హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాకీలో విశేష ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ యువ కెరటం ఈదుల జ్యోతి స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగం సాధించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన జ్యోతి హాకీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు పొందింది. ఆమె ప్రతిభను గుర్తించిన భారతీయ రైల్వే.. క్రీడా కోటాలో అవకాశం కల్పించింది. ఉద్యోగం రావడంపై హర్షం వ్యక్తం చేసిన జ్యోతి శనివారం తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు సరల్ తల్వార్, ప్రధాన కార్యదర్శి కొండా విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీధర్, పాండురంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. మారుమూల గ్రామానికి చెందిన జ్యోతి రైల్వే ఉద్యోగం పొందడం అందరికీ ఆదర్శనీయమని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్రెడ్డి, శివరాం అభినందించారు.