ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్
నెలాఖరు వరకు వందశాతం వసూలు లక్ష్యం
ప్రభుత్వ రాయితీపై పట్టణవాసులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
స్వచ్ఛందంగా ముందుకువస్తున్న యజమానులు
మొండి బకాయిదారులపై చర్యలు
ఆర్మూర్/ శక్కర్నగర్, మార్చి 21: నిజామాబాద్ జిల్లాలో మున్సిపాల్టీల పరిధిలో పన్నుల వసూలు ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పన్నుల వసూలు లక్ష్యంగా కృషి చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో పాలకవర్గ సభ్యులతోపాటు అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు.
మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి
మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి, యజమానులకు నోటీసులను జారీ చేస్తున్నారు. కార్యాలయంలో కూడా బకాయిల జాబితాను ప్రదర్శిస్తున్నారు. మొండి బకాయిదారులపై చర్యలు తీసుకునేందుకు వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపించి చర్యల కోసం వారి అనుమతులను తీసుకంటున్నారు. మొండి బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏండ్లుగా పేరుకుపోయిన పన్నులను చెల్లించడానికి కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాలకు వస్తున్నారు.
జిల్లాలో బకాయిల వివరాలు..
నిజామాబాద్ కార్పొరేషన్లో ఈ ఏడాది రూ. 2975.10 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు అధికారులు రూ. 2303.36 లక్షలు వసూలు చేశారు.ఇంకా 671.74 లక్షల బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. ఏండ్లుగా ఇంటి పన్నుకు సంబంధించి రూ. 2364.03 లక్షలు బకాయిలు ఉండగా, రూ.1597.37లక్షలు వసూలు చేశారు.
ఆర్మూర్లో..
ఆర్మూర్ మున్సిపల్లో రూ.317.93 లక్షల ఇంటి పన్ను లక్ష్యం కాగా అధికారులు ఇప్పటివరకు రూ.267.07 లక్షలు వసూలు చేశారు. రూ. 50.86 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. మొండిబకాయిలు రూ. 98.07 లక్షలు ఉండగా, ఇప్పటివరకు రూ. 81.04 లక్షలు వసూలు చేశారు.
భీమ్గల్లో..
భీమ్గల్ మున్సిపాలిటీలో రూ. 59.94 లక్షల ఇంటి పన్నుల లక్ష్యం కాగా అధికారులు ఇప్పటివరకు రూ.45.85 లక్షలు వసూలు చేశారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఏండ్లుగా ఇంటి పన్నుకు సంబంధించి మొండి బకాయిలు రూ.39.23 లక్షలు ఉండగా, అధికారులు ఇప్పటివరకు రూ.33.67 లక్షలు వసూలు చేశారు.
బోధన్లో..
బోధన్ పట్టణంలో ఇంటి పన్ను, వాణిజ్యపన్ను వసూళ్లపై మున్సిపల్ అధికారులు, యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను ప్రభుత్వ పరంగా ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో రూ.6.06 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ. 4కోట్ల 78లక్షల 78 వసూలు చేశారు. నెల రోజులుగా ఏర్పాటు చేసిన పది ప్రత్యేక బృందాలతో పన్నుల వసూలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పదివేల రూపాయల లోపు ఆస్తిపన్ను ఉన్న వారికి 50శాతం రాయితీ ప్రకటించడంతో పాటు, 2019-20 సంవత్సరానికి గాను బకాయి ఉన్న అపరాధ రుసుములో 90శాతం రాయితీ ప్రకటించడంతో ప్రజలు పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.