తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, మార్కెట్ సంపాదించుకున్నాడు నితిన్. దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా వచ్చిన సరిగ్గా నెల రోజులకు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు.
ఇక్కడే అసలు కథ మొదలైంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. కీర్తి సురేష్ ఇందులో నితిన్ కు జోడీగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా ఆకట్టుకుంది. మిస్టర్ మజ్ను లాంటి ఫ్లాప్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దాంతో ఆయన కెరీర్ కూడా రంగ్ దే కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకటి రెండూ కాదు రూ.36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. బివిఎస్ఎన్ ప్రసాద్ సహ నిర్మాణసంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ రంగ్ దే సినిమాను నిర్మిస్తుంది.
దీనికి ఇంత భారీ బిజినెస్ జరగడం వెనుక ఒక పెద్ద కథ కూడా ఉంది. నిజానికి ఈ సినిమాను గత సమ్మర్లో విడుదల చేయాలనుకున్నారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది రంగ్ దే. ఆ సినిమా సమయానికి నితిన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అప్పటికే విడుదలైన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో అదే ఊపులో ఈ సినిమా బిజినెస్ పూర్తి చేశారు. అందుకే రంగ్ దే సినిమా రూ.36 కోట్ల బిజినెస్ చేసింది. అయితే మొన్న విడుదలైన చెక్ రూ.10 కోట్లు కూడా వసూలు చేయలేదు. ఇలాంటి సమయంలో నితిన్పై అంత బిజినెస్ వర్కౌట్ అవుతుందా అనేది ట్రేడ్లో ఆసక్తికరమైన చర్చ. సినిమాకు బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప ఇంత వసూలు చేయడం దాదాపు అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. మరి నితిన్ ఏం చేస్తాడో చూడాలి.