ODI World Cup 2023 | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు.. ఒక్క చెడ్డ మ్యాచ్ ఎదురైతే ఒత్తిడిలో పడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన రోహిత్ సేనకు పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదని.. అదే ఒక్క మ్యాచ్లో ప్రదర్శన సరిగ్గా చేయలేకపోతే అప్పుడు కాస్త ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని సారథిగా రెండు సార్లు వరల్డ్కప్ అందుకున్న పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ రంగాల్లో భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉందని.. అందులోనూ స్వదేశంలో వరల్డ్కప్ జరుగుతుండటంతో వారికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని పాంటిగ్ అభిప్రాయపడ్డాడు. ఇక భారత కెప్టెన్ రోహిత్పై పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘రోహిత్ కంటే మెరుగ్గా జట్టును ముందుకు తీసుకెళ్లడం ఎవరికైనా కష్టమే. అతడి ఆట తీరు చూస్తే చాలు ఎవరికైనా ఇదే మాట అనాలనిపిస్తుంది. ఒత్తిడిని మొదట తానే ఎదుర్కొని.. సహచరులను దాన్ని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం చేస్తున్న తీరు అద్భుతం’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.
రోహిత్ కెప్టెన్సీ భారం మోస్తుండటంతో విరాట్ కోహ్లీకి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతున్నదని పాంటింగ్ అన్నాడు. అతడు కేవలం బ్యాటింగ్పైనే పూర్తిగా దృష్టి పెట్టే చాన్స్ దక్కిందని పేర్కొన్నాడు. హిట్మ్యాన్ కెప్టెన్సీలో టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పాంటింగ్ అన్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకుంటున్న యువ ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకపోవడానికి ఐపీఎల్ ప్రధాన కారణమని పాంటింగ్ అన్నాడు. ‘ఐపీఎల్లో దీనికంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కోవడంతో.. వాళ్లు ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో ఏమాత్రం తడబాటు లేకుండా ఆడుతున్నారు’ అని పాంటింగ్ వివరించాడు. టోర్నీ సాగుతున్నా కొద్ది అంచనాల భారంతో భారత్పై ఒత్తిడి పెరిగే చాన్స్ లేకపోలేదని ఆసీస్ మాజీ సారథి అభిప్రాయపడ్డాడు.