ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ దీపక్ ముగలికర్ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ప్రజలను బయటకు అనుమతించకపోవడం వంటి చర్యలు చేపట్టినా కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించామని చెప్పారు. ఈనెల 24న రాత్రి ఏడు గంటల నుంచి వర్తించే లాక్డౌన్ 31 వరకూ కఠినంగా అమలవుతుందని అన్నారు.
కొవిడ్-19 కేసులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రజలు లాక్డౌన్కు సహకరించాలని కోరారు. తాజా కేసులు ఇలాగే పెరిగితే పలు నగరాల్లో లాక్డౌన్ విధించే ఆలోచనలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు సంపూర్ణ లాక్డౌన్తో ఫలితం ఉండదని వైరస్ వ్యాప్తిని ఇది అడ్డుకోలేదని మహారాష్ట్ర కొవిడ్-19 టాస్క్ఫోర్స్లో కొందరు సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.