చెన్నై: ఐపీఎల్లో అత్యంత ప్రజాకర్షణ కల్గిన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్లో ఆ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ వాటా కొనుగోలు చేస్తున్నాడా? కానీ మహీ డిమాండ్కు సీఎస్కే మేనేజ్మెంట్ ఒప్పుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ లీగ్ ఆరంభ సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న మహీ.. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ. రికార్డు స్థాయిలో సూపర్కింగ్స్కు ఐదు ట్రోఫీలను అందించిన ఈ మాజీ కెప్టెన్.. జట్టులో తనకు వాటా కావాలని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం ధోనీ.. సీఎస్కేలో 25 శాతం వాటా కావాలని కోరగా ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం 3 శాతమే ఇస్తానని చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో జార్ఖండ్ డైనమైట్ తన డిమాండ్ను 20 శాతానికి.. ఆ తర్వాత 18 శాతానికి తగ్గించుకున్నా చెన్నై మేనేజ్మెంట్ మాత్రం 5.5 శాతానికంటే ఎక్కువ ఇవ్వలేమని తెగేసి చెప్పినట్టు వినికిడి. సీఎస్కే ఓనర్లతో ధోనీకి ఆరంభం నుంచీ మంచి అనుబంధమే ఉంది. చెన్నై జట్టును ధోనీని విడదీసి చూడటం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య వాటాల వ్యవహారం ఎటు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.