పారిస్: పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో గురువారం వివాదాస్పద ఘటన చోటుచేసుకున్నది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్(Imane Khalif)తో జరిగిన బౌట్ మధ్యలో ఆగిపోయింది. ఇటలీ బాక్సర్ ఏంజిలా కారినితో జరిగిన మ్యాచ్ కేవలం 46 సెకన్లలో ముగిసింది. స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదని ఆమె పేర్కొన్నది. గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్పై వివాదం నెలకొన్నది. 2023 చాంపియన్షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పించారు.
ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్లో కూడా ఇదే సీన్ రిపీటైంది. ఒలింపిక్స్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. కానీ టోక్యో ఒలింపిక్స్ తర్వాత చాలానే మారింది. 25 ఏళ్ల ఇమేని ఖాలిఫ్ది .. అల్జీరియాలోని తియారెట్. ఆమె యూనిసెఫ్ అంబాసిడర్ కూడా. అమ్మాయిలు బాక్సింగ్ ఆడడాన్ని ఖాలిఫ్ తండ్రికి నచ్చలేదు. కానీ భారీ టోర్నీల్లో గోల్డ్ మెడల్ గెలవాలన్నది ఆమె లక్ష్యం. పురుషుల క్రోమోజోమ్లు ఇమేనిలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
2018 వరల్డ్ చాంపియన్షిప్ ద్వారా ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి ఖాలిఫ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ టోర్నీలో ఆమె 17వ స్థానంలో నిలిచింది. 2019లో 19వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్లో ఆమె పోటీపడింది. క్వార్టర్స్లో కెల్లీ చేతిలో ఓడిపోయింది. 2022 ఆఫ్రికన్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలుచుకున్నది.
2023 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తొలిసారి ఇమేని ఖాలిఫ్పై లింగ ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన ఆ ఈవెంట్ నుంచి ఆమెను నిషేధించారు. ఆమెకు నిర్వహించిన డీఎన్ఏ టెస్టు ద్వారా ఆమెకు ఎక్స్వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు. ఖాలిఫ్ పాస్పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో పోటీపడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు.
ఐఓసీ వ్యక్తం చేసిన అభిప్రాయం పట్ల మాజీ మహిళా బాక్సర్లు క్లారెసా షీల్డ్, ఎబేని బ్రిడ్జ్స్ తప్పుపట్టారు. కానీ అల్జీరియా ఒలింపిక్ కమిటీ మాత్రం బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.