చండీఘడ్: రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ పోగట్(Vinesh Phogat) పెట్టిన డిమాండ్తో.. హర్యానా క్రీడా శాఖ ఇరకాటంలో పడింది. గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో వినేశ్ పోగట్ రెజ్లింగ్లో రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా హర్యానా సర్కార్ ఆమెకు 4 కోట్ల నగదు రివార్డు ఇవాల్సి ఉంది. అయితే 4 కోట్ల క్యాష్ రివార్డు కావాలా లేక అంత విలువైన ప్లాట్ కావాలా లేక గ్రూపు-ఏ జాబ్ కావాలా అని క్రీడా శాఖ ఇటీవల ఆమెను కోరింది. ఆ ఆఫర్కు రియాక్ట్ అయిన వినేశ్ పోగట్.. తనకు 4 కోట్ల క్యాష్తో పాటు ప్లాట్ కూడా కావాలని కోరింది. దీంతో క్రీడాశాఖ ఖంగుతిన్నది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు.
పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్క్వాలిఫై అయిన సిల్వర్ పతక విజేత వినేశ్ కేసులో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని, మూడు ఆప్షన్లలో ఆమె దేన్ని అయినా తీసుకోవచ్చు అని ఇటీవల సీఎం నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం వల్ల ఆమె ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హురాలు కాదు. ఇక క్యాష్ రివార్డు లేదా ప్లాట్ తీసుకునే ఆప్షన్లలో.. ఆమె రెండింటిని కోరడం క్రీడాశాఖను ఇరకాటంలో పడేసింది.
పారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల కేటగిరీలో వినేశ్ పోగట్.. బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. కేవలం వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను పక్కన పెట్టేశారు. డిస్క్వాలిఫై అయిన కొన్ని గంటల్లో సీఎం సైనీ తన ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. వినేశ్ పోగట్ పట్ల దేశం గర్వంగా ఫీలవుతున్నదని, సిల్వర్ మెడలిస్టుకు ఇచ్చే అని బెనిఫిట్స్ ఇస్తామని ఆయన అన్నారు.
అయితే కొన్ని పరిణామాల వల్ల వినేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరి, జులనా అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల బడ్జెట్ సెషన్లో సీఎం చేసిన ప్రామిస్ గురించి ఆమె అడిగారు. దాంతో మార్చి 25వ తేదీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ కేసుగా తీసుకుని బెనిఫిట్ ఇచ్చేందుకు అంగీకరించారు.
ఒలింపిక్స్లో పతకాలు సాధించే ప్లేయర్లకు హర్యానా సర్కారు భారీగా ప్రైజ్మనీ ఇస్తున్న విషయం తెలిసిందే. గోల్డ్ మెడలిస్టులకు ఆరు కోట్లు, సిల్వర్ మెడలిస్టులకు నాలుగు కోట్లు, బ్రాంజ్ మెడలిస్టులకు 2.5 కోట్లు ఇస్తోంది.