Adam Zampa : భారత పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో తన పేరు లేనందకు చాలా నిరాశ చెందానని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా అన్నాడు. నేను కచ్చితంగా సెలక్ట్ అవుతాను అనుకున్నా. కానీ, భారత పర్యటన జట్టు విషయంలో తీసుకున్న కఠినమైన నిర్ణయం ఇది అని సెలక్టర్ జార్జ్ బెయిలీ, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ నాతో అన్నారు. దాంతో నేను చాలా నిరాశకు గురయ్యా. ఆ 18మందిలో నేను ఉంటే ఎంతో బాగుండేది అని ఈ లెగ్ స్పిన్నర్ తెలిపాడు. ఫిబ్రవరిలో భారత పర్యటన కోసం 18 మంది ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్ట్ చేసింది. నాథన్ లియాన్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ అగర్తో పాటు 22 ఏళ్ల టాడ్ ముర్ఫీను స్పిన్నర్లుగా తీసుకుంది. గత కొన్నాళ్లుగా వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్న ఆడమ్ జంపా టెస్టు జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. ప్రస్తుతం అతను బిగ్బాష్ లీగ్ 12 సీజన్లో ఆడుతున్న మెల్బోర్న్ స్టార్స్కు కెప్టెన్గా ఉన్నాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరిలో భారత్ రానుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య నాలుగు టెస్ట్ల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు రేసులో టీమిండియా, ఆస్ట్రేలియా ముందున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్వదేశంలో సఫారీలను చిత్తు చేసిన ఆ జట్టుకు 136 పాయింట్లు ఉన్నాయి. గత ఏడాది రన్నరప్ భారత్ 99 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ టెస్టు సిరీస్ రెండు టీమ్లకు కీలకం కానుంది.