పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో లండన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన అబ్బాస్ కు కరోనా వైరస్ కూడా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గంటగంటకూ విషమించుతున్నదని వైద్యులు చెబుతున్నారు.
74 ఏండ్ల జహీర్ అబ్బాస్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల క్రితమే లండన్ కి వెళ్లారు. యూఏఈ నుంచి లండన్ కు వెళ్లే క్రమంలో ఆయనకు కరోనా సోకిందని తెలుస్తున్నది. అబ్బాస్ కు న్యూమోనియా కూడా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన డయాలిసిస్ తో పాటు కరోనా చికిత్స కూడా అందిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అబ్బాస్ క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
పాకిస్తాన్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందిన జహీర్ అబ్బాస్.. 1969-1985 మధ్య కాలంలో పాక్ తరఫున ఆడాడు. 78 టెస్టులలో 5,062 పరుగులు, 62 వన్డేలలో 2,572 రన్స్ సాధించాడు. టెస్టులలో 12, వన్డేలలో 3 సెంచరీలు చేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. దేశవాళీలో మాత్రం టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. 457 మ్యాచులలో ఏకంగా 34,843 రన్స్ చేసి రికార్డులు నెలకొల్పాడు. ఆసియా బ్రాడ్మన్ గా గుర్తింపుపొందిన అబ్బాస్.. గతంలో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.