నిర్లక్ష్యమైన షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. కొంచెం టచ్లోకి వచ్చినట్లున్నాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో తక్కువ స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ను ఆదుకోవడంలో కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7), ఛటేశ్వర్ పుజారా (9), రహానే (1) విఫలమవడంతో.. బ్యాటింగ్ భారం కోహ్లీపై పడింది.
ఇలాంటి సమయంలో కోహ్లీకి తోడుగా బ్యాటింగ్కు వచ్చిన పంత్ (51 నాటౌట్) చక్కగా బ్యాటింగ్ చేశాడు. కొన్నిసార్లు తన దూకుడు ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. అయితే ఎదురుగా కెప్టెన్ కోహ్లీ అతనితో మాట్లాడుతూ రెక్లెస్ షాట్లకు వెళ్లకుండా అడ్డుకున్నట్లున్నాడు. దీంతో నిర్లక్ష్యమైన షాట్లు ఆడకుండానే తనదైన దూకుడు ప్రదర్శిస్తూ చక్కగా ఆడిన పంత్ ఈ సఫారీ టూర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అతని అర్ధశతకం పూర్తిచేసిన తర్వాత లంచ్ బ్రేక్ లభించింది. ఆ సమయానికి భారత జట్టు 130/4 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు కోహ్లీని మెచ్చుకుంటున్నారు.
కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు పంత్ ఆటతీరు మారిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో కూడా పంత్ ఎటువంటి రెక్లెస్ షాట్లు ఆడకుండా కోహ్లీ ఆపాడు. అతను పంత్ను హెచ్చరించడం స్టంప్ మైక్లో కూడా రికార్డయింది.