ముంబై: ఈ ఏడాది రెండోసారి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా తాత్కాలిక కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త కోచ్ వేటలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీసీఐకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీ20 వరల్డ్కప్తో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి తప్పుకోనుండటంతో అతని స్థానంలో కొత్త కోచ్ కోసం చూస్తోంది. ఈ పదవిపై ఎంతో మంది విదేశీయులు ఆసక్తిగా ఉన్నా.. బీసీసీఐ మాత్రం ఓ ఇండియన్కే అప్పగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్( Rahul Dravid )లను అడిగినా.. వాళ్లు సున్నితంగా తిరస్కరించారు. దీంతో కోచ్ను నియమించడం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం తీసుకునేలా ఉండటంతో ఇప్పుడు ద్రవిడ్ను కనీసం తాత్కాలిక కోచ్గానైనా నియమించాలని బోర్డు భావిస్తోంది.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్కు ద్రవిడ్ను తాత్కాలిక కోచ్గా నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్కప్ ముగిసిన (నవంబర్ 17) మూడు రోజుల తర్వాత ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఏడాది శ్రీలంకలో ఇండియా సెకండ్ రేట్ టీమ్కు కోచ్గా ద్రవిడ్ వ్యవహరించిన విషయం తెలిసిందే. నిజానికి రవిశాస్త్రినే మరికొన్నాళ్లు కొనసాగించాలని ముందు భావించినా.. తర్వాత బోర్డు ఆ ప్రతిపాదనను విరమించుకుంది.
ఈ కోచ్ పదవిపై పలువురు ఆస్ట్రేలియా మాజీలు ఆసక్తి చూపుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే బోర్డు మాత్రం ఇండియన్ కోచ్వైపే చూస్తోంది. దీనికోసం ముందుగానే సరైన వ్యక్తిని గుర్తించాలని అనుకుంటున్నట్లు ఓ బోర్డు అధికారి వెల్లడించారు. తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరూ ఈ పదవికి సూట్ కాకపోతే బాగుండదని, అందుకే ముందుగానే సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ద్రవిడ్ను తాత్కాలిక కోచ్ను చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.