న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్లు(Indian Captains) సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్లు .. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు లేఖ రాశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అతనికి సరైన వైద్యం అందించాలని అంతర్జాతీయ క్రికెటర్లు కోరారు. 21 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ లేఖలో ఈ డిమాండ్ చేశారు. వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ ఆధ్వర్యంలో ఆ లేఖను పంపారు. ఇమ్రాన్ ఖాన్కు మానవత్వంతో సాయం చేయాలని అంతర్జాతీయ క్రికెటర్లు రెండోసారి వేడుకున్నారు.
పాకిస్థానీ దేశీయ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని, కానీ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రాథమిక చికిత్సను ఇమ్రాన్కు అందించాలని వేడుకుంటున్నట్లు క్రికెటర్లు తమ లేఖలో కోరారు. మాజీ కెప్టెన్లు మూడు వ్యక్తిగత అభ్యర్థనలు చేశారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించినట్లు మెడికల్ బోర్డు వైద్యులతో పాటు ఇమ్రాన్ వ్యక్తిగత డాక్టర్లకు ఆరోగ్య పరీక్షల కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. ఇమ్రాన్ కుడి కంటి చూపు తగ్గిందని, దానికి చికిత్స చేయించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇమ్రాన్ కుటుంబసభ్యులు జైలును విజిట్ చేసే రీతిలో ఏర్పాట్లు చేయాలని కెప్టెన్లు కోరారు. ఎటువంటి జాప్యం జరగకుండా చికిత్సను అందించాలని కూడా అంతర్జాతీయ కెప్టెన్లు కోరారు.
2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉంటున్నాడు. అతనితో పాటు అతని భార్యకు 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. పాకిస్థాన్ ప్రధానికి రాసిన లేఖలో ముగ్గురు భారత కెప్టెన్లతో పాటు మైఖేల్ అథర్టన్, మైఖేల్ బ్రియర్లే, నాసిర్ హుస్సేన్, ఆండ్రూ స్ట్రాస్, డేవిడ్ గోవర్, అలన్ బోర్డర్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, ఆడమ్ గిల్ క్రిస్ట్, స్టీవ్ వా, కిమ్ హ్యూగ్స్, క్లైవ్ లాయిడ్; జాన్ రైట్, అలిస్టర్ కుక్, అర్జున రణతుంగ సంతకాలు చేశారు. 2018 నుంచి 2022 వరకు పాక్ ప్రధానిగా ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టారు.