యాషెస్ సిరీస్లో భాగంగా ఎమ్మెస్జీలో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు తొలిసారిగా సత్తా చాటారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు టెస్టుల్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లిష్ బౌలర్లు.. మూడో టెస్టులో ఫర్వాలేదనిపించారు. వరుసపెట్టి భారీ స్కోర్లు చేస్తున్న ఆసీస్ ఆటగాళ్లను కట్టడి చేశారు.
ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతనికి మిగతా బౌలర్ల నుంచి మంచి సహకారం లభించడంతో ఆసీస్ జట్టు 267 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 2, మార్క్ వుడ్ 2 వికెట్లు కూల్చగా.. బెన్ స్టోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు 185 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.
దీంతో ఆసీస్ తక్కువ స్కోరుకు పరిమితమైనా ఇంగ్లండ్పై 82 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ను ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మరోసారి దెబ్బతీశాడు. అతని ధాటికి ఓపెనర్ జాక్ క్రాలీ (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. స్టార్ బ్యాటర్ డేవిడ్ మలాన్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు.
ఆ తర్వాత కాసేపటికే స్కాట్ బోలాండ్ బౌలింగ్లో హసీబ్ హమీద్ (7) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జాక్ లీచ్ (0) డకౌటవడంతో ఇంగ్లండ్ జట్టు 22/4తో కష్టాల్లో కూరుకుపోయింది.