Broad – Anderson : ఇంగ్లండ్ దిగ్గజ పేసర్లకు అరుదైన గౌరవం లభించింది. మాజీ స్పీడ్స్టర్లు జేమ్స్ అండర్సన్(James Anderon), స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad)ల నిలువెత్తు చిత్రపటాలను లార్డ్స్ స్టేడియంలో ఏర్పాటు చేసింది ఇంగ్లండ్ బోర్డు. పాకిస్థాన్తో రెండో టెస్టుకు ముందు ఈ వెటరన్ పేసర్లు తమ నిలువెత్తు ఫొటోను ఆవిష్కరించారు. దశాబ్దానికి పైగా ఇంగ్లండ్ విజయాల్లో కీలమైనందున వీరి గౌరవార్థం.. ఒకే ఫ్రేమ్లో ఇద్దరి ఫొటోలకు రూపమిచ్చింది ఈసీబీ.
టెస్టు క్రికెట్లో ఒకప్పుడు భయంకరమైన పేస్ జోడీగా గుర్తింపు పొందిన స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్లు.. లార్డ్స్ స్టేడియంలో తమ చిత్రపటలను ఆవిష్కరించారు. అక్కడి లాంగ్ రూమ్లో ఏర్పాటు చేసిన తమ నిలువెత్తు ఫొటోను బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారిద్దరు. ఒకే ఫ్రేమ్లో జిమ్మీ, బ్రాడ్ ఫొటోలను జేమీ రౌట్లే అనే చిత్రకారుడు గీశాడు. ఇక నుంచి లార్డ్స్ ఫొటో కలెక్షన్లో ఈ ఐకానిక్ జోడీ ఫొటో భాగం కానుంది.
Two of England’s finest immortalised in the Lord’s Long Room ✨
A new portrait of Sir James Anderson and Stuart Broad, painted by Jamie Routley, was unveiled ahead of the England vs Pakistan Test 🎨 pic.twitter.com/jxr7mgUd6G
— Cricinfo (@cricinfo) August 26, 2026
ఇంగ్లండ్ పేస్ దళానికి దశాబ్ద కాలంపైగా నాయకత్వం వహించిన అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్ దాదాపు 350 మ్యాచులు ఆడారు. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన ఈ లెజెండరీ పేస్ ద్వయం 1,308 వికెట్లు తీసింది. అంతేకాదు సంయుక్తంగా సుదీర్ఘ ఫార్మాట్లో 600 మందిని ఔట్ చేసిన ఇంగ్లండ్ మొదటి పేస్ జంటగా వీరు రికార్డు నెలకొల్పారు. బ్రాడ్ 167 టెస్టుల్లో 604 వికెట్లతో కెరీర్ ముగించగా… జిమ్మీ 188 మ్యాచుల్లో 704 వికెట్లతో వీడ్కోలు పలికాడు.
స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ జోరుమీదుంది. తొలి మ్యాచ్లో భారీ విజయంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆతిథ్య జట్టు.. రెండో విజయంపై కన్నేసింది. లార్డ్స్లోనూ పాక్ను ఓడిస్తే జో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లండ్కు తొలి సిరీస్ విజయం కానుంది.