మథుర (యూపీ) : ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీ నెగ్గిన తర్వాత ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్య, అనుష్క శర్మతో కలిసి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టాడు. మంగళవారం ఉదయం యూపీ మథుర బృందావన్లోని ప్రముఖ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఈ జంట.. స్వామీజీ ఆశీస్సులు తీసుకుంది.
ఆశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఫేస్ మాస్కులు ధరించిన కోహ్లీ దంపతులు కారులో బృందావన్ పరిక్రమ మార్గ్లోని హిట్ రాధా కేలి కుంజ్ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ప్రేమానంద్ మహారాజ్ను కలిసి ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆశ్రమంలోనే గడిపారు. అనంతరం వృందావన్లోని స్వామి హిట్ గోవింద్ శరణ్ ఆశ్రమాన్ని కూడా సందర్శించారు.