బాలి (ఇండోనేషియా): ప్రపంచ చాంపియన్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో సెమీస్కు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో మ్యాచ్లో 26 ఏండ్ల సింధు 21-10, 21-13తో వోన్ లీ (జర్మనీ)పై విజయం సాధించింది. గ్రూప్ దశలో వరుసగా రెండో మ్యాచ్ నెగ్గిన తెలుగమ్మాయి.. నేరుగా నాకౌట్కు దూసుకెళ్లగా.. పురుషుల విభాగంలో ప్రత్యర్థులు తప్పుకోవడంతో లక్ష్యసేన్ కూడా సెమీస్లో అడుగు పెట్టాడు. గ్రూప్-‘ఎ’లో భాగంగా 31 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబర్చి.. వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని మట్టకరిపించింది. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్లో శుక్రవారం టాప్ సీడ్ పోర్పవీ చొచువాంగ్ (థాయ్లాండ్)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ఇప్పటికే నాకౌట్ బెర్త్ దక్కించుకున్న లక్ష్యసేన్ గురువారం పోరులో 15-21, 14-21తో ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 18-21, 7-21తో కునావత్ వితిద్సరణ్ (థాయ్లాండ్) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 19-21, 20-22తో బల్గేరియా ద్వయం చేతిలో పోరాడి ఓడగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.