Unproffessional Moments In Cricket : క్రికెట్ను జెంటిల్మన్ గేమ్గా పిలుస్తారు. మైదానం లోపల, బయట ఆటగాళ్ల హుందా ప్రవర్తన వల్లే దానికా పేరు వచ్చింది. అయితే, ఆ తర్వాత క్రికెట్లో మార్పులు వచ్చినట్టు ఆటగాళ్ల ప్రవర్తనలో క్రమంగా మార్పులొచ్చాయి. మైదానంలో హుందాగా ప్రవర్తించాల్సిన క్రికెటర్లు ఆవేశాలకులోనై ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారు. శరీర రంగును కూడా వదిలిపెట్టకుండా ద్వేషిస్తున్నారు. ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం, అంపైర్లతో గొడవలు, వికెట్లు నేలకేసి కొట్టడాలు, బంతి ఆకారాలు మార్చడం ద్వారా ఆటలో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈ ధోరణికి దీనికి మొగ్గతొడిగింది ఆస్ట్రేలియన్లే అయినా ఆ తర్వాత అది అందరికీ విస్తరించింది. ఇలాంటి ఘటనలు జెంటిల్మన్ గేమ్ను కాస్తా అన్ప్రొఫెషనల్గా మార్చేస్తున్నాయి. క్రికెట్లో అలాంటి పది ఘటనల గురించి తెలుసా..?
ఇటీవలి కాలంలో మన్కడింగ్ అనగానే గుర్తొచ్చే పేరు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 2019 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ను అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలా అవుట్ చేయడం కరెక్టే. కానీ, క్రీడా స్ఫూర్తికి మాత్రం విరుద్ధం. దీంతో ఇలా అవుట్ చేయడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ అవుట్పై స్పందించిన ఐసీసీ మన్కడింగ్ అనే పదం స్థానంలో రనౌట్ను చేర్చింది.
రవిచంద్రన్ అశ్విన్, బట్లర్
నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటి వస్తే బౌలర్ బంతి సంధించడం మాని అవుట్ చేయొచ్చన్నమాట. నిజానికి ఈ మన్కడింగ్కు ఆద్యుడు భారత స్పిన్నర్ వినూ మన్కడ్ (1947). ఆస్ట్రేలియన్ బ్యాటర్ బిల్ బ్రౌన్ను మన్కడ్ ఇలానే అవుట్ చేశాడు. అప్పట్లో ఈ అవుట్ చాలా వివాదాస్పదమైంది. అప్పటి నుంచి ఇలా అవుట్ చేయడాన్ని మన్కడింగ్గా వ్యవహరిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది చట్టబద్ధమే కానీ జెంటిల్మన్ గేమ్లో మాత్రం ఇది అన్ప్రొఫెషనల్ మూమెంట్గా నిలిచిపోయింది.
2006 ఆగస్టు 20న ఇంజమాముల్ హక్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటకు వెళ్లింది. చివరిదైన నాలుగో టెస్టులో పాక్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడింది. అంపైర్లు డారెల్ హెయిర్, బిల్లీ డాక్ట్రోవ్ బంతి పరిస్థితిని పరిశీలించి ట్యాంపరింగ్ నిజమేనని నిర్ధారించారు. దీంతో ఇంగ్లండ్కు ఐదు పెనాల్టీ పరుగులు అందించారు. తప్పు చేసినా తనదే పై చేయి కావాలని భావించిన పాకిస్థాన్ టీమ్ తప్పును అంగీకరించేందుకు నిరాకరించింది. టీ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినా పాక్ ఆటగాళ్లు మాత్రం పత్తా లేకుండా పోయారు. 20 నిమిషాలు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ ఇంజీతో అంపైర్లు చర్చలు జరిపినా మ్యాచ్ను కొనసాగించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు ప్రకటించారు. పాక్ నిర్వాహకంపై మొత్తం క్రికెట్ ప్రపంచం దుమ్మెత్తి పోసింది.
మార్లోన్ శామ్యూల్స్ – షేన్వార్న్
2013 బిగ్బాష్ లీగ్ సమయంలో మార్లోన్ శామ్యూల్స్-షేన్వార్న్ మధ్య గొడవ జరిగింది. తొలుత మాటలతో మొదలైన గొడవ ఆ తర్వాత భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఇద్దరు ఒకరిపై ఒకరు వస్తువులతో దాడి చేసుకున్నారు. మైదానంలో మాత్రమే కాదు.. మైదానం వెలుపల కూడా ఈ గొడవ అలాగే కొనసాగింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల అనైతిక చర్యపై అధికారులు జరిమానా విధించారు.
2006లో ఆస్ట్రేలియా-టీమిండియా టెస్టు మ్యాచ్ సందర్భంగా అంపైర్ స్టీవ్ బక్నర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం షాకైంది. అంపైరింగ్ మొత్తం భారత్పై వివక్షతోనే ప్రవర్తించాడు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
అంపైర్ స్టీవ్ బక్నర్
2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు కారణమైంది. రాత్రి పొద్దుపోయే వరకు తాగి తందనాలాడి అతను జట్టు పరువు తీశాడు. సెయింట్ లూసియాలో ఆటగాళ్లు బస చేసిన హోటల్ సమీపంలోని నైట్క్లబ్కు వెళ్లి పీకలదాకా తాగాడు. అతడితోపాటు మరికొందరు ఆటగాళ్లు కూడా ఉన్నాడు. ఉదయం తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ పెట్టుకుని నైట్క్లబ్లో తాగి రచ్చచేయడంపై క్రికెట్ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఫ్లింటాఫ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాతో 2008లో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ‘మింట్గేట్’ వివాదంలో చిక్కుకున్నాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు తాను నములుతున్న ‘మింట్’ను దానికి అతికించాడు. పాంటింగ్ చేసిన ఈ తప్పుడు పని కెమెరాలకు చిక్కడంతో పెద్ద దుమారమే రేగింది.
మింట్గేట్’ వివాదంలో పాంటింగ్
బాల్ ట్యాంపరింగ్కు సంబంధించి మరో పెద్ద వివాదం ఇది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ప్లేయర్లు కేమరాన్ బాన్క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఘటనలో వీరు ముగ్గురూ దోషులుగా తేలడంతో క్రికెట్కు ఏడాది పాటు దూరం కావాల్సి వచ్చింది. జెంటిల్మన్ గేమ్లో ఇదో నీతి బాహ్యమైన చర్యగా మిగిలిపోయింది.
ఒకప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ గ్యాటింగ్, అంపైర్ షాకూర్ రాణాకు మధ్య జరిగిన గొడవ కూడా క్రికెట్ అభిమానులను విస్మయ పరిచింది. బౌలర్ బంతి వేయడం ప్రారంభించిన తర్వాత ఫీల్డింగ్లో గ్యాటింగ్ మార్పులు చేయడం చూసిన అంపైర్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వివాదానికి కారణమైంది.
బంతిని కొరుకుతున్న ఆఫ్రీదీ
అన్ప్రొఫెషనల్ క్రికెట్కు ఇది మరో ఉదాహరణ. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్లో అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది బంతి ఆకారాన్ని మార్చేందుకు దానిని కొరుకుతూ దొరికిపోయాడు. ఇలా దొంగదారిలో మ్యాచ్ను గెలవాలని చూసిన షాహిద్ అఫ్రీదీపై క్రికెట్ ప్రేమికులు దుమ్మెత్తి పోశారు.
శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న దక్షిణాఫ్రికా ప్లేయర్ వెర్నాన్ ఫిలాండర్ను ఆసీస్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, నాథన్ లియాన్ను వెక్కిరించిన ఘటన చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోయింది. 2020లో న్యూలాండ్స్లో జరిగిన టెస్టు మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆసీస్ ప్లేయర్లపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఆసీస్ బోర్డు విచారణ జరిపించింది. దీంతో దిగొచ్చిన వార్నర్ తన ప్రవర్తనకు సిగ్గుపడుతూ బహిరంగ క్షమాపణ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఫిలాండర్కు క్షమాపణలు తెలిపింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు అడపా దడపా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హసన్కి అయితే ఇలాంటివి చాలా మామూలు విషయాలు. అంపైర్లతో గొడవకు దిగడం, వికెట్లను నేలకేసి కొట్టడం అతడికి చాలా సాధారణ విషయాలు. ఈ చేష్టలతో అతడు నిషేధం కూడా ఎదుర్కొన్నాడు.