BCCI Central Contracts | ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియాకు ఆడే క్రికెటర్లకు శుభవార్త చెప్పనుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులలో పెంపుతో పాటు బోనస్ కూడా ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ను కాదని ఐపీఎల్కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ‘ఒక క్యాలెండర్ ఈయర్లో సదరు ఆటగాడికి రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్స్తో పాటు వారికి అదనంగా రివార్డ్ ఇవ్వబడుతుంది. ఆటగాళ్లు టెస్టు క్రికెట్ వైపునకు మళ్లే దిశగా ఇది తోడ్పడుతోంది..’ అని అతడు తెలిపాడు. అసలు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి. ఏ గ్రేడ్లో ఆటగాళ్లకు ఎంత దక్కుతుంది..? అన్న వివరాలు ఇక్కడ చూద్దాం.
నాలుగు గ్రేడ్స్..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు గ్రేడ్స్ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు యేటా రూ. 7 కోట్లు దక్కుతాయి. ఏ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతోంది. సీ గ్రేడ్లో ఉన్న క్రికెటర్లకు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు అందుతున్నాయి.
BCCI is set to increase the salary for Test players who play all the matches in the series. [Devendra Pandey From Express Sports] pic.twitter.com/o3KHffIHzk
— Johns. (@CricCrazyJohns) February 27, 2024
ఇచ్చేదెంత..?
– సెంట్రల్ కాంట్రాక్టులతో పాటు టెస్టు మ్యాచ్లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు దక్కుతాయి.
– ఏ+ గ్రేడ్లో ఉన్న క్రికెటర్లు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా
– ఏ గ్రేడ్ : హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్
– బీ గ్రేడ్ : ఛతేశ్వర్ పుజారా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్
– సీ గ్రేడ్ : ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కెఎస్ భరత్
పెరిగేదెంత..?
టెస్టులు ఆడే క్రికెటర్లకు ప్రస్తుతం రూ. 15 లక్షలు అందజేస్తున్న బీసీసీఐ.. దీనిని రూ. 25 లక్షలవరకూ పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీ20ల మోజులో పడి స్టార్ క్రికెటర్లు లీగ్లకే ప్రాధాన్యమిస్తుండగా వారిని చూసి ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలుపెడుతున్న ఆటగాళ్లు సైతం అటువైపే అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఇటీవలే బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఐదు రోజులు క్రికెట్ ఆడే ఉద్దేశం, ఫిట్నెస్ లేని క్రికెటర్లు మాత్రం.. కేవలం నాలుగు గంటల్లో ముగిసే టీ20లకే ప్రాధాన్యమిస్తుండటంతో బీసీసీఐ.. తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఏడాదికి సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.