన్నాడు.
మరోవైపు ఇంద్రాణి ఎందుకు తనను అంగీకరించిందో.. ఎందుకు ముమ్మడిని తిరస్కరించిందో తెలుసుకోవాలన్న కుతూహలం అతనిలో పెరిగిపోతున్నది.
దూరంగా వస్తూ కనిపించాడు పుళిందపుడు. ఇద్దరి చూపులు కలవగానే పరుగు పరుగున దగ్గరికి వచ్చాడు.
కళ్ల గంతల ఘర్షణ తర్వాత.. జాయపుని ఎదుట ఎప్పుడూ చేతులు కట్టుకునే మాట్లాడతాడు పుళిందపుడు. కూర్చోమన్నా కూర్చోడు. ముమ్మడి అయితే మళ్లీ కళ్లముందు కనిపించలేదు. ఆ గొడవలవల్ల తన వాణిజ్య వ్యవహారాలు దెబ్బతీసేలా జాయపుడు వ్యవహరిస్తాడని పుళిందపుని భయం. సమావేశాల్లో, ఆటల్లో పాటల్లో అన్నిటిలో జాయపుణ్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ.. అందరికీ గొప్పగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తి మాట్లాడుతున్నాడు.. ప్రవర్తిస్తున్నాడు. ఆ సంఘటన నగరిలోని చాలామంది పెద్దలకు, యువకులకందరికీ తెలిసిందని.. జాయపునికి అంకమరట్ట విన్నవించాడు.
“శుభోదయం మిత్రమా..” అన్నాడు జాయపుడు.
“శుభోదయం.. శుభోదయం సేనానీ! తమరు ఇక్కడ.. ఇప్పుడు..” అర్ధోక్తిలో ఆపాడు.
“మీ మిత్రుని ప్రేయసి కోసం..” అన్నాడు జాయప.
ఇబ్బందిగా ముఖంపెట్టాడు పుళిందపుడు.
“మనవాణ్ని ఆమె.. నిరాకరించింది సేనాని..” అన్నాడు మెల్లగా.
“అదేమీ! కారణం తెలుసుకోవచ్చా పుళిందపా!”.
“ఏమో.. నాకూ స్పష్టంగా తెలియదు. ఆ నగునూరునాడు రాజ్య గొడవలు మొదలైనప్పటి నుంచీ ముమ్మడి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడు”.
“దానికీ.. కోరుకున్న ప్రేయసితో వివాహానికి ఏం సంబంధం? పైగా రాకుమార్తె??”.
ఏమీ చెప్పలేక చేతులు పిసుక్కుంటూ వెంట నడుస్తున్నాడు పుళిందపుడు. అప్పుడే దూరంగా ఇంద్రాణి కనిపించింది. ఆమె ఇల్లున్న వీధిలోకి వచ్చారిద్దరు. తన ఇంటివైపు వెళ్తూ.. వీళ్లిద్దరినీ చూసి ఆగింది ఇంద్రాణి.
“శలవు మిత్రమా..” అంటూ జవాబు కోసం చూడకుండా వడివడిగా వెళ్లిపోయాడు పుళిందపుడు.
జాయపుడు వెళ్లి, ఇంద్రాణి పక్కన నడుస్తూ..
“శుభోదయం!” అన్నాడు..
ఆమె తలవంచుకుని..
“శుభోదయం జాయప సేనానులకు..” అన్నది.
“మీరు.. ముమ్మడిని వివాహమాడబోతున్నట్లు..”.
ఆమె ఏమాత్రం తొట్రుపడకుండా..
“ఎవరు చెప్పారు మీకు.. మేము చెప్పలేదే! ఎవరో ఏదో వాగితే దాన్నే నమ్మితే ఎలా..?!”.
ఈసారి తొట్రుపడటం జాయపుని వంతయ్యింది.
“అదే.. అక్క. అక్కగారు.. కాకతీయ మహారాణి నారాంబదేవివారు మీతో మా వివాహం..”.
“విన్నాం. మా తల్లిదండ్రుల నిర్ణయం అది. ఇప్పుడు గుర్తించారా!? మీరు చెప్పిన యోధుడు మీతో పోరాడలేక ఓడిపోయారు కదా!”.
ఆమె తన ఇంటివసారాలోకి వెళ్లి జాయపుని వైపు చూడకుండానే చేతులు జోడించి నమస్కరించి లోపలికి నిష్ర్కమించింది. ఇంద్రాణిని అర్థం చేసుకునే క్రమంలో మరికొంత పురోగతి సాధించాడు జాయపుడు.
ఏడవ అధ్యాయం : జీవిత రంగస్థలం
“యుద్ధమంత్రాంగ మందిరానికి రావాల్సిందిగా చక్రవర్తుల వారి ఆదేశం!”.
మంత్రాంగ మందిరంలో ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోయాడు జాయపుడు..
అనుభవమూ.. కొత్త రక్తమూ కలసి ప్రవహిస్తున్నట్లు రేచర్ల రుద్రసేనాని, మల్యాల చౌండ సేనాని, వెల్లంకి గంగాధర మంత్రి లాంటి పెద్దలతోపాటు చెరకు బ్రహ్మిరెడ్డి, ప్రసాదిత్యుడు, రాజనాయకుడు.. మరికొన్ని కొత్త ముఖాల యువయోధులు కూడా పరివేష్టించి ఉన్నారక్కడ. చక్రవర్తి కోసం నిరీక్షిస్తూ యుద్ధతంత్రాలపై యువయోధులు మాట్లాడుతుండగా.. వృద్ధయోధులు చిద్విలాసంగా, మౌనంగా వింటున్నారు. ఏదైనా యుద్ధం మొదలవ్వబోతున్నదా!. లేక యువకులకు, అనుభవజ్ఞులకు మధ్య చర్చకోసమా!? ఈ సమావేశం.
అందరికీ నమస్కరించి ఓ పల్యంకంలో కూర్చుని మౌనంగా వింటున్నాడు జాయపుడు.
కొంత సమయం గడిచాక జాయపుణ్ని ఉద్దేశించి అన్నాడు రుద్రసేనాని..
“నువ్వేమీ మాట్లాడటం లేదేమి జాయపా?”.
జాయపుడు నవ్వి..
“చక్రవర్తులవారు ఏమి చెయ్యమంటే అది చేయడమే నా కర్తవ్యం. నా అభిప్రాయం అంటూ వేరేలేదు పెదనాయనగారు!”.
“అయితే చక్రవర్తులవారిదే ఆలోచన, నిర్ణయం,ఆజ్ఞ అంటావా..?”.
“అలాగే అంటారు జాయప సేనానులవారు!” అంటూ ప్రవేశించాడు గణపతిదేవుడు. వెంట గజసాహిణి కొమురయ.
పెద్దలు అలాగే ఉపవిష్టులై ఉండగా.. పిన్నలు లేచి నిలబడ్డారు. నమస్కరించారు. ఆంతరంగిక సమావేశాలలో పెద్దలు లేవడం గణపతిదేవుడు అంగీకరించడు.
“నిద్రాసమయం ఇది. అందువల్ల ఎక్కువగా మాట్లాడేదేమీ లేదు. మనరాజ్యంపై యుద్ధ ఛాయలు కమ్ముకుంటున్నాయి. అందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. ఇప్పట్నుంచే సమాయత్తమవ్వాలి. ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య దక్షిణావర్తంలో నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతున్న మనపై అఖండ భరతరాజ్యాలు దృష్టి నిలిపి ఉన్నాయి. కాబట్టి మన కాకతీయ రాజ్యం ఏదైనా రంగంలో దుర్భేద్యంగా కనిపించాలి. అందుకు అనువైనది గజసైనికశక్తి. గజసాహిణి కొమురయ, జాయపసేనానుల బృందం గొప్ప ప్రగతి సాధిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే కొమురయ మమ్మల్ని దినమూ విసిగిస్తున్నాడు. ఆయన అభిప్రాయానికి విలువ ఇచ్చి యుద్ధ సంసిద్ధతకు నాందిగా.. మన యువవీరుడు జాయపసేనానుల వారిని గజసాహిణిగా నియమిస్తూ నిర్ణయించడమైనది. ఇది మా నిర్ణయం కాదు. సర్వసేనానులవారు శ్రీ రేచర్లరుద్రయ సేనానుల నిర్ణయం. మేము కూడా శిరసావహించాల్సిన వారమే కదా!”.
బిత్తరపోయి చూస్తున్న జాయపుని వద్దకు రేచర్లరుద్ర సేనానులు వెళ్లి ఆత్మీయంగా హత్తుకున్నాడు.
“నిర్ణయం నాదే కానీ, సలహా ఇచ్చి నిత్యమూ నా చెవివద్ద పోరినవాడు కొమురయ. జాయపసేనానిని తన స్థానంలో గజసాహిణిగా నియమించాలని ఆయన అభిప్రాయం. జాయపుని అద్భుత తంత్రజాలంతో కాకతీయ గజదళం దుర్భేద్యం కాగలదని కొమురయ భావన. అందుకు మహామండలీశ్వరులు ఆమోదించడం సంతోషం!”.
“కొమురయ అందరివద్దా.. ‘అమ్మో! జాయపుడు సామాన్యుడు కాదు. అమ్మో! జాయపుని శక్తియుక్తులు అమోఘం. అమ్మో! జాయపుడు తలచుకుంటే ఏనుగులను పాతాళంలో దాచినా బయటికి తీస్తాడు. అమ్మో! జాయపుడు..’ ఇది కొమురయ పాడే స్తోత్రగీతం. అవును కదూ కొమురయా..?!!” అంటూ అందరినీ నవ్వించాడు గణపతిదేవుడు.
అప్పుడు చెప్పాడు కొమురయ..
“మీరన్నట్లు అందుకు కారణం ఉంది ప్రభూ! ఎవ్వరికీ చెప్పవద్దనీ.. అది చాలా చిన్నముచ్చటనీ జాయపుడు అన్నాడు. కానీ, నా దృష్టిలో అదొక మహాద్భుతం ప్రభూ. అది మీ అందరికీ తెలియాలి”.
“చెప్పు చెప్పు..” అంటూ అందరూ ఆసక్తి చూపారు.
“మేము కామరూపదేశపు అడవుల్లో ఏనుగుల కోసం వెళ్లినప్పుడు ఈ అద్భుతం జరిగింది. మా బృందం ఐదారుమాసాలు రకరకాలుగా గోతులు, మాట్లు తవ్వి నాలుగైదు వందల ఏనుగులను పట్టుకున్నాం. ఒకానొక మునిమాపువేళ మేము ముచ్చట్లు చెప్పుకొంటూ అడవి మధ్యగా వస్తుండగా.. ఊహాతీతంగా కొన్ని ఏనుగులు ఓ పెద్ద ఊబిలో దిగబడిపోయాయి. అది చాలా పెద్ద ఊబి. ఏనుగులు బరువైన జంతువులు. అందులో పడ్డ ఏనుగు పైకి రావడం దాదాపు అసాధ్యం. ఏవో కొన్నితప్ప.. అన్నీ అందులోపడి లోపలికి కూరుకుపోతున్నాయి. మేము యాభైమందిమి ఉన్నా.. ఊబిలోంచి ఏనుగులను బయటికి ఎలా తీయాలో తెలియదు.
అవి భయంకరంగా ఘీంకారాలు చేస్తూ.. అరుస్తూ.. తొండాలు ఎత్తి అన్ని వైపులకూ కదులుతున్నాయి. కానీ, బయటికి రాలేకపోతున్నాయి. నేనూ, జాయపుడు, మావటివాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఏనుగును కూడా రక్షించలేకపోతున్నాం. నదుల్లో, కాలువల్లో పడితే రక్షించవచ్చు. కానీ అది ఊబి. అందులో పడితే కింద నేల దొరకదు. కాలు నిలవదు. జాయపుడు కూడా అందరిలాగే కంగారు పడిపోయి ఆ ఊబి చుట్టూ పరుగులు పెడుతున్నాడు. నాకేమో ఇంత కష్టపడి అద్భుతమైన మంచి జాతి ఏనుగులను సాధించి.. ఈ ఊబికి వదిలేస్తున్నామని బాధ. పాపం.. అవి పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాయి. ఏడుస్తున్నాయి.
గజరాజులు కళ్ల నీళ్లుపెట్టుకుంటూ కళ్లముందే బురదలో కూరుకుని పోవడం.. ఇంత బాధాకరమో ఆలోచించండి. అప్పుడు జాయపుడు గొప్ప ఇంద్రజాలం ప్రదర్శించాడు. దేవుడు తప్ప నరమానవుడెవ్వడూ ఆ అద్భుతం చెయ్యలేరు. జాయపుని మెడలో రకరకాల పొడవు, పొట్టి గొట్టాలున్నాయి. అవి కూడా ఆ అడవిలోనే మంచి వెదురు దొరుకుతుందని గాలించి తయారు చేసుకున్నాడు. వాటిని తీసి నోటితో వాయించసాగాడు. ఏవేవో కూతలు.. కూజితాలు.. పాటలు.. ఆ ఊబి చుట్టూ తిరుగుతూ వాయిస్తున్నాడు. అవి ముందు కొంత తేరుకున్నాయి. వెంటనే గొట్టాలు పక్కన బెట్టి నోటితో కూజితాలు.. యుద్ధ భూమిలో చేస్తాడే.. అలా! చాలాసేపు వాటిని భయపడవద్దన్నట్లు చెప్పాడు. ఆ ఊబి చుట్టూ పాములా, తూనీగలా, చిరుతలా ఎగురుతూ దూకుతూ.. పక్షిలా.. డేగలా.. పాడుతూ వాయిస్తూ.. కూస్తూ.. అన్ని ఏనుగులకూ ధైర్యం నూరిపోశాడు. తర్వాత మళ్లీ పెద్ద.. ఇంత పొడవైన గొట్టంతో ఏవేవో కూజితాలు దిక్కులు పిక్కటిల్లేలా వాయించసాగాడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284