లవర్బాయ్ ఇమేజ్కు పరిమితం కాకుండా విభిన్న పాత్రలతో వెర్సటైల్ యాక్టర్గా గుర్తింపును తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని అన్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశి’. శ్రీనివాస్నాయుడు దర్శకత్వం వహించారు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఆది సాయికుమార్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
స్నేహానికి, ప్రేమకు విలువనిచ్చే రాజ్కుమార్ అనే యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తా. కాలేజీ విద్యార్థిగా, రాక్ బ్యాండ్ కళాకారుడిగా భిన్న పార్శాల్లో నా పాత్ర సాగుతుంది. అతడి మనసులో ఉన్న అంతులేని వేదన వెనకున్న రహస్యం ఆసక్తిని పంచుతుంది. హీరోయిన్ పేరుతో టైటిల్ పెట్టడానికి సినిమాలో ఓ కారణముంటుంది. దర్శకుడు శ్రీనివాస్నాయుడు నాటకీయత, సహజత్వం మేళవించి కథ, పాత్రల్ని మలచిన తీరు నచ్చి ఈ సినిమాను అంగీకరించా. ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. సిధ్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. పాట వచ్చే సందర్భం కొత్తగా ఉంటుంది. ఈ పాట వల్లే సినిమాకు హైప్ వచ్చింది. నిర్మాతలు రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అదే నా బలహీనత..
‘చుట్టాలబ్బాయి’ తర్వాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నా. అయితే కథలు బాగున్నా పబ్లిసిటీతో పాటు ఇతరత్రా కారణాల వల్ల కొన్ని సినిమాలు ఆడలేదు. అందుకే ప్రస్తుతం అంగీకరించే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నా. స్వతహాగా నాకు మొహమాటం ఎక్కువ. అందువల్లే సినిమా వేడుకల్లో ఎక్కువగా కనిపించను. ఇప్పుడిప్పుడే ఆ బలహీనత నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్నా.
భార్య సలహాలు తీసుకుంటా..
నేను చేయబోయే సినిమాల కథల్ని నాన్న వింటారు. అయితే అంతిమ నిర్ణయం మాత్రం నాకే వదిలిపెడతారు. సినిమాల విషయంలో నా భార్య చక్కటి సలహాలు ఇస్తుంది. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో మా మధ్య చాలా సార్లు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. తాను చెప్పే అంశాలను నేను పాటిస్తుంటా. టాలీవుడ్లో ఐకమత్యం ఎక్కువే. ఇతర భాషలతో పోలిస్తే ఈ విషయంలో మనమే నంబర్వన్. హీరోలందరికి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో అన్ని విషయాలు చర్చించుకుంటాం. హీరోలందరి మధ్య చక్కటి సఖ్యత ఉంది. ప్రస్తుతం ‘జంగిల్’, ‘బ్లాక్’ సినిమాలు చేస్తున్నా. మరో కొత్త చిత్రాన్ని అంగీకరించా.