సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పేసర్ల హవా నడుస్తోంది. దీంతో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ప్రభావం చూపలేకపోయాడు. సఫారీల తొలి ఇన్నింగ్సులో 13 ఓవర్లు వేసిన అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే అతను బౌలింగ్ చేసినప్పుడు ఫీల్డింగ్ సెటప్ చూస్తే.. వికెట్ల కోసం అశ్విన్తో బౌలింగ్ వేయించలేదని తెలుస్తుంది.
ఒక ఎండ్ నుంచి ముగ్గురు పేసర్లు దాడి చేస్తుండగా.. మరో ఎండ్లో సఫారీ బ్యాటర్లను కట్టడి చేసేందుకే అశ్విన్ పరిమితమయ్యాడు. దీంతో ఫీల్డింగ్ సెటప్ అగ్రెసివ్గా లేదు. ఈ క్రమంలోనే చాలా మంది సోషల్ మీడియా వేదికగా అశ్విన్ ప్రదర్శనపై పెదవి విరిచారు.
అయితే తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ పాత్రను స్పష్టంగా వివరించిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ తీసినా.. సరికొత్త అశ్విన్ కనపడతాడని అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో పరుగుల కట్టడికే పరిమితమైన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో పిచ్పై పగుళ్లను, అలాగే సౌతాఫ్రికా పేసర్ జేమీసన్ వల్ల ఏర్పడిన ఫుట్ప్రింట్లను బాగా ఉపయోగించుకునే అవకాశం ఉందని డీకే చెప్పాడు.
ఈ పిచ్పై కచ్చితంగా పేసర్ల హవానే ఉంటుందని, అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసినా ఒకటి లేదా రెండు వికెట్ల కంటే తీయలేడని స్పష్టం చేశాడు. మరి రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.